చాటు విట్టలనాథ: శ్రీకృష్ణదేవరాయలు, ఆయన తదుపరి అచ్యుతదేవరాయలు పోషించిన మరొక కన్నడ కవి నిత్యాత్మశుక చాటు విట్ఠలనాథుడు. ఇతడు భాగవతాన్ని భామినీషట్పది ఛందస్సులో వ్రాసినాడు. ఇందులో కొంత భాగము మాత్రమే ఇప్పుడు లభ్యము. అందులోనుండి ఒక రెండు పద్యాలు. ఇవి శ్యమంతకమణి ఉపాఖ్యానములోనిది –
ఇత్త నాతను బళిక తన్నయ
పుత్రియను జాంబవతి యెంబళ
నత్యధిక గుణరూపసంపన్నెయను మణిసహిత
మత్తె బహువిధ వస్తుగళ నొలి-
దిత్తు పూజిసిదను పరాత్పర
వస్తువను వేదాంతవిశ్రుత కీర్తియను నలిదు
గుణము రూపము నందు మించిన
తనయ యగు జాంబవతి కన్నెను
అనఘు కొసగెను ఘనత కెక్కిన మానికముతోడ
మనము నిండగ బ్రీతి వస్తువు
లను త నెన్నియొ పూజ సేయుచు
దనర నిడె వేదాంతవిశ్రుతకీర్తి కలరారి
రత్నవరవను కొండు కన్యా
రత్నసహి తానందదలి గుణ-
రత్నమూరుతి పురకె బిజయంగైయ్యుతిరె
యత్నదలి పురవాసిజన నవ-
రత్నమయ తొడిగెగళ లెసెయలు
నూత్ననవ నెందిదిరుగొండరు వివిత విభవదలి
రత్నమును తా దాల్చి కన్యా
రత్న సహితుడు రమణతో గుణ
రత్నమూర్తియు రాణతో నగరమును జేరెనుగా
రత్నరాశుల ప్రజలు జల్లిరి
నూత్న దంపతు లిఱువురకు స-
ద్యత్నమున నాహ్వానమిచ్చిరి వైభవము మీఱ
తమిళ కవులు: రాయల రాజ్యములో నేటి తమిళనాడు, కేరళ ప్రాంతాలు భాగంగా ఉన్నా, ఆ ప్రాంతాలలోని కవులు ఎక్కువగా రాయల కొలువులో లేరు. హరిదాసర్ అనే ఒక తమిళ కవి రాయల ఆస్థానములో ఉన్నాడు, అతడు ఇరు సమయ విళక్కం (రెండు మతాల – వైష్ణవ, శైవ – వివరణ) అనే ఒక కావ్యాన్ని వ్రాసినాడు. రాయలను గురించిన పద్యమొకటి ఆ కావ్యమునుండి అందజేస్తున్నాను –
కిరిపోల్ విళంగి క్కిళరుం పుయక్కిట్ణరాయన్
తరైమీదు శింగాత్తిరియిల్ శెయత్తంబం నాట్ట
వరం ఆదరవాల్ అళిత్తే వడకూవం మేవుం
కరుమామణివణ్ణనై నీడు కరుత్తిల్ వైప్పోం
(గిరివలె శోభించి చెలరేగే ఉప్పెనలాటి కృష్ణరాయలు సింహాచలములో జయస్తంభాన్ని ప్రతిష్టించగా, దయతో వరములను ప్రసాదించి కాపాడే నీలమేఘశ్యాముని ధ్యానింతము.)
ముగింపు
రాజ్యభారము, యుద్ధాలు వీటితోబాటు ఈ మహారాజుకు కావ్యాలు వ్రాయడానికి, వీణ వాయించడానికి (ఇతనికి వీణ నేర్పిన గురుపరంపరకు చెందినవాడే మంత్రాలయ రాఘవేంద్రస్వామికి వీణ నేర్పిన గురువు) సమయం ఎలా దొరికిందో? రాయలు రాజ్యభారముల ఒత్తిడి లేక, ఒక కవిగా మాత్రమే ఉండి ఉంటే ఎన్నెన్ని గొప్ప రచనలను చేసి ఉండేవాడో అనే విషయం ఊహించవలసిందే. సంగీతములో, సాహిత్యములో, సంగ్రామములో సవ్యసాచియే ఈ సార్వభౌముడు. రాయలకు పృథ్వీవృత్తము (జ-స-జ-స-య-ల-గ, 8,9) అంటే ఇష్టమట. పృథ్వీశ్వరునికి పృథ్వి ప్రియమే గదా! క్రింది పృథ్వీవృత్తముతో ఈ వ్యాసాన్ని ముగిస్తాను.
కవిత్వ జగదీశ్వరా ఘన కవీంద్ర మిత్రాగ్రణీ
సువర్ణయుగ చేతనా సుమధురాంధ్ర వాగీశ్వరా
ప్రవృద్ధధరణీపతీ రమణ తుంగభద్రప్రియా
నవీనరవవాదనా నతుల కృష్ణదేవేశ్వరా
గ్రంథసూచి
- అరిదాసర్ – ఇరుశమయ విళక్కం, పాపులర్ ప్రెస్, చెన్నై.
- కనకదాస – మోహనతరంగిణి, కర్ణాటక కావ్యకలానిధి, మైసూరు, 1913.
- H. నంజే గౌడ – కన్నడ సాహిత్య చరిత్రె, చేతన పుస్తకాలయ, మైసూరు, 1995.
- వేటూరి ప్రభాకరశాస్త్రి – కృష్ణరాయలు – సకలకథాసారసంగ్రహము, భారతి, అక్టోబర్ 1939.
- ఆ. రంగస్వామి సరస్వతి – కృష్ణదేవరాయల యాస్థానిలోని కన్నడ కవులు, భారతి, జులై 1925.
- కృష్ణదేవరాయ – రామరాజు (సం.) జాంబవతీపరిణయము, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాదు, 1969.
- శ్రీకృష్ణదేవరాయలు – ఆముక్తమాల్యద, వావిళ్ళ రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్, చెన్నపురి, 1915.
- ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ – ఆంధ్ర కవయిత్రులు, శివాజీ ప్రెస్, సికందరాబాదు, 1980.
- వాదిరాజయతి – దశావతారస్తుతి.
- వల్లభాచార్య – శ్రీకృష్ణాష్టకం.
- వాదిరాజయతి – లక్ష్మీ శోభానె హాడు, శ్రీమన్మధ్వ సిద్ధాంత గ్రంథాలయ, ఉడుపి, 1949.
- వాదిరాజయతి – రుక్మిణీశవిజయః, శ్రీమనమధ్వ సిద్ధాంతోన్నాహినీ సభ, చిరుతానూరు, 1996.
- నిడదవోలు వేంకటరావు, పోణంగి శ్రీరామ అప్పారావు, సం., మానవల్లికవి – రచనలు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాదు, 1972.
- S. Krishnaswami Ayyangar – Sources of Vijayanagar History, University of Madras, Madras, 1919.
- B.N.K. Sharma – History of the Dvaita School of Vedanta and its Literature, Motilal Banarsidass, Bombay 1961.
- వల్లభాచార్య
- వ్యాసతీర్థ
- కృష్ణా నీ బేగనె బారో – చిత్ర
- కృష్ణా నీ బేగనె బారో – బాలసరస్వతి నాట్యము
- భాగ్యద లక్ష్మీ బారమ్మ – సుబ్బులక్ష్మి – కర్ణాటక పద్ధతి; హిందూస్తానీ పద్ధతి
(ఈ వ్యాసరచన కుపయోగపడిన కొన్ని ప్రచురణలను నా గమనికకు తెచ్చిన శ్రీ వాడపల్లి శేషతల్పశాయిగారికి నా కృతజ్ఞతలు.)
