క్రౌంచపదము
క్రౌంచపదము అనేది ఒక వృత్తఛందస్సు. (క్రౌంచము అనే పేరుతో ఒక పక్షి (Heron), ఒక కొండ కూడా ఉన్నాయి.) తెలుగు ఛందస్సులో క్రౌంచపదంలో ప్రతి పాదానికి 24 అక్షరాలు ఉంటాయి. ఇది సంకృతి ఛందములో పుట్టిన 4193479వ వృత్తము. దీని గణములు- భ-మ-స-భ-న-న-న-య. ఇది ఒక చతుర్మాత్రల తాళవృత్తము. మాత్రాగణములుగా దీనిని ఇలా వ్రాయవచ్చు- UII UU UII UU IIII IIII IIII UU, అనగా ప్రతి పాదములో ఎనిమిది చతుర్మాత్రలు. సంస్కృతములో[8] , కన్నడములో[9] ఈ పేరుతో, ఇదే లయతో ఒక వృత్తము ఉన్నది. కాని అది పాదానికి 25 అక్షరాలు గల అభికృతి ఛందస్సులోని 16776391వ వృత్తము. తెలుగులో చివరి మాత్రాగణము గ-గము. సంస్కృతము, కన్నడములలో అది స-గణము. క్రౌంచపదముతో ఛందఃపరముగా ఎన్నో ఆటలను ఆడుకోవచ్చు[10]. సంస్కృతములో పింగళ ఛందస్సులో దీనికి “యా కపిలాక్షీ పింగళకేశీ …” అనే ఉదాహరణ ఉంది. ఇది ఒక కురూపియైన స్త్రీ వర్ణన. దీనికంటే ఒక అందమైన ఈ క్రింది పద్యాన్ని మధ్వాచార్యులు సంస్కృతంలో రాశారు.[11]:
సం.క్రౌ. అంబరగంగా చుంబితపాదః పదతలవిదలిత గురుతరశకటః
కాలియనాగశ్వేలనిహంతా సరసిజనవదలవికసితనయనః
కాలఘనాలీ కర్బురకాయః శరశతశకలితరిపుశతనివహః
సంతతమస్మాన్ పాతు మురారిః సతతగసమజవఖగపతినిరతః
ఆకాశగంగను ముద్దాడిన పాదాలు గలవాడా, పెద్ద బండినే విరగగొట్టిన అడుగులవాడా, కాళియుని ఉనికిని నాశనము చేసినవాడా, కొత్త తామరపూల రేకులవంటి కన్నులు గలవాడా, కారు మేఘములవంటి దేహము గలవాడా, శత్రువులను బాణములతో జయించినవాడా, ఎల్లప్పుడు గరుడదేవునిపై వెళ్ళెడివాడా, ఓ మురారీ, నన్నెల్లపుడు కాపాడవయ్యా అని దీనికి అర్థం. పై పద్యంలో మొదటి రెండు పాదాలలో యాదృచ్ఛికముగా పూర్వార్ధములో ప్రాసయతి కుదిరింది. కన్నడములో కూడా మొదటి సగ పాదంలో ప్రాసయతి ఉన్నది. ఆ కన్నడ క్రౌంచపద పద్యము [9]–
క. క్రౌ. శీతకరోర్వీ-వాత-శశాంకర్ యుగ-మిత-సురపుర-నివహద కడెయొళ్
భూతగణేశం, భూత-శరాశా గజదొళె యతిగళు మెసెదరె పెసరిం
నీతియుతే, కేళ్ నీ సాతిశయోక్తి-క్రమదొళె నెగళ్దుది దతిశయ రచనో
పేతమశేషోర్వీతలకం క్రౌంచపదమిదతిశయపదరచనెగళిం
చంద్రుడు(భ-గణము), భూమి(మ-గణము), వాయువు(స-గణము), చంద్రుడు(భ-గణము), నాలుగు దేవలోకాలు(న-గణాలు), చివర ఒక శుక్రాచార్యుడు(గురువు), భూతాలు(ఐదు), బాణాలు(ఐదు), దిగ్గజాలు(ఎనిమిది), ఋషులు(ఏడు) యతులుగా ఉండినచో, ఓ మానవతీ, విను, ఆ అతిశయ రచనను క్రౌంచపదము అంటారు అని నాగవర్మ తన భార్యను ఉద్దేశించి ఈ పద్యాన్ని వ్రాసినాడు.
ఇందులో కూడా ప్రథమార్ధములో ప్రాసయతి ఉంది. కన్నడములో యతికి అక్షరమైత్రి లేదు, పాదవిచ్ఛేదన మాత్రమే. కావున ప్రతి పాదం ఐదు, ఐదు, ఎనిమిది, ఏడు అక్షరాలుగా విరుగుతుంది. కాని తెలుగులో మాత్రం పాదానికి 24 అక్షరాలు. దానిని రేచన కవిజనాశ్రయములో ఇలా వివరిస్తాడు-
క్రౌ. పంచశరాభా, సంచితపుణ్యా, భమసభననయల పరిమితమైనన్
గ్రౌంచపదాఖ్యం బంచిత మయ్యెన్ గ్రమయతి దశవసుకలితము కాగన్
మన్మథాకారుడా, పుణ్యవంతుడా, భమసభనననయలతో కూడియున్నదై పదికి, ఎనిమిదికి తరువాత యతి ఉండినచో దానిని క్రౌంచపదమందురు. ఇందులో అక్షరయతి మాత్రమే సూచించబడినా, ఉదహరణలో ఐదక్షరాల తరువాత ప్రాసయతి కూడా ఉన్నది. అసలు సంస్కృత, తెలుగు క్రౌంచపదాలకు లయలో భేదము ఏ మాత్రము లేదు. దీనిని నిరూపిస్తూ కింద ఒక పద్యము చూడండి. ఇందులో కుండలీకరణములలో నున్న పదాలు తెలుగు క్రౌంచపదానికి, అలా లేని చివరి పదాలు సంస్కృత వృత్తానికి వర్తిస్తాయి.
క్రౌ. ఇంచు సడుల్ నే నించుక వింటిన్ హృదయము నిజముగ హృతమయె నహహా (నాహా)
ఎంచితి నిన్ బ్రేమించితి రాత్రిన్ హిమకర కరములు హితమయ మయెగా (మయ్యెన్)
కాంచనమాలా చంచల హేలా గగనము మురిసెను కడు ముద మొసగన్ (మీయన్)
కాంచగ రావా క్రౌంచపదమ్మున్ గనగను వినగను కమల సునయనా (సునేత్రీ)
ఈ నేపథ్యముతో నన్నెచోడుని క్రౌంచపదాన్ని(10.30) పరిశీలిద్దాము.
క్రౌ. చంచుల నాస్వాదించుచు లేఁదూండ్లకరువు ప్రియులకు నలదుఁచు మై రో
మాంచము లోలిం గంచుకితంబై పొడమఁగ నడరుచుఁ బులినములం గ్రీ
డించుచు సంభాషించుచుఁ బ్రీతిం బొలుచుచుఁ జెలగుచుఁ బొలయు సముద్య
త్క్రౌంచగతుల్ వీక్షించుచు భాస్వజ్జ్వలనుఁడు శరవణ సరసికి వచ్చెన్
ముక్కులతో లేత తూడులను తింటూ, పుప్పొడిని తమ ప్రియురాళ్ళకు పూస్తూ, గగుర్పాటుతో ఒళ్ళు నిండిపోయి విజృంబిస్తూ, ఆ ఇసుక తిన్నెలపై ఆడుతూ, మాట్లాడుతూ, సంతోష ధ్వనులతో మురిసిపోతూ ఉండే ఆ క్రౌంచ పక్షులను చూస్తూ మండిపోతూ ఉండే అగ్నిదేవుడు శరవణ సరసికి వచ్చాడు. శివుని రేతస్సును మోసికొని అగ్ని శరవణసరసికి వచ్చినప్పుడు క్రౌంచపక్షుల విహారాన్ని వర్ణించే పద్యము ఇది.
నన్నయ భారతములో క్రౌంచపదము లేదు. నన్నెచోడుని క్రౌంచపదమే తెలుగు సాహిత్యములో మొట్టమొదటిది. ఇందులోని విశేషాలు:
- సంస్కృతమువలె, కన్నడమువలె కాక ఇందులో పాదానికి 24 అక్షరాలు ఉన్నాయి.
- ఇందులో పూర్వార్ధములో ప్రాసయతి ఉన్నది.
- ఉత్తరార్ధములో అక్షరయతి ఉన్నా, అది మొదటి అక్షరముతో చెల్లడం లేదు. సీస పాదమువలె మొదటి సగములో ప్రాసయతి, రెండవ సగములో సామాన్య యతి ఉన్నది.
ఈ మూడవ విశేషాన్ని గమనించిన కవి[12] సీసమునుండి క్రౌంచపదము పుట్టినది అన్నారు. కాని నాకు ఇది అంత సబబుగా తోచలేదు. ఎందుకంటే, సీసపదముగా నుండాలంటే చివరి రెండు చతుర్మాత్రలను త్రిమాత్రలు చేయాలి. నన్నెచోడునికి నాగవర్మ ఛందోంబుధి పరిచితమై ఉంటుంది. అందులోని విధముగా ప్రాసయతిని ఉంచాడు. కాని అక్షరయతి ఉంచేటప్పుడు ద్వితీయార్ధాన్ని స్వతంత్రంగా తీసికొన్నాడు. అసలు 25 అక్షరాల పాదం 24 అక్షరాలు ఏలాగయింది? రేచన కవిజనాశ్రయాన్ని చూసి వ్రాసింది కాదు. రేచన కవిజనాశ్రయము నన్నెచోడునికి ముందు వ్రాయబడి ఉంటే, లక్ష్యాలేమియు లేని రేచన సంస్కృత లక్షణాలను స్వీకరించి ఉంటాడు. నన్నయ మధ్యాక్కరకు ఐదవ గణముతో యతి నుంచాడు. నన్నెచోడుడు మధ్యాక్కరను రాయలేదు. కాని చంపకోత్పలమాలలలో మధ్యాక్కరను గర్భితము చేయడానికి ప్రయత్నించినట్లుందని “చంపకోత్పలమాలల కథ” అన్న వ్యాసంలో తెలియజేసాను. (11.131, 11.132). ఇలా చేస్తే అదనముగా యతి నుంచలేని కారణాన, మధ్యాక్కరకు నాలుగవ గణముతో యతి కుదురుతుంది. ఎఱ్ఱన మధ్యాక్కరకు నాలుగవ గణముతో యతిని ఉంచాడు. రేచన మధ్యాక్కరలోని నాలుగవ గణానికి యతిని నియమిచాడు. ఇక పోతే ఇద్దరు నన్నియలు మానినికి, కవిరాజవిరాజితమునకు ఒకే యతి నుంచారు. కాని కవిజనాశ్రయకర్త మూడు యతులను వివరించాడు. ఈ కారణాలవల్ల కవిజనాశ్రయము నన్నయ నన్నెచోడుల పిదప వ్రాయబడినది కాని ముందు కాదు. అంటే భీమనచందము అని పిలువబడే కవిజనాశ్రయాన్ని భీమన వ్రాసెనో లేక రేచన వ్రాసెనో మనకు నిక్కచ్చిగా తెలియదు. కాని ఆ రచయిత నన్నయ, నన్నెచోడుల తరువాతివాడే.
క్రౌంచపదానికి పూర్వార్ధపాదములో అందరూ ప్రాసయతిని ఉంచలేదు. తిక్కన కవిజనాశ్రయ లక్షణములను విధిగా పాటించాడు. ఎఱ్ఱన పూర్వార్ధములో అక్షరయతిని ఉంచాడు. నంది తిమ్మన, అప్పకవి పద్యాలలో ప్రాసయతి లేదు [13]. నన్నెచోడుని ద్వితీయార్ధ యతిలా కాక అక్షరయతి ఎప్పుడూ మొదటి అక్షరముతో చెల్లుతుంది మిగిలిన కవుల పద్యాలలో. సంస్కృత క్రౌంచపదము రుక్మవతీ (ప్రథమార్ధము) మణిగణనికరముల (ద్వితీయార్ధము) సంయోగము. మనకు దొరికిన నన్నెచోడుని మణిగణనికరము(8.93) లక్షణయుక్తముగా లేదు.
మణి. సరసిజహితుఁ డటు సనఁ దరతర మ
త్యరుణరుచిని మెఱుఁ గడరుచు వడి సం
బరమున నుడుతతి ప్రవిమల మయ్యెన్
నిరుపమ మణిగణనికర విభాతిన్
సూర్యుడు అలా అస్తమించాడు, ఎర్రని కాంతులు మెల్లమెల్లగా ఆకాశములో వ్యాపించాయి. నక్షత్రాలు మణిగణముల రాశిలా దేదీప్యమానముగా వెలుగ నారంభించాయి. పుస్తకములో పద్యం ఇలాగే ఉంది. ఈ రీతిలో నన్నెచోడుడు వ్రాసి ఉంటే మొదటి రెండు పాదాలకు మాత్రమే మణిగణనికరపు లక్షణాలు ఉన్నాయి. మూడవ, నాలుగవ పాదాల చివర రెండు లఘువులు, ఒక గురువుకు బదులు రెండు గురువులు ఉన్నాయి. ఈ లక్షణాలతో ఉండే వృత్తమును కమలవిలసితము లేక గౌరీ అంటారు. మూడవ పాదములో అయ్యెన్ కు బదులుగా అయెగా అనియూ నాలుగవ పాదములో మణిగణనికర విభాతిన్ కు బదులుగా మణిగణనికరము విధమై అని చెబితే మణిగణనికరపు లక్షణాలు సరిపోతాయి. మొదటి రెండు పాదాలు మణిగణనికరములా ఉన్నా, చివరి రెండు పాదాలు కమలవిలసితములా ఉన్నది (ఉదా. కంకంటి పాపరాజు ఉత్తరరామాయణములోని[14] వనజనయనుఁ గరివరదునిఁ జేరన్ …). కాని ఈ కమలవిలసితవృత్తము కవిజనాశ్రయములో లేదు. దీనినే పింగళుడు[8] గౌరీ అని పిలిచాడు.