శ్రీశ్రీ ఛందఃశిల్పము
ఎదురు నడక
“ఉత్కృష్టమైన కళాకార్యాలు అన్నింటికీ ఒక symmetry అంటే సౌష్ఠవము ఉంటుంది. ఐతే సౌష్ఠవము వున్నవన్నీ ఉత్కృష్టరచనలు కావు” - శ్రీశ్రీ.
నా ఉద్దేశంలో శ్రీశ్రీ ప్రవేశ పెట్టిన ఛందస్సులోని ఉత్కృష్టమైన మార్పు (పాత తెలుగు ఛందస్సుకు వ్యతిరేకంగా ఒక విప్లవాత్మకమైన మార్పు) ఎదురు నడక. తెలుగులో, కన్నడములో దేశి ఛందస్సులో పద్య పాదం లఘువు (I) గురువు (U) కలయికలతో ఎప్పుడూ ఆరంభమవదు. దీనికి కారణము దేశిఛందస్సుకు కావలసిన సూర్య, ఇంద్ర, చంద్ర గణాలు (కన్నడములో బ్రహ్మ, విష్ణు, రుద్ర గణాలు) రెండు మాత్రలైన U, II నుండి పుట్టినవి. అందువలన IU నడకకు ఈ భాషలలో అవకాశమే లేదు. కానీ తమిళములో ఇట్టి నడక నిషిద్ధము కాదు. తెలుగు సంగీత కృతులలో కూడా వీటికి ఎక్కువ ప్రాముఖ్యత లేదు. త్యాగరాజ కీర్తనలలో కూడా ఇట్టివి వ్రేళ్ళపైన లెక్కించవచ్చు. లఘుగురువుల పదాలను మొదట ఉచ్చరించేటప్పుడు బహుశా లఘువును ఊది పలకడం సాధ్యపడదేమో?
ఏది ఏమైనా, జ-గణము, య-గణము, లగము పాదానికి ముందు దేశి ఛందస్సులో ఉండవు. దీనిని ఎదురు నడక అంటారు. సంస్కృత వృత్తాలలో దీనికి ఆక్షేపణ లేదు. పంచచామరము, భుజంగప్రయాతము, ఉపేంద్రవజ్ర, శంభునటనము వంటి వృత్తాలలో ఇవి కనిపిస్తాయి. శ్రీశ్రీ చతుర్మాత్రలలో జ-గణాన్ని ఉపయోగించడం మాత్రమే కాక వాటిని మొదట కూడా పెట్టాడు. ఇది శ్రీశ్రీ ఒక ప్రత్యేకమైన సాధన. అన్ని పాదాలు ఎదురు నడకతో ప్రారంభమయితే ఒక గమనము, ఉరుకు వస్తుంది. ఇలా వ్రాస్తే ఆద్యక్షరాలు తేలిపోతూ ద్వితీయాక్షరాల ఊనికచేత ఉచ్చారణ గౌరవం పొందుతూ గీతానికి ద్రుతగతిని ఆపాదిస్తాయని సంపత్ తన వ్యాసంలో అభిప్రాయపడ్డారు. శ్రీశ్రీ తానే ‘జగణంతో జగడం కోరగా దగదు గానీ’ అని చమత్కరించాడు. ఎదురు నడక గీతాలకు ఎన్నో ఉదాహరణలు (స్విన్బర్న్ కవికి) ఉన్నాయి.
విషం క్రక్కే భుజంగాలో
కదం త్రొక్కే తురంగాలో
మదం పట్టిన మాతంగాలో
కవీ నీ పాటల్
కొన్ని చమత్కారాలు
కుమ్మరి మొల్ల చిత్రంలో అష్టావధానాలలోని దత్తపదిలా ఒక పద్యం కూడా శ్రీశ్రీ వ్రాశాడు. ఇందులోని పదాలు అప్పు, నిప్పు, మెప్పు, చెప్పు, కాని ఈ పదాలకు ఈ అర్థాలు ఉండవు ఈ పద్యంలో. ఆ పద్యం -
అప్పుడు మిథిలకు జని నే
నిప్పుడు కావించు వింత నిచ్చటి ప్రజ తా
మెప్పుడును కాంచబోరని
చెప్పుచు రాఘవుడు విడిచె శివకార్ముకమున్
ప్రాసాక్షరములో అచ్చును ఉపయోగించి కూడా ఒక పద్యాన్ని శ్రీశ్రీ వ్రాశాడు-
ఓ అంతా కవులే, అ
ఆ ఇయ్యీలయిన రాని యంబ్రహ్మలె, మే-
మూ ఋషులం అంటూ
ఛీ ఎంతటి సిగ్గు చేటు సిరిసిరిమువ్వా
స్వరయతులను వర్ణిస్తూ రేచన కవిజనాశ్రయములోని మరొక పద్యము మాత్రమే ఇట్టి ప్రాసకు నాకు తెలిసిన ఉదాహరణ. అంతేకాదు, శ్రీశ్రీ ఒక కంద పద్యములో ర అక్షరానికి ఠ అక్షరానికి రూపసామ్యం ఉండడంబట్టి యతి చెల్లించాడు!
వచన గేయాలు
అనంతుని ఛందములో గద్య లక్షణము ఈ విధముగా చెప్పబడినది-
కనుఁగొనఁ బదరహితమై
పనుపది హరిగద్దెవోలె బహుముఖరచనం-
బున మెఱయు గద్య మది దాఁ
దెనుఁగుకృతుల వచన మనఁగ దీపించుఁ గడున్
అట్టి వచనములలో చూర్ణగంధి లక్షణాలు ఇలాగుంటాయి-
ఛందోగణముల నియతిం
బొందక తాళప్రమాణమునఁ గడుఁ జెలువై
కొందఱిచేఁ దచ్చూర్ణం
బందముగాఁ దాళగంధి యనఁ బొగడొందున్
అంటే పొడిపొడి మాటలతో అందముగా తాళబద్ధముగా వ్రాయబడే వచనములు ఇవి. తాళ్లపాక పెదతిరుమలాచార్యుడు (అన్నమయ్య మనుమడు) ఈ గతిలో శ్రీవేంకటేశ్వర వచనములను వ్రాసినాడు. అదే విధంగా మారుతుండే లయలతో, గతులతో, గమనములతో పాడుకోటానికి వీలుగా వచన గేయాలను శ్రీశ్రీ సృష్టించాడు. ఇట్టి వచనాలలో గణపవరపు వేంకటకవి తన ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములో పద్యాలను కూడా చొప్పించినాడు. ఇట్టి వచనములలో కొన్ని చోట్ల ఒక పద్యపు పోలిక మరి కొన్ని చోట్లలో వేరొక పద్యపు నడక మనకు కనబడవచ్చు. ఇవి ఆంగ్లములోని vers libreను, సంగీతములోని medleyను పోలినవి. ఇందులో నిశ్వాస విరామస్థానానికి ప్రాధాన్యత ఎక్కువ. ఒక విధముగా ఇది సంస్కృతములోని పాదాంతయతి లాటిది. ఆద్యక్షర ప్రాసలు, ద్వితీయాక్షర ప్రాసలు, అంత్యప్రాసలు ఇట్టి గేయాలకు ఆభరణాలు. శ్రీశ్రీ ఈ ప్రయోగాన్ని విద్యున్మాలికలతో ఆరంభిస్తాడు. ‘దెబ్బ తిన్న లేళ్ళ కళ్లు’ లోని క్రింది పంక్తులను ఒక ఉదాహరణగా భావించవచ్చును.
కావవి, వేటకాని కోలలకు కూలి వేదనల తూలు హరిణాల కండ్లు, జాలికి పురిటిండ్లు దిక్కుదిక్కుల కంపిన దీనంపు చూడ్కులే ఆనాటి ప్రళయతాండవ భయంకర సౌదామినులు
ఈ వచనగీతాలకు పతాకము ‘కవితా, ఓ కవితా’ వచన గేయము. ఇందులో ఎన్నో ఛందస్సుల ఛాయలున్నాయి, అనుప్రాసల మాయలున్నాయి, ప్రాసలు రాసుకొని క్రీడిస్తున్నాయి, పదజాలాలు తీయగున్నాయి, అలంకారాలు అందెలవలె మ్రోగుతున్నాయి, భావాలు సమాసాలలో కౌగిలించుకొంటున్నాయి, పలు భంగుల రంగులు సింగారించుకొంటున్నాయి. వచనగేయాలలో కూడా గణాలు ఉన్నాయి. కాని ఈ గణాలలో ఒక నిర్దిష్ట క్రమము (అన్నీ పంచమాత్రలు లేక మూడు, నాలుగు మాత్రల మిశ్రగతులు, ఇలాటివి) ఉండదు, ఒక నిర్దిష్ట సంఖ్య ఉండదు (ప్రతి పాదములో నాలుగు గణాల లాటివి). అక్షరగణాలతో, మాత్రాగణాలతో నడిచే పద్యాలు మానవులు నిర్మించిన కాలువలవంటివి ఐతే, వచన గేయాలు నిసర్గములో ఒక చోట తక్కువ వెడల్పుతో మరొక చోట ఎక్కువ వెడల్పుతో ప్రవహించే చిన్న సెలయేరులాటిది. దేని అందము దానిది. ఇట్టి గణాలతో పద్యాలను కూడా వ్రాయవచ్చునని నేను ఈ మధ్య వివరించాను. ఈ శైలి ఖడ్గసృష్టిలో ఎక్కువగా కనిపిస్తుంది. వీటిని వచనగేయాలు అనేకన్నా వచనములని చెప్పవచ్చును.
ముగింపు
ఛందస్సును గురించి శ్రీశ్రీ ఇలా అంటాడు - “కవికి కావాల్సింది కవిత్వ స్వరూపం కాదు; స్వభావం. ఛందస్సేదైనా సామాజిక స్పృహ ముఖ్యం. మాత్రాఛందస్సులోనే మళ్లీ రామాయణం రాస్తే అది ఆధునిక కవిత్వం అనిపించుకోదు. ఎంత ప్రతిభావంతుడికైనా ఎంతోకొంత వ్యుత్పత్తి కూడా వుంటుంది. ప్రతిభ కూడా నూటికి పది శాతం inspiration, తతిమ్మాదంతా perspiration అన్నదాంట్లో చాలా నిజం వుంది. నా అనుభవం కూడా ఇదే. ఇక ఆదేశం అంటారా అది ఎవరికివారు తేల్చుకోవల్సిందే”. సైన్సులాగే కవిత్వానికి కూడా ప్రయోగాలు లేనిదే అభివృద్ధి లేదు. నాడు పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు ఎంత ధీమాతో ‘వాణి నా రాణి’ అని చెప్పాడో అంతే ధీమాతో శ్రీశ్రీ ‘ఒక విధంగా చూస్తే నేను వాడిన ఛందస్సులన్నీ శ్రీశ్రీయాలే’ అన్నాడు. మాత్రాఛందోప్రయోగాల్లో శ్రీశ్రీ “ఈ శతాబ్దానికి పర్యాయపదం, కవితాసృష్టికి పరిశోధన కేంద్రం”.
ఉపయుక్త గ్రంథసూచి
- అనంతుని ఛందము, అనంతామాత్యుడు. వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మదరాసు, 1921.
- ఆధునిక కవిత - అభిప్రాయ వేదిక, సం. తిరుమల, సేకరణ మద్దాళి రఘురాం. కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు, 1981.
- ఆధునికాంధ్ర కవిత్వము, సి. నారాయణ రెడ్డి. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు, 1967.
- ఖడ్గ సృష్టి, శ్రీశ్రీ,
- నవగీతి - ఆధునిక కవితలకు ఛందస్సు నమూనాయేమో?, జెజ్జాల కృష్ణ మోహన రావు, 2009.
- పాడవోయి భారతీయుడా - సినిమా పాటలు, శ్రీశ్రీ. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు, 1983.
- భారతీయ సాహిత్య నిర్మాతలు - మహాకవి శ్రీశ్రీ, బూదరాజు రాధాకృష్ణ. సాహిత్యా అకాడెమీ, న్యూ ఢిల్లీ, 1999.
- మాత్రిక ఛందోం కా వికాస్, శివనందన ప్రసాద్, బిహార్ రాష్ట్రభాషా పరిషద్, పట్నా, 2000.
- రగడలు, జెజ్జాల కృష్ణ మోహన రావు.
- శ్రీశ్రీ కవితావైభవం, మిరియాల రామకృష్ణ. యువభారతి, సికిందరాబాదు, 1981.
- శ్రీశ్రీ కవిత్వం, మిరియాల రామకృష్ణ (This is the long doctoral thesis of Ramakrishna. After obtaining his PhD, Ramakrishna sent a telegram to SrISrI and SrISrI quipped back famously - Congratulations, yours patiently!)
- “శ్రీశ్రీ కవిత్వంపై మరొక వ్యాసం, శంఖవరం రాఘవాచార్యులు. ఈ మాట, మే 2007.
- శ్రీశ్రీ వచన విన్యాసం, రాపోలు సుదర్శన్. అనన్య ప్రచురణలు, హైదరాబాదు, 1997.
- శ్రీ వేంకటేశ్వర వచనములు, తాళ్లపాక పెద తిరుమలాచార్య, పరిష్కర్త వేటూరి ప్రభాకర శాస్త్రి, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రెస్, తిరుపతి, 1945.
- సులక్షణ సారము, లింగమగుంట తిమ్మకవి.
(ఈ వ్యాసములోని కొన్ని భాగాలు శ్రీశ్రీ, కొకు, గోపీచంద్ శత జయంత్యుత్సవాల సందర్భంగా సెప్టెంబరు 26-27, 2009న డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ ఆధ్వర్యాన జరిగిన సభలో చదువబడినవి.)
Rohiniprasad అభిప్రాయం:
January 1, 2010 6:49 pm
ఛందస్సులమీద ఒక doctorate వంటిది సంపాదించగలిగిన మోహనరావుగారే ఇంత మంచి వ్యాసం రాయగలరు. శ్రీశ్రీ సాహిత్యపు విలువలలో మాత్రాఛందస్సు అందాలు పెద్దపీట పొందలేకపోవచ్చుగాని, readability, or rather, ‘recitability’ విషయంలో ఈ అంశం బాగా పనిచేస్తుంది.
ఎవడి గోల వాడిది అన్న పద్ధతిలో గేయాలను పాడించటానికి ట్యూన్లు తయారు చేస్తున్నప్పుడు నేను గమనించినదేమిటంటే ఆధునిక తెలుగు కవుల్లో మాత్రాఛందస్సును ఖచ్చితంగా పాటించినవారిలో కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి, సినారె ముఖ్యులు.
సినీగీతాల్లో పాతరోజుల్లో కూడా ముందు ట్యూన్ చేసి, తరవాత పాటలు రాయించే అలవాటుండేది. ముఖ్యంగా సి.ఆర్.సుబ్బరామన్ ఇదే చేసినట్టు కనబడుతుంది. దురదృష్టం కొద్దీ ఆ పాటలన్నీ సముద్రాల సీనియర్ ‘కిట్టించినవే’. అవి నా లెక్కన చెత్త రచనలు. ఏ శ్రీశ్రీకో ఇస్తే చక్కగా రాసి ఉండేవాడు. (జోరుగా హుషారుగా పాటలో ఒక గురువు వెంట ఒక లఘువు వచ్చేటట్టు ఎంత బాగా రాశాడో). అలాగే దీర్ఘాలు అనే శీర్షికతో ఇలా రాశాడు;
“నా నీవూ, నీ నేనూ, ఆనాడూ, ఈనాడూ, ఆడాలే పాడాలే నాదానా ఓచానా”
తాళం తమాషాగా నడిచే పాటల్లో మహేశా పాపవినాశా ఎత్తుగడ ఒకటి. అనార్కలీలో కలిసె నెలరాజు అనేది మరొకటి. మరాఠీ భక్తిపాటలు (అభంగ్) అచ్చగా తాళానికే రాసినట్టుంటాయి.
నా లెక్కన ట్యూన్లకు పాటలు రాయడంలో తమిళంవంటి భాషల్లో చాలా కష్టం. ఎందుకంటే వారి పదాలన్నీ polysyllabic గా పెద్దవిగా ఉంటాయి. తెలుగు చాలా నయం. ఒకటి, రెండు అక్షరాలు పుష్కలంగా ఉన్న హిందీ అన్నిటికన్నా సులభం. బొంబాయిలో Hindi-to-Telugu టీవీ డబ్బింగ్ సీరియల్ తెలుగు వర్షన్లకు నేను చాలా పాటలు రాశాను. ఒకేసారి దానితోబాటు తమిళ, మలయాళ వర్షన్లు కూడా రికార్డింగ్ చేసేవారు. అప్పుడు ఈ వ్యత్యాసాలను గమనించేందుకు నాకు అవకాశాలు లభిస్తూ ఉండేవి.
పై భాషల గురించి మోహనరావుగారు ఏమంటారో?
mOhana అభిప్రాయం:
January 2, 2010 10:49 am
శ్రీశ్రీ మాత్రమే కాదు, ఎందరో ఉత్తమ శ్రేణి కవులు తెలుగు సినిమాలకు పాటలు రాశారు. వారు అమలులోనికి తెచ్చిన ఒక కొత్త పాత ప్రయోగం అంత్యప్రాస. ఉత్తర భాషలలో పద్యాలలో, పాటలలో (హిందీ వగైరాలు) అంత్య ప్రాస (తుక్) అవసరము. కానీ ప్రాచీన తెలుగు కవులు (పోతన మినహాయించి) రగడలలో తప్ప దీనిని ఎక్కువగా వాడలేదు. పాటలలో, ప్రత్యేకముగా సినిమా పాటలలో ఛందస్సు ఎక్కడ అనే వాళ్ళు ఈ విషయాన్ని గుర్తులో ఉంచుకోవాలి. శ్రీశ్రీయే సినిమా పాటలను గురించి “పాడవోయి భారతీయుడా” అనే పుస్తకంలో ఇలాగంటారు -
“సినిమాకు పాటలు రాయటం చాలామంది అజ్ఞానులనుకునేటంత సులభం కాదు. ఇక డబ్బింగుకు రాయడమనేది మరీ కష్టంతో కూడుకొన్న పని. ఆ రోజుల్లో అన్నపూర్ణా పిక్చర్స్ వారు ద్విభాషా చిత్రాలు తీసేవారు. తెలుగుకి నేనూ, అరవానికి ఉడుమలై నారాయణకవి పాటలు రాస్తుండే వాళ్లం. ఉడుమలై కవీ నేనూ పాటల రచనకి కలిసే కూర్చుండేవాళ్ళం. “ఆకాశవీధిలో అందాల జాబిలి” అని నేను రాస్తే “ఆగాయ వీదియిల్ అళగాన వెణ్ణిలా” అని అతడు రాశాడు. అలాగే “అగాధమౌ జలనిధిలోన ఆణి ముత్యమున్నటులే…” అన్న అయిడియా నారాయణ కవిది. యతిప్రాసల పట్టింపు అతని కెంతో ఎక్కువ. “ఇలక్కణం” (వ్యాకరణం) అనేవాడు, లక్షణ భంగం అనేది అతనికి సుతరాము కిట్టేది కాదు.”
తమిళ సినిమాలో కణ్ణదాసన్ రాసిన ఎన్నో పాటలకు స్వరబద్ధత పాట రాసిన తరువాతే జరిగింది. అలాగని విశ్వనాథన్ చెప్పారు. తమిళ ఛందస్సులో పద్యాలలో, పాటలలో సామాన్యముగా (ఏవో కొన్ని మినహాయింపులు తప్ప) పదాలు గణాలకు బాగా విరుగుతాయి. అరుణగిరినాథర్ వంటి కవులు తాళవృత్తాలను చాలా లయబద్ధముగా వాడారు. లయనే ఛందస్సు పేరుగా వ్యవహరిస్తారు. ఉదాహరణగా తోటకవృత్తమును (స-స-స-స) బోలిన పద్యపు ఛందస్సును తననా తననా తననా తననా ఛందము అంటారు. ఇందులోని చివరి గురువును లఘువు చేస్తే అది తననా తననా తననా తనతన ఛందము అవుతుంది. ఇది హిందూస్తాని సంగీతములోని బందిష్ లాటిది. ఇట్టి కొత్త లయలను తెలుగులో ప్రవేశ పెట్టాలని నా ఆశ.
విధేయుడు - మోహన
jagannadham alapati అభిప్రాయం:
January 10, 2010 12:18 pm
భాష పైన, ప్రత్యేకించి గణ, మాత్రా ఛందస్సులపై యింతటి సాధికారత గల్గిన మోహనరావు గారు, చాలా కాలంగా నాకున్న ఒక అభిప్రాయం సరియైనదో, కాదో తెలియజేస్తారని ఇది రాస్తున్నాను.
“క్ష” అనే అక్షరమూ, “క” కి “ష” వత్తు ఇవ్వడమూ, ఉచ్చారణలోనూ, ఇంచుమించు రూపంలోనూ ఒకే రకంగా ఉన్నప్పుడు ప్రత్యేకించి “క్ష” అనే అక్షరం యొక్క ఆవస్యకత ఏమైయుండునో తెలుపగలరు.
జగన్నాథం ఆలపాటి
mOhana అభిప్రాయం:
January 10, 2010 2:02 pm
జగన్నాధంగారూ, ప్ర, త్ర్య లాటి అక్షరాలవలెనే క్ష అక్షరం కూడా ఒక సంయుక్తాక్షరమే. నిఘంటువులలో క్ష-కారముతో ఆరంభమయ్యే పదాలు క అక్షరం కిందే ఉంటాయి. ప్ర అక్షరంతో ప్రారంభమయ్యే పదాలు క్ష అక్షరంతో ఆరంభమయ్యే పదాలకంటే ఎక్కువే. కాని దీనికి కొందరు ఒక ప్రత్యేక స్థానాన్ని ఇవ్వడానికి కారణం బహుశా క్ష అక్షరం పలికేటప్పుడు, క కు ష ఒత్తు ఇచ్చి పలికేటప్పుడు ఉచ్చరణలో కొద్దిగా భేదం ఉండడంవల్లనేమో? లేకపోతే మతపరంగా (చక్రాలు ఇత్యాదులు) మరేమైనా కారణం ఉందేమో? యూనికోడ్లో ఈ అక్షరానికి ఒక ప్రత్యేక స్థానం లేదు అనే అనుకొంటా. విధేయుడు - మోహన
jagannadham alapati అభిప్రాయం:
January 11, 2010 4:20 pm
కృతఙ్ఞతలు మోహనగారూ. “క్ష” ని సంయుక్తాక్షరముగా ఏ తెలుగు పండితుడుగాని, తెలుగులో పీ.హెచ్.డీ చేసినవారుగాని ఏకీభవించని నావాదనని మీరు సమర్థించారు. మరొకసారి ధన్యవాదాలు.
ఇదే రకంగా హిందీలో కూడ “క్ష”,”త్ర” లు కూడ సంయుక్తాక్షరాలైనప్పటికీ, ప్రత్యేకాక్షరాలున్నాయి. వీటికికూద మీరన్నట్లుగా ప్రత్యేక కారణాలు ఉండివుండవచ్చు.
విధేయుడు, జగన్నాథం.
rsk అభిప్రాయం:
January 14, 2010 7:48 am
‘క్ష’ రాసేటప్పుడు ‘ష’ వత్తు, ‘ష’ తో కూడుకున్న ఇతర సంయుక్తాక్షరాలలో ‘ష’ వత్తు కంటే భిన్నంగా ఉంటుంది. అక్షరమాలలో ‘క్ష’ ను ప్రత్యేకించి చేర్చడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చును.
భవదీయుడు,
కారాశం
Vadapalli SeshaTalpaSayee అభిప్రాయం:
January 16, 2010 6:55 am
పై చర్చకు సంబంధించి కొన్ని వ్యాసములు -
1936 ఏప్రెలు (ధాత చైత్ర) “భారతి”లో కల్లూరి వేంకటసుబ్రహ్మణ్య దీక్షితులుగారి వ్యాసము- వర్ణసమామ్నాయమున ‘క్ష’కారము
1940 అక్టోబరు (విక్రమ ఆశ్వయుజ) “భారతి”లో చెరుకూరి వేంకటజోగారావుగారి వ్యాసము - జ్ఞకార విమర్శనము గిడుగు వేంకటసీతాపతిగారి వ్యాసము - జ్ఞకారము (ఈసంచిక దొరకలేదు).
నమస్సులతో,
వాడపల్లి శేషతల్పశాయి.
mOhana అభిప్రాయం:
January 18, 2010 9:33 pm
శాయి గారూ, భారతి వ్యాసాన్ని అందించినందులకు వందనా లండీ. నాకు తెలిసి ష-కారపు ఒత్తు క-కారముతో, ర-కారముతో మాత్రమే వస్తుంది. ల-కారముతో, ష-కారపు ఒత్తుతో ఏమైనా పదాలున్నాయా? లేదనే అనుకొంటాను. ర్ష
సంయుక్తాక్షరము ముందున్న పదాలు ఏవీ లేవు. ష-కారపు ఒత్తుతో ప్రారంభమయ్యే పదాలు క-అక్షరముతో మాత్రమే. అందువల్ల దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నదేమో? ఇలా మరేదైనా సంయుక్తాక్షరం తెలుగులో ఉందా?
విధేయుడు - మోహన
rama bharadwaj అభిప్రాయం:
January 19, 2010 1:11 pm
మోహన గారి అభిప్రాయం అంతగా స్పస్టపడలేదు నాకు. ఆయన పదాలతో ఉదాహరిస్తూ మరింత వివరించి ఉండిఉంటే బాగుండేది.
“త్ర్యంబక” లాంటి పదాల్లోని ” త్ర్య” అన్నది కూడా సయుంక్తాక్షరం తో మొదలౌతున్న ఒక అరుదైన పదం. ఇందులో రెండు కాదు మూడు అక్షరాలు కలిసి ఒక అక్షరం కాగా పదాదిన ఈ సంయుక్తాక్షరం రావడం విశేషం.
రమ.