విశిష్ట విమర్శకుడు: సంపత్కుమార

సంప్రదాయ విమర్శ మార్గాన్ని అనుసరించినా వ్యాకరణాన్ని గూర్చి సంప్రదాయ పండితులకంటే కొంత ఉదారము, ఆధునికము అయిన వైఖరిని సంపత్కుమార సమర్థించారనడానికి ఆ క్రింది అంశాలు నిరూపకంగా కనిపిస్తాయి.

– “ఒక భావం – అదెట్లాంటిదయినా భాషలో అభివ్యక్తం కావాల్నంటే, ఆ భాషాపదాలకు ఒకానొక విధమయిన కూర్పు అవసరం. ఆ కూర్పులోని స్థితిని, అంటే ఆ కూర్పులో ఒదిగిన పదాలకు కలిగిన పరస్పర సంబంధాలను వింగడించి చూపేది వ్యాకరణం. వ్యాకరణం వింగడిస్తున్నది కాబట్టి ఆ సంబంధాలను వ్యాకరణ సంబంధా లంటున్నాం.”

– “అర్థ(భావ)స్ఫూర్తికి వ్యాకరణ సంబంధాలు ముఖ్యమే. కాని ఆ స్ఫూర్తి కలిగిం తరువాత ఆ కలిగిన అర్థం ఆధారంగా ఏర్పడేవన్నీ ఆ అర్థం(భావం) బట్టి చెప్పబడుతాయే కాని వ్యాకరణాన్నిబట్టి కాదు.”

– “భావం అనేది భాషలో అభివ్యక్తమయినాక గాని ఇది భావం, లేదా ఇది భావంలోని ఒక అంశం అని చెప్పటానికి వీలుపడదు.”

– “భావస్ఫూర్తిని వదిలితే వ్యాకరణం యొక్క అవసరం లేదు. మరొక అంశ మేమిటంటే, భావస్ఫూర్తికి వ్యాకరణ సంబంధాల పరిజ్ఞానం తోడ్పడినంత మాత్రాన స్ఫురించే భావం ‘వ్యాకరణ భావం’ కాదు. భావస్ఫూర్తికి వ్యాకరణం సహాయకం. వచనపద్య పాదవిభజనకు భావస్ఫూర్తి సహాయకం.”

వ్యాకరణాల సంకెళ్ళు విడగొట్టడానికి సంపత్కుమార అనుసరించిన రీతి ఇది. సంప్రదాయంలో ఆధునికతను, ఆధునికతలో సంప్రదాయాన్నీ రంగరించి చూపడమే సంపత్కుమార నవ్యసంప్రదాయ మార్గంలోని విశిష్టత.


ఛందో భూమికలు
కోవెల సంపత్కుమారాచార్య
అభినవప్రచురణలు, 2003

పరిష్కర్తగా, పరిశోధకుడిగా, విమర్శకుడిగా మొట్టమొదట సంపత్కుమారను ఉత్పథంలో నిలిపినది ఛందశ్శాస్త్ర పరిశ్రమ. తెలుగు ఛందోవికాసము, తెలుగు ఛందస్సుపై కొన్ని వెలుగులు, ఛందోభూమికలు వంటి గ్రంథాలు, ఛందస్సంబంధమైన కొన్ని ఇతర వ్యాసాలు ప్రచురించి తన పరిష్కరణ దక్షతను, విమర్శ పాటవాన్ని చాటుకొని ఆధునిక లాక్షణికులలో ఒకరుగా పరిగణన పొందారు. విశ్వనాథ సృష్టించిన అనేక నూతన ఛందస్సుల అవసరాన్ని, ఔచిత్యాన్ని వివరించడంలోను, పద్యశిల్పాల మర్మాలను ఆవిష్కరించడంలోను ఒక వినూత్న మర్యాదను చూపి ఛందశ్శిల్ప రహస్యవేత్తగా గుర్తింపు పొందారు. విశ్వనాథ సృష్టించిన ‘శ్వేని’ అనే వృత్తానికీ, ఉత్సాహ వృత్తానికీ గల పోలికలను తెలియజేస్తూ ‘శ్వేని’ ఉత్సాహ కాని ఉత్సాహమని సంపత్కుమార వివరించారు. విశ్వనాథ ‘రామాయణ కల్పవృక్షం’ యుద్ధకాండలో అతికాయుణ్ణి, శ్రీరాముణ్ణి ఒకే సీసపద్యంలో వర్ణించారు. ఆ సీసపద్య పాదాల క్రమవిశేషాన్నీ, పదవిన్యాసాన్నీ, అక్షర సంయోజనాన్ని బట్టి వారిద్దరి గుణవిశేషాలు ఏ విధంగా వ్యంజిత మౌతున్నాయో సంపత్కుమార విమర్శించిన తీరు సహృదయ పాఠకులకు మనఃప్రహ్లాదకంగా ఉంటుంది. ఒక కవి తన రచనలో ఉపయోగించే సర్వసామాన్య పద్యప్రయోగానికీ, విశేషపద్య ప్రయోగానికీ గల తేడాను, విశేషపద్య ప్రయోగ అవసరాన్నీ సంపత్కుమార ఇలా వివరించారు.

“పద్యాలను సామాన్య – విశేష భేదంతో స్థూలంగా రెండు వర్గాలు చేయవచ్చు. ఏదో ఒక విశేషాంశ స్ఫూర్తి లేకుండా విశేషపద్యం ఉపయోగించటం జరుగదు. ఛందశ్శిల్ప విషయంలో ఇదొక సామాన్య సూత్రం. పద్యపు నడకను బట్టి, పేరును బట్టి లేదా స్వరూపాన్ని బట్టి, రచనారీతిని బట్టి ఏదో ఒక విశేషాన్ని విశేషపద్యం స్ఫురింపజేస్తుంది. కథాగమనంలో, భావప్రసారంలో వచ్చే మలుపులను సూచించేందుకు కూడా విశేషపద్యం ప్రయుక్తం కావచ్చు.”

ఈ విషయాన్ని సంపత్కుమారకు ముందు ఇంత సవిమర్శంగా, శ్రద్ధగా ఉపలక్షించిన వారు తక్కువ. ఛందో బందోబస్తులను నిరాకరించినవారిలో ఈ దృష్టి మరీ తక్కువ. ప్రాచీన కవుల ప్రయోగాల విషయంలో పూర్వలాక్షణికులు అనుసరించిన వైఖరిని విమర్శిస్తూ సంపత్కుమార కొన్ని అభిప్రాయాలను ప్రకటించారు. అందులో కొన్ని ఇక్కడ ఉదాహరిస్తున్నాను.

– “లక్షణకర్త లందరును అన్ని విషయములలో ఏకమతస్థులు కానక్కరలేదు. అభిప్రాయము భేదింపవచ్చును. ఈ భేదింపు నన్నయాధర్వణులలోనే కనిపించుచున్నది గాదా! కావున నన్నయాధర్వణులు సాధించిన రూపములను కేతన సాధించక పోవుట ఒక మతభేదముగా మాత్రమే పరిగణించవలసి యుండును.”

– “పూర్ణబిందుపూర్వకముగా మకారమును (నకారమును గూడ) వ్రాయు పద్ధతి నన్నయగారి కంటగట్టుటలో ఔచిత్యము కన్పించదు.”

– “శ-స లకు యతిప్రాసలు చెల్లుట అంగీకరించిన లాక్షణికులు ర-ఱ లకు అంగీకరించక పోవుటలోని యనౌచిత్య మింతకన్న వేరే కన్పించదు.”

ఈ విధంగా ప్రాచీన లాక్షణికుల మధ్యగల అభిప్రాయభేదాలు, చర్చకు ఆస్పదమైన విషయాలు సంపత్కుమార విమర్శలో ఎలా చోటు చేసుకున్నాయో పైన సూచించిన వాక్యాల వలన మనకు తెలుస్తుంది. ప్రయోగాల ననుసరించి, ప్రక్రియాభేదాల ననుసరించి లాక్షణికులు అవలంబించదగిన ఉదార వైఖరిని కూడా పలుసందర్భాలలో సంపత్కుమార తన విమర్శలో ప్రస్తావించారు. ‘కవి గజాంకుశము’ వంటి లక్షణగ్రంథ శీర్షికల మూలంగా కవులనే మదగజాలకు తాము అంకుశంవంటి వారమని పూర్వలాక్షణికులు వ్యవహరించిన తీరు ప్రాచీనసాహిత్య పాఠకులకు పరిచితమైనదే. ఈ అంకుశాలను, నిరంకుశులైన కవులను అదుపులో ఉంచి తమ ఆజ్ఞావశవర్తులను చేయగల స్తోమత లోకవ్యవహారానికుందని సంపత్కుమార గుర్తుచేస్తూ వచ్చారు. కవులు లోకవ్యవహారాన్నీ, లాక్షణికులు కవి ప్రయోగాలను మన్నించడమే మర్యాద అని వారు తీర్మానించారు. జీవద్భాషా ప్రవాహంలోని అనేక ప్రయోగ పరిణామరీతులను గుర్తించి లక్షణాన్ని నిరూపించవలసి ఉంటుంది. ఆ కారణంగా కాలం గడుస్తున్న కొద్దీ లక్షణగ్రంథాలలో అనేక మార్పులు చేసుకొని ప్రామాణికస్థితిని పొందుతాయని వారు నిర్ధారణ చేశారు. పద్యకవిత, గేయకవిత, వచనకవిత మొదలైన విభాగాలలో రూపానికే ప్రాధాన్యం గానీ కవిత్వ మౌలికతత్త్వంలో ఏ విధమైన భేదమూ ఉండదని వారు స్పష్టం చేశారు. వచనకవితలో కంటే గేయకవితలోను, గేయరచన కంటే పద్యరచనలోను అవరోధాలు, క్లేశాలు ఎక్కువగా ఉంటాయనే వాదనను ఆయన కొట్టిపారేశారు. ప్రాచీన చందస్సులతో పాటు గురజాడ సృష్టించిన ‘ముత్యాలసరం’ అనే నూతన చందస్సుకు సంబంధించిన పూర్వాపర లక్షణ వివేచనను, విమర్శను చేసే సందర్భంలో సంపత్కుమార తనకు గల జానపద ఛందోలక్షణ పరిజ్ఞానాన్ని వెల్లడించుకున్నారు. గురజాడ ముత్యాలసర నిర్మాణంలోని లోపాలను చూపించడంలో వారికి ఆసక్తి ఎక్కువని పాఠకులకు తోచకమానదు.

వచనపద్యం పరిపూర్ణంగా ఆధునికమైన ప్రక్రియ. పాశ్చాత్య కవిత్వ పఠనంతో తెలుగు కవులు సృష్టించుకున్న ప్రక్రియ ఇది. ఛందస్సు నుండి విముక్తిని సాధించడమే వచనపద్యానికి లక్షణమని అభ్యుదయవాద విమర్శకులందరూ గట్టిగా విశ్వసించారు. ఆ విశ్వాసం అప్రతిహతంగా కొనసాగుతున్న సమయంలో పద్యమనే భావన ఏర్పడిన ప్రతిచోటా తప్పనిసరిగా ఛంధస్సంభావనము ఉండి తీరుతుందని, ఆ కారణంగా వచనకవిత్వంలో కూడా ఒక ఛందఃప్రక్రియ ఉందని నిరూపించడం సాధ్యమని సంపతుకుమార సాహసోపేతంగా ప్రకటించారు. ‘అన్నీ వేదాలలో ఉన్నాయిష!’ అన్న సూత్రం ఆధారంగా ప్రాచీన మార్గానికి చెందిన ఛందోప్రక్రియలో వచన కవిత్వానికి కూడా గతి కల్పించటానికి సంకల్పించిన దురాశయమే కానీ, సంపత్కుమార వాదనలో సాహసమేమీ లేదని చేకూరి రామారావు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. ఆ ప్రతిపాదనలు, తిరస్కారాలతో తెలుగు విమర్శ చరిత్రలోనే ఒక వినూత్న మర్యాదతో కూడిన స్నేహపూరితమైన చర్చ కొనసాగింది. ఆ ఫలితంగా వెలువడిన ‘వచన పద్యము: లక్షణ చర్చ’ గ్రంథంలో సంపత్కుమార ప్రకటించిన అభిప్రాయాలలో కొన్నింటిని ఇక్కడ స్థూలంగా చూపిస్తున్నాను.

– “వచన పద్యం పద్యం కావటానికీ, అందులో కవితా పదార్థం ఉండటానికీ, లేకపోవటానికీ ఏ సంబంధం లేదు. ఉండవచ్చు, ఉండకపోవచ్చు.”

– “వచన పద్యానికి ఛందస్సాంప్రదాయంలో నేనుగా చోటు కల్పించటానికి ప్రతత్నించలేదు. మాత్రాఛందస్సులను దాటి వచ్చి, తనంతట తనే వచన పద్యం ఛందస్సాంప్రదాయంలో చోటు చేసుకున్నది.”

– “ఛందస్సు, గణవిభజన ఉన్నంత మాత్రాన ఏ పద్యానికీ అదనపు గౌరవం రాదు. ఆ పద్యంలో శక్తి ఉంటే వస్తుంది.”

– “అత్యాధునికంగా పద్యకుటుంబానికి మాత్రమే కలిసివచ్చి విస్తరించిన ఆస్తి వచన పద్యం.”

– “ఆర్బిట్రరీగా రూపొందిన లక్ష్యాల్ని పరిశీలించి, వర్గీకరణాదులు చేసి, సామాన్య లక్షణాలను గమనించి, వీలయినంత అనువుగా పొసగే పాదవ్యవస్థాదులను నిరూపించే లక్షణాలను – సూత్రాలను నిష్పన్న పరచవలసి ఉంటుంది. అట్లా నిష్పన్న లక్షణాలననుసరించి లక్ష్యాలు మళ్ళీ విరివిగా వచ్చింతరువాత ఈ లక్షణాలకూ – లక్ష్యాలకూ అవినాభావ సంబంధం సుప్రతిష్ఠితమవుతుంది. అప్పుడు, సాంప్రదాయికంగా అనువర్తిస్తున్న పద్యాల గూర్చి మనకీనాడు కలుగుతున్న ప్రామాణ్యమూ, సులువూ వచన పద్యాల విషయంలో కలుగుతుంది. వచన పద్య ప్రయోక్తకూ – పరిశీలకునికీ సమాన ప్రమాణం ఉండటం వంటివి అప్పుడు కుదురుతయి.”

పై అభిప్రాయాలతోపాటు చేరా ప్రతిపాదించిన అంశాలను, చర్చించిన విశేషాలను జతకలిపి పరామర్శించడం వల్ల వచన పద్యంలో ఛందఃస్పర్శ ఉన్నదా? లేదా? అనే విషయంలో పాఠకులకు సమ్యక్‌జ్ఞానం కలుగుతుందనే ఉద్దేశంతో ఇద్దరి వ్యాసాలను అనుబంధ సహితంగా ఒకే పుస్తకంగా ప్రచురించడం చేరా, సంపత్కుమారల ఉత్తమ సంస్కారాన్ని వ్యక్తం చేస్తుంది. “వచన పద్యానికి నేను చెప్పిన లక్షణమే లక్షణం కావాల్నని గాని, కేవలం ఇది మాత్రమే నిర్దిష్టమయిందని కాని వాదించే అతిశయం నాకు లేదు. నాకు స్ఫురించిన ఒక పద్ధతిని సూచించటం మాత్రమే నా తాత్పర్యం.” – అని వినమ్రంగా ప్రకటించారు సంపత్కుమార. విమర్శలో పూర్వాపర సందర్భంతో కూడి హేతుబద్ధమైన తిరస్కారాన్ని కూడా పురస్కారంగా భావించే సౌమనస్యం సంపత్కుమార సొత్తు. ఎత్తుగీతి గణనిర్ణయంలో తన అభిప్రాయాలను సోపపత్తికంగా నిరాకరించిన సంగనభట్ల నరసయ్య విమర్శకు సాదరమైన స్వాగతాన్ని పలకడం ఇందుకు నిదర్శనం. వృణతేహి వినృశ్చ కారిణం గుణ లుబ్ధాః స్వయమేవ సంపదాః అన్న భారవి సూచనను విమర్శ సందర్భంలో తానెన్నడూ విస్మరించలేదు, విస్మరించిన వారిని హెచ్చరించక పోవనూ లేదు.