శార్దూలవిక్రీడిత లక్షణాలను చెప్పేటప్పుడు రేచన రాసిన పద్యానికి, నన్నెచోడుని దారిద్ర్యవిద్రావణ దశకములోని ఒక పద్యానికి ఆరంభంలో ఉన్న పోలికను కూడా నేను గమనించాను. రేచన, కవిజనాశ్రయము, యతిచ్ఛందోధికార ప్రకరణము నుండి ఈ పద్యం:
శా. సారాచారవిశారదా, యినయతిన్ శార్దూలవిక్రీడితా
కారంబై మసజమ్ములిమ్ముగ సతాగప్రాప్తమై చెల్వగున్
శ్రేష్ఠములైన ఆచారములను తెలిసికొన్న వారిలో గొప్పవాడా, పన్నెండుకు విరిగే శార్దూలవిక్రీడితము మ-స-జ-స-త-త-గలతో ఒప్పారును అని దీనర్ధం. నన్నెచోడుని దారిద్ర్యవిద్రావణదశకములో ఒక పద్యం (10.98) కూడా ఇలాగే ఆరంభమవుతుంది.
శా. సారాచారవిచారదక్షు లమలజ్ఞానక్షణోద్వీక్షణా
ప్రారంభాత్మకు లాత్మ నిన్ను నెనయన్ భావించి దుర్వార సం
సారాంభోనిధి పారమెయ్ది సుమహత్సౌఖ్యాత్ములై మర్త్యు లా
ధారాధేయ విముక్తియుక్తు లగుదుర్ దారిద్ర్యవిద్రావణా
అర్ధం:ఓ దారిద్ర్యవిద్రావణా, విమలవంతములైన ఆచారముల నెరిగినవారు, ఒక త్రుటిలో నిర్మల జ్ఞానాన్ని తెలిసికొనే శక్తిగలవారు నిన్ను మనసులో సంస్మరించి ఈ గొప్ప సంసారసాగరానికి ఆవలి ఒడ్డు చేరి పారమార్థిక సౌఖ్యాలను అనుభవించిన మానవులు ఈ జన్మనుండి విముక్తి పొందుతారు గదా!
నన్నెచోడుడు ఒక లాక్షణికుడా?
కుమారసంభవములోని పద్యాల సంఖ్యను ఈ పట్టికలో చూడగలరు. ఇందులో సామాన్యముగా తెలుగులో రాసే కందము, సీసము, ఆటవెలది, తేటగీతి, శార్దూలమత్తేభ విక్రీడితాలు, చంపకోత్పలమాలలు ఎక్కువ. సీసపద్యానికి చివర ఆటవెలదినో లేక తేటగీతినో వ్రాయాలి. దీనిని ఎత్తుగీతి అంటారు. నన్నయభట్టు భారతంలో సీసపు ఎత్తుగీతిగా ఆటవెలదులే ఎక్కువ. నన్నెచోడుడు పై పట్టిక ప్రకారం రెంటిని సరి సమానముగా వాడాడు. ఆ ఒక కారణం వల్ల నన్నెచోడుడు నన్నయకు పిదప వాడని నిర్ధారించలేము. ప్రాచీన శాసనాలలో సీసపద్యానికి ఎత్తుగీతిగా తేటగీతులు కూడా ఉన్నాయి. ఆటవెలదిగీతికన్న తేటగీతులు మూడింతలకన్న ఎక్కువగా ఉన్నాయి కుమారసంభవములో. ఇది నన్నెచోడునికి తేటగీతిపైన ఉండే సుముఖతను, సౌలభ్యాన్ని సూచిస్తుంది. ఈ సుముఖతయే సీసపు ఎత్తుగీతిలో కూడా ప్రసరించి ఉండవచ్చు కదా!
ఖ్యాత వృత్తాలు, జాత్యుపజాతుల తరువాత మిగిలిన వాటిలో మహాస్రగ్ధర, లయగ్రాహి, ఉత్సాహ కన్నడమునుండి గ్రహించబడినవి. తరువోజ తెలుగు శాసనాలలో కనిపిస్తుంది. స్రగ్ధర, వనమయూరము, లలితగతి, వసంతతిలకము, భుజంగప్రయాతము, మందాక్రాంత, స్వాగతము, మాలిని, తోటకము సంస్కృత ఛందస్సులో ఉన్నాయి. మిగిలినవి క్రౌంచపదము, మత్తకోకిల, మానిని, లయహారిణి, కవిరాజవిరాజితము, మంగళమహాశ్రీ, మణిగణనికరము. వీటిలో క్రౌంచపదము, మణిగణనికరము, మంగళమహాశ్రీలను గురించి తరువాత చర్చిస్తాను. ఇవి పోగా ఉండేవి మత్తకోకిల, మానిని, కవిరాజవిరాజితము, లయహారిణి. సామాన్యముగా లాక్షణికులు లక్షణాలకు లక్ష్యాలను ఇచ్చేటప్పుడు ముద్రాలంకారాన్ని వాడుతారు అనే విషయాన్ని మనము జ్ఞాపకములో పెట్టుకోవాలి.
ఇందులో మత్తకోకిల(4.108), మానినీ వృత్తాలను(7.9) ముద్రాలంకారంతో వాడాడు చోడుడు. ఆ పద్యాలు-
మత్త. మెత్త మెత్తన క్రాలు దీవు సమీరణుండ, మనోభవుం
డెత్తకుండఁగ వేగకూడఁగ నెత్తు, మెత్తక తక్కినన్
జత్తు సుమ్ము వసంతుచే నని చాటునట్లు చెలంగె నా
మత్తకోకిల లారమిం గడు మాసరంబగు నామనిన్
అందమైన ఆమనివేళలో ఆ తోటలోని మత్తకోకిలలు “ఓ పవనమా, నీవేమో మెల్లమెల్లగా వీస్తున్నావు. మన్మథుడు నీపై దండయాత్ర చేయకముందు నీవే త్వరగా వానిపై దండెత్తు, అలా చేయకపోతే వసంతుడు నిన్ను చంపుతాడు, జాగ్రత్త సుమా” అని హెచ్చరించేటట్లు ధ్వనులు చేశాయట.
కన్నడములో మత్తకోకిలకు పేరు మల్లికామాలె. కన్నడములోని ఉత్పలమాలె, చంపకమాలె తెలుగులో ఉత్పలమాల, చంపకమాలలయ్యాయి. మరి మల్లికామాలె మల్లికామాల ఎందుకు కాలేదు? దీనికి మత్తకోకిల అని ఎవరు పేరు పెట్టారు? మల్లికామాల అని పద్యంలో రాయాలంటే ఆ పదాన్ని ఒక పాదం చివరనుండి మరొక పాదం మొదట పెట్టితేనే సాధ్యమవుతుంది. కాని మత్తకోకిల పదాన్ని పాదంలో ఎక్కడైనా వాడవచ్చును. నన్నెచోడుడు ముద్రాలంకారాన్ని ఉపయోగించాడు ఒక మత్తకోకిలలో, కాబట్టి అతడే దీనికి మత్తకోకిల అని పేరు పెట్టి ఉండవచ్చు గదా?
మా. ఆననలీల సుధాకరబింబ నవాంబురుహంబుల చెల్వగుటన్
వేనలి కృష్ణభుజంగకలాపి సవిస్తరభాసురమై చనుటం
దా నతి బాలకి యయ్యుఁ దపం బుచితస్థితిఁ జేయుచునుండుట నీ
మానిని రూపచరిత్ర లుదారసమం బగుచున్నవి చిత్రగతిన్
ముఖమో చంద్రబింబము లేక అప్పుడే విరిసిన పద్మాలు. జడ నల్లటి త్రాచు పామువలె లేక నెమలిలా ప్రకాశిస్తూ ఉంది. తనేమో చిన్న పిల్ల అయినా దీక్షతో తపస్సు చేస్తూ ఉంది. ఈ మానిని రూపము, గుణము అతి విచిత్రముగా ఉన్నదని దీని భావము.
నన్నయ (ఏచి తనర్చి తలిర్చిన ప్రోవుల నింపగు తావుల…), నన్నెచోడుడులు ఇద్దరూ మానినీ వృత్తానికి ఒక్క యతినే పాటించారన్న విషయం గమనార్హము. కాని రేచన మానినీవృత్తాన్ని యతిచ్ఛందోధికార ప్రకరణములో విశదీకరించేటప్పుడు ఒక్క యతినే చెప్పినా, ఆ పద్యంలో మూడు యతులు వాడాడు. ఆ పద్యం-
మా. కారకముల్ క్రియఁ గన్గొన నేడు భకారము లొక్క గకారముతో
గారవమై చనఁగా యతి పండ్రెటఁ గల్గిన మానిని కామనిభా
ఓ మన్మథాకారుడా, ఏడు భ-గణములతో, ఒక గురువుతో పన్నెండు అక్షరాలకు విరిగే వృత్తాన్ని మానిని అంటారు.
మానినిని సంస్కృతములో మదిరా అంటారు. మదిర అనే పేరు నచ్చక దీనికి మానిని అని నన్నెచోడుడు పేరు పెట్టి ఉండవచ్చుగదా? ఈ కోవకు చెందినదే కవిరాజవిరాజిత వృత్తం కూడా. నన్నయ(చనిచని ముందట నాజ్య హవిర్ధృత సౌరభ ధూమ లతాతతులన్ …), నన్నెచోడుడు(11.214, కింది పద్యం) ఒక్క యతినే వాడారు.
కవి. మనునిభ చారుచరిరుఁ బవిత్రు నమానుష పౌరుషవర్తి జగ
జ్జననుత నిర్మలకీర్తి రమావిభు శాశ్వత యోగ పదస్థిరు, స
న్మునిజన ముఖ్యు శివాగమవేది నమోఘవచోనిధి ధీనిధిఁ బా
వనతరమూర్తి సమస్త జగద్గురు వంద్యు ననింద్యు, సదాత్మవిదున్
మనువువలె అత్త్యుత్తమ చరిత్ర గలవానిని, పవిత్రుని, మానవాతీతమైన పురుషరూపుని, లోకమునందలి ప్రజలచే కొనియాడబడి విష్ణుమూర్తివలె కీర్తివంతుని, అచంచల యోగమూర్తిని, మునీశ్వరులలో ముఖ్యుడైనవానిని, ఈశ్వరవేదజ్ఞానిని, అనర్గళమైన వాక్కుల సిరిగలవానిని, ధీమంతుని, పరమ పావనుని, గురువులకే గురువైన వానిని, అనింద్యుని, బ్రహ్మజ్ఞానియైన జంగమ మల్లికార్జునుని గురించి రాసినదని ఈ పద్యార్ధము. రేచన ఈ పద్యానికి యతిచ్ఛందోధికార ప్రకరణములో లక్షణాలు చెప్పేటప్పుడు యతి మాటే ఎత్తలేదు, కాని లక్షణపద్యంలో మూడు యతులను వాడాడు.
కవి. క్రమమున నొక్క నకారము నాఱు జకారములుం బరగంగ వకా
రమును నొడంబడి రాఁ గవిరాజవిరాజిత మన్నది రామనిభా
అర్థం: ఓ రామరూపా, వరుసగా న-గణము, ఆరు జ-గణాలు, పిదప వ-గణము కవిరాజవిరాజిత వృత్తానికి ఉంటుంది. ఈ కవిరాజవిరాజితాన్ని సంస్కృతములో, కన్నడములో హంసగతి వృత్తము అంటారు. కవిరాజవిరాజిత వృత్తాన్ని ఆదిశంకరులు కూడా వాడారని “శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము” అన్న వ్యాసంలో తెలియజేసాను . తెలుగులో ఎప్పుడు ఎవరు కవిరాజవిరాజితమన్న పేరును పెట్టారో తెలియదు. బహుశా ఒక వేళ కవిరాజశిఖామణియైన నన్నెచోడుడు మొట్టమొదట దీనిని వాడినప్పుడు కవిరాజవిరాజితమన్నాడా?
అలాగే, లయహారిణికి కూడా ఆ పేరు ఎలా వచ్చిందో తెలియదు. నన్నెచోడుడు ఈ వృత్తంలో రాసిన రెండు పద్యాలలో ఒక దానిలో లలితగతి అనే పదం ఉంది. ఇతడు దీనికి లలితగతి అని పేరుంచాడేమో? ఈ నా ఊహకు కారణం, లయహారిణిలో చివరి రెండు గురువులకు బదులుగా ఒక స-గణమును ఉంచితే ఆ వృత్తాన్ని లలితలతా అంటారు. భారతములో ఈ ఉద్ధురమాలా వృత్తము కనబడదు. పైన చెప్పిన కారణాలవల్ల నన్నెచోడుడు పాత వృత్తాలకు కొత్త పేరులను కల్పించియుండవచ్చును. ఇదే నిజమయితే, కవిజనాశ్రయకారుడు కవిరాజశిఖామణి పిదప జీవించి ఉండాలి.
