కవిరాజశిఖామణి

కాని యిక్కడ మార్గకవిత అంటే ఏమిటో, దేశికవిత అంటే ఏమిటో? సంగీత శాస్త్రములో మార్గసంగీతము అంటే శాస్త్రీయ సంగీతమని, దేశి అంటే సామాన్యముగా ప్రజలు పాడుకొనేది అని అభిప్రాయము ఉంది [11]. అలాగే మార్గకవితంటే సంస్కృత కవిత్వమా? దేశికవిత అంటే దేశి ఛందస్సుతో నిండిన తెలుగు కవిత్వమా? కన్నడములో మనకు ఇప్పుడు లభించిన గ్రంథాలలో అతి పురాతనమైనది నృపతుంగుని కవిరాజమార్గము [12]. దానిని కన్నడములో ‘మార్గము’ అనుట వాడుక. ఇది ఒక లక్షణగ్రంథము. మార్గకవిత అంటే కవిరాజమార్గములో చెప్పబడిన రసాలతో కూర్చిన కవిత లాటిదా అనే సందేహం నాకు వస్తుంది. కవిరాజమార్గం కూడా చంపూకావ్యమే. ఇందులో కూడా సంస్కృత, దేశి పద్యాలు ఉన్నాయి. ఇందులో కూడా చిత్రకవిత్వం ఉన్నది. పంపభారతములో కూడా మార్గదేశి కవితల ప్రస్తావన ఉన్నది. వస్తుకవిత అనే పదం నాగవర్మ ఛందోంబుధిలో, పంపకవి భారతములో కూడా వాడబడినది. కవిత వర్ణకము (వర్ణనలతో), వస్తుకము (కథతో) అని రెండు విధాలు. కథాప్రధానమైన కవిత్వము వస్తుకవిత యేమో? తరువాత వస్తుకవితను గురించి రేచన కవిజనాశ్రయములో, విన్నకోట పెద్దన కావ్యాలంకారచూడామణిలో ప్రస్తావించారు [9]. వస్తుకవిత అంటే సహజమైన, అకృత్రిమమైన కవిత్వం అని కూడ అనుకోవచ్చు.

సర్వమంగళము

కావ్యాలను శ్రీకారముతో ప్రారంభించుట వాడుక. నన్నయ కూడా భారతాన్ని “శ్రీవాణీగిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు…” అని ప్రారంభించాడు. నన్నయ భారతాన్ని తెలుగులో రాసినా మొదటి పద్యం సంస్కృతములో రాశాడు. కాని నన్నెచోడుడు కుమారసంభవాన్ని కింది తెలుగు పద్యంతోనే ప్రారంభించాడు.

స్ర. శ్రీవాణీంద్రామరేంద్రార్చిత మకుటమణి శ్రేణిధామాంఘ్రిపద్మా
     జీవోద్యత్కేసరుండాశ్రిత జనలసితాశేష వస్తుప్రదుం డా
     దేవాధీశుండు నిత్యోదితుఁడజుఁడు మహాదేవుఁడాద్యుండు విశ్వై
     కావాసుండెప్పుడును మాకభిమతములు ప్రీతాత్ముఁడై యిచ్చుగాఁతన్(1.1)

విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు నమస్కారము చేయగా వారి కిరీటాలలోని మణుల కాంతులు అడుగుదామరల కేసరములవలె ప్రకాశించుచున్నవి. ఆశ్రయించినవారి కోర్కెలను తీర్చువాడు, నిత్యప్రకాశితుడు, పుట్టుక లేనివాడు, ఆది దేవుడు, ఈశ్వరుడు, విశ్వమందంతట ముఖ్యవాసుడు ఐన ఆ దేవాధీశుడు సదా ప్రసన్నుడై మా అభీష్టములను తీర్చుగాక అని అర్థం కుమారసంభవములోని ఈ మొదటి పద్యానికి.

ఇది అతనికి జాను తెనుగుపై గల మమకారాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ ఒక విషయం తప్పక చెప్పాలి. స్రగ్ధరా వృత్తపు గణాలు – మ-ర-భ-న-య-య-య. ఈ పద్యం “మ-ర” గణాలతో ప్రారంభమయినది, దీనిని మొదటి పద్యముగా చోడుడు రాశాడు, అందువల్ల యుద్ధంలో “మర”ణించాడు అనే ఒక కథ ఉంది. అలా ఒక పద్యాన్ని కూడా అధర్వణాచార్యులు తన ఛందస్సులో రాశాడని [1], అందువలననే తరువాతి కవు లెవ్వరూ స్రగ్ధరను మొదటి పద్యముగా రాయలేదు అని చెబుతారు. కాళిదాసాది కవులు సంస్కృతములో స్రగ్ధరలో దేవుని స్తుతి చేస్తూ మొదటి పద్యం రాశారు. వారెవ్వరూ అకాలమృత్యువు పాలయ్యారని వదంతులు లేవు. నన్నెచోడుడు వృత్తౌచిత్యమును పాటించుటలో అందెవేసిన చేయి. స్రగ్ధర అంటే మాలాధారి అని అర్థము. పెళ్ళికొడుకైన ఈశ్వరుడు మాలాధారియే గదా? పెళ్ళికూతురైన పార్వతి కూడా స్రగ్ధరయే. వారి మంగళోద్వాహాన్నిగురించిన కావ్యం కనుక స్రగ్ధరతో ఆరంభించియుండవచ్చు. కొర్లపాటి శ్రీరామమూర్తిగారేమో మానవల్లి రామకృష్ణకవి తన పేరిలోని మా-రా లను సూచించుటకై మ-ర గణాలతో ఆరంభమయ్యే స్రగ్ధరను ఎన్నుకొన్నారన్నారు [7]. వారి దృష్టిలో నన్నెచోడుడనే కవియే లేడుగా! లోకో భిన్న రుచిః అని అందుకే అంటారు కాబోలు! మంగళాది మాత్రమే కాదు, మంగళ మధ్యమమై, మంగళాంతమై ఉండాలి కావ్యం. అందువలననే నన్నెచోడుడు తన కావ్యాన్ని మంగళమహాశ్రీ వృత్తముతో అంతం చేసినాడు. దీనినిగురించి విపులముగా ఇంకొక వ్యాసములో చర్చిస్తాను.

ఇష్టదేవతాస్తుతి

ఇష్టదేవతాస్తుతిని కూడా ఈ కవియే ప్రారంభించినట్లుంది. నన్నయ ఒక రెండు పదాలలో “హరిహరాజగజాననార్కషడాస్య మాతృసరస్వతీ గిరిసుతాదిక దేవతాతతికిన్ నమస్కృతి సేసి” (ఆది పర్వము – 1.21) భారత రచనకు పూనుకొన్నాడు. నన్నెచోడుడు ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క పద్యం రాశాడు. అందులో కన్నడ భారతములోని పంపకవివలె [13] మన్మథుని కూడా స్తుతించాడు. ఆ పద్యము

కం. హరుఁ డాదిగ సకల చరా
        చరమయ జీవాళి నెల్ల సతతముఁ గామా
        తురులుగ వశగతిఁ జేసిన
        మరుఁ డీవుత నఖిలవశ్యమతి మత్కృతికిన్(1.9)

చరాచర ప్రపంచములో ఈశ్వరుడు మొదలుకొని ప్రాణికోటి కంతటినీ కామాతురులుగా తన వశం చేసికొన్న ఆ మన్మథుడు నా కావ్యానికి అందరూ వశం చేసికొనే శక్తిని ప్రసాదించుగాక! కావ్యములో మన్మథునికి ఒక ముఖ్య పాత్ర ఉంది. కావున స్మరుని స్మరించడం సబబే కదా! తరువాత కేతన కూడా మన్మథస్తుతి చేశాడు. అంతే కాదు, సూర్యుని కూడా చోడుడు వేడుకొన్నాడు.

షష్ఠ్యంతములు

నన్నెచోడుడు సృష్టించిన మరొక పద్ధతి ఇప్పటిప్పటివరకు కావ్యాలలో కొనసాగింది. అది కథాప్రారంభానికి ముందు షష్ఠ్యాంతాలలో కృతిభర్తను పొగడి కావ్యాన్ని అంకితం చేయడం. దీనినిగురించి [14] నేను సోదాహరణముగా ఈ మధ్య చర్చించియున్నాను. ఇతడు ఆశ్వాసాంత పద్యాలను కూడా విభక్త్యంతముగా వ్రాసినాడు కాబట్టి అవతారికాంతమును కూడా షష్ఠీవిభక్త్యంతముగా వ్రాసియుండవచ్చు. కుమారసంభవమునుండి మచ్చున కొక ఉదాహరణ –

కం. వినుత బ్రహ్మర్షికి, న-
        త్యనుపమ సంయమికి, సజ్జనాభరణునకున్,
        మనుజాకార మహేశున,
        కనుపమ చరితునకు, మల్లికార్జున మునికిన్ (1.66)

నన్నెచోడుడు కుమారసంభవమును తన గురువైన జంగమ మల్లికార్జునకు అంకితం చేసినాడు. అంతే కాకుండా తన గురువునకు, ఈశ్వరునికి అభేద భావాన్ని కల్గించి అతడిని ఈశ్వరునిగా భావించి షష్ఠ్యంతాలను వ్రాసినాడు. అందుకే పై పద్యములో మనుజాకార మహేశునకు అని చెప్పినాడు. మల్లికార్జున మునికి మహేశ్వరునకు అద్వైతత్వమును కవి ఆపాదించాడు. పంపకవి కన్నడములో రాసిన విక్రమార్జునవిజయము అనే నామాంతరముగల భారతములో కూడా ఇలాగే ఉంది [15]. అందులోని నాయకుడైన అర్జునునికి అంకితమిచ్చిన రాజుకు అభేదత్వాన్ని కలిగించి అర్జునుని గుణాలను రాజుకు ఆపాదించాడు పంపకవి. కన్నడములో ప్రావీణ్యము గడించిన చోడునికి ఇది బాగా తెలిసి ఉంటుంది. తరువాతి కాలంలో తిక్కన కూడా నిర్వచనోత్తర రామాయణాన్ని రాజుకి అంకితము చేసి, అందులోని కథానాయకుడైన శ్రీరామునికి, మనుమసిద్ధికీ అభేదత్వాన్ని చూపినది గమనార్హము. నన్నెచోడుడు శివకవియైనా విష్ణుద్వేషి కాడు. బ్రహ్మవిష్ణువులు శివుని అంశములే అని ఈ కవి తలంపు. ఈ కవికి ఎక్కడ చూచినా శివుడే కనిపిస్తాడు. మన్మథుడు మామిడిచెట్టును చూచి శివుడని భ్రమించిన తీరును గమనించండి.

సీ. పలకెడు కారాకు లలితాస్థి చయముగా,
        సోలు కొమ్మలు పలు కేలుగాఁగ,
        బాల పల్లవములు వ్రేలు కెంజడలుగా,
        పెనఁగు తీఁగలు దొడ్డ ఫణులు గాఁగఁ,
        గలకంఠ నికరంబు గళమునఁ గప్పుగాఁ,
        బుప్పొడి మేన విభూతి గాఁగ,
        ఫలములు వరదాన ఫలములుగా, నలి
         మాలికల్ రుద్రాక్ష మాలికలుగ,

 

ఆ. శంభుమూర్తిఁ దాల్చి సహకార భూరుహ
         చక్రవర్తి నవవసంతవేళ
        నతిశయిల్లుచుండె నక్కడఁ గని మది
        నుదరిపడి మనోజుఁ డోసరింప (4.101)

రంగులు మారే పండుటాకులు ఎముకల ప్రోవును తలపించిందట, వాలే కొమ్మలు ఎన్నో చేతులవలె ఉండినవట, తలిరాకులు వేలాడే ఎర్రటి జడలవలె తోచిందట, కోకిలల గుంపు కంఠమునందలి మచ్చవలె కనబడిందట, పుప్పొడి వీబూదివలె తేలియాడిందట, పండ్లు దానఫలములవలె ఆకారాన్ని దాల్చాయట, తుమ్మెదల బారు రుద్రాక్షమాలికలవలె కనబడిందట, ఆ వసంతకాలములో శివుని రూపాన్ని దాల్చినట్లుండిన మామిడిచెట్టును చూచి శివుని జయించాలని బయలుదేరిన మన్మథుడు బెదిరిపడ్డాడట.