5. పద్యం, గద్యం, వచన పద్యం వగైరా

పద్యవిభజనలో ఉన్న వైవిధ్యాన్ని గురించి చెబుతూ, ఛందస్‌శ్లేషను గురించి ప్రస్తావించాను. సంపత్కుమార దాన్ని నేను ఉద్దేశించిన అర్థంలో గ్రహించలేదు. పద్యవిభజనలో భిన్నత్వం predict చెయ్యదగింది అవునా, కాదా అనే దృష్టితో నేను పరిశీలించాను. ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజెయ్యటం కోసం వ్యాకరణ భిన్నత్వం ఒకే వాక్యానికి రెండర్థాలను ఎట్లా కలిగిస్తుందో పరిశీలిస్తాను.

ఇంట్లో బియ్యం లేవని మా ఆవిడ రొట్టెలు చేసింది.

ఈ పై వాక్యానికి రెండర్థాలున్నై. ఆ అర్థాలు కింది వాక్యాల్లో వ్యక్తమౌతున్నై.

1. ఇంట్లో బియ్యం లేవు కాబట్టి మా ఆవిడ రొట్టెలు చేసింది. (హేత్వర్థం.)

2. “ఇంట్లో బియ్యం లేవు” అని (నాతో అని) మా ఆవిడ రొట్టెలు చేసింది. (అనుకరణార్థం.)

ఈ రకమైన భిన్నార్థకత వ్యాకరణం ప్రెడిక్టు చేస్తుంది. మొదటి అర్థం ‘అని’ని అను ధాతువునుంచి ఏర్పడ్డ క్వార్థకరూపంగా అన్వయించటం వల్ల వచ్చింది. (అనుకరణలో వచ్చే ‘అని’ వెనువెంటనే వచ్చే అనుధాతు నిష్పన్న రూపాలముందు వికల్పంగా లోపిస్తుంది.) రెండో అర్థం ‘అని’ని అనిష్పన్నమైన అవయవిసూచకంగా గ్రహించటం వల్ల వచ్చింది. అనుధాతువునుంచి నిష్పన్నమైన క్త్వార్థక క్రియ అవయవిసూచకమైన ‘అని’ ఒకే రూపంతో ఉండటం వల్ల ఈ అర్థ భేదం వచ్చింది. నిర్దిష్టమైన వ్యాకరణ సూత్రాల మీద వాక్యనిర్మాణం ఆధారపడి ఉండటం వల్ల ఈ భిన్నార్థకతను ప్రెడిక్టు చెయ్యగలిగాం. కానీ, ఈ కింది వాక్యాన్ని పరిశీలించండి.

సీత అలంకరించుకొని మా ఇంటికి వచ్చింది.

ఇక్కడ సీత పాశ్చాత్య పద్ధతిలో అలంకరించుకొన్నదా? ప్రాచ్యపద్ధతిలో అలంకరించుకున్నదా? ఉత్తరాది పద్ధతిలో ముడి వేసుకున్నదా? దక్షిణాది పద్ధతిలో పూలజడ వేసుకొన్నదా? అనే విషయం వ్యాకరణం చెప్పలేదు. వీటిల్లో ఏ అర్థమైనా రైటు కావచ్చు. లేక ఇంకేదైనా కావచ్చు. సీత అనే అమ్మాయిని చూస్తే తప్ప ఏ విషయమూ చెప్పలేము. అందువల్ల ఇక్కడ (సూత్రబద్ధమైన) శ్లేష లేదు. ఈ పద్ధతిలో సంపత్కుమార ఉదాహరించిన ‘మధుర మధురమైన మామిడి పండ్లను’ పరిశీలించాను. ఇవి సీసభాగమా, ఆటవెలది భాగమా అనేది మనం ప్రెడిక్టు చెయ్యవచ్చు. అంటే రెండింట్లో ఏదో ఒకటిగా మాత్రమే విభజించటానికి వీలున్నదని చెప్పవచ్చు. వచన పద్య పాదవిభజనలో భిన్నత్వం అట్లాంటిది కాదు. దీనికి నిర్దిష్ట సూత్రాలు లేవు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ‘మధుర మధురమైన మామిడిపండ్లను’ విభజించటానికున్న భిన్న పద్ధతులను మనం ముందుగా చెప్పవచ్చు. ఛందశ్శాస్త్రం అందుకు సాయపడుతుంది. పాదవిభజన లేకుండా రాసిన వచన పద్యాన్ని ఒకరికి పాదవిభజన చెయ్యమని ఇస్తే అతను ఏయే పద్ధతుల్లో చెయ్యటానికి వీలుందో ప్రెడిక్టు చెయ్యగలమా? అతను విభజన చేసిన తరువాత నువ్వు ఇట్లా ఎందుకు చేశావంటే కారణం చెప్పగలడా? అందుకే సంపత్కుమార అచ్చులో కాని, రాతలో కాని పాదవిభజన సూచించాలనటం. అంటే అట్లా ప్రెడిక్టు చెయ్యటానికి వీల్లేదని వారంగీకరించినట్టే. వచన పద్యంలో కూడా అట్లా ప్రెడిక్టు చెయ్యటానికి వీలుందని, అయితే ఆ విభజించేవాడు ఈ ప్రెడిక్టు చేసేవాడూ భావగణాలని తెలుసుకొని ఉండాలని వాదిస్తే సంపత్కుమార వాదానికి బలం వచ్చేది. ఆ భావగణాలను గుర్తు పట్టటం అన్నది వేరే ప్రశ్న. సంపత్కుమార విధాన్ని గురించి ఎట్లాగూ వేరే ఆలోచించాలి. నేనుద్దేశించిన దాన్ని సంపత్కుమార గ్రహించలేదు. అందుకే, ‘అక్కడ వేరు వేరుగా విభజించేందుకు గల అవకాశం ప్రధానం గాని, రెండు విధాలుగానా? మూడు విధాలుగానా? అన్నది ప్రధానం కాదు’ అని రాశారు. ఎన్ని విధాలుగా అన్నది కూడా ఇక్కడ ప్రధానమే. ప్రెడిక్టు చెయ్యటమంటే అదే. సూత్రబద్ధమైన శ్లేష ఉన్నప్పుడు ఎన్ని విధాలుగా విభజించటానికి వీలుందో ప్రెడిక్టు చెయ్యవచ్చు. మధుర మధురమైన మామిడిపండ్లను (జాతుల్లో) రెండు రకాలుగా మాత్రమే ప్రెడిక్టు చెయ్యటానికి వీలుంది. వచన పద్యానికి సూత్రబద్ధత లేదు గనుక అట్లాంటిది సాధ్యం కాదు. ఒకవేళ ప్రెడిక్టు చేస్తే వ్యాకరణాంశాలను బట్టి చెయ్యవచ్చు. అప్పుడది ఛందస్సుకు సంబంధించినది కాకుండా పోతుంది.

ఇక భావగణాల దగ్గరికొస్తే వాటిని వివరించానంటున్నారు సంపత్కుమార. ఆ వివరణ చాలదంటున్నాను. ‘అనల తోరణం’ అనే కూర్పులో ఇది భావగణం, ఇది భావాంశం అని చూపించిన మాట నిజమే. ఎందువల్ల ఇది భావగణం, ఎందువల్ల ఇది భావాంశం అనే ప్రశ్నలు వారు వేసుకోలేదు. నేను వేసిన వాటికి సమాధానాలియ్యలేదు. ‘ఇక్కడ భావం పూర్తి అవుతున్నది. ఇక్కడ భావం స్ఫురిస్తున్నది’ అనేవాటిని సంతృప్తికరమైన సమాధానాలుగా నేను గ్రహించలేను. ఇది ఇంతేనంటే నేను చెయ్యగలిగిందేమీ లేదు. ఇక వాదాలు అంతటితో ఆగిపోవటం తప్ప మార్గాంతరం లేదు. ఇంతకు పూర్వం లక్షణాలు చెప్పినవాళ్ళు ఇట్లాంటి ప్రశ్నలు వేసుకున్నారు. ఆ దృష్టితో లక్షణాలు చెప్పారు. వాటిని మనం అన్వయించుకొని చూడవచ్చు. అందువల్ల అవి శాస్త్ర ప్రతిపాదనలుగా నిలబడగలిగినై – అవి సమగ్రమా? అసమగ్రమా? అనేది వేరే ప్రశ్న.

పద్యానికి పాదబద్ధత అనేది ప్రధానాంశం అని మేమిద్దరమూ అంగీకరిస్తున్నాం. ఆ పాదబద్ధత ఎట్లాంటిది అనే అంశం మీదనే భేదిస్తున్నాం. పాదవ్యవస్థను అర్థం చేసుకోటానికి అంతర్నిర్మాణమూ, బాహ్య పరిమితీ అనే అంశాలను నేను ప్రతిపాదించాను. నిజానికీ మాటలు మాత్రమే నేను కొత్తగా ప్రతిపాదించినవి. ఈ భావాలు పూర్వం నుంచీ ఉన్నవే. లేకపోతే ఒక పాదంలో అక్షరాల క్రమాల గురించి గాని, గణ క్రమాన్ని గురించి గాని, ఫలాని అక్షరం ఫలానిదై ఉండాలని గాని, ఫలానిది కాకూడదని గాని చెప్పటానికి కారణం కనిపించదు. పాదవ్యవస్థకు అడ్డువచ్చేది దండకం ఒకటి ఉంది. ఒక్కో గణాన్ని పాదంగా పరిగణిస్తే పాదవ్యవస్థను దానికి కూడా అన్వయించుకోవచ్చు. మాలికా వృత్తాలకు దండకానికి భేదం (తెలుగులో) ఒకటే కనిపిస్తున్నది. దండకానికి ప్రాసనియమం లేదు. ప్రాసనియమం లేని మాలికా వృత్తంగా దండకాన్ని పరిగణించవచ్చు. అంతర్నిర్మాణ విషయంలో ఏకాక్షర వృత్తం లొంగదు. ఒక సెట్ తనలో తాను అంతర్భాగం కూడా అవుతుందన్న గణిత శాస్త్ర ప్రతిపాదనను దీని కన్వయించవచ్చు గానీ, దానివల్ల సాధించగలిగిన ప్రయోజనాల విషయంలో నాకు స్పష్టమైన అభిప్రాయం లేదు. అందువల్ల పై రెండు ఛందోభేదాలనూ అపవాదాలుగానూ, వాటి గురించి నేను చేసిన సూచనలు తాత్కాలికమైనవిగానూ గ్రహించాలి.

నేను ప్రతిపాదించిన బాహ్యపరిమితి విషయంలో సంపత్కుమారకు పేచీ లేదు. అంతర్నిర్మాణం విషయంలోనే అభ్యంతరం చెబుతున్నారు. నిజానికి అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్నిర్మాణం ఉంటుందని ఒప్పుకోటమూ, అది ఫలాని విధంగా ఉంటుందని ఒప్పుకోటమూ ఒకటి కావు. ఈ రెంటినీ సంపత్కుమార కలిపేస్తున్నారు. ‘ఏ విధమైన పద్యపాదానికి కూడా అంతర్నిర్మాణమంటూ ఏదీ ఉండదు’ అనే వాక్యం వారి అసలు ఉద్దేశాన్ని వెల్లడించడం లేదు. అంతర్నిర్మాణం చెప్పటానికి గణపద్ధతి ఒకటే ఉందని నేననుకుంటున్నట్టు సంపత్కుమార అనుకుంటునట్టున్నారు. ఈ విషయంలో నా అభిప్రాయాన్ని బండి నాగరాజుగారు (చూ. అనుబంధం) విస్తరించారు గనుక దాన్ని గురించి ఇక్కడ ఎక్కువగా ప్రస్తావించను. ‘పాదం అక్షర సముదాయం కాదు, గణ సముదాయం’ అని నేను మొదటి వ్యాసంలో అన్న మాట స్థూలదృష్టితో చెప్పింది. నా రెండో వ్యాసంలో దాన్ని గురించి విపులంగా చర్చించి అంతర్నిర్మాణానికి గణసహాయం అవసరం లేదన్న సంపత్కుమార సూచనను వృత్తాల విషయంలో గ్రహించాను. మాత్రాపద్యాల విషయంలోనూ, జాతుల విషయంలోనూ గణ సహాయం అవసరం అన్నాను. అంటే గణాల్లేకుండా లక్షణం చెప్పడం అసలు కుదరదని కాదు. అట్లా చెప్పటంలో సంక్షిప్తత లేదని నా ఉద్దేశం. దాన్నే ‘ఏకైక పద్ధతి’ అన్నాను. గణాల పద్ధతిలో చెప్పటంలో సంక్షిప్తత ఉంది. సౌలభ్యం ఉంది. ఈ మాటల్ని మామూలు అర్థాల్లో కాక పరిభాషలో వాడుతున్నాను. కాయితం మీద తక్కువ చోటు పడుతుంది కాబట్టి సంక్షిప్తత, సూత్రం తేలిగ్గా చదవ్వచ్చు కాబట్టి సౌలభ్యం అవసరమని నా ఉద్దేశం కాదు. పట్టే చోటుతోగాని, చదివే సౌకర్యంతోగాని శాస్త్రానికి సంబంధం లేదు. ఇంతకన్నా ఎక్కువ ప్రయోజనం ఉంటేనే సంక్షిప్తతకూ, సౌలభ్యానికీ శాస్త్రంలో ప్రవేశం ఉంటుంది. స్పష్టత కోసం వ్యాకరణం నుంచి ఒక ఉదాహరణ చూపిస్తాను. సంకేతాల ద్వారా ఈ సంక్షిప్తత సాధించబడింది. బాలవ్యాకరణంలో ఈ దిగువ సూత్రం ఉంది.

“అగు, వచ్చు, చొచ్చు, చూచులకు ముత్తు పరంబగునప్పుడు కా, రా, చొరు, చూడులగు.” (క్రియ – 91.)

తెలుగు క్రియల్లో కొన్నింటికి భిన్నపరిసరాల్లో వచ్చే రూపభేదాలను వాటి వర్ణసంయోజనాన్ని బట్టి నిర్ణయించలేం. అట్లాంటివి పైన సూత్రంలో చెప్పిన క్రియలు. ఈ రూపభేదాన్ని కలిగించే పరిసరాలు ముత్తు అన్న సంకేతంతో సూచించబడ్డయ్. ఈ ముత్తు వేటికి సంకేతమో వ్యాకరణంలో ఇంకో చోట చెప్పబడింది. ఈ ముత్తు అనే సంకేతం లేకుండా చెప్పకూడదా అంటే తప్పకుండా చెప్పవచ్చు. అయినా వ్యాక్కర్త సంక్షిప్తతనే వరించి ముత్తు అనే సంజ్ఞను వాడాడు. నిజానికి ఈ ముత్తు ఏమిటో తెలుసుకోవాలంటే వేరే సూత్రాలు వెతుక్కోవాలి. ఆ రకంగా చదవటంలో క్లిష్టత కూడా ఉంది. అయినా ఈ సంకేతాన్ని వాడటంవల్ల వ్యాక్కర్త సాధించేదేమిటంటే శాస్త్ర సంక్షిప్తత, అదే ‘ఏకైక పద్దతి’లో చెప్పటం. భిన్న పరిసరాల్లో జరిగే మార్పుల్లో ఉన్న ‘ఏకత’ను ఈ సూత్రం ద్వారా వ్యక్తపరిచాడు. ఈ పరిసరాలన్నీ కలిపి కలిగించే మార్పు ఒక్కటే అన్న విషయం తెలియపర్చటానికే ఈ సూత్రం ఇట్లా రాయబడ్డది. ‘ముత్తు’ అవసరం లేదని ఎవరైనా వాదించవచ్చు. సాధారణీకరణ (జెనరాలిటీ) సాధించదల్చుకున్న వ్యాక్కర్త కిది అవసరమే.

ఈ దృష్టితోనే నేను గణాల అవసరాల్ని పరిశీలించాను. వృత్తాల లక్షణాల్ని గణాలతోనూ చెప్పవచ్చు, అక్షరక్రమంలోనూ చెప్పవచ్చు. గణాలతో చెప్పటంలో సంక్షిప్తత లేదా అంటే మామూలు దృష్టితో ఉందిగాని శాస్త్రదృష్టితో లేదు. అక్షరక్రమంలో చెప్పిన దానికన్నా గణక్రమంలో చెప్పటం వల్ల వృత్తాల్లో సాధించే ‘జెనరాలిటీ’ లేదు. అంటే అక్కడి సంక్షిప్తత శాస్త్ర సంక్షిప్తత కాదు. అందువల్ల వృత్తాల అంతర్నిర్మాణాన్ని చెప్పటానికి గణాల అవసరం లేదంటే గణాల సాయంతో చెప్పలేమని కాదు. అట్లా చెప్పటం వల్ల సాధించే శాస్త్ర సంక్షిప్తత లేదని. కానీ జాతుల విషయంలో అట్లాంటిది ఉంది. భిన్నాక్షరక్రమాలు ఒక అంతస్సూత్రం మీద ఆధారపడి ఉన్నాయన్న విషయాన్ని జాతుల్లో గణ సహాయం ద్వారా చెప్పవచ్చు. అక్షరక్రమంలో చెప్తే ఈ అంతస్సూత్రాన్ని చెప్పలేం. అట్లాగే మాత్రాఛందస్సుల విషయం. అందుకే నా నవంబరు వ్యాసంలో ‘ఏకైక పద్ధతి’ అని వాడింది. దాన్నే బొమ్మల సాయంతో వివరించాను.

జాతులకు నిర్దేశించిన గణాలు సమమాత్రాకాలు కావు. అంతేకాక ఆ గణాలు ఏకైక అక్షరక్రమాన్ని ఇయ్యలేవు. సమమాత్రాకాలు అయితే మాత్రాగణాలతో చెప్పవచ్చు. ఒకే అక్షర క్రమాన్ని ఇస్తే గురు లఘు క్రమ భేదంతోగాని, నిసర్గ గణాల్లోగాని చెప్పొచ్చు. జాతుల గణాల్లోని ఈ వ్యత్యాసాన్ని గురించి చెబుతూ సంపత్కుమార, ‘ఆ గణాల పరిస్థితి అట్లా ఉన్నది’ అని అన్నారు. పరిస్థితి అట్లా ఉన్నది కాబట్టే ఆ గణాలు అక్కడ అవసరమయినై. ‘ఆలోచిస్తే లక్షణ కథనంలోని సౌలభ్యం కోసమే ఈ గణపద్ధతి అని స్పష్టం’ అని రాసినదానితో కూడా నాకు పేచీ లేదు. అయితే ఆ సౌలభ్యం పైన నేను సూచించిన శాస్త్ర సంక్షిప్తతను సాధించేది కావాలి. శాస్త్ర సంక్షిప్తత అవసరమా కాదా అంటే అవసరమని నా అభిప్రాయం. నా అభిప్రాయంతో సంపత్కుమార ఒప్పుకోకపోవచ్చు. భారతీయ శాస్త్రకారులీ సంక్షిప్తతను సాధించటానికి ప్రయత్నించారని తెలిసిన వాళ్ళంటారు. ఆధునిక భాషాశాస్త్రంలో ఇది అతిముఖ్యమైన లక్షణం. ఒక భాషకు సాధ్యమైన భిన్నవ్యాకరణాలలో ఉత్తమమైనది ఎంచుకోటానికి ఉపయోగించే లక్షణం ఇది (రామారావు, 1971.)

మాత్రా పద్యాలకు మాత్రా గణాల్లో కాకుండా వేరే పద్ధతిలో లక్షణం చెప్పవచ్చు గాని శాస్త్ర సంక్షిప్తతను సాధిస్తూ లయను సూచిస్తూ చెప్పాలంటే మాత్రాగణాల సాయంతో చెప్పాలి. పాదాల్లో మాత్రల కలయికను గురించి చెప్పకుండా, పాదంలో మాత్రాసంఖ్యను మాత్రమే చెప్తే పాదాల అంతర్నిర్మాణాన్ని గురించి చెప్పినట్టే. ఇక వాటి అంతర్నిర్మాణాన్ని లయ ననుసరించి చెప్పాలంటే మాత్రాగణాల పద్ధతిలోనే చెప్పాలని నా వాదం. అట్లా చెప్పకపోతే లయ ననుసరించి చెప్పినట్టు కాదు. అంటే ఆ పద్యానికి లయ నిర్దేశం చెయ్యలేదన్నమాట. లయ నిర్దేశం చెయ్యకపోతే భిన్నలయలు వాడుకోడానికి వీలుంది. మాత్రాగణాల్లో చెబితే మాత్రం లయ సాధ్యమౌతుందా? అంటే మాత్రాగణాల్ని భాషలో ఊనిక ప్రవర్తన ననుసరించి వాడితే లయ సాధ్యమవుతుంది. ఈ ఊనిక ప్రవర్తన పద పదాంశ విరామం మీదా, పదంలో గురు లఘు క్రమం మీదా ఆధారపడి ఉంటుంది. ఈ ఊనిక ప్రవర్తన ననుసరించే అనులోమ విలోమ గతుల భేదం వస్తుంది. లయ స్ఫురణలో పద పదాంశ విరామాలూ, ఊనిక ప్రవర్తన చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తయ్యని నా మొదటి వ్యాసంలో సూచించాను.

ఇంతకీ జాతుల్లో గాని, మాత్రా ఛందస్సుల్లో గాని అంతర్నిర్మాణం గణాల్లో చెప్పాలా అక్కర్లేదా అన్నది నా వాదానికి ప్రధానం కాదు. అట్లా చెప్పటంలో ఉన్న సౌలభ్యాన్ని పైన చర్చించాను. రేపటి పరిశోధకులు గణ పద్ధతికన్నా పటిష్ఠమైన ఇంకో పద్ధతిని సూచించవచ్చు. కాని అంతర్నిర్మాణం లేకుండా పద్యం ఉండదు. ఫలాని అక్షరాలు ఫలాని క్రమంలో ఉంటయ్యని గాని, ఫలాని అక్షరం గురువో లఘువో కావాలని గాని, కాకూడదని గాని చెప్పటం పాదంలో అంతర్నిర్మాణాన్ని గురించి చెప్పటమే అవుతుంది. ఈ విషయాన్ని నాగరాజుగారు (చూ. అనుబంధం) గుర్తించారు.

ఇక భావగణాల విషయం. భావగణ విభజనలో వ్యాకరణాంశాల పాత్రను సంపత్కుమార పూర్తిగా నిరాకరించలేదని గుర్తించాను. ఆ పాత్ర ఎంతవరకు అన్నదాంట్లోనే మా ఇద్దరికీ అభిప్రాయ భేదం. వ్యాకరణ సంబంధాలకీ, భావాంశాలకీ ఏకైక సంబంధం ఉందని నా అభిప్రాయం. సంబంధాన్ని పూర్తిగా నిరాకరిస్తే అర్థబోధలో వ్యాకరణాంశాలకు పాత్ర లేదనాల్సి ఉంటుంది. అందువల్ల సంపత్కుమార మధ్యే మార్గాన్ని ఎన్నుకుని కొంతవరకు మాత్రం ఉంటుందంటున్నారు. కాదు పూర్తిగా ఉంటుందని నా వాదం. దీనికి ఉపపత్తిగా వారు భావగణాలంటున్న వాటిని నేను వ్యాకరణ గణాలుగా నిరూపించాను. సంపత్కుమార తన వాదాన్ని నిలబెట్టుకోవాలంటే వ్యాకరణ సంబంధాలు పాదవిభజనకు ఎక్కడ లేవో నిరూపించాలి. కనీసం ఆ ‘కొంతవరకు’ అనేది ఎంతవరకో స్పష్టంగా చెప్పాలి. ఇది సాధ్యమనుకోను. భావగణాలని వారనుకుంటున్న వాటికి, వ్యాకరణానికి అంత విడదియ్యరాని సంబంధం ఉంది. అయితే భావస్పూర్తి ప్రధానం గాని వ్యాకరణ సంబంధాలు ప్రధానం కాదంటారు సంపత్కుమార. ఈ సందర్భంలో అర్థాలంకార ప్రసక్తి తీసుకొచ్చారు. అర్థాలంకారాలను వ్యాకరణాలంకారాలు అని అనాల్సి ఉంటుందా? అని అడుగుతున్నారు. అనక్కర్లేదు, అనగూడదు అని సమాధానం. ఒక అలంకారాన్ని ఒక కవి సంస్కృత శ్లోకంలో వాడినా, తెలుగు పద్యంలో వాడినా, గద్యంలో వాడినా, చిన్న పద్యంలో వాడినా, పెద్ద వాక్యంలో వాడినా, సంహృత వాక్యంలో వాడినా, ఒక వాక్యంలో వాడినా, భిన్న వాక్యాల్లో వాడినా ఒక అలంకారం అదే అలంకారం అవుతుంది. అలంకారాల్లో పాదవిభజన లేదు. శబ్దరూప ప్రాధాన్యం లేదు. వాక్యవ్యవస్థను బట్టి అలంకారం మారదు. కాని, వీరి భావగణాలు అట్లా మారకుండా ఉంటయ్యా? మారకుండా ఉండని పద్ధతిలో భావగణాల్ని నిర్వచించారా? ఎంతకీ భావస్ఫూర్తిని బట్టి, భావాన్ని బట్టి అనేగాని అంతకన్నా స్పష్టమైన నిర్వచనం ఇవ్వటం లేదు. ఇప్పటి వ్యాసంలోనైనా ఈ వాక్యాలు చూడండి: ‘భావగణం ఏకపదంగా ఉంటుందా? బహుపదంగా ఉంటుందా? అన్నప్పుడు అక్కడ ఉపయుక్తమైన పదాల స్థితి అంటే ఏకపదం భావాంశ స్ఫోరకమైతే ఏకపదమే భావగణం. బహుపదాల సమష్టి భావాంశ స్ఫోరకమైతే ఆ సమష్టే భావగణం. భావాన్ని స్ఫురింపజేసే పదాల స్థితి అంటే ఇది.’ – దీన్ని బట్టి భావగణం ఏమిటో నాకర్థం కావటం లేదు. ఈ వాక్యాల్నుంచి భావగణ స్వరూపాన్ని గ్రహించలేని నా అశక్తతను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. ఇంతకన్నా స్పష్టంగా భావగణ స్వరూపాన్ని వివరించటం కుదరదంటే చేసేదేమీ లేదు.

పద్యపాదానికి అంతర్నిర్మాణ బాహ్య పరిమితులుంటాయనీ, వచన పద్యానికి అంతర్నిర్మాణం లేదని, బాహ్య పరిమితి ఆర్బిట్రరీ అని, భావగణాల స్వరూపం ఏమిటో స్పష్టంగా తెలియనందున భావగణాలు వచన పద్యాన్ని నిర్వచించలేవని, భావగణ విభజన ఏ పద్ధతిలో జరిగినా వచన పద్యాన్ని వచనం నుంచి భావగణాలు వేరు చెయ్యలేవనీ, అందువల్ల వచన పద్యం ‘పద్యం’ కాదనీ ఇంకోసారి నిరూపించాను. అచ్చులో లైన్లు కూరే పద్ధతిమీద ఆధారపడకుండా వచన పద్యాన్ని గద్యం నుంచి వేరు చేసే కొత్త లక్షణాల్ని సంపత్కుమార గాని, ఇంకొకరు గాని ప్రతిపాదించేవరకు ఈ విషయాన్ని గురించి చర్చించవలసిన అంశాలు కూడా లేవు.

(భారతి జులై 1975 పే. 28-35)


వచన పద్యం: లక్షణ చర్చ – ఉపయుక్త గ్రంథ, వ్యాస సూచి.

వచన పద్యం: ఒక పరిశీలన – బండి నాగరాజు. వచన పద్యం లక్షణ చర్చకు అనుబంధ వ్యాసం.

(ఈ వ్యాస పరంపరలో చివరి వ్యాసం కోవెల సంపత్కుమార రాసిన వచన పద్యం వాద సమాపనం.)


చేకూరి రామారావు

రచయిత చేకూరి రామారావు గురించి:

తెలుగు సాహిత్య ప్రపంచంలో విమర్శకులు, భాషా శాస్త్రవేత్తగా ప్రసిద్ధికెక్కిన డాక్టర్‌ చేకూరి రామారావు (1934 – 2014). చేరాగా సువరిచితులు. ఆధునిక భాషాశాస్త్ర రంగంలో కొత్త విప్లవాన్ని తీసుకువచ్చిన నోమ్ చోమ్స్కీ పరివర్తన సిద్ధాంతాన్ని ఉపయోగించి తెలుగు వాక్యాన్ని విశ్లేషించి కొత్త ఒరవడికి ఆద్యులయ్యారు.

 ...