కోనసీమ కథలు: వామనుడు

డాక్టర్ చెప్పింది విని ఆశ్చర్యపోయాను. “మరి మీరు వాళ్ళకి చెప్పలేదా?”

“చెప్పాను. ఏం లాభం? కొడుకులందరూ ఇహాయన బ్రతకడన్న నిర్ణయానికొచ్చేసారు. కాకినాడ తీసుకెళ్ళినా ప్రయోజనం ఉండదని డబ్బుకి వెనుకాడారు.”

“పేరప్ప గారి మరణంపై వాళ్ళు నిర్ణయానికి రాలేదు. నిర్ణయించేసారు. ప్రయోజనం బ్రతకడానిక్కాదు. వాళ్ళకేమీ ఉండదని.” పైకి అందామనుకున్న మాటలు నాలోనే నొక్కేసాను. నాకు సూరిబాబు కుటుంబం గురించి బాగా తెలుసు. పేరప్పగారి తాళాల గుత్తిని పిల్లలందరూ పంచుకున్నారు. ఇల్లు మాత్రం భార్య పేరే రాసాడు పేరప్పగారు. ఆవిడ తదనంతరమే కొడుకులకి చెందేటట్లా రాసాడు. ఏదయితేనే ఆ ఇంట స్వేచ్ఛా వాయువులు ఉధృతంగా వీచాయి. ఆ ధాటికి ఆస్తి రెపరెపలాడ్డం మొదలెట్టింది. డాక్టర్ దగ్గర శలవు తీసుకొని ఇంటికొచ్చాను.

అమ్మకి కాకినాడ పెద్దాసుపత్రిలో హార్టుకి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. త్వరగానే కోలుకుంది. ఒక వారం రోజులుక్కడుంచి ఇహ అమలాపురం వెళ్ళచ్చనీ చెప్పారు. అమ్మ పూర్తిగా కోలుకున్నాక ఆపరేషన్ చేసిన డాక్టరుకి కృతజ్ఞతలు చెబుదామని పళ్ళు కొని తీసుకెళ్ళాను. ఆయన మా డాక్టరికి లెటర్ రాసిస్తానని చెబుతూ ఊరూ, పేరూ అడిగాడు. చెప్పాను. ఉత్తరం పూర్తిచేసి చేతికిస్తూ –

“మీది అమలాపురమా? మీ వూళ్ళో పేరప్పగారని ఉన్నారు. మీకు తెలుసా?” అడిగారు. బాగా తెలుసననీ, ఆయన ఈ మధ్య పోయారన్న సంగతీ చెప్పాను.

“అయ్యో పాపం! పోయాడా పెద్దాయన! అలాంటివాళ్ళు ఈ కాలంలో చాలా తక్కువమందుంటారయ్యా? మహానుభావుడు!” అన్నాడు. నాకు మతిపోయింది. పేరప్ప గారిని పొగిడే మొట్ట మొదటి మనిషిని మొదటిసారి ఈ భూ ప్రపంచమ్మీద చూస్తున్నాను.

“మహాను భావుడేంటండీ? మా వూళ్ళో అందరూ ఆయన్ని పిసినారి పేరప్ప అంటారు.” ఉండబట్టలేక అనేసాను.

“లేదయ్యా! నీకు తెలీదు. ఈ ఆసుపత్రి కట్టడానికి భూరి విరాళమిచ్చిన అజ్ఞాత దాత. కనీసం ఎక్కడా పేరు కూడా వేయద్దనీ చెప్పాడు.”

నమ్మబుద్ధి కాలేదు. అదే పైకి చెప్పాను. ఆ ఆసుపత్రి కట్టడానికి లక్ష రూపాయిలిచ్చాడని చెప్పాడు. చనిపోయిన రోజున ఆ కుటుంబం ఆయనపై చూపించిన గౌరవం గుర్తొచ్చింది. కొంత సేపయ్యాక డాక్టర్ వద్ద శలవు తీసుకొని భారంగా అక్కడనుండి కదిలాను. డాక్టర్ చెప్పిన విషయం మా ఆవిడకీ, అమ్మకీ చెబితే వాళ్ళూ నమ్మలేదు. పనులన్నీ ముగించుకొని, కోటిపల్లి మీదుగా అమలాపురం వెళదామని అనుకున్నాను. రావులపాలెం మీదుగా అయితే అమ్మ అంతసేపు ప్రయాణం చెయ్యలేదు. కోటిపల్లి గోదావరి దగ్గర పడవ ఎక్కి ఆవతల వైపునున్న ముక్తేశ్వరం రేవు దగ్గర నుండి అమలాపురం బస్సెక్కి వెళ్ళచ్చు. కోటిపల్లి చేరగానే పడవ సిద్ధంగా ఉంది. టిక్కట్టు తీసుకొని పడవెక్కాము. పడవలో ఏభై ఏళ్ళ పెద్దాయన నాకేసి పదే పదే చూస్తున్నాడు. ఆయనకేసి చూసి మొహమాటంగా నవ్వాను.

“మిమ్మలెనెక్కడో చూసునట్టుందండీ..?” అని మాటకలిపాడు. నా గురించి చెప్పాను.

“అలా చెప్పండాయ్! మా చెల్లెల్ని పేరూరే ఇచ్చాం. నేను అల్లవరానికి మునసబుగా చేసాను. మీరుండేది పేరూర్లోనేనా?” నేనుండే చోటు చెప్పాను.

“అమలాపురవా? భూపయ్యగ్రహారమా? చెప్పరే మరి! మీకు పేరప్పగారు తెల్సా?” అంటూ ప్రతీ వాక్యాన్నీ సాగతీస్తూ అడిగాడు. పేరప్పగారి పేరు అల్లవరం వరకూ పాకిందాని ఆశ్చర్యపోయాను. ఈ మధ్యే పోయారని చెప్పాను.

“అయ్యో పాపం! చాలా మంచోడా మనిషి. తుఫానుకి మా స్కూలు కూలిపోతే అది కట్టించడానికి ఆయనే డబ్బిచ్చాడు. ఆయన పేరు పెడతానన్నా వద్దన్నాడు. అసలు పేరు కూడా పైకి రానివ్వద్దని చెప్పాడు. దేవుడెప్పుడూ అంతేనండీ, మంచోళ్ళని ఇట్టే లాక్కెళ్ళి పోతాడు.”

మరోసారి మాటలేదు నాకు. ఇదంతా వింటూ మా ఆవిడా, అమ్మా ఆశ్చర్యపోయారు కూడా. ఈ కాకినాడ ప్రయాణంలో అన్నీ ఊహించనివే ఎదురవుతున్నాయి.

చిన్నప్పట్నుండీ చూసి చూసి పేరప్పగారంటే నాకొక రకమైన వ్యతిరేకాభిప్రాయం ఏర్పడిపోయింది. నాకే కాదు ఆయన చుట్టూ ఉన్నందరికీ అంతే! ఈ విషయం అమలాపురంలో చెప్పినా ఎవరూ నమ్మరు. ముఖ్యంగా వాళ్ళింట్లో వాళ్ళు. ఆలోచనలో పడిపోయాను. చుట్టూ ఉండే మనుషుల్లో కాంప్లెక్సిటీ ఇప్పటికీ అర్థంకాదు నాకు. ప్రవర్తనలో కనిపించే రూపం వేరు; లోపలి దేహం వేరూనూ.

పేరప్పగారు చిన్నప్పుడు వినాయక చవితి చందా అడగపోతే చెవి మెలేసిన సంఘటన గుర్తొచ్చింది. అప్రయత్నంగా చెవి మీదకి చెయ్యెళ్ళింది. పెద్దయ్యాక ఓసారి సూరిబాబు కోసం వెతుక్కుంటూ సరాసరి మా పారాయణ స్థలానికే వచ్చిన సంఘటన గుర్తొచ్చింది. అక్కడ సూరిబాబు లేడు కానీ, వాడికి పడాల్సిన అక్షతలు నాకు పడ్డాయి. “ఏరా వెధవా! మా వాడెలాగూ తగలడ్డాడు. నీకేం పొయ్యకాలం వచ్చిందిరా? మీ నాన్న సంపాదించిందంతా ఇలా తగలేస్తున్నావా?” అంటూ చదివిన తిట్ల దండకం గుర్తొచ్చింది. పొట్టిగా పీలగా వామనుడిలా ఉండే పేరప్పగారు గుర్తుకొచ్చారు. వంటికి చిన్న అంగోస్త్రమూ, మొలతాడుకి తళతళ లాడే తాళాల గుత్తీ గుర్తొచ్చాయి. కొంత సేపయ్యాక ఆయనతో అన్నాను.

“నేను రెండు వారాల్లో అల్లవరం స్కూలుకి టీచర్‌గా ట్రాన్స్‌ఫర్ మీదొస్తున్నాను.”

నా మాట విని నాకేసి విస్తుబోయి చూసింది మా ఆవిడ. అవునన్నట్లు తలూపాను. నా నిర్ణయం ఆమెకు తెలీదు. ఆమెకే కాదు నాకూ ఇప్పటివరకూ తెలీదు, వామనుడి గుడికి పూజారిగా వెళుతున్నానని. మెల్లగా మా పడవ ఒడ్డుకు చేరుకుంది.


(పంతొమ్మిదివందల డెబ్భై కాలంలో కోనసీమలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా – ఈ కోనసీమ కథలు.)