ఇంతవరకు ఈ క్రౌంచపదాన్ని గురించి వ్రాసినవారందరూ ఒక విషయం మరచినట్లుంది. తెలుగు క్రౌంచపదపు లక్షణాలు ఉన్న వృత్తము పింగళఛందస్సు, ఛందోంబుధిలో లేవు. అంతమాత్రాన దానిని ఏ లక్షణకారుడు నిర్వచించలేదు అనడం తప్పు. జనాశ్రయుని, జయదేవుని (గీతగోవిందకారుడు కాదు) పిదప జయకీర్తి అనే లక్షణకారుడు ఇప్పటి కర్ణాటకములో ఉండేవాడు. అతని లక్షణగ్రంథము ఛందోనుశాసనము (తరువాతి కాలంలో హేమచంద్రసూరి కూడా ఛందోనుశాసనమనే మరొక గ్రంథాన్ని రచించాడు). నాగవర్మ ఛందోంబుధి క్రీ. శ. 990 నాటిది. తరువాత కొన్ని సంవత్సరాల పిదప జయకీర్తి ఛందోనుశాసనమును సంస్కృతములో రాసినాడు. ఇందులో తెలుగు క్రౌంచపదపు లక్షణాలతో హంసపదము అనే ఒక వృత్తము ఉన్నది[15]. జయకీర్తి ప్రకారము దాని లక్షణాలు-
హంసపదం స్యాద్భాంచ గణాః స్యుర్వ్రతశరవసుయతి మసభననాన్యౌ
తరువాతి కాలంలో హంసపదమును కోకపదము అని కూడా పిలిచేవారు. వేరు లక్షణాలతో హంసపదమనే మరొక వృత్తము కూడా ఉన్నది[16]. జయకీర్తి హంసపదాన్ని నన్నెచోడుడు చూచి అదే క్రౌంచపదమనుకొని వ్రాసినాడేమో? సంగీతపరంగా క్రౌంచపదము చాలా ముఖ్యమైనది, అందుకే దేశికార ప్రబంధములలో పదనైవదిగా క్రౌంచపదాన్ని, పదహారవదిగా హంసపదాన్ని (క్రౌంచపదము కాని మరొక హంసపదము) మతంగముని బృహద్దేశిలో[17] పేర్కొన్నాడు. ఇలా ఈ రెండు పదవృత్తాలను గురించి తికమకలు పడడానికి అవకాశం ఉందా అనే ప్రశ్నకు నా జవాబు: మణిగణనికరములో అన్ని పాదాలు ఒకే విధముగా లేవు కదా? అందులోని మొదటి రెండు పాదాలు సంస్కృత క్రౌంచపదములోని ద్వితీయార్ధములాగా, చివరి రెండు పాదాలు తెలుగు క్రౌంచపదములోని ద్వితీయార్ధములాగా ఉన్నవి కదా?
ఈ చర్చల సారాంశము ఏమంటే – రేచన కవిజనాశ్రయములోని క్రౌంచపదపు లక్షణాలు నన్నెచోడుని పద్యాన్ని అనుసరించి వ్రాసినది. నన్నెచోడునికి సంస్కృత క్రౌంచపదము, జయకీర్తి ఉదహరించిన క్రౌంచపదము తెలిసి ఉండాలి. ఇతడు తెలుగు కన్నడ సీమల సరిహద్దులకు రాజు కదా! తాను వ్రాసినప్పుడు ఒక దాని లక్షణాలను మరొకదానికి తారుమారు చేసి ఉంటాడు, మణిగణనికరమును సంకరము చేసినట్లు. కన్నడములోలా ప్రాసయతిని ఉంచినా, అక్షరయతిని ఎందుకు మొదటి అక్షరముతో పెట్టలేదో అన్నది ఇంకా చర్చనీయమే. దానిపై నా అభిప్రాయాలు ఇవి – క్రౌంచపదమును వ్రాసేటప్పుడు నన్నెచోడుడు ఒక సందిగ్ధావస్థలో పడ్డాడు. తాను వ్రాసిన స్రగ్ధర, మహాస్రగ్ధరలకు తప్ప మిగిలిన అన్ని పద్యాలకు అక్షర సామ్య యతి ఒకటే. స్రగ్ధరలోని రెండు యతులు సంస్కృతములో శతాబ్దాలుగా నియతమై ఉన్నవి. మహాస్రగ్ధర స్రగ్ధరనుండి పుట్టిన వృత్తము, కావున అందులో కూడా యతి నియమము కష్టమైనదేమీ కాదు. క్రౌంచపదములో నన్నెచోడుడు ఒక కొత్త సమస్యను ఎదుర్కొన్నాడు. ఇందులో ప్రాసయతి, సామాన్య యతి రెంటినీ మిశ్రితము చేయాలి. కన్నడ పద్ధతి దీనికి ఏ సహాయమూ చేయదు. ఎందుకంటే కన్నడములో స్వరయతి లేదు. సీసాన్ని వ్రాసేటప్పుడు నన్నయ యతి సాంకర్యము ఎక్కువగా చేయలేదు. నన్నెచోడుడు ఒకే పాదములో రెంటినీ మిశ్రణము చేసినట్లుంది. కాని కుమారసంభవమంతా తంజావూరు ప్రతిపైన ఆధారపడినది కావున గ్రంథ స్ఖాలిత్యాలు ఇందులో ఎక్కువ.
ఈ సందిగ్ధతనుండి బయటపడడానికి రెండు మార్గాలు. ఒకటేమో, మొదటి అక్షరముతో యతి కుదర్చడము. దీనివల్ల ఇప్పటికీ ఒక నష్టమేమంటే, అక్షరసామ్యము పది అక్షరాల తరువాత వస్తుంది, కావున శ్రవణసుభగత్వము అంతగా ఉండదు ఇట్టి పద్యాలలో. రెండవ అర్ధ పాదములోని అక్షరాలకు యతిని ఉంచితే వినడానికి బాగుంటుంది. ఈ కారణాలవల్ల నన్నెచోడుడు క్రౌంచపదానికి యతి నిర్ణయం ఇలా చేసి ఉంటాడు. ఇది కేవలం ఊహాగానమైనా నాకేమో తర్కరీతిగా సబబు అనే తోస్తుంది. పై సిద్ధాంతాలు అంగీకృతమైతే, నన్నెచోడుని కాలం ఛందోనుశాసన కర్త జయకీర్తి తరువాత, రేచనకు ముందు అని చెప్పవచ్చు. అంటే ముగ్గురు నన్నియలు (నన్నియభట్టు, నన్నియ నారాయణాభట్టు, నన్నిచోడుడు) సమకాలికులని అనుకోవచ్చు. కుమారసంభవము భారతంకన్న ఒక పదేళ్ళ ముందు లిఖితమయి ఉండవచ్చును. సంఖ్యాశాస్త్రాదుల నుపయోగించి కృష్ణారెడ్డి[2] నన్నెచోడుడు నన్నయభట్టు సమకాలికులనే తీర్మానించారు.
మంగళమహాశ్రీ
పంపకవి కన్నడ భారతాన్ని మంగళం అనే పదముతో అంతం చేశాడు. అందులో మత్తేభవిక్రీడితములోని చివరి పదాలు[18] ‘విభవం భద్రం శుభం మంగళం’. నన్నెచోడుని కుమారసంభవములోని చివరి పద్యములోని చివరి పదము ‘మంగళమహాశ్రీ’. ఈ పద్యం కూడా ముద్రాలంకారముతో వ్రాయబడినది. మంగళమహాశ్రీ వృత్తము ఆ కాలపు ఏ ఛందోగ్రంథములలో కూడా వివరించబడలేదు. అనగా ఇది అసలు సిసలైన ఒక కొత్త పద్యము. నాగవర్మ ఛందోంబుధిలో[9] మంగళము అనే 16అక్షరాల వృత్తము (న భ జ జ జ గ) ఉన్నది. పింగళ ఛందస్సులో[8] దీనిని పద్మ అని పిలిచారు. మంగళమహాశ్రీ కవిజనాశ్రయములో చెప్పబడినది.
ఈ వృత్తము ఎలా పుట్టింది అనే ప్రశ్న కలుగవచ్చు. ఛందోంబుధిలో లలితవృత్తము, లయగ్రాహి చెప్పబడి యున్నది. ఈ రెంటికీ గణాలు ఒక్కటే. లయగ్రాహిలో ఉన్న చివరి ప్రాసయతి లలితలో ఉండదు. అదొక్కటే ఈ రెంటికీ తేడా. నన్నయ నన్నెచోడులు లయగ్రాహిని వ్రాసియున్నారు. లయగ్రాహికి 30 అక్షరాలు. కాళిదాసో లేక నా ఉద్దేశములో శంకరాచార్యులో అశ్వధాటీవృత్తాన్ని దేవీ అశ్వధాటిలో వ్రాసియున్నారు. అశ్వధాటికి 22 అక్షరాలు. ఇందులో పాదానికి ఆరు పంచమాత్రలు (UUI, UIII), చివర ఒక గురువు. లయగ్రాహిలో ఏడు పంచమాత్రలు (UIII), రెండు గురువులు. ఇక్కడ ఒక చిక్కు, వృత్తాలలో 26 అక్షరాలకంటె ఎక్కువ ఉండరాదు. 30 అక్షరాలలో నాలిగింటిని అంటే ఒక పంచమాత్రను తీసివేస్తే మనకు 26 అక్షరాలు దొరుకుతాయి. దీనికి ఉదాహరణగా నా యీ కింది పద్యమును చదవండి. ఇందులో కుండలీకరణములతో చదివితే లయగ్రాహి, వాటిని వదలి చదివితే మంగళమహాశ్రీ మనకు దొరుకుతాయి.
(ఓ రమణి) సంతసము మీరగ వసంతముననీరముల చారు సుమ హారములు పూచెన్
(కారుకొను) వంత లిక తీరువడు, వర్ధిలును ధారుణియు, వర్షములు ధారలయి పాఱున్
(దారుణపు) చింత లిక దూరమగు శ్రీలు కడు చేరువగు, చెల్వముల తారకలు తోచున్
(స్ఫారమగు) కాంతుల నపారమగు గానసుధ లూరు, శుభకాలములు చేరు ధర శాంతిన్
బహుశా ఆ అలోచనే చోడునికి తట్టి ఉంటుంది. ఇది వృత్తము కాబట్టి లయగ్రాహిలోని ప్రాసయతికి బదులు, క్రౌంచపదములా ప్రాసయతి సాంకర్యము లేక, ఇందులో రెండు మాత్రాగణాలకు ఒక అక్షరయతి ఉంచబడినది. లయగ్రాహిలోని ఒక పంచమాత్రారాహిత్యము వలన మంగళమహాశ్రీని చోడుడు కల్పించి ఉంటాడు. అలా ఈ వృత్తము ఉత్కృతి ఛందములో 15658735వ వృత్తమైనది. నన్నెచోడుని మంగళాంత పద్యమును(12.231) కింద చదువవచ్చు. ఇందులో మొదటి పాదములో చివరి రెండు గురువులకు ముందు ఒక పంచమాత్ర లోపమై ఉన్నది.
మం. భూవినుతుఁ, డార్యజనపూజితుఁడు, సద్గుణవిభూషితుఁడు, సర్వా-
శా వివర పూరిత విశాల శర నిర్మలయశఃప్రసరశోభితుఁడు, సద్భూ
దేవకులశేఖరుఁడు, దేవమునిముఖ్యుఁడు, సుధీజనవరేణ్యుఁడు, ప్రియుండై
యీ వసుధ శిష్టతతి కిష్టఫలయుక్తముగ నిచ్చు దయ మంగళమహాశ్రీ
భూమిలో పొగడబడినవాడు, పెద్దలచే పూజించబడినవాడు, మంచి గుణాలతో శోభిల్లువాడు, దిక్కుదిక్కుల వ్యాప్తమైన కీర్తిధవళిమతో అలరారువాడు, బ్రాహ్మణశ్రేష్ఠుడు, దేవతలలో మునులలో ముఖ్యుడు, పండితజనులలో ప్రథముడు – జంగమ మల్లికార్జునుడు – కోరిన కోర్కెలను మంగళమైన గొప్ప సంపదలను సజ్జనులకు ప్రసాదించును అని దీనికి అర్థము
ముగింపు
నన్నెచోడుడు ఒక చిన్న సామంత రాజు, కాని కవిరాజులకు రారాజు. పరమేశ్వరారాధకుడు మాత్రమే కాదు, ప్రబంధ పరమేశ్వరుడు కూడ. జాను తెలుగులో వస్తుకవితకు మార్గదర్శి. తెలుగు కావ్యకన్యకకు అలంకారాలను తీర్చి దిద్దిన అసమాన శేముషీ దురంధరుడు. చిత్ర కవి, లాక్షణికుడు, ఛందోవతంసుడు, నూతన పథాన్వేషణాసక్తుడు, స్వతంత్రుడు. వైష్ణవద్వేషి కాని వీరశైవుడు. స్మరుని స్మరించిన శృంగారరసోల్లాసి. స్కందుని ప్రీతికై కందానికి అందాలను దిద్దిన కల్పనా నిపుణుడు. సీసానికి మాసిపోని మూసల నేర్పరచి వాసికెక్కిన వర్ణనాత్మకుడు. నవరస పిపాసి, నటరాజోపాసి. ఆంధ్రభాషలోని ఆదికవి లేక ఆదికవులలో ఒకడు.
గ్రంథసూచి
- జొన్నలగడ్డ మృత్యుంజయ రావు, నన్నెచోడకృత కుమారసంభవము, ప్రథమ భాగము, పీఠిక, తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు, 1994.
- దేవరపల్లి కృష్ణారెడ్డి, నన్నిచోడకవి చరిత్ర, బీ.ఎన్.కే. ప్రెస్, మదరాసు, 1951.
- కొర్లపాటి శ్రీరామమూర్తి, నన్నెచోడుని కుమారసంభవము ప్రాచీనగ్రంథమా?, రమణశ్రీ ప్రచురణ, విశాఖపట్టణము, 1983.
- అమరేశం రాజేశ్వరశర్మ, నన్నెచోడుని కవిత్వము, అజంతా ప్రింటర్స్, సికిందరాబాదు, 1958.
- మల్లియ రేచన లేక వేములవాడ భీమకవి, కవిజనాశ్రయము, వావిళ్ళ రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్, మదరాసు, 1950.
- మల్లియ రేచన లేక వేములవాడ భీమకవి, కవిజనాశ్రయము, ఆంధ్ర సాహిత్య పరిషత్, సుజనరంజనీ ముద్రాక్షరశాల, కాకినాడ, 1932.
- పోలూరి గోవిందకవి, తాళదశప్రాణ ప్రదీపిక, తంజావూరు సరస్వతీ మహల్ సీరీస్ – 13, గవర్నమెంట్ అఫ్ మెడ్రాస్, 1950.
- పింగలాచార్య, ఛందఃశాస్త్రం, పరిమల్ పబ్లికేషన్స్, ఢిల్లీ, 1994.
- నాగవర్మ, కన్నడ ఛందస్సు, సం. ఎఫ్. కిట్టెల్, బేసెల్ మిషన్ బుక్అండ్ ట్రాక్ట్ డెపాసిటరీ, మంగళూరు, 1875.
- జెజ్జాల కృష్ణ మోహనరావు, ద్వికందగర్భిత క్రౌంచపదము – , క్రౌంచపదము – హరిగతిరగడ
- వ్యాసనకెరె ప్రభంజనాచార్య, స్తోత్రమాలికా, శ్రీమన్మధ్వసిద్ధాంతోన్నాహినీ సభ, తిరుచానూరు, 1994.
- మానవల్లి రామకృష్ణకవి, మానవల్లికవి రచనలు, సం. నిడదవోలు వేంకటరావు, పోణంగి శ్రీరామ అప్పారావు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాదు, 1972.
- రావూరి దొరసామిశర్మ, తెలుగు భాషలో ఛందోరీతులు, వెల్డన్ ప్రెస్, మదరాసు, 1962.
- కంకంటి పాపరాజు, ఉత్తరరామాయణము, 4.281, సీ. వీ. కృష్ణా బుక్ డిపో, మదరాసు, 1957.
- జయకీర్తి ఛందోనుశాసనం, జయదామన్, సం. హరి దామోదర్ వేళంకర్, హరితోషమాల, బాంబే, 1949.
- జెజ్జాల కృష్ణ మోహనరావు, హంసపద
- మతంగముని, బృహద్దేశి, పరిష్కర్త, ద్వారం భావనారాయణరావు, ద్వరం పబ్లికేషన్స్, విశాఖపట్టణము, 2001.
- నిడుదవోలు వేంకటరావు, ఆంధ్ర కర్నాట సారస్వతములు, క్రాంతి ప్రెస్, మదరాసు, 1962.
