కం. గిరిసుత మై కామాగ్నియు
హరుమై రోషాగ్నియుం దదంగజుమై ను-
ద్ధుర కాలాగ్నియు రతిమై
యురు శోకాగ్నియును దగిలి యొక్కట నెగసెన్ (5.52)
పొరలు పొరలుగా భావాలు ఈనాటి కవిత్వములోనే కాదు, ఆనాటి కవిత్వములో కూడ ఉన్నవి. ఇక్కడ నాలుగు పాదాలలో నలుగురికి నాలుగు విధాలైన అగ్గి. మన్మథుని ప్రభావమువల్ల పార్వతి దేహము కామాగ్నితో కందిపోతుంది. ఇక పోతే శివుడి దేహము భావాతీతుడైన తన్ను కూడ తికమకలు పెట్టించిన మన్మథునిపైని రోషాగ్నితో రేగిపోతుంది. ముక్కంటి మూడవ కన్ను తెరిచాడు. కాలుని అగ్నితో మదనునికి కాలము నిండింది. దీనినంతా చూస్తున్న రతి దేహము శోకాగ్నితో కంపించింది. ఈ నాలుగు అగ్నిశిఖలు కలిసి ఒక్కటై పైకి లేచినవంట.
కం. జలవాసులైన హరి ల-
క్ష్ములు వర్షనిశావసానమున మేల్కని క
న్నులు విచ్చి చూచినట్టులు
జలజోత్పల రుచులు వెలసె శారదవేళన్ (6.113)
దీని అర్థము – శరత్కాలములో తామరలు, కలువలు అప్పుడే వర్షాకాలము అనే రాత్రికాలపు యోగనిద్రనుండి లేచిన జలవాసులైన విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కన్నులవలె ఉన్నాయట. ఇది నా దృష్టిలో ఒక గొప్ప పద్యము. ఎందుకంటే, సామాన్యముగా మనము పద్మాక్షుడు, ఇందీవరలోచన అనే పదాలను వాడుతూ ఉంటాము. అనగా ఆ పూల అందాన్ని, సాదృశ్యాన్ని కన్నులకు ఆపాదిస్తాము. కాని ఇక్కడ దానికి విలోమముగా ఉన్నది కవి భావన. కళ్ళు పూలలా లేవు. పూలే కళ్ళలా ఉన్నాయట.
నన్నెచోడుడు వ్రాసిన లయగ్రాహి, లయహారిణులు కూడా వృత్తౌచిత్యములో తీసిపోవు. లయనిలయుడైన ఆ నటసార్వభౌముని స్తుతికి ఈ వృత్తాలు ఉచితమైనవే కదా! కింద అట్టి లయగ్రాహి ఒకటి –
ల. తాళరుతి గీతిరుతి మేలి తత వాద్యరుతి చాల రసవంతమయి యోలి నులియం, ద
త్తాలగతి మెట్టుచును గేలఁ జరు లిచ్చుచును జాలి యనురాగమునఁ గ్రాలుచు సుఖాబ్ధిం
దేలుచును మై మఱచి వ్రాలుచును గెత్తుచును లోలగతి నేత్ర భుజ చాలనతోఁ బ్రే
తాలయమునందు సుఖలీల నెఱసంజ ననుకూలగతి నాడు శివు శూలి నుతియింతున్ (2.101)
తాళధ్వనులు, గీతధ్వనులు, శ్రేష్ఠమైన వాద్యనాదములు, ఎంతో రసవంతముగా ధ్వనించుచుండగా, ఆ తాళగతి కనుగుణముగా ఆడుచు, చేతులతో చప్పట్లు చేస్తూ కరుణతో, ప్రేమతో పొంగిపోతూ, ఆనందసముద్రములో ఒడలు మరచి సోలుచూ, గంతులు వేస్తూ, చలిస్తున్న కన్నులతో, భుజాలతో స్మశానములో నిండు సంజలో అనువుగా నాట్యము చేసే ఆ శివుని శూలధారిని పొగడుతాను అన్నాడు కవి యిక్కడ. సంగీతమునుగురించి, నాట్యాన్నిగురించి చోడునికి గల ప్రావీణ్యత ఈ పద్యములో విదితమైనది.
చాలా చోటులలో తరువోజను తరుపద అని నన్నెచోడుడు పేర్కొంటాడు. తరువోజ స్త్రీల దంపుళ్ళ పాట అని భావన. దంచడానికి వాడే రోకలి చెట్టు కొయ్యతో చేసిందే కదా. అది తరువైతే, రోకళ్ళ పాట తరుపదమవుతుంది గదా! అందుకే చోడుడు తరువోజను తరుపదమని పిలిచాడని నా ఊహ. కొన్ని తరువోజలు ప్రత్యేకముగా స్త్రీల కోసం కేటాయించబడి నట్లున్నాయి. అట్టి దొకదానిని కింద చదవండి. కామదహనం పిదప రతీదేవి శోకాన్ని కాళిదాసు వియోగినీవృత్తములో [18] ఒక సంపూర్ణ ఆశ్వాసములో విశ్లేషించాడు. నన్నెచోడుడు ఒక చిన్న తరువోజలో ఆ శోక సంఘటన జరిగిన వెంటనే రతి స్పందించిన విధాన్ని చెబుతాడు.
తరు. కాయజుఁ డా యగ్నిఁ గాలెనొ నెఱయఁ గాలంగ నెడ యెద్ది? కడు భీతిఁ
బాఱి పోయెనో? ననుఁ బెట్టి పోవునే? కడచి పోయిన నీ భస్మపుంజ మెక్కడిది?
మాయయో యిది? యని మది యఱఁ బొదల మ్రాకుల చెట్టుల మఱుపునఁ గలయ
నా యింతి భ్రమగొని యడలడి సంశయాకులచిత్తయై యాత్మేశు రోసె (5.61)
శివుడు మూడవ కన్ను తెరిచాడు, ఆ అగ్గిలో మన్మథుడు బుగ్గి అయినాడు, మిగిలిందల్లా అతడుండిన చోట ఒక బూడిద కుప్ప మాత్రమే. అది ఒక క్షణం ముందు అతడు అక్కడ ఉన్నాడన్న విషయానికి గుర్తు. మన్మథుని భార్య రతి అక్కడికి వచ్చింది. కాయజుడు అగ్నిలో కాలిపోయాడా అని తన్ను తానే ప్రశ్నించుకొన్నది. అయితే అలా ఒక్క క్షణంలో కాలిపోవడానికి అవకాశం ఉందా? ఒక వేళ భయపడి పారిపోయాడేమో? అలా ఎన్నటికీ జరుగదు, నన్ను వదలి తాను వెళ్ళిపోతాడా, అది అసంభవం. అలా వెళ్ళిపోతే ఇక్కడ ఉండే ఈ బూడిద కుప్ప మరెవరిది? ఒక వేళ ఇదంతా తన కళ్ళ ముందర జరుగుతుండే ఒక మాయ యేమో? అలా ఎన్నో ఆలోచనలతో పొదలను, చెట్లను కలయ జూడసాగింది. ఆమె భ్రాంతి, దుఁఖము, సందేహము మున్నగు వివిధ భావాలతో సతమమవుతూ తన ప్రాణనాథుడైన మన్మథుని మరణాన్ని తలచి చింతిస్తుంది.
ఛందోవిశేషాలు – ముద్రాలంకారం
పద్యపు పేరు పద్యములో దొరలితే దానిని ముద్రాలంకారము అంటారు. సామాన్యముగా ఛందోగ్రంథాలలో వృత్తపు ఉదాహరణ పద్యాలలో ఈ ముద్రాలంకారము కనబడుతుంది. దీనిని పంపాది కన్నడ కవులు విరివిగా వాడారు. పంపభారతమునుండి ఒక ఉదాహరణ (13)
మ. బక కిమ్మీర జటాసురోద్ధత జరాసంధర్కళం సంద కీ
చకరం నూర్వరుమం పడల్వడిసిదీ, త్వచ్చండ దోర్దండ ము
గ్ర కురుక్ష్మాపమహీరుహప్రకరమం మత్తేభవిక్రీడిత
క్కె కరం పోల్వెగె వందు భీమ రణదొళ్ నుర్గాడదేం పోకుమే
– పంపకవి, విక్రమార్జునవిజయం, 9.25
బకుడు, కిమ్మీరుడు, జటాసురుడు, జరాసంధుడు, కీచకుడు మున్నగు నూరుగురిని పోరిలో నేల గూల్చిన భయంకరమైన నీ భుజదండాలు ఉగ్రులైన కురురాజులనే చెట్టులతో ఏనుగులలా యుద్ధభూమిలో ఆటాడుకొనకుండా ఉంటుందా అని అర్థం దీనికి. కన్నడ సంప్రదాయాన్ని అనుసరించిన చోడుడు కూడా ముద్రాలంకారాన్ని మరువలేదు. నేను ఇంతకు ముందే ముద్రాలంకారాలతో కూడిన ఉత్సాహ మత్తేభవిక్రీడిత పద్యాలను తెలిపాను. ఇప్పుడు మరి కొన్ని –
మ.కో. మెత్త మెత్తన క్రాలు దీవు సమీరణుండ, మనోభవుం
డెత్తకుండఁగ వేగకూడఁగ నెత్తు, మెత్తక తక్కినన్
జత్తు సుమ్ము వసంతుచే నని చాటునట్లు చెలంగె నా
మత్తకోకిల లారమిం గడు మాసరంబగు నామనిన్ (4.108)
అందమైన ఆమనివేళలో ఆ తోటలోని మత్తకోకిలలు “ఓ పవనమా, నీవేమో మెల్లమెల్లగా వీస్తున్నావు. మన్మథుడు నీపై దండయాత్ర చేయకముందు నీవే త్వరగా వానిపై దండెత్తు, అలా చేయకపోతే వసంతుడు నిన్ను చంపుతాడు, జాగ్రత్త సుమా” అని హెచ్చరించేటట్లు ధ్వనులు చేశాయట.