విమర్శకు పూనుకునే ముందు దానికి సంబంధించిన పరిభాషను తనదైన దృక్పథంతో నిర్వచించి, వివరించి విషయ స్థాపన చేయడం సంపత్కుమారకు అలవాటు. ఈ దృష్టితో చూసినప్పుడు, ఆధునికతకు ఆయన ఇచ్చిన నిర్వచనం, వివరణ అభ్యుదయవాద విమర్శకుల వాదానికి బాగా భిన్నంగా ఉంటాయి, ఇటీవలి కాలంలో సామాజిక విమర్శకులు ఆధునికతను; దేశీయమైన ఆధునికత, వలస పాలన కారణంగా ఏర్పడిన ఆధునికత, వలస పాలనాంతర ఆధునికత, ఉత్తరాధునికత, అని నాలుగు విధాలుగా విభజించి పరిశీలిస్తున్నారు. ఈ పరిశీలనలో ఎవరికి తోచిన నిర్వచనాలని వారు కల్పించుకొని, ఎవరి దృక్కోణాన్నసురించిన వివరణలను వారు చూపిస్తున్నారు. ఈ వింగడింపును పక్కన పెట్టి దేశీయమైన ఆధునికత, వలస పాలన వలన ఏర్పడిన ఆధునికత అనే విభజనను ఆశ్రయించి 19వ శతాబ్దం ఉత్తరార్ధం నుండి కొందరు 20వ శతాబ్దం పూర్వార్ధం వరకు గల కాలాన్ని కొందరు అధ్యయనం చేస్తున్నారు. వలస పాలన కారణంగా సంఘంలో అభ్యుదయకరమైన పరిణామాలెన్నో ఏర్పడ్డాయని ఆధునికులైన సంస్కరణవాదులు భావించడం కొందరకు మింగుడు పడలేదు. గురజాడ “వచ్చెనిదె బంగారు కాలము” అనడాన్ని, పాశ్చాత్య సంస్కృతిని ప్రశంసించడాన్ని జీర్ణించుకోలేనివారు ఆ మార్గాన్ని ఆత్మన్యూనతా మార్గంగా ఎంచారు. ఆ రకమైన భావనకు లోను కావడమే ఆధునికతగా సంపత్కుమార చెప్తారు.
“మన జీవితంలోని అన్ని రంగాలలోనూ పాశ్చాత్య సంపర్కం ఏర్పడిన నాటినుంచి మనకు ‘ఆధునికత’ మొదలయిందనేది ఒక స్థూలమైన అభిప్రాయం. కాని, జాగ్రత్తగా అనుశీలిస్తే పాలకులు పాలితులను సర్వాత్మనా ఆత్మన్యూనతా భావానికి గురిచేయటం, అది ఫలించటం ఆరంభమయిన నాటినుంచీ ఆధునికత అని చెప్పుకోవలసి ఉంటుంది.” – అని సంపత్కుమార పేర్కొనడం గురజాడ, గిడుగు, కందుకూరి వంటి సంస్కర్తలను, వారి అనుయూయులను ఉద్దేశించి చేసిన విమర్శ అని ఎవరికైనా బోధపడుతుంది. ఆయన తన మనోగతాన్ని ఇంకా విస్పష్టంగా ఇలా విప్పిచెప్పారు: “ఇటీవలి శతాబ్దాల్లోని బ్రిటీషు పాలన వల్ల ఈ దేశానికి ఆధునికత సంభవించిందనే అపోహ ఒకటి వ్యాప్తిలో ఉంది. నిజానికి ఆధునికత ఒకరి ద్వారా వచ్చేది కాదు. ఒక దేశం తన ప్రాచీనత, సంస్కృతుల పునాది మీద పెంపొందిన స్వతంత్రమయిన ఆలోచనా విధానంతో, అనుభవాల విశ్లేషణతో, ఇతరేతరమయిన ఆటుపోటులనుండి నిలవరించుకొని సాగించిన ఆచరణ విధానంతో ‘ఆధునికత’ ను ఎప్పటికప్పుడు సాధించుకుంటూ ఉంటుంది.” ఈ అభిప్రాయాన్ని వ్యాప్తి చేయడానికే విశ్వనాథ తన సర్వ సాహిత్యాన్నీ సృష్టించాడు. ఆ సాహిత్యాన్ని విశ్లేషిస్తూ ఆ భావాన్ని పరిపూణంగా వ్యాప్తి చేయడానికి సంపత్కుమార తన విమర్శ సర్వస్వాన్నీ ఒక సాధనంగా ప్రయోగించారు.
ఆధునికతను నిర్వచించినట్లే సంపత్కుమార ‘మహాకవి’ అనే పరిభాషను కూడా నిర్వచించారు. “ఎవరిని ప్రమాణీకరించి కవులు తమ స్థానాన్ని అంచనా వేసుకుంటారో, ఎవరిని ప్రమాణీకరించి ఇతర కవులను అంచనా వేసే స్థితి కలుగుతుందో ఆయన మహాకవి.” – అన్న సంపత్కుమార నిర్వచనాన్ని ఆశ్రయించి కొందరు గురజాడను ‘మహాకవి’ అని నిర్ణయిస్తే మరి కొందరు విశ్వనాథను ‘మహాకవి’ అని నిర్ణయించుకున్నారు. ఎవరి దృక్కోణం వారిది. కానీ ప్రాచీనుల నిర్వచనాలు ఈ విధంగా ఎటు పడితే అటు వంగవు. రాజశేఖరుడు మహాకవి అనేవాడికి ఎనిమిది లక్షణాలుండాలని స్పష్టంగా చెప్పాడు. ఆ లక్షణాలలో ఏ ఒక్క లక్షణం కొరవడినా ఒక కవి మహాకవి కాలేడు. సంపత్కుమార అభిప్రాయం ఇంత కట్టుదిట్టంగా కాక, కాలానుగుణమైన మార్పులను, వ్యాపకత్వాన్ని పొందినట్లు కనిపిస్తుంది. సమజము, సమాజము అనే రెండు పదాల మధ్య ఉండే చాలా ఆసక్తికరమైన తేడాను సంపత్కుమార ఒకచోట నిర్వచనప్రాయంగా విశదం చేశారు. పశువుల గుంపును ‘సమజం’ అంటారనీ; ఒక సువ్యవస్థతో, సమన్వయ భావంతో, పరస్పర సహకార విధానంతో, పరస్పర ప్రేమ భూమికగా త్యాగలక్షణంతో ఒకటిగా ఏర్పడ్డ మానవుల సమూహాన్నే ‘సమాజం’ అంటారని ఆయన అభిప్రాయపడ్డారు. మానవకోటి ‘సమజ’స్థాయి నుంచి ‘సమాజ’ స్థాయికి ఎదగాలన్నది ఆయన ఉదారాశయం. ఇటువంటి నిర్వచనాలూ, వివరణలూ ఇంకా చాలా సంపత్కుమార విమర్శలో కనిపిస్తుంటాయి. “భావాన్ని సమగ్రపరిచేదీ, పరిపుష్టం చేసేదీ భావాంశం” – అన్న వాక్యంలో సంపత్కుమార చెప్పినది నిర్వచనమా? లక్షణమా? అనే సందిగ్ధత ఏర్పడుతుంది. ఇలా ఎక్కడైనా సంపత్కుమార విమర్శలో కొన్ని వాక్యాలు సందిగ్ధతకు తావిచ్చినా అనిష్టార్థస్ఫూర్తికి మాత్రం అవకాశం కల్పించవు.
ప్రక్రియా పరిజ్ఞానము, విచక్షణ లేనిదే సాహిత్య విమర్శ సహేతుకంగా సాగదని సంపత్కుమార తలంపు. కావ్య జగత్సంబంధమైన సర్వసామాగ్రిని దానికై పరినిష్ఠితమైన ప్రక్రియాలక్షణంతో పర్యవేక్షించి, విమర్శ కొనసాగించవలసి ఉంటుంది. సంపత్కుమార ముందుగా ఒకానొక ప్రక్రియకు సంబంధించిన బహిరంతర స్వరూప నిర్ణయాన్ని మనసులో కుదుటపరచుకొని అవకాశ నిరవకాశాల కనుగుణమైన రీతిలో దానికొకపాటి వివరణ నిచ్చిన తరువాత, వస్తు గుణ రీతి రసాలంకారాది ఇతర గుణాలపై దృష్టి సారిస్తారు. ప్రక్రియాపరమైన విమర్శను గూర్చి సంపత్కుమార ప్రస్తావించిన అంశాలు ఆయన మాటల్లోనే:
“ఏ ప్రక్రియకు, ఏ భేదానికి చెందిన కావ్యాన్ని, రచనను ఆ ప్రక్రియ యొక్క మౌలికతత్వాన్ని భూమికగా చేసుకొని వివేచించవలసి ఉంటుంది. ఒక శతకాన్ని ఒక ప్రబంధంతో, ఒక ప్రబంధాన్ని ఒక ఇతిహాసంతో పోల్చి వాటి స్థాయిని, ప్రత్యేకతను బేరీజు వేయటానికి వీలులేదు. ఒక కవితాఖండికను ఒక కావ్యాన్ని సమస్థాయిలో ఉంచి పోల్చి చూడటానికి వీలు లేదు. కాగా సత్యనారాయణగారు ఈ విధమయిన ప్రక్రియాపరమైన వివేకం యొక్క అవసరాన్ని తొలిసారిగా సాహిత్యవిమర్శలో ప్రవేశపెట్టారు. అందుకని, ఆయన ‘ప్రక్రియాపర విమర్శా’ విధానానికి ఆద్యులు. ఆయన సాహిత్య విమర్శ ప్రధానంగా ప్రక్రియాపర వివేకంతోనే మొదలయిందని అనవచ్చు.”
సాహిత్యాన్ని ప్రక్రియాపరంగా విమర్శించడం అనే లక్షణం పాశ్చాత్య విమర్శ మార్గపరిచయంతోటే వికాసాన్ని పొందిందనవచ్చును. తెలుగు సాహిత్యవిమర్శలో విశ్వనాథ ఈ రీతిని ప్రారంభించారన్న విషయం కొంత సాపేక్షమైనదైనా, ప్రక్రియాపర విమర్శను గూర్చి సంపత్కుమార ఇక్కడ పొందుపరచిన వివరణ, సాహిత్య విమర్శ విద్యార్థులకు ఋజుమార్గ నిర్దేశకంగా ఉంది.
సమకాలీన జాతీయ చైతన్యాన్ని పొదువుకొని ఉండటం, కాల-దేశ పరిమితులను అధిగమించి సార్వకాలిక, సార్వదేశిక చైతన్యంతో విశ్వమే నేపథ్యంగా ఇతిహాస రచన జరుగుతుందని, ఇతిహాస ప్రక్రియకు గల ఒక విస్తృతమైన భూమికను మనకందించిన సంపత్కుమార ‘వేయి పడగలు’ నవల తన ఆకళింపుకు రాగానే “ఇతిహాసం మూడుతరాల కాలపరిధిని కథావస్తువుగా స్వీకరిస్తుంది” – అని నిర్ద్వందంగా తీర్మానిస్తారు. విమర్శకుడు ఇటువంటి తీర్మానాలు చేసే సందర్భంలొ పూర్వాపర సమన్వయబుద్ధితో ప్రవర్తించవలసిన అవసరాన్ని సంపత్కుమార ఇక్కడ గుర్తు చేస్తారు.
ముక్తక ప్రక్రియకు, కావ్యప్రక్రియకు నిర్వహణపరమైన భేదాన్ని స్పష్టంగా వివరించి తరతరాలుగా కొనసాగి వస్తున్న ఒక మొరను తొలగించడానికి ప్రయత్నించారు సంపత్కుమార. ముక్తకరచనకు అనుస్యూతమైన భావపరంపరతో పనిలేదు. కథాపరమైన బహువిషయ సమన్వయంతొ ఇక్కడ పనిలేదు. అయినా ప్రతి ముక్తకము ఒక ప్రబంధము వంటిదేనని, ప్రతి రసాత్మకమైన వాక్యము ఒక కావ్యమేననీ పూర్వులు పలికిన మాటలాధారంగా ఆధునికులు కొంత విపరీత ధోరణి నవలంబించడం చూసి కలత చెందిన సంపత్కుమార – “వట్టి భావాన్ని ముక్కలు ముక్కలుగా, అంటే ముక్తకాలుగా చెప్పడం కన్నా ఒక కథను నిర్మించి ఈ భావాలను ఆ కథ కనుసంధించి కూర్చి నిర్వహించడం ప్రతిభ గలవారి పని. అంత మాత్రాన ముక్తకాల స్థాయికేమీ లోపం లేదు. కాని, అవి కావ్యస్థాయికి మాత్రం చేరవనేది కావ్యమర్మజ్ఞులకు విదితమైన విషయం,” అంటూ ముక్తక పరిమితిని, కావ్యవైశాల్యాన్ని వీలైనంత సున్నితంగా తెలియజేశారు.
కథాప్రక్రియలో ప్రారంభానికి పెద్దపీట వేసిన సంపత్కుమార కథ తన జీవధాతువుతో మొదలవ్వాలని చెప్తారు. కథాశిల్పం వేరు, ఉపాఖ్యాన శిల్పం వేరు. ఉపాఖ్యానాలన్నీ ఒకేరకంగా ఉండవు. కవి తన కావ్యంలో సన్నివేశానుగుణంగా ఏ ప్రయోజనాన్ని సాధించదలచుకున్నాడో, దానిని బట్టి, ఏ పాత్రముఖంగా ఉపాఖ్యానాన్ని చెప్పించదలచుకున్నాడో, ఆ పాత్ర గుణశీలాదులే కాక ఆ సన్నివేశగతమైన వైఖరిని బట్టి ఉపాఖ్యానం ఉంటుందంటారు సంపత్కుమార. అందుకే ఉపాఖ్యానములు పలురీతులుగా ఉంటాయని సంపత్కుమార అంటారు. కావ్యశిల్ప సంబంధమైన అనేకాంశాలతో సంపత్కుమార విశ్వనాథ మార్గాన్ననుసరించా డనటానికి ఈ వివరణ ఒక నిదర్శనం. ఇది విశ్వనాథోపజ్ఞమైన విమర్శ మార్గం. ఈ మార్గంలోనే విమర్శ ప్రక్రియను కూడా భావన జేశారు సంపత్కుమార. ఆధునిక విమర్శలకు విమర్శ ప్రక్రియలో రెండు ప్రకృష్టమైన రీతులున్నాయి. ఒకటి సాంప్రదాయక విమర్శ రీతి, రెండవది పాశ్చాత్య విమర్శరీతి. దేశీయ సాహిత్యాన్ని దేశీయ విమర్శ విధాన భూమిక మీదనే వివేచించవలసి ఉంటుందని, విదేశీయ విమర్శ విధానాలలోని మేలిమిని దేశీయవిధానంతో సమన్వయ పరచుకొని పురోగమించవలసి ఉంటుందని ప్రబోధించిన విశ్వనాథ విమర్శ విధానము సంపత్కుమారకు శిరోధార్యమయింది.