ప్రథమ వక్త ఏపూరి భక్తవత్సల “త్రిపురనేని గోపీచంద్- తాత్త్విక దృష్టి” అనే విషయంపై మాట్లాడారు. తండ్రిలా నాస్తికత్వముతో ప్రారంభించినా, తరువాత స్వాధ్యయనము వల్ల గోపీచందు తన భావాలను మార్చుకొన్నారు. వారి రచనలలో వివిధ తత్త్వవేత్తలను గురించిన సమాచారాలున్నాయి, ఉదాహరణకు మెరుపుల మరకలులో జాన్పాల్ సార్త్ర్, పరమేశ్వరుని వీలునామాలో వైట్హెడ్, పోస్టు చెయ్యని ఉత్తరములో రస్సెల్, అరవిందులను గురించి, చీకటి గదులలో మార్క్సిస్టులను గురించిన విషయాలు ఉన్నాయి. వీరు పెరిగింది జస్టిస్ పార్టీ వాతావరణంలో. బ్రాహ్మణ వ్యతిరేక పార్టీ ఇది, బ్రిటిష్వారికి అనుకూలమైన ఈ పార్టీకి ఆంధ్రలో రామస్వామి చౌదరి ఒక ముఖ్య నాయకుడు. గోపిచందు మొదటి వ్యాసం తన నాన్నగారు రాసిన ‘శంభుకవధ’ను గురించినది. దీని పేరు కూడా శంభుకవధయే. పెరిగేటప్పుడు అతనిపైన కూడా మార్క్సిస్టుల ప్రభావం పడింది. ఈ పరిణామాలను వీరి ఆత్మకథను పోలిన చీకటిగదులు అనే నవలలో మనము చదువుతాము. అందుకే దోనేపూడి రాజారావు మార్క్సు, M. N. Roy, John Dewyలను చదివిన గోపీచందు భావవాదాన్ని, భౌతికవాదాన్ని సమన్వయ పరచారని చెప్పారు (ఉదా. పోస్టు చెయ్యని ఉత్తరాలు). గోపీచందు అన్ని రచనలలో మూలతత్త్వ అన్వేషణ జరుగుతుందని, గోపీచంద్ భావకవిత్వాన్ని నిష్క్రియాకవిత్వముగా తలచారని కూడా మంజులత అన్నారు.
శ్రీమతి కొత్త ఝాన్సీలక్ష్మి “పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా ప్రత్యేకత-తాత్త్వికత” అనే విషయంపైన మాట్లాడారు. గోపీచందు నిరంతరాన్వేషి, నిశిత పరిశీలకులు అన్నారు. సాహిత్య అకాడెమీ బహుమతి పొందిన నవల ఇది. సుజాత పరమేశ్వరుని పెంపుడు కూతురు. ఉన్నత భావాలు కలిగిన ఒక రచయితయైన కేశవమూర్తిని ప్రేమించి పెళ్ళి చేసికొని పెంపుడు తండ్రికి దూరమవుతుంది. భర్తపై అనుమానంతో బెంగళూరు వెళ్ళడం, శ్రీమంతం బుకాయి మాటలను నమ్మడం, మోసపోయానని విచారించడం సుజాత కథ. కేశవమూర్తి ఇంటికి వచ్చి చూస్తే భార్య ఇంటిలో లేకపోవడం, తన రచనలంటే అభిమానం ఉన్న సుభాషిణి తన బంధువైన శ్రీమంతం రాసిన ఆకాశరామన్న ఉత్తరం చూడడం, కేశవమూర్తి బెంగళూరు వెళ్ళడం, సుజాత పశ్చాత్తాపముతో మూర్తిని క్షమాపణ అడగడం ఇలా కథ సాగుతుంది. పరమేశ్వరశాస్త్రి ఛాందసుడు, గ్రాంథిక భాషాభిమాని. సుజాత అబ్రాహ్మణుడైన కేశవమూర్తిని పెళ్ళాడడం ఇతనికి ఇష్టముండదు. శాస్త్రికి జబ్బు చేసినప్పుడు కేశవమూర్తి అంటే గిట్టనివారు సంస్కృత పాఠశాలకు తన ఆస్తిపాస్తులు సంక్రమించేటట్లు శాస్త్రిచే వీలునామా వ్రాయిస్తారు. శాస్త్రి శుశ్రూషలకై సుజాత తాతగారి పేరు పెట్టిన తన ఐదేళ్ళ కొడుకుతో శాస్త్రి ఇంటికి వస్తుంది. మూర్తి నిజాయితీని అర్థం చేసికొన్న శాస్త్రి పాత వీలునామాను చింపి కేశవమూర్తి పేర మరో వీలునామా రాసి కొన్నాళ్ళకు చనిపోతాడు. ఒకప్పుడు బలహీనమైన తరుణంలో శాస్త్రిగారు సుందరమ్మ అనే ఆవిడతో కలవడం, దాని ఫలితంగా పుట్టిన బిడ్డయే సుజాత అంటూ శాస్త్రి రాసిన మరో ఉత్తరాన్ని లాయరు చదివి వినిపించడంతో సుజాత జన్మవృత్తాంతం తేటతెల్లమవుతుంది. ఈ నవలలో ఆధ్యాత్మిక స్పృహ ప్రతిఫలిస్తుంది. మానసిక శక్తికి అతీతమై ఉండే శక్తి ఉందనే భావమే ఈ ఆధ్యాత్మిక స్పృహ అని కేశవమూర్తి ద్వారా రచయిత పలుకుతారు ఈ నవలలో. అరవిందుల ప్రసక్తి, ఆధ్యాత్మిక ఘట్టాలు కూడా ఉన్నాయి ఈ నవలలో అని ఝాన్సీలక్ష్మి అన్నారు.
తరువాత ఆరి సీతారామయ్య కూడా పరమేశ్వర శాస్త్రి వీలునామా పైననే మాట్లాడారు. తాను జీవపరిణామ శాస్త్రములో అధ్యాపకుడినని, ఆ విషయం నవలలో ఉంది కాబట్టి దానిని గురించి మాట్లాడారు. ఇందులోని పాత్రలు చాలా మంచివి లేక చాలా చెడ్డవి, సామాన్య పాత్రలు లేవు ఈ నవలలో అన్నారు. శాస్త్రజ్ఞానంలో లోపాలున్నాయి, అందువలన ఆధ్యాత్మికత అవసరం అంటారు గోపీచందు. కానీ ఆ లోపాలు ఏవో విడమర్చి చెప్పడంలో రచయిత సఫలీకృతుడవలేక పోయారు. ఆధ్యాత్మిక విషయాలపైన పుస్తకంలో చర్చ లేకుంటే నవలకు గొప్ప నష్టమేమీ లేదని పేర్కొన్నారు. వీరు చెప్పిన అతీత మానవుని గురించిన ఆధ్యాత్మిక లక్షణాలకు, డార్విన్ ఎవొల్యూషన్ థీరీకి భేదం ఎక్కువగా లేదు. కొన్ని శాస్త్రీయ విషయాలను సరిగా అర్థం చేసికోలేక పోయారు. గోపిచందు వేసిన కోతులన్నీ మానవు లయ్యాయా అనే ప్రశ్న శాస్త్రీయంగా సబబు కాదు, ఎందుకంటే ఒక కోతీ మానవుడు కాలేదు. తొందరపాటు వివరణలు ఇవ్వడం అంత మంచిది కాదని రోహిణీప్రసాద్ ప్రతిపాదించారు. రావూరి భరద్వాజ పరమేశ్వరశాస్త్రి వీలునామ ఒక సమర్థుని జీవన యాత్ర అని చెప్పినట్లు సాయిచంద్ అన్నారు.
పిదప వేములపల్లి రాఘవేంద్ర చౌదరి “చీకటి గదులు – ఒక సమీక్ష” అనే విషయంపై ప్రసంగం చేశారు. ఇది ఒక అసంపూర్ణ రచన. దీనిని గోపీచందు ఆత్మకథ అంటారు. యౌవనంతో ఆగిపోతుంది. రామస్వామి పేరు ఇందులో కృష్ణస్వామి, గోపీచందు పేరు గోపాలం, తల్లి చనిపోగా తండ్రి రెండో పెళ్ళి చేసికొంటాడు. సవతి తల్లి బాగా చూడదనుకొని, నాన్నమ్మ గోపాలాన్ని, గోపాలం చెల్లెలు కమలను పల్లెటూరికి తీసికొని వెళ్ళుతుంది. గోపాలం రాంబాబు స్నేహితులు. రాంబాబు మరొకడితో స్నేహం చేయడం గోపాలం సహించలేడు. రాంబాబుపై భరించలేని ప్రేమ ఉంటుంది గోపాలానికి. రాంబాబుకు తన స్నేహాన్ని నిరాకరించవద్దని ఉత్తరం రాస్తాడు గోపాలం. కాని రాంబాబు దానికి జవాబివ్వడు. ఒక రోజు రాంబాబు ఎవ్వరికీ చెప్పకుండా మాయమవుతాడు. ఇంకా శశికళ, గాంధీధామయ్య, హాస్టల్ జీవితం, ఒక గురుకులంలో దుర్గ అనే అమ్మాయిని చూడడం, ఇవి ఇందులో కొన్ని కథాంశాలు. సవతి తల్లి దమయంతి పాత్రను ఎంతో చక్కగా తీర్చి దిద్దారు గోపీచందు ఈ నవలలో. గాంధీవాదానికి మార్కిజానికి మధ్య ఉన్న వైరుద్ధ్యాన్ని కూడా చిత్రిస్తారు ఇందులో. జీవితంతో రాజీపడి అందరూ ఆనందంగా జీవించాలి అనే భావాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ నవలలో కృత్రిమత లేదు. దీనిని సినిమా తీయాలనే ఉద్దేశము తనకుందని సాయిచంద్ ప్రకటించారు.
తరువాత వేలూరి వేంకటేశ్వరరావు “అనగనగా… గోపీచంద్ అనుభూతి కథలు” అనే విషయంపై రాసిన పత్రాన్ని వారు లేకపోయినందువలన వారికి బదులు ఆవుల మంజులత చదివారు. పాశ్చాత్య లాక్షణిక పరిధిని అధిగమించి కథలను రాసి, చదివి అలవాటు చేసికొనడం మంచిది. గోపిచందు సుమారు 300 కథలు మూడు దశాబ్దాల కాలంలో రాశారు. కానీ వీరి నవలలకు, నాటికలకు వచ్చిన ఖ్యాతి వీరి కథలకు ఎందుకు రాలేదో? ‘పతితులు’, ‘ధర్మవడ్డి’ పేర్లతో వీరి కథాసంకలనాలు లభిస్తాయి. గోపిచంద్గారు ఒక రేడియో ప్రసంగంలో కథలలో తాను ఆవేశానికి, భావాలకు ప్రాధాన్యత ఇస్తానని, శిల్పానికి కాదని చెప్పిన వాక్యాలను మళ్ళీ మనకు జ్ఞప్తి చేశారు. తనకు తెలిసిన మనుషులు, వారి జీవితాలు, తాను చదివిన పుస్తకాలు ఇత్యాదులు తన కథాపాత్రలని గోపిచంద్ చెప్పింది ఒక విధంగా తాను చెప్పిన recovered memories theoryని బలపరుస్తుంది అన్నారు వేలూరి. చలంచే ప్రభావితుడై కొన్ని కథలు గోపీచంద్ రాశారు. చిత్రం అనే కథను ఉదహరించారు. తన్ను కలుసుకోమని చెప్పిన ఒక అమ్మాయిని తక్షణమే కలుసుకోలేకపోయి తరువాత వెళ్ళినప్పుడు ఆమె అక్కడ ఊండదు. ఇది ఒక ట్రాజీకామెడీ. చలం ఛాయలు ఇందులో ఉన్నా అతని వ్యంగ్యం లేదు ఈ కథలో. ఓ.హెన్రీ ప్రభావం కూడా ఉంది ఈ రచయితలో. ఆస్కర్ వైల్డు కథకు అనుకరణ ఐన ముత్యాలు కథను చదివితే అందులో గోపిచంద్ అనుభూతులు, నిశిత పరిశీలన బాగా కనబడతాయి. సామాన్య పాఠకుని తరఫున వారి కథల విమర్శలు ఇంకా రాలేదు అని వేలూరి అభిప్రాయపడ్డారు.
తరువాతి ప్రసంగం “అసమర్థుని జీవయాత్రేనా?” ముందుగా మాచవరం మాధవ్ వీడియో ద్వారా మాట్లాడారు. అసమర్థుడు అంటే ఒక మనిషి మన లౌకిక పరిధిలో ఉండి, ఆ లౌకిక ప్రపంచములోని విలువలను అందుకోలేకపోయినవాడు. ఈ విలువలను తెలిసికోలేనివాడు అసమర్థుడు కాదు. ‘అసమర్థుని జీవయాత్ర’లో సీతారామారావు అసమర్థుడు కాదు. అసమర్థుడుగా ప్రారంభమైనా తరువాత ఒక ఉన్మాదిగా రచయిత చిత్రించారని అభియోగం చేశారు. సాహిత్యంలో రావిశాస్త్రి సుబ్బయ్య, తిలక్ కథలోని గంగాధరం నిజంగా అసమర్థులు. నిజమైన అసమర్థతలో ఉన్మాదిగా మారే లక్షణాలు ఉండవు. తన తాత్త్విక చింతనకై ఈ పాత్రను రచయిత ఒక పావుగా వాడుకొన్నట్లుంది. మాధవ్ మాచవరం అభిప్రాయాలకి విరుద్ధంగా మద్దిపాటి కృష్ణారావు తమ అభిప్రాయాలని వెలిబుచ్చారు. సీతారామారావు నిజంగా అసమర్థుడే, జీవితం వడ్డించిన విస్తరి ఐనప్పుడు ఆకలికి సరిగా తినలేనివాడు అసమర్థుడా, పిచ్చివాడా అన్నదే ప్రశ్న అని ఆయన అన్నారు. సీతారామారావును నిర్వచించడం కష్టం. మన వంశం పేరు నిలబెట్టు అని తండ్రి చెబుతాడు. దేవుడి పెళ్ళికి పీటలమీద కూర్చునే హక్కును తనదిగా చేసికోవడానికి 30వేల రూపాయల ఖర్చుకు కూడా వెనుకాడని వంశం వారిది. కుటుంబ ఆర్థిక స్థితి పడిపోయిన తరువాత ఆ స్థితిని పూర్తిగా అవగాహన చేసికోలేకపోయాడు సీతారామారావు. వాస్తవాలను ఎదురుకోలేని బలహీనత అతనిని అసమర్థునిగా చేసింది. ఆచారాలకు వాస్తవికతకు పొంతన కుదరని ఒక కారణం అసమర్థునిగా చేసింది. కొందరు ఈ నవలలోని పాత్రలు తమలాటివి అని అనుకోవడం ఈ నవల సార్వజనీనతకు తార్కాణం, నవలలో సాంకేతికపరంగా లోపాలున్నాయని చెప్పారు కృష్ణారావు.
అసమర్థత మానసికరోగానికి దారితీయగలదు, కాని ఆ అసమర్థత సీతారామారావు అసమర్థతవలె ఉంటుందా అన్నదే సందేహమని మానసిక శాస్త్రంలో నిపుణులైన జంపాల చౌదరి అన్నారు. అతని ఉన్మాదానికి అసమర్థత కారణం కాదు అని కూడా చెప్పారు. తన భూతకాలపు జీవితాన్ని సింబాలిక్గా నిర్మూలించాలనే గోపీచందు ప్రయత్నమని సుదర్శన్ అనే రచయిత తెలిపారని ఒకరు అంటే, నవల పేరును ఆచంట జానకిరాం పెట్టినట్లు కృష్ణారావు చెప్పారు. సృజనాత్మక రచయితలు ఒక శాస్త్రజ్ఞునివలె, మానసికశాస్త్ర నిపుణునివలె వ్యవహరించరు, వారు అంత సాంకేతికముగా ఉండరు అని మంజులత వివరించారు. మాధవ్ ఆ పుస్తకము పేరుతో విభేదించారా అని కూడా ఒకరు ప్రశ్నించారు.
ఐదవ సదస్సు: చర్చా వేదిక
చర్చావేదికకు సమన్వయకర్త గుళ్ళపల్లి రవి. ముఖ్య అతిథులు జంపాల చౌదరి, వెల్చేరు నారాయణరావు, మంగాపురం విష్ణుప్రియ, వెంకటయోగి నారాయణస్వామి. చర్చకు ఎన్నుకొన్నవిషయం “రచయితలు (కొకు, శ్రీశ్రీ, గోపీచంద్), సాహిత్యం, సమాజం – పరస్పర ప్రభావం.” చౌదరి శ్రీశ్రీ ప్రభావం సమాజంపైన ఉంది, కాని మిగిలినవారి ప్రభావం అంత స్పష్టంగా లేదని అన్నారు. వెల్చేరు సమాజం అంటే ఏమిటి, ప్రభావం అంటే ఏమిటి, సాహిత్యం ఎన్ని రకాలు అనే కొన్ని మౌలిక ప్రశ్నలను శ్రోతలముందు పెట్టారు. సామాన్యంగా సాహిత్యంగా చలామణి అయ్యేదాన్ని చాలా తక్కువమంది మాత్రమే చదువుతున్నారు.
దీనికి బహిర్గతంగా ఒక పెద్ద సాహిత్యం ఉన్నది. పందొమ్మిదవ శతాబ్దములో ఒక కొత్త మధ్య తరగతి పుట్టింది. వారు ఒక కొత్త సాహిత్యాన్ని పుట్టించారు, పోషించారు అని అన్నారు. సాహిత్యాన్ని సాహిత్యంగా చదవండి. వాస్తవం (reality) వేరు, వాస్తకవిత (realism) వేరు అని వివరించారు. నారాయణస్వామి దాశరథి రంగాచార్య కథ ఆధారంగా నిర్మించబడిన చిల్లర దేవుళ్ళు చిత్రంలో జీవితానుభవాన్ని చిత్రించే ‘ఏటికేతం కట్టి ఎయి పుట్లు పండించి’ పాటను పేర్కొన్నారు. శ్రీశ్రీ, కొకు, గోపీచంద్లాటి వారి సాహిత్యముతో బాటు ఇట్టి సాహిత్యాన్ని కూడా మనం మరువరాదు అని చెప్పారు. ఏ సాహిత్యం కానీ, అది నిజాయితీగా ప్రతిబింబించబడాలి. విష్ణుప్రియ సాహిత్యం ఎలా సమజాన్ని ప్రభావితం చేయగలదో అనే విషయానిపై తన కొన్ని అనుభవాలను పంచుకొన్నారు.
చర్చలో వెలువడిన కొన్ని విషయాలు-
- ఎన్నో రకాల సాహిత్యాలుంటాయి. కష్టజీవుల బాధలను ఎత్తి చూపి సమస్యలను బయటికి తెచ్చేవి మాత్రమే సాహిత్యం కాదు. సాహిత్యం ఎన్నో రకాలుగా ఉన్నా, అందులో కొన్ని మాత్రమే ఆలోచనలను రేకెత్తిస్తాయి.
- మార్క్సిస్టు సాహిత్యం అంటే పేదల పక్షాన సానుభూతిని చూపించే సాహిత్యం. సాహిత్యాన్ని ప్రజాచైతన్యానికి ఒక సాధనంగా విరివిగా ఉపయోగపరుస్తారు. తెలియని జీవిత పార్శ్వాన్ని చూపించి భావాలను ప్రేరేపించజేసేది ఉత్తమ సాహిత్యమే. ప్రజలకు కనీస హక్కులు, జీవితానికి హామీలు ప్రసాదించడానికి సాహిత్యాన్ని ఒక పరికరంగా ఉపయోగించుకోవాలి.
- కథల, నవలల ప్రభావాన్ని controlled experiments ద్వారా కొలవడానికి వీలవుతుందా?
- వ్యక్తికి ఆనందాన్నిచ్చే కవిత్వం కూడా కావాలి.
- గత అరవై సంవత్సరాలలో ఆంధ్రదేశంలో సాహిత్యంవల్ల వచ్చిన మార్పులు చాలా తక్కువ.
పుస్తకావిష్కరణలు, ముగింపు
గోపీచంద్ రచనాసర్వస్వం, వెల్చేరు నారాయణరావు కవితా విప్లవాల స్వరూపం ఈ సభలో ఆవిష్కరించబడ్డాయి. అలానే, బండ్ల హనుమయ్య, ఆవుల మంజులతలకు వారి విశిష్టసేవకు గాను డీటీఎల్సీ తరపున జ్ఞాపికలతో సన్మానం చేశారు. రెండు రోజుల సమావేశాలు సాహిత్యపరంగా చాలా ఆసక్తికరంగా జరిగాయి. దీనిని డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్బు ఎంతో కష్టపడి విజయవంతం చేశారు. వారి సాహితీ పిపాసకు వచ్చిన అతిథులందరూ కృతజ్ఞతలు తెలిపారు. పాత మిత్రులను కలవడానికి, కొత్తవారితో పరిచయం చేసికొనడానికి అవకాశం దొరికింది. రెండు రోజులు ఆనందంగా గడిచిపోయాయి.
పూటకు తప్పకుండ రుచిపూరముగా బలు విందు బోనముల్
మాటల నాడ స్నేహితులు, మాట వినంగను వక్త లెందఱో
మేటిగ బల్కు వారు, కొన మేలిమి పుస్తకముల్ లభించెగా,
పాటన సాహితీసభయు పండుగ రీతిగ నొప్పె నిక్కమై





