విజయనగర చరిత్ర రచన: ఒక సమీక్షా వ్యాసం

అలాగే ఈ రచనలు పూర్తిగా ఆయా పోర్చుగీసు రచయితలు అప్పటికే స్థానికంగా ప్రచారంలో వున్న విషయాలను (ఉదా: విజయనగర రాజ్య స్థాపన, విస్తరణ), వారు విన్న కన్న సంగతులను కలుపుకుంటూ చేసిన ఒక కొత్త ‘అనువాదం’గా చెప్పుకోవచ్చునని సంజయ్ సుబ్రహ్మణ్యం[8] అంటాడు (పే. 388). అదనంగా పదిహేను, పదహారు శతాబ్దాలలో వచ్చిన యాత్రాచరిత్రలను – నికోలో కాంటి (Nicolo Conti), అబ్దుల్ సమర్ఖండి (Al Samarkandi), నికితిన్ (Nikitin), వెర్తెమా (Ludovico di Verthema), తదితరులవి – చేరుస్తూ 1977లో వసుంధర ఫిలియోజాట్[9] సూవల్ అనువాదాలను పునఃపరిశీలించారు. ఎ. రంగస్వామి సరస్వతి 1925లో ఆముక్తమాల్యదలోని రాజనీతిని చర్చించి రాసిన వ్యాసం సమగ్రంగా లేదు. వెల్చేరు నారాయణరావు, డేవిడ్ షూల్‌మన్, సంజయ్ సుబ్రహ్మణ్యం 2004లో ఆ కావ్యంలోని రాజనీతి భాగాన్ని పూర్తిగా అనువదించి[10] దానిపై ఒక వ్యాసం ప్రచురించారు. అప్పటివరకు ఆముక్తమాల్యద అంటే రాజనీతి మాత్రమే అనే అభిప్రాయం వుండేది. దీనిని సవరించడానికి కూడా ఈ వ్యాసం ఉపయోగపడింది.

తెలుగు, కన్నడ చరిత్రకారుల వాదనలలోను, విడిగాను బహు చర్చనీయాంశమైన విషయం విజయనగర రాజ్య ‘స్థాపకు’లైన హరిహర రాయలు, బుక్కరాయలు – వీరిని గురించినది. ఈ ఇద్దరూ ప్రథమంలో కాకతీయ ప్రతాపరుద్రుని కొలువులో వున్నారని, కంపిలి యుద్ధంలో బందీలుగా ఢిల్లీకి తరలింపబడ్డారని, అక్కడ మహమ్మదీయ మతం స్వీకరించారని, ఢిల్లీ సుల్తాను వీళ్ళని దక్షిణభారతంలో శత్రురాజ్యాలను అణిచివేయడానికి పంపించాడని, ఆ తరువాత వీళ్ళు విద్యారణ్యుని ప్రభావంతో మరల హిందూ మతాన్ని స్వీకరించి సనాతన హిందూ ధర్మరాజ్యాన్ని స్థాపించారని ఒక కథ వుంది. ఈ కథకు మూలాలుగా ‘రాజకాల నిర్ణయము’, ‘విద్యారణ్య కాలజ్ఞానము’, ‘విద్యారణ్య వృత్తాంతము’ వంటి 16వ శతాబ్దం నాటి రచనలను, సూవల్ అనువాదాలను, 14వ శతాబ్దం నాటి పర్షియన్, అరబిక్ రచనలను ఉదహరిస్తూ మొదటగా వెంకటరమణయ్య ఒక సంగ్రహ చరిత్ర రాసే ప్రయత్నం చేశాడు.

తరువాత నీలకంఠశాస్త్రి ఇప్పటికీ ముద్రణలో వున్న, ప్రముఖ పాఠ్య పుస్తకం A history of south India (1955) లో, వెంకటరమణయ్య చేసిన సుదీర్ఘవాదాన్ని చారిత్రక సత్యంగా పేర్కొన్నారు. ఇదే విషయాన్ని వెంకటరమణయ్య క్లుప్తంగా, పాపులర్ శైలిలో మజుందార్ సంపాదకత్వంలో భారతీయ విద్యా భవన్‌వారు ప్రచురించిన History and culture of the Indian people ఆరవ సంపుటంలో (1967) చెప్పటం జరిగింది. ఈ వాదనతో విభేదిస్తూ, ఆ కాలంలో ప్రముఖ కేంద్రంగా ఢిల్లీకున్న స్థానాన్నీ, విజయనగర చరిత్ర రచనలో మత గురువులు, ముఖ్యంగా శృంగేరి పీఠం పాత్రను, అదే కాలంలో వచ్చిన ఇలాంటి కథలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ మంచి పరిశోధనా వ్యాసాలు11-13 వచ్చాయి. డాలపికోలా (Anna Dallapiccola) సంపాదకత్వంలో,రెండు సంపుటాలలో వచ్చిన చాలా వ్యాసాలు[11] చదవదగినవి.

విజయనగర సైన్యంలో పెద్ద సంఖ్యలో తురుష్కులు, ఆఫ్ఘనులు కిరాయి సైనికులుగా వుండేవారు, అరబ్ దేశాలనుంచి (పోర్చుగీసువారి ద్వారా) గుర్రాలను దిగుమతి చేసుకునేవారు. విజయనగర కాలంలో వస్త్రధారణ, భవన నిర్మాణంపై వాగనర్ [13], వాణిజ్యంపై సంజయ్ సుబ్రహ్మణ్యం[14] రాసిన పలు వ్యాసాలు, దేవాలయాల పాత్రపైన తిరుపతి ఆలయం ప్రధానాంశంగా బర్టన్ స్టైన్, సంజయ్ సుబ్రహ్మణ్యంల వ్యాసాలు [15-16] కూడా విజయనగర కాలాన్ని ఒక కొత్త కోణంలో మనకు చూపెడతాయి. 1993 లో వాగనర్ ప్రచురించిన Tidings of the king: A translation and ethnohistorical analysis of the Rayavacakamu విజయనగర పరిశోధనలలో వెలువడిన ఉత్తమ గ్రంథాల్లో ఒకటి. దీనిలో రాయవాచకాన్ని అనువదించడంతో పాటు చేర్చిన విశ్లేషణాత్మ వ్యాసం, పొందుపరచిన సమాచారం చాలా విలువైనవి. విజయనగర చరిత్రనంతటినీ సమన్వయిస్తూ రాయడానికి చివరిగా ప్రయత్నం చేసినది బర్టన్ స్టైన్[7]. కానీ ‘విజయనగర’ అన్న ఆ పుస్తకం (Cambridge, 1989) అందరినీ సంతృప్తి పరచలేక పోయింది.

తెలుగువారు చేసిన పరిశోధనలు, జనప్రియమైన రచనలు

నేలటూరి తరువాత 1800కు ముందునాటి చరిత్ర పరిశోధనలో చెప్పుకోవలసిన పేరు సి.వి. రామచంద్రరావు. రామచంద్రరావు మనకు చేసిన గొప్ప సేవ, ఆయనకున్న పరిమితులలోనే, రాయవాచకం (1982), కృష్ణరాయ విజయం (1981), ఏకామ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్రం (1984) మొదలైన చారిత్రక గ్రంథాలను పూర్తి పాఠాలతో, చారిత్రక విశ్లేషణతో అందించటం. మిగిలిన వారిలో చెప్పుకోవలసిన కొన్ని పేర్లు: ఓరుగంటి రామచంద్రయ్య (Studies on Krsnadevaraya of Vijayanagara, వాల్తేరు, 1953. 1946లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పిహెచ్.డి పట్టా కోసం సమర్పించిన థీసిస్.), బి. సూర్యనారాయణరావు (Short history of Vijayanagar, 1909), చిలుకూరి వీరభద్రరావు (ఆళియరామరాయలు, 1931), నూతలపాటి పేరరాజు (విజయనగర చరిత్రము, బాలసరస్వతీ బుక్ డిపో,కర్నూలు, 1941). ఇంకా భారతి, ఆంధ్ర సాహిత్యపరిషత్పత్రిక, ప్రబుద్ధాంధ్ర, A.P. historical journal మొదలైన పత్రికల్లో విరివిగా చారిత్రక వ్యాసాలు వచ్చాయి కానీ, ఈ వ్యాసం ప్రారంభంలో చెప్పినట్లు గత 40 సంవత్సరాలలో సంఖ్యా పరంగాను, వస్తురీత్యా ప్రత్యేకంగా ప్రస్తావించదగ్గవిగా నా దృష్టిలోకి రాలేదు. అలాగే తెలుగు విశ్వవిద్యాలయాలలో కూడా పెద్దగా పరిశోధనలు జరుగుతున్నట్లుగా కనపడటంలేదు.

జనప్రియమైన రచనల్లో కొన్ని: వేదం వేంకటరాయశాస్త్రి రాసిన విజయనగర యుగము (1976), చిట్టా రామకృష్ణరావు రాసిన శ్రీకృష్ణదేవరాయలు (1944), విష్ణుభొట్ల సూర్యనారాయణ రాసిన శ్రీకృష్ణదేవరాయల చరితము (1951), దుగ్గిరాల రాఘవచంద్రయ్య చౌదరి రాసిన విజయనగర సామ్రాజ్యము (1914) అనే కాల్పనిక రచన, నెలటూరి వెంకటరమణయ్య రాసిన పశ్చాత్తాపము (విజయనగర కథాతరంగిణి – ప్రథమ తరంగము, 1955) అన్న కాల్పనిక చారిత్రక నవల.

పరిశోధనల అవసరం

మామూలుగా చరిత్ర రచనలో శాసనాలలోను, యాత్రా చరిత్రలలోను వున్న సమాచారం‘వాస్తవాలు’ గాను, సాహిత్యంలోని వివరాలు ‘కల్పనలుగాను, కట్టుకథలుగాను’ చూపించడం రివాజు. కాని శాసనాలలోని పద్యాలు కూడా కావ్యాలలోని పద్యాలలాగా ఆలంకారిక ఆడంబరంతోను, యాత్రా రచనలలోకూడా కథలు, వదంతులు వుంటాయని స్పష్టంగా చూపించడం ఇటీవల కాలంలో జరిగిన పని. కాని కథ అయినంత మాత్రం చేత చారిత్రకం కాదని కొట్టేయక్కరలేదని, శాసనం అయినంత మాత్రం చేత దానిలో ఉన్నదంతా చారిత్రక వాస్తవమేనని తీసుకోవక్కరలేదని విమర్శాత్మకమయిన అభిప్రాయాలు ఈ కాలంలోని పరిశోధనలలో ప్రతిపాదించబడ్డాయి. ఈ సందర్భంలో వెల్చేరు నారాయణరావు, డేవిడ్ షూల్‌మన్, సంజయ్ సుబ్రహ్మణ్యం రాసిన Textures of time[17]అన్న పుస్తకం చరిత్ర పరిశోధనని ఒక మలుపు తిప్పింది. భారతీయులకు ఇంగ్లీషువాళ్ళు రాకముందు చరిత్ర రచన లేదని, చారిత్రక జ్ఞానం లేదని నమ్మకంగా విశ్వసించే అభిప్రాయాలని ఈ పుస్తకం సవిమర్శకంగా ఎదుర్కున్నది. ఉదాహరణకి, కల్పితకథగా భావించబడే కుమార రాముని కథ, పాటలుగా భావించబడిన బొబ్బిలి యుద్ధ కథ, కావ్యంగా భావించబడే రంగరాయ చరిత్ర, వీటన్నిటినీ చారిత్రక గ్రంథాలుగా చూడవలసిన అవసరాన్ని ఈ పుస్తకం సమర్ధంగా ప్రతిపాదించింది.

ఇప్పటికి కూడా విజయనగర సామ్రాజ్యం గురించి, కృష్ణదేవరాయలు గురించి జాతీయవాద భావాలు, ఆంధ్ర వైభవ భావాలు విచ్చలవిడిగా చలామణి అవుతున్నాయి. ఇప్పటికీ మనం కృష్ణరాయల కాలంలో అష్టదిగ్గజాలు వుండేవారని, వాళ్ళతో ఆయన రోజంతా సమస్యాపూరణలు, సాహిత్య చర్చలు చేసేవారని నమ్ముతూ కూర్చుంటాం. ఈ నమ్మకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తోడ్పాటిస్తూంది. కృష్ణరాయల ఆంధ్రభోజత్వాన్ని, ఆయన చుట్టూ వున్న కథలని ఎలా అర్థం చేసుకోవాలో చెప్తూ అవి అక్షరాలా చారిత్రకం కావు, అయినా అవి కొట్టివేయ తగ్గవి కావు అని ప్రతిపాదిస్తూ, ఇటు సాహిత్య చరిత్రకి అటు భావాల చరిత్రకి (History of Ideas) ఇవి యెంతగా ఉపయోగిస్తాయో వివరంగా చెప్పిన పుస్తకం వెల్చేరు నారాయణరావు, డేవిడ్ షూల్‌మన్ రాసిన A poem at the right moment: Remembered Verses from Pre-modern South India; (Berkeley, New Delhi, 1998, 1999). కానీ ఈ పుస్తకం తెలుగుదేశంలో చరిత్రకారుల దృష్టికి వచ్చినట్లులేదు. ఈ భావాలకి, కథలకి వెనకాల వున్న రాజకీయ అవసరాలను గుర్తిస్తూ కనీసం చరిత్రకారులలోనైనా వీటిని సవిమర్శంగా చర్చించే పరిస్థితి ఏర్పడాలి.

ఉపయుక్త విషయసూచిక

  • ఎమెస్కో వారు Robert Sewell 1900 సంవత్సరంలో ప్రచురించిన A Forgotten Empire అనే పుస్తకాన్ని ఈ మధ్యనే తెలుగులోకి అనువదించి ప్రచురించారు. 110 ఏళ్ళ తరువాతైనా విజయనగర చరిత్రాధ్యయనంలో ముఖ్యమైన ఈ పుస్తకం తెలుగులో రావడం మంచి వార్త.
  • రామరాజీయము – అ. వెంకయ్య, సం. గుస్తాఫ్ ఒప్పర్ట్ (Gustav Oppert) , వావిళ్ళ ప్రచురణ, 1923.
  • స్థానికంగా కరణాల వద్ద పూర్తిగా సహకారం అందనప్పుడు, లేక ఒక రాతప్రతిని పూర్తిగా యెత్తి రాసుకోవలసిన అవసరం లేదని భావించినా, మెకంజీ సహాయకులు స్థానిక సమాచారాన్ని క్లుప్తంగా ఒక డైజెస్ట్ రూపంలో పొందుపరచిన సమాచారం.
  • విజయనగర చరిత్రను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఆనాటి సమకాలీన, పరిసర రాజ్యాల (ఉదా. తమిళ/పాండ్య, దక్కన్/బహమనీ) చరిత్రను, అలాగే 14వ శతాబ్దం ముందునాటి (ఉదా. కాకతీయ, రెడ్డి, హొయసాల రాజుల) స్థితిగతులను గురించి కూడా తెలుసుకోవడం ముఖ్యం. ఆసక్తి గలవారు ఆయా రాజ్య చరిత్రలను కూడా సంప్రదించవచ్చు.
  • కుమారరాముని కథ – సంపాదకత్వం: వెంకటరమణయ్య, GOML, Madras, 1952.
  • చివరి పుస్తకం కృష్ణస్వామి అయ్యంగార్ సంపాదకత్వంలో పూర్తిచేయబడింది.
  • Burton Stein – Vijayanagara, 1989
  • Sanjay Subrahmanyam – Reflections on state-making and history-making in south India, 1500-1800,
    JESHO, V41N3, pp. 382-416, 1998.
  • Vasundhara Filliozat – The Vijayanagara empire: As seen by Domingo Paes and Ferna~o Nuniz, Two sixteenth century
    chronicles, New Delhi, 1999.
  • Velceru Narayana Rao, David Shulman, Sanjay Subrahmanyam – A new imperial idiom in the 16th century: Krishnadevaraya and his political theory of Vijayanagara; in “South-Indian Horizons – Felicitation volume for Francois Gros”; Chevillard, Wilden (Eds), pp. 597-625; Pondicherry, 2004.
  • Hermann Kulke – “Maharajas, Mahants and Historians – Reflections on the historiography of early
    Vijayanagara and Sringeri” in “Vijayanagara city and empire”; A.L. Dallapiccola (ed), pp. 120-44; Stuttgart, 1985.
  • Phillip Wagoner – Harihara, Bukka and the Sultan: The Delhi sultanate in the political imagination of Vijayanagara” in “Beyond Turk and Hindu – Rethinking religious identities in Islamicate south Asia”, D. Gilmartin, B. Lawrence (eds), pp. 300-26;2000.
  • Phillip Wagoner – Sultan among Hindu kings: Dress, titles and the Islamicization of Hindu culture at Vijayanagara, JAS, V55N4, pp. 851-80, 1996.
  • Sanjay Subrahmanyam; The political economy of commerce : Southern India, 1500-1650; Cambridge University Press, 1990.
  • Burton Stein – The economic function of a medieval south Indian temple; JAS, V19, pp. 163-76; 1960.
  • Sanjay Subrahmanyam – An Eastern El-Dorado: The Tirumala-Tirupati Temple-Complex in Early European Views and Ambitions, 1540–1660, in Syllables of Sky: Studies in South Indian Civilization in Honour of Velcheru Narayana Rao, David Shulman (ed.), pp. 338–390, Delhi, 1995.
  • Velceru Narayana Rao, David Shulman, Sanjay Subrahmanyam: Textures of Time – Writing history in south India 1600-1800, Permanent Black publ., 2001.