రాగమాలిక

ఈ రాగమాలిక రచనల్లో కొంతమంది గమ్మత్తైన ప్రయోగాలు చేసారు. తంజావూరు శంకరయ్యరనే సంగీతకారుడు రంజని రాగమాలికని స్వరపరిచారు. ఇందులో వాడిన రాగాలన్నీ రంజని పేరుతోనే ఉంటాయి. అవి రంజని, శ్రీరంజని, మేఘరంజని, జనరంజని. చాలా మంది వాగ్గేయకారులు ఈ రాగమాలికల్ని స్వరపరిచారు. సుబ్రహ్మణ్య భారతి రచించినవాటిని రాగమాలికల్లోనే స్వరపరిచారు. అలాగే గోపాలకృష్ణ భారతి కూడా రాగమాలికలు రచించారు. రాగమాలిక రచనలే కాకుండా రాగమాలికా వర్ణాలు కూడా ఉన్నాయి. పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ స్వరపరిచిన ‘వలచి వచ్చిన‘ అనే రాగమాలికావర్ణం అత్యంత ప్రసిద్ధమైనది. ఈ రాగమాలికలో పల్లవి కేదారంలోనూ, అనుపల్లవి శంకరాభరణంలోనూ, ముక్తాయి స్వరం కళ్యాణి, బేగడలో, చరణం కాంభోజి రాగంలోనూ ఉంటాయి. మిగిలిన చిట్టస్వరాలు వరుసగా యదుకుల కాంభోజి, బిలహరి, మోహన, శ్రీ రాగాల్లో ఉంటాయి. పల్లవీ, అనుపల్లవీ, ముక్తాయి స్వరాల్లో వాడిన రాగాలని ప్రత్యేకంగా చూస్తే కాకలి నిషాదం(ని3) స్వరం అన్ని రాగాల్లోనూ వుంది. అలాగే చరణమూ, చిట్టస్వరాల్లో చతుశ్రుతి రిషభం (రి2) , పంచమం(ప) ఆధారంగా మిగతా రాగాలన్నీ కలిపారు. ఈ రాగమాలికలో పల్లవిలోంచి అనుపల్లవీ, అనుపల్లవిలోంచి ముక్తాయి స్వరాలూ ఒకదాంట్లోంచి ఇంకోటి సెలయేటి ప్రవాహంలా సాగుతాయి. అలాగే చరణమూ, మిగతా చిట్టస్వరాలు కూడా.

ఇవే కాకుండా, ప్రొఫెసర్ సాంబమూర్తి ‘దిన రాగ మాలిక’ అనే వర్ణాన్ని రచించాడు. ఇందులో “రక్తి రాగములైన బిలహరి, ధన్యాసి, మధ్యమావతి, కళ్యాణి, పూర్వకళ్యాణి, కేదారగౌళ, మోహన, భూపాళములు గల” అని అనుపల్లవుంటుంది. అలాగే పార్థసారధి ‘నక్షత్ర రాగ మాలిక’ అనే రాగమాలిక రచించారు. ఇందులో ఒక్కో ఆవర్తనానికీ ఒక్కో రాగం వాడారు. తాళం మాత్రం ఒకటే ఉంటుంది. సాంబమూర్తి వినూత్నంగా రాగమాలికలో స్వరాలన్నీ కర్ణాటక సంగీత పరంగా బాణీ మాత్రం వెస్ట్రన్ సంగీత పరంగా ఒక రాగమాలిక రచించారు. ఇలా అనేకమంది వాగ్గేయకారులు రాగమాలికలని రచించారు. సాధారణంగా కర్ణాటక సంగీత కచేరీల్లో ఈ రాగమాలికలు వింటూ ఉంటాం. స్వాతి తిరునాళ్ రచించిన ‘భావయామి రఘురామం‘ అనే ప్రసిద్ధి చెందిన రాగమాలిక తరచు కచేరీల్లో పాడుతూనే ఉంటారు. స్వాతి తిరునాళ్ ‘కళ్యాణి ఖలు యద్కథ త్రిజగదం’ అనే రాగమాలిక శ్లోకాన్ని రచించాడు. ఇందులో వాడిన రాగాల పేర్లు కళ్యాణి, మోహన, సారంగ, శంకరాభరణం శ్లోకం ప్రతీ పాదంలోనూ వస్తాయి.

ఇంతకు ముందు చెప్పినట్లు ఈ రాగమాలికల్లో రాగం మారుతుంది కానీ తాళం మాత్రం ఒకటే ఉంటుంది. అలాకాకుండా రాగం ఒకటే ఉండి తాళం మాత్రం ప్రతీ అంగానికీ మారడాన్ని తాళ మాలిక అంటారు. ఈ తాళమాలికలో ప్రత్యేకమైన రచనలేవీ కనిపించక పోయినా, మనోధర్మ సంగీతంలో తాళమాలిక కనిపిస్తుంది. తిరువత్తియూర్ త్యాగయ్యర్ అనే ఒకాయన ఒకే రాగంలో ప్రతీ చరణాన్నీ వేర్వేరు తాళాలతో పాడి కచేరీ చేసినట్లుగా చెబుతారు. ఇవే కాకుండా ప్రతీ అంగానికీ రాగమూ, తాళమూ మారే ప్రక్రియని రాగ తాళమాలిక అని వ్యవహరిస్తారు. ముత్తుస్వామి దీక్షితార్ తండ్రి రామస్వామి దీక్షితార్ 108 రాగతాళ మాలిక రచించారు. నాకు తెలిసినంతవరకు ఇదొక్కటే కర్ణాటక సంగీతంలో ఉన్న రాగతాళ మాలిక. ఇందులో ఉపయోగించిన ప్రతీ రాగం పేరూ సాహిత్యంలో కనిపిస్తుంది.

ఈ రాగమాలిక ప్రక్రియ నాయకరాజుల కాలంలో నృత్య నాటికలూ, యక్షగానాలతో మొదలయ్యింది. నృత్యనాటికల్లో సన్నివేశానికి తగ్గట్టుగా వివిధ రసాల్నీ పాటలో చూపడానికి ఎక్కువగా వాడేవారు. మధుర నాయకరాజుల కాలంలో వెంకట సోమయాజి గారి తిరుమలయ్య రచించిన చిత్రకూట మహత్మ్యం అనే యక్షగానంలో రాగమాలికని వాడినట్లుగా వుంది. మధుర నాయక రాజుల తరువాత వచ్చిన తంజావూరు మహారాష్ట్ర రాజుల కాలానికి ఈ రాగమాలిక నృత్యనాటికల్లో భాగమయ్యింది. ఆ కాలంలో ఈ రాగమాలిక ప్రక్రియని ప్రతీ ఒక్కరూ అనుసరించారు. కానీ త్యాగరాజు రచించిన నృత్యనాటికల్లో ఒక్కొక్క రాగం ఒక్కొక్క రసాన్ని చూపడానికి వాడినా రాగమాలిక రచన కనిపించదు. అన్నమాచార్య కీర్తనలనీ సాహిత్యాన్ని బట్టి రాగమాలికల్లా (ఉదా: ‘ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన’ కీర్తన – బృందావని, మాయమాళవ గౌళ) స్వరపరిచారు.

ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాల మురళీకృష్ణ రాగమాలికను థిల్లానలో వాడి కొత్త ప్రయోగం చేసారు. ఇందులో అమృతవర్షిణి, మోహనం, కానడ, హిందోళ రాగాలున్నాయి. ఇదే కాకుండా శ్రుతి బేధం చూపుతూ తాయ థిల్లాన అనే మరో పద్ధతిలో రాగమాలిక రచించారు. అలాగే గతి భేదాన్ని చూపిస్తూ మరో రాగమాలిక, ‘అంబా మామవ’ అనే శుద్ధ రాగమాలికా కృతీ, తిరుపతి వేంకటేశ్వరునిపై ‘గాన లోల’ రాగమాలిక కృతినీ రచించారు.

ఈ రాగమాలిక ప్రయోగం కేవలం శాస్త్రీయ సంగీతానికే పరిమితం కాలేదు. భావగీతాల్లోనూ, జానపద గీతాల్లోనూ, సినిమా పాటల్లో కూడా ఈ రాగమాలికా ప్రయోగం తరచు వింటూనే ఉంటాం. కాకపోతే సినిమాల్లో చరణాలని బట్టి రాగాలు వాడడం కనిపిస్తుంది. కొన్ని పాటల్లో రెండూ లేదా మూడూ రాగాలు మాత్రమే కనిపిస్తాయి. పాత సినిమా పాటలు శాస్త్రీయ సంగీత రాగాలనుసరించి వరుసలు కట్టేవారు. అందువల్ల వివిధ రాగాల వాడకం పాటల్లో కనిపిస్తుంది. మునుపటి సంగీత దర్శకులు రాజేశ్వర రావు, పెండ్యాల, ఘంటసాల స్వరపరిచిన పాటల్లో ఈ రాగమాలిక ప్రయోగం కనిపిస్తుంది.

మల్లీశ్వరి సినిమాలో ఉషాపరిణయం యక్షగానంలో బిలహరి, మోహన, కేదారగౌళ, ముఖారి, హిందోళం వంటి రాగాలు కనిపిస్తాయి. రహస్యం సినిమాలో గిరిజా కళ్యాణం యక్ష గానంలో నాట, శ్రీ, కాంభోజి, అఠాణ, వసంత, రీతిగౌళ, బేగడ, సరస్వతి, హిందోళం, హంసధ్వని, సావేరి, సామ, సురటి, మధ్యమావతి రాగాలున్నాయి. సువర్ణ సుందరి సినిమాలో ‘హాయి హాయిగా ఆమని సాగే‘ పాటలో కూడా సోహిని, బహార్, జోన్‌పూరి, యమన్ వంటి రాగాలు కనిపిస్తాయి.

సినిమా పాటల్లో వాడే రాగమాలికలకీ, శాస్త్రీయ సంగీత రాగమాలికా కృతులకీ చాలా తేడా ఉంది. శాస్త్రీయ సంగీతంలో రాగ మాలికల్లో అన్య స్వర ప్రయోగాలు చేయకుండా రాగ లక్షణాలని పూర్తిగా పాటిస్తారు. సినిమా సంగీతంలో కొన్ని సార్లు అన్య స్వర ప్రయోగాలు చేస్తారు. అంటే, సినిమా పాటల్లో కేవలం రాగ మూర్ఛన (స్కేల్) ని మాత్రమే పాటిస్తారు తప్ప పూర్తి రాగాన్ని వాడరు. ఒక్కోసారి స్వర వర్జితాలు కూడా చేస్తూ ఉంటారు. ఫలానా సినిమా పాట ఈ రాగంలో ఉందీ అంటే ఆ పాట కేవలం రాగ మూర్ఛనని మాత్రమే పాటిస్తోందని అర్థం చేసుకోవాలి. సినిమా పాటలలో కూడా కొన్ని పాటలు పూర్తి రాగ లక్షణాలని పాటించి స్వరపరిచారు. కానీ, వాటి సంఖ్య చాలా తక్కువనే చెప్పచ్చు. కొన్ని సినిమా పాటల్లో రాగమాలికలు:

  • అనార్కలి: రాజశేఖరా (చక్రవాకం, హిందోళం)
  • అమెరికా అమ్మాయి: ఆనంద తాండవ మాడె (వసంత, అఠాణ)
  • ఉండమ్మా బొట్టు పెడతా: రావమ్మ మహాలక్ష్మి (నీలాంబరి, మధ్యమావతి, మోహన)
  • తూర్పు-పడమర: స్వరములు ఏడైనా (కామవర్ధిని, హిందోళం, సింధుభైరవి, చక్రవాకం)
  • జయభేరి: యమునా తీరమున (బేహాగ్, కాపి)
  • పంతులమ్మ: మానస వీణా మధు గీతం (పంతువరాళి, రేవతి)
  • పాండురంగమహత్మ్యం: జయ కృష్ణా ముకుందా మురారీ (మోహన, కళ్యాణి, ఆరభి, హిందోళం)
  • బావామరదళ్ళు: ముక్కోటి దేవతలు ఒక్కటై నారు (కాంభోజి, యదుకుల కాంభోజి, కానడ, గౌరీ మనోహరి, మాయా మాళవ గౌళ, నాటకురంజి)
  • భక్త ప్రహ్లాద: జీవము నీవేకదా (ఖరహరప్రియ, హిందోళం, మలయమారుతం)
  • మల్లీశ్వరి: నెలరాజా వెన్నెల రాజా (శ్రీ, కానడ); ఆకాశవీధిలో హాయిగా యెగిరేవు (భీంపలాస్, కళంగద, కీరవాణి, హంసానంది); పోయి రావే తల్లి (పీలు, శహన, పున్నాగవరాళి)
  • మంచిమనసులు: శిలలపై శిల్పాలు చెక్కినారు (ఉదయ రవి చంద్రిక, కాంభోజి, కీరవాణి)
  • వాగ్దానం: శ్రీ నగజా తనయం (కానడ, శంకరాభరణం, మోహన, తోడి, కేదారగౌళ, శ్రీ, కళ్యాణి)
  • విప్రనారాయణ: మేలుకో శ్రీరంగ (బౌళి, మలయమారుతం); ఎవ్వడే అతడెవ్వడే (భైరవి, మోహన, కాపి, వసంత)
  • శంకరాభరణం: రాగం-తానం-పల్లవి (చారుకేశి, సారంగ, దేవగాంధారి, కాంభోజి)
  • శివరంజని: అభినవ తారవో (శివరంజని, మలయమారుతం, సరస్వతి, కళ్యాణి)
  • శ్రీ కృష్ణ తులాభారము: భలే మంచి చౌక బేరము (కాపి, భాగేశ్వరి, మోహన, భాగేశ్వరి, హంసానంది, గౌళ, కాపి)
  • సప్తపది: అఖిలాండేశ్వరి (షణ్ముఖప్రియ, అఠాణ, సరస్వతి, దుర్గ(శుద్ధ సావేరి))
  • సిరివెన్నెల: ఈ గాలి ఈ నేల (శివరంజని, అమృతవర్షిణి)
  • లలితగీతాలు: పుష్ప విలాపము (శివరంజని కళ్యాణి, పంతువరాళి, పహాడి, మార్వా, బాగేశ్వరి)

పైనుదహరించిన పాటలే కాకుండా ఇంకా అనేక పాటల్లో రాగమాలిక ప్రయోగం కనిపిస్తుంది. పూర్వపు సినిమాల్లో ప్రతీ సంగీత దర్శకుడూ వివిధ రాగాల్లో రాగమాలికలా స్వరపరచడముంది. చాలామంది సంగీత ప్రియులు ఈ రాగమాలికల్ని ఇష్టపడతారు ఎందుకంటే వీటి వల్ల ఎక్కువ రాగాలని పాడిన అనుభూతి వస్తుంది. అన్ని రాగాలూ అందర్నీ అలరించినా అలరించకపోయినా రాగమాలిక మాత్రం ఎప్పటికీ జనరంజకమే.


ఆధార గ్రంథాలు:

  1. A Dictionary of South Indian Music and Musicians – Sambamoorthy, P. – Madras, Indian Pub. House, 1952.
  2. సమగ్రాంధ్ర సాహిత్యం – ఆరుద్ర – తెలుగు అకాడమీ – హైద్రాబాదు – 2004.
  3. గాంధర్వ వేదము – సంగీత రత్నాకరం – చర్ల గణపతి శాస్త్రి – ఆంధ్ర విశ్వవిద్యాలయం – విశాఖపట్టణం.
  4. గాన కళా బోధిని – పార్థ సారధి – బాలసరస్వతి బుక్ డిపో – మద్రాసు – 1965.
  5. సంగీత విద్యా దర్పణం – ఏకా సుబ్బారావు – మహలక్ష్మి బుక్ కార్పోరేషన్ – విజయవాడ.
  6. A history of British diplomacy in Tanjore – Rajayyan, K. – Madras University, 1969