నాచన సోమన చతుర వచో విలాసం

ఈ సంభాషణంతా ఇలా ఎందుకు సాగింది? నరకుని సంహరించమని కృష్ణునికి స్వయంగా చెప్పే చనువు మునులకి లేదు. ఇక్కడున్నది భగవంతుడూ భక్తులూ కాదు. రాజు, అతని ఏలికలోని ప్రజలు. అందుకే వాళ్ళ మాటల్లో వినయం ఉంది, క్లుప్తత ఉంది, లౌక్యం ఉంది. మునుల బాధలు విన్న శ్రీకృష్ణుడు నరకునిపై కోపాన్ని ప్రదర్శిస్తాడు. ఈ సన్నివేశం మొత్తం మీద కృష్ణుడు మాట్లాడింది ఒకే మాట “నరకుని జంపువాడ నందఱును జూడ” అని. ఒక చక్రవర్తి ఠీవి ఇక్కడ కనిపిస్తుంది. ఇలాటి సందర్భమే ఈ కావ్యంలో మరో చోట వస్తుంది. హంస డిభకులు దుర్వాసముని ఆశ్రమానికి వెళ్ళి, అతన్ని అవమానిస్తారు. ఆ విషయం కృష్ణునికి చెప్పడానికి తన శిష్యగణంతో వెళతాడు దుర్వాసుడు. దుర్వాస మహామునికి స్వాగతమిచ్చి చాలా అనునయ వాక్యాలని పలుకుతాడు శ్రీకృష్ణుడు. మీకేం కష్టం వచ్చిందని విచారిస్తాడు. అప్పుడు దుర్వాసుడిలా అంటాడు:

తగునే యింత మురాంతకా తలుపవే త్రైలోక్యముం గావ నీ
వు గదా దానవవైరివై పొడమి లావుం జేవయుం జూప రూ
పగు దైవంబు గదాధరుండ వఖిల వ్యాపారాపారంగ మా
ధ్వగ మావృత్త మెఱుంగనేర వన జిత్తం బుత్తలం బందదే

“ముల్లోకాలనీ రక్షించే వాడివి, రాక్షస సంహారివి, అఖిల వ్యాపారాలనీ నిర్వహించేవాడివి. మాకు వచ్చిన కష్టం గురించి నీకు తెలియకపోవడం తగునా, నువ్వలా అంటే నా మనసు కలత చెందదా!” అంటున్నాడు దుర్వాసుడు. ఇక్కడ శ్రీకృష్ణుడు దైవ స్వరూపుడు. దుర్వాసాది మునులు అతని నిరంతరం స్మరించే భక్తులు. భగవంతుడు భక్తాధీనుడు.

హంసడిభకుల చేత నీ యతులు నేము
బడిన పాటులు వేర చెప్పంగనేల
కమలలోచన ముంజేతి కంకణమున
కద్దమేటికి నీ సొమ్ము లరయ రాదె

“హంస డిభకుల చేత మేము పొందిన పాట్లని వేరే చెప్పకరలేదు. ఇదిగో యీ మా వస్తువులని చూడు. ముంజేతి కంకణానికి అద్దమెందుకు” అనడంలో దుర్వాసుని అతిశయం ద్యోతకమవుతుంది.

నకట మోమోట లేక తా రంతజేసి
బ్రదికి పోయిరె! పులి పేదవడిన బసుల
వాండ్రె యెక్కాడి రను కత వచ్చె నాకు;
మునుల లోపల నాలుక ముల్లు విరిగె

“భయం ఏ కోశానా లేకుండా ఆ హంసడిభకులు అంతలేసి పనులు చేసి ఇంకా బతికున్నారంటే ఏ మనాలి? శక్తి హీనమైన పులిని పసువుల కాపర్లు కూడా వెక్కిరించారట! అలా అయ్యింది నాపని! మునుల కొండనాలుక ఈ నాడు విరిగిపోయింది. ” అని కూడా అంటాడు దుర్వాసుడు.

మాకేది దిక్కు దెరువో
లోకంబులు మూడు నింతలో నేమగునో
నీ కడు పట స్వరంబును
జేకొనవే దుష్ట శిక్ష చేసి మురారీ!

“మాకే ఇలా దిక్కు లేకపోతే, ఇక లోకమేమై పోతుందో!” అంటూ దుష్ట సంహారం చెయ్యమని సూటిగా చెప్తాడు. ఈ సంభాషణలో ఎక్కడా పైన చెప్పిన మునుల సంభాషణలోని లౌక్యంగాని, గడుసుదనంగాని, అణకువగాని లేవు. ఇక్కడ మాట్లాడుతున్నది దుర్వాసుడు. సహజంగా అతనికున్న ఔద్ధత్యం, భక్తునిగా శ్రీకృష్ణుని పైనున్న అధికారం, చనువు ఇక్కడ కనిపిస్తుంది. ఇలా చెప్పిన దుర్వాసునితో కృష్ణుడు కూడా దానికి అనుగుణంగానే బదులిస్తాడు:

అనిన యతిం గనుంగొని మురాంతకు డిట్లను “దప్పు చేసితిం!
గినియకు మయ్య! మిమ్మొకడు కీడున బెట్టెడు వాడు లేడ యెం
దని పరికింపనైతి, విను మా ధరణీశ కుమార ధూర్తులం
దునిమెద నింతలో వగల దూలకు, సాత్యకి తోడు సంయమీ

హరుడు వరమిచ్చె వాణీ
వర వరుణ కుబేర సురప వైవస్వతు లి
త్తురు గాక నీవు గినిసిన
వరముల గిరములను బ్రదుకు వారే కుమతుల్”

ఇలా ఎంతో వినమ్రంగా మాట్లాడతాడు. హంసడిభకులని సంహరిస్తానని సాత్యకిపై ప్రమాణం కూడా చేస్తాడు! సాత్యకిపైనే ప్రమాణం చెయ్యడంలోని ఔచిత్యం తర్వాతి కథ చదివితే తెలుస్తుంది. “వరములు గిరములు వాళ్ళని బతికించ లేవు” అనడంలో తిరస్కారభావం ఎంతగా ధ్వనిస్తోందో గమనించండి.

ఊర్వశి మాటల చదరంగం

ఉత్తరహరివంశంలో సంభాషణలకి మకుటాయమానంగా వెలిగే సన్నివేశాలు రెండు. అందులో ఒకటి ఊర్వశీ నరకుల సంభాషణ. నరకుడు స్వర్గం మీదకి దండెత్తి దేవతలందరినీ తరిమేసి వాళ్ళ సంపదనంతా దోచుకుంటాడు. అతనికి ఊర్వశి అంటే కోరిక కలుగుతుంది. ఆమెని పిలిపించి తన కోరికనిలా బయటపెడతాడు:

నాకపురంబులో మెఱసి నందనకేళి జరించి దివ్యకాం
తా కర తాలవృంత సముదాయ సమీరము సోక రాజ్యముం
గైకొని నేడు దిగ్విజయ గౌరవ ధన్యుడ నైన నా సభన్
నీ కనుదోయి వెన్నెలలు నిండక కోర్కులు నాకు నిండునే

“ఎన్ని స్వర్గ సౌఖ్యాలని అనుభవించినా నీ కనుదోయి వెన్నెలలు లేకపోతే నాకు కోర్కెలు నిండుతాయా?” అని అనడంలో ఎంతో సౌకుమార్యం ధ్వనిస్తోంది.

అవె సుత్రామ రథంబు లల్లవె కుబేరానేకపశ్రేణు; ల
ల్లవె వార్ధీంద్రు తురంగమంబు; లవె ప్రేతాధీశ వీరావళుల్;
దవులం బారిన బట్టి తెచ్చి రనిలో దైతేయు లేసొమ్ము లిం
దువిదా నీకు ప్రియంబు? గైకొనుము నీ యుల్లంబు దెల్లంబుగన్

ఈ సంభాషణలో నరకుని మాటల నేర్పంతా కనిపిస్తుంది. దిక్పాలకుల ఐశ్వర్యాన్ని చూపించి, “ఇందులో నీకేవి ఇష్టమో వాటిని నిస్స్సంకోచంగా తీసుకో” అంటున్నాడు. ఇక్కడ తాను స్వయంగా కాక, తన సేనలు యుద్ధబూమిలో ఆ సొమ్ములని పట్టి తెచ్చారనడంలో ఉంది నరకుడి ఠీవి, దర్జా. ఇందులో తాను దిక్పాలకులను జయించానన్న విషయం వాచ్యంగా లేదు!

ఈ మాటల బట్టి నరకుడొక కాముకుడిలా కాక ప్రేమికుడిలా కనిపిస్తాడు. అతనికి ఊర్వశి మీదున్నది నిజంగానే ప్రేమా లేదా మాటల చాతుర్యాన్ని చూపిస్తున్నాడా? ఇప్పుడు నరకుడే స్వర్గానికి అధిపతి. తనని ఎలా అయినా లొంగదీసుకోగలడు. అప్పుడు తను చెయ్యగలిగేది ఏదీ లేదు. కాని నరకుడలా చెయ్యలేదు. కాబట్టి అతనినుండి తప్పించుకొనే అవకాశం ఉంది. కానీ, ఎలా? అతను తనపై ప్రేమని కురిపిస్తున్నాడు. కాదనడం ఎలా? ఇదంతా కొన్ని క్షణాలు ఆలోచిస్తుంది ఊర్వశి. అతడిని మంచి మాటలతో కాసేపు ఆడించాలనుకుంటుంది. అందుకే ఇలా అంటుంది :

చతుర వచో విలాస గుణసాగర! సాగర మేఖలావనీ
పతి యగు నీకు నింతులొక బ్రాతియె? నీవిటు గోరుటెల్ల నా
యతులిత భాగ్య; మింత నిజ; మైన గలంగక మున్న వైభవో
న్నతి మెఱయంగ వచ్చి యొక నాడయినన్ నను గారవించితే

ఇక్కడ ‘చతుర వచోవిలాస గుణసాగర’ అన్న సంబోధన పైకి అతన్ని పొగుడుతున్నట్టున్నా, అతను చూపించిందంతా నిజమైన ప్రేమ కాదు వట్టి వాక్చాతుర్యమే నన్న ఎత్తిపొడుపు కూడా ఉంది! “సమస్త భూమండలానికీ అధిపతివైన నీకు స్త్రీలొక లెక్కా? నువ్విలా నన్ను కోరడం నా అదృష్టం. ఇది నిజం!” అని పద్యంలో సగంపైగా అతని గొప్పతనాన్ని పొగిడి ఆ తర్వాత మెలిక పెడుతున్నది. “అయినా, ఇన్నాళ్ళల్లో ఒకనాడైనా వచ్చి నన్ను మన్నన చేసావా?” అని నిష్ఠూరమాడడంలో ‘అంటే నిజంగా నీది ప్రేమే అని నేనెలా నమ్ముతాను’ అన్న భావం నర్మగర్భంగా దాగుంది. ఇప్పుడా మొదట వేసిన విశేషణంలో, ‘నువ్వొట్టి మాటల మాయగాడివి’ అన్న అర్థం ధ్వనిస్తుంది. దీనికి నరకుడేమనగలడు?