ఇతడు గోమూత్రికా చక్ర బంధాలతో కూడా పద్యాలను వ్రాసినాడు. గోమూత్రికా బంధ పద్యములో ఒకటి విడిచి మరొక అక్షరము మొదటి రెండు, చివరి రెండు పాదాలకు సమానముగా ఉంటుంది.
కం. స్థిరమతి శుభసితమూర్తీ
వర సురవర దనుజ దురితవనధి సుకీర్తీ
హరదతి శుభయుతమూర్తీ
స్మర పురహర తనుభిదురిత జనన సుకీర్తీ (10.85)
స్థిరమతీ, శుభమైన తెల్లని ఆకారముగలవాడా, సురాసురుల పాపసముద్రాన్ని ఇంకింప జేయువాడా, పాపాలను హరించే మంగళకరమయిన ఆకారము గలవాడా, మన్మథుని, త్రిపురాలను భేదించిన వజ్రాయుధమువంటి దేహముగలవాడా అని ఈశ్వరుని సంబోధిస్తున్నాడు కవి ఈ పద్యములో.
పద్యార్ధ యమకాలంకారాన్ని కూడా కింది కంద పద్యములో మనము చూడవచ్చు. ఇందులో మొదటి రెండు పాదాలు చివరి రెండు పాదాలు ఒక్కటే. కాని అర్థాలు వేరు. సంధిగతముగా యమకాన్ని, శ్లేషను అతి చమత్కారముగా తరువాతి కాలములో చేమకూర వేంకటకవి విజయవిలాసములో వాడాడు.
కం. తానేలవచ్చు భూపతి
మానవపతి చరిత నీతిమార్గంబైనన్
తానేలవచ్చు భూపతి
మానవపతి చరిత నీతిమార్గంబైనన్ (10.181)
రాజు నీతిమార్గములో నడిస్తే అతడు భూసతిని పాలించవచ్చు. కాని అతని నడవడిక ఈతి మార్గమైనచో ఆ భూసతి అతడిని ఎందుకు సమీపిస్తుంది అని వ్యంగ్యముగా సూచించాడు కవి ఈ పద్యములో.
దశకం శతకానికి మార్గదర్శియా?
తెలుగు సాహిత్యములో శతకాలు సుప్రసిద్ధమయినవి. శతకవాఙ్మయానికి నాందీగీతం పాడినది నన్నెచోడుడేమో? కుమారసంభవములో దారిద్ర్యవిద్రావణా అనే మకుటముతో ఒక దశకము (పది పద్యాలు 10.90-10.99) ఉన్నది. అందులోని మొదటి పద్యము –
శా. శ్రీరామేశ కవీశ్వరాదు లెద నీ శ్రీపాదముల్ భక్తితో
నారాధించి సమస్తలోకసముదాయాధీశు లైరన్న సం
సారుల్ దుఃఖనివారణార్థ మభవున్ సర్వేశు లోకత్రయా
ధారున్ నిన్ మదిఁ గొల్వకుంకి యుఱవే దారిద్ర్యవిద్రావణా! (10.90)
దారిద్ర్యాన్ని దూరం చేయువాడా, ఓ మహేశ్వరా, విష్ణువు, బ్రహ్మ మున్నగువారు హృదయములో నీ దివ్యమైన పాదాలను సేవించి లోకాల కన్నిటికి ప్రభువు లయ్యారు. సామాన్యులైన సంసారులు వారి వెతలను తీర్చుకొనడానికై అభవుడు, సర్వేశ్వరుడు, మూడు లోకలకు ఆధారభూతుడైన నిన్ను మనసులో స్మరించకుండుట సరి యౌనా అని దీనికి అర్థం. ఈ బాణిలో ధూర్జటివంటి కవుల పద్యాలు అందరికీ తెలిసిన విషయమే. ఈ పద్యములోని శ్రీరామేశకవి అను నతడు బహుశా చోడుని సమకాలీకుడై ఉంటాడని కొందరి అభిప్రాయం.
ముగింపు
నన్నెచోడుని కాలంపై ఇంకా వాదోపవాదాలు జరుగుతున్నా, ఒక విషయం మాత్రం నిజం. ఈ కవి తెలుగు సాహిత్యపు ప్రారంభ దశలో జీవించాడు. ఛందఃపరంగా ఇతని కాల నిర్ణయాన్ని చేయడానికి వీలవుతుందా అనే సంగతిని రాబోయే వ్యాసంలో మీకు వివరిస్తాను. నన్నెచోడుడు ఆంధ్రభాషలోని ఆదికవులలో ఒకడు మాత్రమే కాదు. ఇతడు ఒక యుగపురుషుడు కూడా. ఎన్నో కొత్త కొత్త అందాలను తెలుగు కవిత్వానికి పరిచయం చేశాడు. అందులో కొన్ని – ప్రబంధరచనా ప్రణాళిక, అష్టాదశ వర్ణనలు, తెలుగు పద్యంతో కావ్యాన్ని మొదలు పెట్టడం, కావ్యాంతాన్ని మంగళం చేయడానికోసం మంగళమహాశ్రీ వృత్తాన్ని ఉపయోగించడం, కథారంభానికి ముందు కృతిభర్తను ఉద్దేశించి షష్ఠ్యంతాలు వ్రాయడం, ఆశ్వాసాంతంలోని పద్యాలను విభక్త్యంతముగా చేయడం, వాడుకలో ఉండే తెలుగు నుడికారాన్ని విరివిగా జానుతెనుగు రూపంలో వాడడం, మన్మథునితో కూడా సర్వదేవతలను ప్రత్యేక పద్యాలతో స్తుతించడం, కృతిభర్తకు, కథానాయకునికి ఏకత్వం ప్రతిపాదించడం, స్వతంత్రంగా కావ్యకథనాన్ని నడపడం, తగిన సమయాలలో తగినట్లు పద్యాలను రాసి వృత్తౌచిత్యం, ముద్రాలంకారం పాటించడం, గర్భకవిత్వం, బంధకవిత్వం కావ్యంలో ఒక భాగం చేయడం, శతకవాఙ్మయానికి నాందీవాక్యం పలకడం, ఇత్యాదులు.
ఆ అజ్ఞాత కాలం తెలుగు సాహిత్యానికి వసంతఋతువు లాటిది. అందువల్ల ఈ వ్యాసాన్ని అట్టిదే ఒక పద్యంతో అంతం చేయడం సముచితమే. అందంగా మొగ్గలు, పువ్వులు సంపంగి చెట్లలో చాలా ప్రకాశవంతముగా ఆరిపోని ఒక దీపవృక్షములా వెలిగిపోతుందట ఆ వసంతకాలము. అలాగే నన్నెచోడుని ప్రథమాంధ్రప్రబంధకావ్యము కూడా సదా కాంతిప్రసూనాలను వెదజల్లే దేదీప్యమానమైన దివ్వెల తరువులా వెలిగిపోతూ, హృదయానికీ మేధస్సుకు ఆనందాన్ని కలిగించనీ!
కం. నలి మొగ్గలు విరిపువ్వులు
సలలితమయి చూడనొప్పెఁ జనుపక మత్యు-
జ్జ్వలరుచి రేవగ లాఱక
వెలిగెడు నుద్దీప దీపవృక్షమువోలెన్(4.93)
గ్రంథసూచి
- జొన్నలగడ్డ మృత్యుంజయరావు, కుమారసంభవము, ప్రథమ భాగము, తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు, 1994. (అధర్వణ ఛందస్సునుండి మగణమ్ముఁ గదియ రగణము …, పుట 3).
- జొన్నలగడ్డ మృత్యుంజయరావు, కుమారసంభవము, ద్వితీయ భాగము, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు, 1998.
(ఈ వ్యాసములో నేను ఉదహరించిన పద్యాలన్నీ పై రెండు పుస్తకాలలోనివి. మొదటి భాగములో రావుగారు రసవత్తరమైన విషయాలతో దీర్ఘమైన పీఠిక నొకటి వ్రాసియున్నారు). - ఎం. ఆదినారాయణశాస్త్రి, రాయలసీమ తెలుగు శాసనాల సాంస్కృతిక అధ్యయనం, ఆదిత్య పబ్లికేషన్స్, అనంతపురం, 1995.
- మానవల్లి రామకృష్ణకవి, మానవల్లికవి రచనలు, సం. నిడదవోలు వేంకటరావు, పోణంగి శ్రీరామ అప్పారావు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాదు, 1972.
- దేవరపల్లి కృష్ణారెడ్డి, నన్నిచోడకవి చరిత్ర, బీ.ఎన్.కే. ప్రెస్, మదరాసు, 1951.
- కోరాడ మహదేవశాస్త్రి, కుమారసంభవము, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 1987. (ఈ పుస్తకపు ఉపోద్ఘాతములో శాస్త్రిగారు ఎన్నో విషయాలను ఆసక్తికరముగా చర్చించారు).
- కొర్లపాటి శ్రీరామమూర్తి, నన్నెచోడుని కుమారసంభవము ప్రాచీనగ్రంథమా?, రమణశ్రీ ప్రచురణ, విశాఖపట్టణము, 1983.
- అమరేశం రాజేశ్వరశర్మ, నన్నెచోడుని కవిత్వము, అజంతా ప్రింటర్స్, సికిందరాబాదు, 1958.
- విన్నకోట పెద్దన, కావ్యాలంకారచూడామణి, సం. వేదము వేంకటరాయశాస్త్రి, (3.92) పురవారాశి అనే పద్యము, జ్యోతిర్మతీ ముద్రాక్షరశాల, మదరాసు.
- కాకునూరి అప్పకవి, అప్పకవీయము, (1.28) పురమును, ఋతుషట్కమును అనే సీసపద్యము, పరిష్కర్తలు గిడుగు రామమూర్తిపంతులు, ఉత్పల నరసింహాచార్యులు, వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మదరాసు, 1934.
- శార్ఙ్గదేవుడు, సంగీతరత్నాకరము, సం. చర్ల గణపతిశాస్త్రి, లలితా అర్ట్ ప్రెస్, విశాఖపట్టణము, 1987.
- నృపతుంగదేవ, కవిరాజమార్గం, సం. ఎం. వీ. సీతారామయ్య, కన్నడ సాహిత్య పరిషత్తు, బెంగళూరు, 2005.
- నిడుదవోలు వేంకటరావు, ఆంధ్ర కర్నాట సారస్వతములు, క్రాంతి ప్రెస్, మదరాసు, 1962.
- జెజ్జాల కృష్ణ మోహనరావు, షష్ఠ్యంతములు, ఈమాట, మార్చి 2008.
- కోరాడ రామకృష్ణయ్య, సాహితీ నీరాజనం, సం. కోరాడ మహదేవశాస్త్రి, పుట 118, సీతా ట్రస్ట్, విశాఖపట్టణము, 1992.
- నిడుదవోలు వేంకటరావు, నన్నెచోడుని కవితావైభవము, యువభారతి, సికిందరాబాదు, 1976.
- Fred W. Clothey and A.K. Ramanujan, The many Faces of Murukan: The History and Meaning of a South Indian God, Walter de Gruyter, New York, 1978.
- జెజ్జాల కృష్ణ మోహనరావు, వైతాళీయము – వియోగిని.
- కే. మెహర్మణి, మద్రాసు తెలుగు – సామాజిక భాషా పరిశీలన, శ్రీవేంకటేశ్వరా యూనివర్సిటీ, 1999.
- జెజ్జాల కృష్ణ మోహనరావు, ద్వాదశకందము.

