ఆశ్వాసాంత పద్యాలు
కావ్యాలలో సామాన్యముగా ఆశ్వాసాంత పద్యాలు సంబోధన రూపములో ఉంటుంది. నన్నయ సభాపర్వాంతములో రాసిన రాజరాజనరేంద్రుని ఉద్దేశించి రాసిన పద్యము –
ఉత్సాహ. రాజవంశవార్ధిచంద్ర, రాజదేవ, నిత్యల
క్ష్మీజయాభిరామ, ధర్మమిత్త్ర, విద్వదం
భోజవనపయోజమిత్త్ర, భూరి కీర్తి కౌముదీ,
రాజితత్రిలోక నిఖిలరాజ, నిత్యపూజితా!
– నన్నయభట్టు, సభాపర్వము (2.322)
కాని నన్నెచోడుని ఆశ్వాసాంత పద్యాలు విభక్తులతో అంతమవుతాయి [16]. అట్టి పద్యాలకు ఒక ఉదాహరణ –
వనమయూరము. మేరునగధీరు, నిరమిత్రు, సుచరిత్రున్,
వారిధిగభీరు, నిరవద్యు, జనవంద్యున్,
జారుతరమూర్తి, నతిశాంతు, గుణవంతున్,
మారహరు, సర్వజనమాన్యు, మునిమాన్యున్. (3.113)
మేరుపర్వతము బోలు ధైర్యవంతుని, శత్రువులు లేనివానిని, విమల చరిత్రుని, సముద్రమువలె లోతైన వానిని, అనింద్యుని, జనవంద్యుని, అందమైనవానిని, శాంత స్వభావుని, గుణవంతుని, మన్మథవిజేతను, జనులందరిచే గౌరవించబడువానిని, మునులచే మాన్యుడైన మల్లికార్జునుని అభినందింస్తున్నాడు కవి యిక్కడ.
కుమారసంభవ కథ
కావ్య కథనాన్నిగురించి నన్నెచోడుడే అవతారికలో ఇలా చెప్పాడు-
మ. సతి జన్మంబున్ గణాధీశ్వరు జననము దక్షక్రతు ధ్వంసముం బా
ర్వతి జన్మంబున్ భవోగ్రవ్రతచరితయు దేవద్విషత్ క్షోభమున్ శ్రీ
సుత సంహారమ్ము భూభృత్సుత తపము నుమాసుందరోద్వాహమున్ ద
ద్రతిభోగంబుం గుమారోదయము నతఁడరిం దారకుఁబోర గెల్వున్(1.68)
సతీదేవి జన్మము, గజముఖుని పుట్టుక, దక్షుని యాగము దాని వినాశనము, పార్వతి పుట్టుక, ఈశ్వరుని ఘోర తపస్సు, తారకాసురుని దారుణ చర్యలు, కామదహనము, పార్వతి తపస్సు, వారి పెళ్ళి, ఆదిదంపతుల కామకేళి, కుమారసంభవము, తారకాసుర సంహారము అనే పన్నెండు అంశాలు ఈ కావ్యములోని పన్నెండు ఆశ్వాసాలలో కథాభాగములు. ఈ కథలో కొన్ని చమక్కులు ఉన్నాయి. నన్నెచోడుని కుమారసంభవము కాళిదాసుని కుమారసంభవమునకు అనువాదము కాదు. ఇది స్వతంత్ర కావ్యము. ఇతని కుమారసంభవము ఉద్భటుని కుమారసంభవముపైన ఆధారపడినది. ఇందులోని కథ తమిళదేశములో వ్యాప్తిలో ఉండే కథ. ఇందులోని వినాయకుడు పార్వతి పిండిబొమ్మకు ప్రాణాలు పోసిన చిన్నవాడు కాడు. సతిపతుల వనవిహారములో ఏనుగుల సంభోగాన్ని చూచిన దాక్షాయణికి తాము కూడ పెనవేసికొన్న ఏనుగులలా సరసులో ఆనందిస్తే బాగుంటుందనే ఆలోచన కలిగింది. దాని ఫలితమే గజముఖుని జననము. ఈ ఘట్టాన్ని అతి సుందరముగా మత్తేభవిక్రీడితవృత్తములో ముద్రాలంకారముతో నన్నెచోడుడు వ్రాసిన తీరును గమనించండి –
మ. హృదయాహ్లాదముతోడఁ బాయక సదా నైక ప్రకారంబులన్
మదనాసక్తిఁ బెనంగుచున్న విలసన్మత్తేభవిక్రీడితం
బది దాక్షాయణి సూచి కౌతుకరతైకా లీన భావాభిలా
షదృగత్యుజ్జ్వల దీధితుల్ నెఱపె నీశాననాబ్జంబుపైన్(1.101)
షణ్ముఖుని జననవృత్తాంతము కూడా ఇందులో చిత్రముగా వివరించబడినది. అగ్నిదేవుడు శివుని చూడ వచ్చాడు. ఆ సమయంలో ఈశ్వరుడు, పార్వతి కామక్రీడలో నున్నారు. చెప్పకుండా, చేయకుండా అలా వచ్చిన అగ్నిపైన శివుడు తన వీర్యాన్ని చల్లుతాడు. అగ్ని దాని మంటకు తాళజాలక బ్రహ్మ సలహా ప్రకారము శరవణసరసికి వస్తాడు. అక్కడ సప్తఋషుల భార్యలు నగ్నంగా జలక్రీడ చేస్తున్నారు. వారిని చూచి అగ్ని కామాతురుడయ్యాడు. అగ్నిని చూచిన తక్షణం అరుంధతి బట్టలు కట్టుకొంటుంది. కాని మిగిలినవారు అగ్నితో తృప్తి పొందుతారు. ఆ సమయంలో శివుని వీర్యం వారి గర్భములలోకి ప్రవేశిస్తుంది. ఈ ఆరుగురు భయంతో, అవమానంతో తమ గర్భపిండాలను ఆ శరవణసరసిలో తామరాకులలో వదలి ఇంటికి వెళ్తారు. వారి పతులు వారిని తిరస్కరించగా బ్రహ్మ శివుని వీర్యాన్ని మోసినందులకై జ్యోతిర్లోకములో కృత్తికలుగా ప్రకాశించమని వారికి వరం అనుగ్రహిస్తాడు. శరవణసరసిలోని ఆరు పిండాలు ఒక్కటై షణ్ముఖరూపాన్ని దాల్చి పుట్టుతుంది. అలా జరుగుతుంది కుమారస్వామి జననము.
కుమారుని జననాన్ని వర్ణిస్తూ చోడుడు రాసిన ఉత్సాహవృత్తాన్ని వ్యాసారంభములో మీకు తెలియజేశాను. ఇలా కుమారసంభవకథ అతి నూతనమైనది, విలక్షణమైనది. కాళిదాసు కుమారసంభవములోని కుమారుడు నేరుగా శివునికి, పార్వతికి పుట్టినవాడు, కాని నన్నెచోడుని కుమారుని తలిదండ్రులు ఎవరు? శివుని వీర్యమువల్ల పుట్టాడు కాబట్టి శివుడు తండ్రియా, లేక వీర్యాన్ని మోసిన అగ్ని తండ్రియా? అదే విధముగా కృత్తికలుగా మారిన ఋషిపత్నులు తల్లులా, లేక వీర్యానికి దోహదమైన పార్వతియా? వీటిపైన పుస్తకాలనే రాశారు [17]. గీతలో కృష్ణుడు సేనానినామహం స్కందః (భగవద్గీత, 10.24) అని అంటాడు. కుమారస్వామి హిందూదేవతలలో ఒక ముఖ్య దైవము, తమిళనాడులో స్కందునికి గుడులు, పండుగలు, వ్రతాలు మున్నగునవి సర్వసామాన్యము.
కుమారసంభవకావ్యము ఛందోరీతిగా అత్యుత్తమమైన గ్రంథము. అందులోని కొన్ని విశేషాలను క్లుప్తముగా ఇక్కడ తెలియబరుస్తాను. ఇంతకు ముందే నన్నెచోడుని కొత్త పంథాగురించి చెప్పాను. కావ్యారంభములో షష్ఠ్యంతాలను వ్రాయడం తెలుగు సాహిత్యానికి నన్నెచోడుడు ప్రసాదించిన ఒక గొప్ప కానుక. అలాగే మంగళమహాశ్రీవృత్తముతో కావ్యాన్ని అంతము చేయడం.
ఛందోవిశేషాలు -వృత్తౌచిత్యము
వృత్తౌచిత్యాన్ని పాటించడములో నన్నెచోడునిలాటి కవి లేడంటే అది అతిశయోక్తి కాదు. మూడింటికి ఒకటికన్న ఎక్కువగా కందపద్యాన్ని ఈ కావ్యంలో మనము చదువవచ్చు. పన్నెండు గీతులలో ఆర్యాగీతి ఒకటి. దానినే కందముగా కన్నడ, తెలుగు సాహిత్యాలలో స్వీకరించారు. కందము ప్రాకృతములోని స్ఖంధ అ నుండి పుట్టినది. కుమారసంభవము స్కందుని చరిత్ర. స్కందుని ద్రావిడభాషలో కందన్ అంటారు. మూడు భాషలను ఎరిగిన చోడుడు అందుకేనేమో ఈ సార్థకనామ పద్యాన్ని ఈ కావ్యంలో వాడాడు. పార్వతి ఆర్య కనుక ఆర్యాగీతిని వాడాడు అంటారు మరికొందరు [8]. దీనికి నిదర్శనముగా పార్వతి సౌందర్యాన్ని వర్ణిస్తూ వరుసగా 31 కందపద్యాలు మనకు ఈ కావ్యంలో కనబడుతాయి. కందాన్ని అల్లడములో అతని కౌశల్యము అపారము. ఉదాహరణకు రెండు మూడు కందపద్యాలను ఇక్కడ ఉదహరిస్తాను.
కం. తన జనకుఁడురు స్థాణువు,
జనని యపర్ణాఖ్య, దా విశాఖుండనఁగాఁ
దనరియు నభిమతఫలముల
జనులకు దయ నొసఁగుచుండు షణ్ముఖుఁ గొలుతున్ (1.8)
తండ్రి పెద్ద మోడు, తల్లి ఆకులు లేనిది, తానో కొమ్మలు లేనివాడు. అలా కోరికలను తీర్చెడివాడైన ఆరుముగములవానిని పూజిస్తున్నాను. మోడైన చెట్టుకు, ఆకులు లేని చెట్టుకు పుట్టిన కొమ్మలులేని చెట్టు అభీష్టములను తీర్చే కల్పవృక్షమట. ఇక్కడ స్థాణువు అంటే శివుడు, అపర్ణ అంటే పార్వతి, విశాఖుడు అంటే కుమారస్వామి. ఇలా శ్లేష, విరోధాభాస అలంకారాలను వాడాడు చోడకవి.