విశ్వనాథ కోవెల

1ఆ. శిల్పానుశీలన

అయితే, విశ్వనాథ సాహిత్యాన్ని అర్థం చేసుకోడానికి అలంకారశాస్త్రం ఒక్కటీ సరిపోదు. దానికి కొన్ని పరిమితులున్నాయి. ఒకటి – అలంకారశాస్త్ర ధ్యేయం చాలావరకూ సాధారణీకరణ. రకరకాల కావ్యాలలోని సాహిత్యాంశాలను పరిశీలించి వాటిలో సమాన లక్షణాలని గుర్తించడం అక్కడ ప్రధానం. ఒక కావ్యాన్ని లోతుగా అర్థం చేసుకోడానికి అంతగా ఉపయోగపడదు. రెండు – ప్రాచీన సంప్రదాయాన్ని అనుసరించినా విశ్వనాథ తన కావ్యనాటకాలలో ఎన్నో కొత్త పోకడలను కూడా పోయారు. వాటిని అర్థం చేసుకొని ఆస్వాదించాలంటే ప్రాచీన అలంకారశాస్త్రం సరిపోదు. దీనికి పరిష్కారమార్గం కూడా విశ్వనాథవారే చూపించారు. విశ్వనాథ సాహిత్య విమర్శలో కూడా కొత్త మార్గాన్ని తొక్కారు. తెలుగు విమర్శలో ‘శిల్పానుశీలనం’ అనే కొత్త విధానాన్ని వారు ప్రచారంలోకి తెచ్చారు. శిల్పాన్ని గురించి విశ్వనాథ అభిప్రాయం ఇది, “కావ్యము శిల్పముతో కూడినది. శిల్పశక్తి తగ్గని యే కావ్యమైనా పరిగ్రాహ్యమే యగును. పాశ్చాత్య మహాకావ్యములు శిల్పభూము లగుటచేతనే యచ్చటి మత సంప్రదాయాది విషయములు మనవి కాకపోయినను వానిని పరిగ్రహించుచున్నాము. రచయితల కా శిల్పబుద్ధి తగ్గనిచో కావ్యము కావ్యమగును. శిల్పము అక్షరము నొద్దనుండి కావ్య మహార్థాంతము అనుస్యూతమైన విషయము.” ఇంతకీ ఈ శిల్పమంటే ఏమిటి? కోవెల వారిచ్చిన వివరణ ఇది:

“కవి తాను గాఢంగా భావించి, అనుశీలించి పొందిన అనుభవవిశేషాన్ని, తద్విశేష స్ఫోరకంగా ప్రయోజనవంతమూ, అధికార్థ సంగ్రహణ శీలమూ అయిన రచన ద్వారా సహృదయునిలో ఆ విశేషానుభవం కలిగే విధంగా అతనితో అనుశీలింపజేసి, తద్ద్వారా అతడిని ఉత్పథాలలో, ఉన్నతమార్గాలలో విహరింప జేయటానికి కవిపరమయిన వ్యాపారవిశేషం కావ్య శిల్పం. ఈ శిల్ప లక్షణం కావ్యగత సర్వాంశాలకూ వర్తిస్తుంది. అందుకనే ప్రత్యంశాన్నీ విడివిడిగా – పద్యశిల్పం, అలంకారశిల్పం, కథనశిల్పం, నిర్మాణశిల్పం – ఇత్యాది శిల్పపదానుసంధానంతో వ్యవహరించటం ప్రచారానికి వచ్చింది. అయితే, ఇవన్నీ శిల్పం యొక్క పరిచ్ఛిన్న రూపాలు. ఈ అన్నింటి సమష్టిలోని ఏకీకృత సౌందర్యమే సమగ్రమయిన కావ్యశిల్పం.”

సంపత్కుమారగారు ఈ శిల్పానుశీలనని విశ్వనాథ కావ్యాల అనుశీలనకే తిరిగి ప్రయోగించడం విశేషం. ఇతరుల కవిత్వంలో శిల్పాన్ని వెతికిన విశ్వనాథ తన కావ్యాలలో ఎంతగా దాన్ని ప్రయోగించి ఉంటారో మనం ఊహించవచ్చు. అంచేత వారి కావ్యానుశీలనంలో శిల్పదృష్టి ఎంతగానో ఉపయోగపడుతుంది. విశ్వనాథ కవిత్వాన్ని విశ్లేషించే ప్రతి వ్యాసంలోనూ సంపత్కుమార ఈ శిల్పదృష్టిని పాటించారు. పద్యశిల్పం నుండి కావ్యశిల్పం వరకూ వారు పైన పేర్కొన్న వివిధ శిల్పాల నిర్వహణని విశ్వనాథ కవిత్వంలో, ముఖ్యంగా ‘సర్వశిల్పభూమి’ అయిన రామాయణ కల్పవృక్షంలో వారు దర్శించి మనకి దర్శింపజేశారు. ‘మనీషి – కావ్యర్షి శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు’ అనే వ్యాసంలో పద్యశిల్పాన్ని, శ్రీమద్రామాయణ కల్పవృక్షము – తులనాత్మక పరిశీలన’ అనే వ్యాసంలో పాత్రనిర్వహణ శిల్పాన్ని, ‘విశ్వనాథ సాహితి: కిన్నెరసాని పాటలు’ అన్న వ్యాసంలో నిర్మాణ శిల్పం, ‘రామాయణ కల్పవృక్షచ్ఛాయలో అగస్త్యుని కథ’ అనే వ్యాసంలో కథన సంభాషణాశిల్పాలు, ‘రామాయణ కల్పవృక్షం – శిల్పావతారిక’ అనే వ్యాసంలో ఈ వివిధ రకాలైన శిల్పరూపాలన్నిటినీ కూడిన సమస్త కావ్యశిల్పము – ఇలా వివిధ వ్యాసాలలో విశ్వనాథ సాహిత్యశిల్ప మార్గాన్ని సమగ్రంగా దర్శింపజేశారు సంపత్కుమార. వీటిలో ఒక్క చిన్న ఉదాహరణ మాత్రం ఇక్కడ ఇస్తాను. శబరి పాత్రచిత్రణ గురించి విశ్లేషిస్తూ సంపత్కుమార ఒక ప్రశ్న వేస్తారు. “అసలు రామాయణం ‘అల్లా జరిగింది కాబట్టి అల్లా వ్రాయబడింది’ అనే దృష్టితోగాక కావ్యదృష్టితో చూస్తే శబరి పాత్రయొక్క అవసరం ఏమిటి కథకు?” అన్నది ప్రశ్న. ఇలాంటి దృష్టి చాలా ఆశ్చర్యకరమైనది, ఆధునికమైనది. ఏ కావ్యాన్ని అనుశీలించేటప్పుడైనా, అది రామాయణమైనా సరే, సహృదయుడైన పాఠకుడు ఇలాంటి ప్రశ్నలు వేసుకోవాలి. అప్పుడే మనకి కావ్య పరమార్థం చక్కగా బోధపడేది, అని దీని ద్వారా మనకి మార్గం చూపించారు. ఇంతకూ ఆ ప్రశ్నగురించి వారు చేసిన ఆలోచన, ఇచ్చుకున్న సమాధానం ఇది:

“సుగ్రీవుని కలవమని కబంధుడు చెప్పనే చెప్పినాడు కాబట్టి శబరికి ఆ ప్రయోజనమూ లేదు. శబరికి చివరకి ఏ శాపమూ లేదు. వాల్మీకి దీనికి జవాబుదారీ వహించలేదు. ఆయన సమాధానం ఇవ్వపూనుకోలేదు. అది విశ్వనాథ చేసినాడు. సర్వరామాయణ కర్తలలో శబరీపాత్ర ప్రయోజనం సంపూర్ణంగా గ్రహించింది విశ్వనాథ అన్నది నిజమవుతుంది.

శబరీపాత్రకు ప్రయోజనం ఉన్నది. విశ్వనాథ దాన్ని వివరించాడు. రాముడు సీతావియోగ దుఃఖభారంలో ఉన్నాడు. ఆ దుఃఖభారం కొంతయినా ఉపశాంతి పొందవలసిన అవసరం ఎంతయినా ఉన్నది. దుఃఖభార స్థాయి ఏ విధంగా ఎక్కువ కాలముండడము అవాంఛనీయ విషయము. దీనికి ఈ భారోపశమనానికి సీత మాత్రమే సమర్థమయింది. లేక సీతవంటి మరొక జీవి అయినా సమర్థమవుతుంది. శబరి నల్లాంటి సీతా సమాన లక్షణ లక్షిత అయిన జీవిగా విశ్వనాథ కావ్యములో ప్రవేశపెట్టినాడు. రాముని చూచి చూడడము తోనే శబరి ‘అయోధ్యావీథులన్ నిన్ను నావలె కన్గొనగు వారలెందరు?’ అని అంది. ఇల్లాంటి మాట అనడానికి సీతలాంటి స్థాయిలేని వ్యక్తికి సాధ్యం కాదు. దానికి రాముడు కూడా, ‘అచ్చో నినువంటి వారు కలరా?’ అన్న ప్రశ్న రూప సమాధానం చెబుతాడు. ఆ మాట, దాని కిల్లాంటి సమంజసమైన సమాధానము సీతారాములయందే జరగవీలున్నది. ఆపైన వారిద్దరి సంభాషణ, శబరి ఆత్మీయత, స్తుతి ఇవన్నీ నిర్భరదివ్యార్థములయి ఉన్నవి.

మధుర భక్త్యాత్మక అయిన శబరి తత్సందర్భంలో కల్పిత అయి అతనికి ఉపశమనం కలిగించకుంటే ముందు జరుగబోయే పనిలో స్థైర్యము కలుగడం దుర్లభ విషయం. సీత తనయందు నెరపిన భావమే శబరి నెరపినట్లు రాముడు భావించినాడు కాబట్టే అతనికి ఉపశాంతి కలిగింది. ఈ విషయాన్నే సుందరకాండ చివరి ఖండంలో లక్ష్మణునితో ‘దళముగ గుండె వ్యాజరహితంబగు ప్రేమను గోరుచుండు, నిశ్చలమతి సీతయున్ శ్రమణి సాగెద రాగతి…’ అంటాడు. ఇంకా ‘- మదవతీ మద్విప్రయోగ వ్యధాభారమెల్లన్ శ్రమణీ సమాగమముచే బాధాపనోదంబుగా బరగెన్’ అని కంఠోక్తిగా అంటాడు. ఇతరులది సవ్యాజప్రేమ. సీతది శబరిది అవ్యాజప్రేమ. అనగా అచ్చమైన దన్నమాట. రాముడా అచ్చమైనదానినే వాంఛిస్తాడు. అదే అతనికి ప్రీతికరం. ఇది శబరీపాత్ర ప్రయోజనం.”

అదీ విశ్వనాథ సృష్టి, ఇదీ సంపత్కుమారగారి దృష్టి!

అయితే, శిల్ప విషయమై కొన్ని ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. శిల్పానికి నేరుగా రసాన్ని వ్యంజింపచేసే శక్తి ఉందా? శిల్పాన్ని గురించి తెలిసి చదివిన పాఠకులకే అందులోని విశేషానుభవం స్ఫురిస్తుందా, లేక తెలియకపోయినా అప్రయత్నంగా ఆ అనుభవం కలుగుతుందా? అన్న ప్రశ్నలు. మచ్చుకి పద్యాలలో సమాసాల విషయమై సంపత్కుమారగారిచ్చిన ఒక ఉదాహరణ చూద్దాం:

“అరణ్యకాండ జటాయుః ఖండంలో రావణుడు సీతతో మాట్లాడుతూ తన గొప్పదనాన్ని చెప్పుకుంటూ,

ఓహో మూడవవాని జూపుము సమస్తోర్వీభరంబున్ ఫణా
వ్యూహంబందు నటో యిటో యొరుగగా నూనంగనైనట్టి శే
షాహిం దక్కగ, వింశతి ప్రభుభుజాహంకార సంభార రే
ఖా హేలాధృత శైవపర్వత భుజా స్కంధున్ ననున్ దక్కగన్

అన్న పద్యం. ఇందులో దాదాపు ఉత్తరార్ధమంతా దీర్ఘసమాసంగా కఠినబంధంగా ఉంది. పూర్వార్ధంలో శైథిల్యం ఉంది. ఆ శిథిలబంధం, శేషాహి భారాన్ని వహించడంలోని అగచాట్లనూ, కఠినబంధం, సమాసంలోని దీర్ఘత్వం తాను కైలాసపర్వతాన్ని ఎత్తడంలోని శక్తీనీ హేలనూ సూచిస్తున్నవి.”

ఇక్కడ రెండో సగంలో కఠినబంధమూ (దీర్ఘ సమాసం), మొదటి సగంలో శిథిలబంధమూ (విడివిడి పొడి మాటలు) ఉన్నాయని తెలుసున్న మీదట సంపత్కుమారగారు వివరించిన విశేష భావస్ఫూర్తి కలుగుతుందా, అలా తెలియకుండా అప్రయత్నంగా పద్యం చదివినంతనే ఆ విషయం ధ్వనిస్తుందా? ఇది కొంచెం తికమక పెట్టే విషయం. అప్రయత్నంగానే ధ్వనించాలని అనుకొనే అవకాశం ఉంది. చేరా అలాగే అనుకున్నట్టున్నారు. ‘అక్షర రమ్యత అంటే ఏమిటి?’ అన్న వారి వ్యాసంలో విశ్వనాథవారు చెప్పిన అక్షరశిల్పాన్ని గురించి ఇలా అంటారు:

“‘ఆ దుష్యంతుడనంత సత్వుడు సమస్తాశాంత మాతంగ మర్యాదాలంకృతమైన భూవలయ మాత్మాయత్తమై యుండగా’ అనే చోటకాని ఇంకా ఇతరత్రా పెద్ద సమాసాలను అర్థంలో భూవలయం వంటి పెద్ద వస్తువులకు చిన్న సమాసాలు చిన్న విషయాలకు అని చాలా చోట్ల వ్యాఖ్యానించారు విశ్వనాథ. భాషకూ భాషేతర ప్రపంచానికి సారూప్య సంబంధం దాదాపు ఉండదు. ధ్వన్యనుకరణాల వంటి వాటికి ఉన్నట్టు కనిపించినా అది ఒక్కో భాషా సమాజం విడివిడిగా ఏర్పరచుకున్నదే కాని స్వతస్సిద్ధం గాదు. ధ్వనుల్లో ఉచ్చారణ క్లిష్టత ఉచ్చారణ సులభత ఉంటాయి. కొన్ని ధ్వనులకు ఎక్కువ శక్తి అవసరమవుతుంది… అంత మాత్రం చేత కఠినాక్షరాలున్న మాటలు ప్రపంచంలో కఠినాంశాలనో, క్లిష్టాంశాలనో సూచిస్తాయని చెప్పలేము.”