అసమర్థుని జీవయాత్రేనా?

స్థూలంగా నవలానుక్రమం ఇదీ – సీతారామారావుది ఉన్న కుటుంబం. తన కుటుంబం గొప్పతనం గురించి వినీ వినీ సీతారామారావుకి పడిన నమ్మకం డబ్బు కన్నా పేరు ముఖ్యం అని. అందుకోసమే అడిగిన వారికీ అడగని వారికీ డబ్బు దానం చేశాడు. వాళ్ళ మామ ఇవ్వాల్సిన నలభై వేలకు బదులుగా పదివేలు చేసే పొలం తీసుకుని చెల్లు చేశాడు. త్వరలోనే డబ్బంతా హరించుకుపోయింది. పెళ్ళి కూడా అయింది. మామ ఇచ్చిన ఉద్యోగం నచ్చక వదిలేశాడు. ఏ పనికీ ఏ సార్థకతా, పరమార్థమూ కనపడక ఏ పని చేయకుండా ఉన్నాడు. రామయ్య తాత సలహాలు వినలేదు. మిత్రులతో ఏవో వితండవాదాలు చేస్తూ కాలం గడిపేడు. రాను రాను అసహనం కోపం చిరాకు ఎక్కువైనై. భార్య మీద చేయి చేసుకున్నాడు. గమ్యం లేకుండా నడుచుకుంటూ పోతూ ఏదో సభలో పిచ్చి కేకలేశాడు. అందర్నీ భయపెట్టాడు. అలా పోతూ పోతూ రామయ్య తాతను కలిశాడు. ఆతర్వాత శ్మశానంలో తనను తానే హింసించుకొని చచ్చిపోయాడు. ఇదీ కథ.

మొదట్నించీ చూసుకుంటూ వద్దాం. మొదటగా మనకు తెలిసిన సీతారామారావుకి వంశమూ, గౌరవమూ, సమాజాల స్పృహ ఉన్నది. అతను ఆలోచిస్తున్న తీరు, అతని మనోభావాలూ మనకేమి కొత్తగానో, విపరీతంగానో అనిపించవు. మొట్ట మొదటి అనుమానం మనకొచ్చేది సీతారామారావు ఉద్యోగం పోయిన పద్ధతిలో. పద్దుపుస్తకంలో ఒక బొమ్మ గీస్తాడు. ఆ బొమ్మ కూడానూ చిన్న పిల్లలు గీసినట్టే ఉంటుంది. మేనేజరు తిడతాడు. సీతారామారావు వెకిలిగా నవ్వుతూ చప్పట్లు కొడుతూ మా మామ, మా మామ, అని ఇకిలిస్తూ, మీసాలు.. పోలీసు మీసాలు అంటూ గెంతులు వేస్తాడు. ఈ సన్నివేశం అంతా ఒక్కసారి ఊహించుకోండి. వాడు గీసిన ఆ బొమ్మ చూడండి. ఇది నిజంగా ఒక అసమర్థుడు ప్రవర్తించే, ప్రవర్తించగలిగే తీరేనా? ఆలోచించండి. ఆ తర్వాత నా ఉద్యోగం మా మామ వల్లే పోయింది అని అంటుంటాడు కానీ అప్పటికి మామ మీదే కాక ప్రపంచం మీదే కోపం ఉంది అతనికి. మామ మీద ఒక అసమర్థుని కసి కంటే ఒక ఉన్మాదపు చాయ ఎక్కువగా కనిపిస్తుంది ఈ సన్నివేశంలో.

సీతారామారావుకి కుటుంబజీవితం రోతగా అనిపిస్తుంది. గర్భిణి స్త్రీల ప్రవర్తన అతనికి కంపరం కలిగిస్తుంది. ఆకర్షణీయంగా అలంకరించుకుని అందంగా ఉండే ఆడవాళ్ళంటే అతనికి మరీ కంపరం పుట్టేది. “ఏం చూసుకుని వీళ్ళకీ నిక్కు? మామూలు వాళ్ళలా వీళ్ళూ రోజూ కాలకృత్యాలు తీర్చుకునేవాళ్ళేగా” అనుకుంటాడు. ఊహించుకునే కొద్దీ, ఏడవడమూ, చీదుకోడము లాంటివి చేసే ఆడవాళ్ళు అందరినీ అసహ్యించుకుంటాడు.

శరీర ధర్మాలు ఉంటై. భౌతికమైంది కాబట్టీ పరిమితులు ఉంటై. పసికందుగా ఉన్నప్పుడు శౌచాశౌచాల స్పృహ ఉండదు. పెరిగే కొద్ది సిగ్గు, సమాజపు కట్టుబాట్లతో వాటిని బహిరంగంగా చేయరు. అప్పటికీ, ఇవి పిల్లలకు నవ్వు పుట్టిస్తాయి. యుక్తవయసు దాటి పెరిగే కొద్దీ, ఆ నవ్వులు మాయమైతై. శరీరపు పరిమితులనీ అవసరాలనీ అర్థం చేసుకుంటారు. వాటికీ, మనోభావాలకీ లంకె పెట్టుకోరు. జలుబు చేసిందనో, డయేరియా వచ్చిందనో విడాకులు తీసుకోరు. రోగి పరిస్థితి మీద జాలి పడతారు. పైగా ప్రేమతో రోగికి సపర్యలు చేస్తారు. మనందరమూ మన భాగస్వాములతో ఉండట్లేదా? ఏదైనా రోగం వస్తే చూసుకోటల్లేదా?

పెరిగే కొద్దీ ఈ రకమైన మార్పు రావడానికి మనం ఎవరమూ మేధావులమూ తత్వవేత్తలమూ కానక్కరలేదు. మానవ శరీరమూ, ఈ సృష్టిలో దాని ఉనికీ గురించి విశ్లేషణాత్మక చింతనలూ చర్చలూ చేయనవసరం లేదు. ఒక మామూలు మనిషిగా పెరిగితే చాలు. పెద్దయినాక కూడా ఈ కనీస జ్ఞానం, అది కూడా సహజంగా అబ్బేది రాకపోతే, లేకపోతే మనకు అనుమానం రాదూ ఆ మనిషి మీద? ఆ మెదడు చిన్నప్పుడే పెరగడం మానేసిందని, వెర్రి బాగులదనీ అనిపించదూ? సాహిత్యం మొత్తం లోనో, నిజమైన సమాజంలోనో గాలించి ఒక్క ఉదాహరణ చూపించగలరా నాకు – ఇది అసమర్థతకి ఒక లక్షణమని?

ఇదేదో చిన్న విషయమని కొట్టేయకండి. ఈ ఆలోచనలూ మాకు వస్తై అనేయకండి. ఇలాంటి ఆలోచనలు సీతారామారావొక్కడికే కాదు. మనలోనూ చాలామందికి వచ్చినై, వస్తుంటై కూడా. కానీ అవి మన జీవితం మీద ప్రభావాన్ని చూపవు. అంటే ఆ ఆలోచనలని మనం అమల్లో పెట్టం, కానీ నా చిన్నప్పటి లెక్కల క్లాసు కుర్రాడలా కాదు. సీతారామారావు అలా కాదు. ఇలాంటి చిన్న విషయాలలోనూ, సీతారామారావు చేసే చింతనలో అక్కడక్కడా ముక్కల్లోనే అతని ఉన్మాదపు సూచికలు కనిపిస్తై. అంటే మనల్నీ సీతారామారావుల్నీ విడదీస్తున్నది మనకున్న లౌకిక స్పృహ అన్నదిందుకే. అందుకే ఈ ఉదాహరణ ఇవ్వాల్సి వచ్చింది.

అంతేకాదు, సీతారామారావు తన భార్యతో ప్రవర్తించే తీరు గమనించండి. తనకే తెలీని అర్థంకాని తన ప్రవర్తనని, ఒక వావీ వరసా లేకుండా సాగే ఆ ఆలోచనలను చూడండి. వాటిలో మనకేరకమైన అర్థమూ, పారదర్శకతా కనిపించదు. సీతారామారావు మిత్రులని, వారి వాదనా పటిమను, వారి ఆలోచనల లోతునూ బట్టి చూస్తే వారికి పెద్ద తెలివి లేదనీ, ఉత్త చవటలనీ తెలిసిపోతుంది. భూమి గుండ్రంగా ఉండడం వల్లనే వాడి రచనలు తిరిగొస్తున్నాయని అనుకుంటుంటాడు వాళ్ళలో ఒకడు. సీతారామారావు ఆలోచనలన్నీ ఒకచోట మొదలై వెర్రి తలలు వేసి ఎటో పోతుంటై. సామ్యవాదం నుంచి, ఆధ్యాత్మిక వాదం లోంచి, ఇంకెటో వెళ్ళిపోతుంటై. అవి తను ఒక పూర్తి అవగాహనతో తర్క సహితంగా చేస్తున్నట్టుగా ఉండవు. కేవలం పదాలనూ, నిర్వచనాలనూ వేసి గిలక్కొట్టి ఒంపిన డబ్బాలా ఉంటుంది అతని ఆలోచనల ధోరణి. జీవచైతన్యమూ జడత్వమూ గురించి చర్చలో కారు, అంటే ఒక యంత్రాన్ని ఉదహరించడం, ఇలా. ఆ డబ్బా లాగానే, ఇతని మెదడుకి కూడా జ్ఞాన మీమాంసలో ఉండాల్సిన లౌకిక స్పృహ ఉండదు.

సీతారామారావుకు వచ్చే కలలు చూడండి. అతను గీసే బొమ్మలు చూడండి. అతను రాసే కవితలు చదవండి. అవి ఎలాంటివో సీతారామారావు వయసూ, పరిస్థితుల నేపథ్యంలో పరిశీలించండి. ఇంత చెప్పనవసరం లేకుండానే మీకే తెలిసిపోతుంది – సీతారామారావు కేవలం అసమర్థుడు కాదనీ, ఒక మానసిక రుగ్మత ఉన్నవాడనీ, నవల సాగేకొద్దీ అతనికి కావలసింది వైద్య చికిత్స అనీ, తత్వ బోధన కాదనీ. నవల చదువుతూ పోయే కొద్దీ సీతారామారావులో పెరిగిపోతున్న ఉన్మాద లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. నిజానికి అతని అసమర్థత (అంటే అతనిలో లౌకిక స్పృహతో ఉన్న భాగం) సీతారామారావు కూతురుని దండించినప్పుడూ, భార్యతో భోజనం దగ్గర తగాదా పెట్టుకున్నప్పుడూ, ఇలా అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నా, సీతారామారావు కేవలం అసమర్థుడు అనుకోడానికి కారణాలు దొరకవు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ మానసిక రుగ్మత అతని అసమర్థతకు పర్యవసానంగా కనిపించదు, అదీ వచ్చిన పెద్ద చిక్కు.

ఈ విషయం రచయితకి తెలుసనీ, అయినా ఆయనేమీ చెయలేకపోయినాడనీ ముందు అన్నాను. రచయిత ఎవరో కాదు, రామయ్య తాతే. ఎలా అంటారా? మరి పుస్తకంలో చెప్పబూనిన తన తాత్విక దృక్పథాన్ని రచయిత మనకెలా చెప్పగలిగాడు? ఒక పాత్రతో సుదీర్ఘ ఉపన్యాసం ఇప్పించడం ద్వారానే కదా. ఈ రకమైన ఉదాహరణలు – రచయితలు ఒక పాత్రలా జొరబడి మనకు ఒక సందేశాన్నివ్వడం – సాహిత్యంలో కోకొల్లలుగా కనిపిస్తాయి.

నవల ప్రారంభంలో రచయిత కొంచెం ఆలోచన చెప్పబోతాడు సీతారామారావుకి. పశ్చాత్తాప పడే పనులేమీ చేయ్యద్దని సలహా ఇస్తాడు. కానీ, సీతారామారావులో అప్పటికీ ఉన్మాదపు లక్షణాలు ప్రస్ఫుటంగా లేవు. అందువల్ల రామయ్య తాత వాటిని గుర్తించలేదు. క్రమేణా, సీతారామారావు పిచ్చి ముదిరి ఆ లక్షణాలని ప్రదర్శిస్తూ వెర్రి ప్రేలాపనలు చేస్తుంటే ఈ రామయ్య తాత కూడా, ఈ రచయిత కూడా వాణ్ణి నువ్వో పిచ్చివాడివి అని అనేస్తాడు. ఇది రచయితకు క్రమేణా ఏర్పడిన అవసరంతో వచ్చిన సందిగ్ధత. సీతారామారావుని తన అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటూ పోవడంలో వచ్చింది. ఇది గుర్తించలేక పోవడం వల్లనే రచయిత సీతారామారావుతో చేయించే ఆలోచనల్లో ఒక పద్ధతి లేని తనం కనిపిస్తుంది, పిచ్చి పిచ్చిగా సాగే ఆలోచనల్లో ఉన్నట్టుండి ఒక బరువైన ఆలోచన, ఒక లోతైన తాత్విక ఛాయ కనిపిస్తుంది. లోతైన తాత్విక స్రవంతిలో వెర్రి పోకడలు కనిపిస్తై. కానీ ఇలా కనిపించి మాయమయే స్వచ్ఛత వల్ల ఆలోచనా స్రవంతి మొత్తమూ అర్థవంతం కాదు, కాలేదు. అందువల్ల రచయిత ఉన్మాదాన్ని తన పని తాను చేసుకొని పోనిస్తాడు. అది సీతారామారావుని కబళించి వేస్తూ ఉంటుంది. సీతారామారావు చివరికీ ఆ పిచ్చి లోనే తనను తాను హింసించుకుని శ్మశానంలో హీనంగా చచ్చిపోతాడు, ఆ ఉన్మాదం వికటించి విస్ఫోటించి పూర్తిగా చెయిజారిపోయిన స్థితిలో.


మద్దిపాటి కృష్ణారావు నన్నీ నవల గురించి మాట్లాడమని అన్నప్పుడు ఆయన మాట కాదనలేక ఒప్పుకుని ఈ పనికి పూనుకున్నాను, నవల గురించి దగ్గిర స్నేహితులతోనూ చర్చించాను. మద్దిపాటి కృష్ణారావు నవల నేపథ్యం గురించి నాకు చెప్పారు. 1920-60 ప్రాంతాలలో, ప్రత్యేకించి కోస్తా జిల్లాల కమ్మ కులస్తుల్లో వచ్చిన – లోకజ్ఞానంతో సమన్వయం లేని ఆదర్శాలూ, కొత్తగా వచ్చిన భేషజాలు, బ్రాహ్మినైజేషన్ ఆఫ్ కమ్మా కేస్ట్ లాంటివి – మార్పులను సీతారామారావు తాత తండ్రుల ప్రవర్తన ఎలా పట్టుకోగలిగిందో కూడా చెప్పారు. ఈ మార్పులు నిజానికి నవల మొదట్లోనూ తర్వాత సీతారామారావుకి మేనమామ రాసిన ఉత్తరంలో మనకు కనిపిస్తాయి. కానీ అక్కడ కూడా, సీతారామారావు నాన్న అహంకారమూ, వ్యక్తిత్వపు విలనీ గురించిన చర్చే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ నవల ఉద్దేశం ఒక కులంలో జరిగిన సామాజిక మార్పులని నమోదు చేయడం కాదని అనిపిస్తుంది. ఈ సామాజిక నేపథ్యం నవల ముఖ్య ఉద్దేశానికి సమాంతరంగా నడుస్తుందే తప్ప దానితో మమేకం కాలేక పోయింది. అటు తాత్విక చింతనకీ, ఇటు సామాజిక సందేశానికీ చెందక రెంటికీ చెడినట్టనిపిస్తుంది. ఇదిగో ఈ ప్రమాదం వల్లనే రచయిత రామయ్య తాత రూపంలో ఒక పెద్ద ఉపన్యాసం చివర్లో ఇవ్వాల్సి వచ్చింది. నిజంగా ఇది అప్పటి సమాజంలో ఒక కులంలో వస్తున్న మార్పులను విశ్లేషించి ఎత్తిచూపే ఉద్దేశం ఉన్న నవలే అయివుంటే దానికింత తాత్వికత జోడింపు అవసరం లేదు. నిజానికి ఆ నవలా నేపథ్యానికీ, నవలలో ఉన్న తాత్వికతకీ పొసగలేదు. ఇదీ చిక్కు.

ఈ ప్రసంగం తయారు చేసుకుంటూ ఉండగా వచ్చిన అనుమానం ఇదే. ఒక అసమర్థుని జీవయాత్రను వివరించడానికి రచయిత తాత్విక చింతనా పద్ధతిని ఎంచుకోలేదని. తన తాత్విక చింతనను వివరించడానికి సీతారామారావుని తయారు చేసుకుని వాడుకున్నాడనీ అనిపించింది. అందువల్లనే, సీతారామారావు అసమర్థుడిగా మిగిలిపోక ఒక ఉన్మాదపు స్థితికి జార్చివేయబడ్డాడు. పైన చెప్పిన ఉద్యోగం పోయిన సన్నివేశం, సీతారామారావుకి స్త్రీల విషయంలో రోత, ఇవన్నీ కూడా ఎందుకు ఆపాదించబడ్డాయి? రామయ్య తాత చివర్లో ఉపదేశం ఇవ్వటానికి వీలుగా. అందువల్లనే సీతారామారావు జీవితం కేవలం అతని అసమర్థతకు పర్యవసానం కాదు అని నేను అంటున్నది. అలా కాకపోయి ఉంటే అతని పాత్రలో ఒకదానికికొకటి సంబంధం లేని అన్ని రకాల తాత్విక సంశయాలను గుప్పించే వెసులుబాటు రచయితకి దొరికేది కాదు. రచయితకీ తెలిసి తెలిసీ సీతారామారావుని ఒక పావుగా వాడుకున్నాడని ముందర ఆరోపించింది ఇందుకే.

అందుకేనేమో, షుమారు ఇరవై అయిదేళ్ళ తర్వాత ఈ నవల మళ్ళీ చదువుతూ చివరిలో రామయ్య తాత ఉపన్యాసం మొదలు పెట్టేటప్పటికి పుస్తకాన్ని ఇక చదవలేకపోయాను, ఎందుకంటే రామయ్య తాత మాటలు, రచయిత చెప్పుకుంటున్న మాటలు. అవి సీతారామారావుకి పనికొచ్చేవి కావు. నవలలో అప్పటిదాకా జరిగిన జీవితాలకీ సంబంధించినవీ కావు. మనకి అవసరమైనవీ కావు.