కవిరాజశిఖామణి

స్వా. ఆ గిరీంద్రసుత హర్షముతో శై
        వాగమోదిత విధాయతితో సు
        స్వాగతాభిమత వాక్యములం ద
        భ్యాగతోచిత సపర్యలఁ దన్సెన్(7.5)

పార్వతీదేవి శైవాగమములు విధించిన తీరుగా సంతోషముతో సుస్వాగత వాక్యాలను పలికి అతిథులకు చేయవలసిన మర్యాదలను చేసి తృప్తి పొందింది. ఇందులోని కడపటి పదమును తనిసెన్ బదులు తన్సెన్ అని వాడాడు కవి. ఇట్టి ప్రయోగములు ఈ కావ్యములో కొల్లలు.

చం. జలజము సావి కోకములు షట్పదముల్ పఱతెంచి తద్దయున్
        నలి వినుతాస్యమండలము నాసికయున్ శశిబింబ చంపకం
        బులు సవి డాయనొల్ల కతి మోహమునం బెడఁబాయనోప కా
        కులమతి నున్న భంగిఁ గుచకుంతలవక్త్రము లొప్పు గౌరికిన్ (8.8)

చక్రవాక పక్షులకు వెన్నెల అంటే అయిష్టం. అదే విధంగా తుమ్మెదలకు సంపంగి పూలు పడవట. కానీ ఈ రెంటికీ తామరపూలు ప్రియమైనవి. పార్వతి ముఖాన్ని దూరంనుండి చూచి పద్మమని భ్రమించి అవి ఆమె దగ్గరకు చేరుతాయి. తీరా దగ్గరకు వచ్చిన తరువాత ఆమె ముఖకాంతి వెన్నెలను జ్ఞప్తికి తెస్తుంది చక్రవాకాలకు, ఆమె ముక్కు చంపకాన్ని జ్ఞప్తికి తెస్తుంది తుమ్మెదలకు. పద్మమని వెళ్దామా లేక వెన్నెల, సంపంగి అని దూరముందామా అనే భ్రమలో పడ్డాయి అవి. అట్టి సుందరమైన ముఖము, వెండ్రుకలు, స్తనాలు ఉన్నాయి గౌరికి. పార్వతి ముఖం వెన్నెలలా, కేశాలు నల్లని తుమ్మెదలలా, కుచాలు చక్రవాకములలా ఉన్నాయని దీని ఐతిహ్యము. సంపంగి ముక్కుపైన ప్రసిద్ధమైన పద్యం “నానాసూన వితాన వాసనల సారంగ మేలా నన్నొల్లదటంచు …” శతాబ్దాల తరువాత వ్రాయబడినది. నన్నెచోడుడు మానిని, మణిగణనికర వృత్తాలను కూడా ముద్రాలంకారముతో వ్రాసినాడు.

ఛందోవిశేషాలు – నెఱసున్నగా మారిన అరసున్న

నన్నెచోడుని కొన్ని పద్యాలలో మరొక ప్రత్యేకత ఉన్నది. అదేమంటే దీర్ఘము మీది అరసున్నను నిండుసున్న చేయడం. ఈ పద్ధతి ఇప్పుడు కూడా తమిళ దేశంలో తెలుగు మాట్లాడేవారిలో ఉంది [19]. కోతిని కోంతి అని, మూతిని మూంతి అని, చీకిలిని చీంకిలి అని అక్కడ వినడం సామాన్యం. పూర్వకాలంలో అరసున్నను, నిండు సున్నను రెంటినీ నిండు సున్నగా రాసేవారు (శిలాశాసనాలపై చెక్కేవారు). ఈ రెండిటికీ మధ్య ఉండే తేడా దాని తరువాత వచ్చే హల్లును రాసే పద్ధతిలో తెలుపుతారు. కోతిని కోంతి అని సంతసమును సంత్తసము అని రాసేవారు ఆ కాలంలో. నాచన సోముడు కూడా ఇలాటి ప్రయోగాలు చేశాడట. ఈ గుణముతో ఉండే చోడుని ఒక పద్యము –

కం. పోండిగ నగజ తపశ్శిఖి
        మూండు జగంబులను దీవ్రముగఁ బర్వినఁ బ్ర
        హ్మాండము గాఁచిన కాంచన
        భాండము క్రియఁ దాల్చెఁ దత్ప్రభాసితమై(6.157)

పార్వతి తపస్సు అనే అగ్ని మూడు లోకాలలో ఒప్పిదముగా వ్యాపించగా, ఆ నిప్పు జ్వాలతో ఆకాశం ఒక బంగారు కుండలా ప్రకాశించిందట. పోఁడి, మూఁడు అనే పదాలను పోండి, మూండు అని వ్రాసి ప్రాసను చెల్లించాడు కవి ఈ పద్యములో.

ఛందోవిశేషాలు – చిత్రకవిత్వం

నన్నెచోడుని తెలుగులో చిత్రకవిత్వానికి పితామహుడని చెప్పవచ్చు. గర్భ కవిత్వాలు, బంధ కవిత్వాలు, మున్నగు వాటిని కుమారసంభవములో చూడ వీలవుతుంది. ఒకే కంద పద్యంలో ఎన్నో కందపద్యాల లక్షణాలు ఉండేటట్లు వ్రాయవచ్చు. ఒకప్పుడు ఛందస్సు, రచ్చబండ గుంపులలో నేను ఇట్టి ద్వాదశకందమును చర్చించాను [20]. నన్నెచోడుని చతుర్విధ కందాన్ని కింద ఇస్తున్నాను. ఇందులోని నాలుగు కందాలు ముద్దగా ఉండే అక్షరాలతో ప్రారంభమవుతాయి.

కం. సుజ్ఞానయోగతత్త్వ వి-
        ధిజ్ఞులు భవ బంధనములఁ ద్రెంచుచు భువిలో
        నజ్ఞానపదముఁ బొందక
        ప్రాజ్ఞులు శివుఁ గొల్తు రచల భావనఁ దవులన్(12.217)

మంచి జ్ఞానము, యోగము, తత్వము తెలిసినవారు, జీవితంలోని బంధాలను తెంచివేసి అజ్ఞానములో లీనమవక ఏకైక దీక్షతో శివుని పూజిస్తారు అని దీనికి అర్థం.

చంపకమాలలో కూడా కందాన్ని గర్భితము చేయడానికి వీలవుతుంది. ఇట్టి చంపకమాల ఒకటి ఈ కావ్యములో ఉన్నది (12.219). సర్వలఘుకందము కూడా ఒకటుంది ఈ కావ్యంలో.

కం. తగుఁదగదని మనమున మును
        వగవగ నొడఁబడఁగ వగవ వగవఁగ బడయున్
        దగుఁ దగదని వగవనివగ
        వగవగఁ బనిగలదె తనకు వగ మఱి జగతిన్(10.187)

ఒక పని చేయడానికి ముందు మంచిదా చెడ్డదా అని ఆలోచించాలి. అలా చేయకుండా పని చేస్తే అది తనకు, ప్రపంచానికి దుఃఖాన్ని కలిగిస్తుంది అని దీని భావం. ఇలాటి సర్వలఘు (పాదాంతపు గురువు తప్ప) కందమొకటి పోతన భాగవతములో కూడా ఉంది (అడిగెదనని కడు వడి …, భాగవతము 8.103). బహుశా నన్నెచోడుని పై పద్యం పోతనకు స్ఫూర్తి నిచ్చిందేమో?