కవిరాజశిఖామణి

ప్రబంధపరమేశ్వరుడు

తెలుగులో ప్రబంధయుగం నన్నెచోడునితో ప్రారంభమైనదని చెప్పడములో సందేహం లేదు. ఎఱ్ఱాప్రెగడకు ప్రబంధపరమేశ్వరుడని బిరుదు ఉన్నా, మనుచరిత్ర ప్రబంధ యుగానికి నాందీవాక్యం పలికినా, కుమారసంభవములో ప్రబంధానికి కావలసిన లక్షణాలు అన్నీ ఉన్నాయి. చోడుడే అష్టాదశ (అరణ్యము, జలక్రీడ, సూర్యోదయం, చంద్రోదయం, పుత్రోదయం, మంత్రాలోచనలు, యాత్ర, సంభోగము, రాజు, యుద్ధం, సముద్రము, సురాపానము, ఋతువులు, నగరము, వివాహము, కొండ, విరహము, రాయబారము) వర్ణనలతో తాను ఈ పుస్తకాన్ని రాస్తున్నానని ఇలా చెబుతాడు –

కం. వన జలకేళీ రవి శశి
        తనయోదయ మంత్ర గతి రత క్షితిప రణాం
        బునిధి మధు ఋతు పురోద్వా
        హ నగ విరహ దూత్య వర్ణ నాష్టదశమ్మున్(1.44)

ఈ విషయాన్నే విన్నకోట పెద్దన తన కావ్యాలంకారచూడామణిలో [9]కూడా వివరిస్తాడు. అప్పకవి వీటికి మరిన్నీ నాలుగు (వేట, మౌనీంద్ర పుణ్యాశ్రమము, కన్యాంగ సౌందర్య కథనము, దౌహృదము) కలిపాడు [10]. అష్టాదశ వర్ణనలను అన్నీ ఇక్కడ వ్యాఖ్యానించడానికి చోటు లేకపోయినా, సురాపానం గురించి ఒక పద్యాన్ని మీతో పంచుకొంటాను. ఏ పేరుతో పిలిచినా గులాబీ పూవే కదా! బహుశా అలాటిదే మదిర కూడా అంటాడు కవిరాజు.

చం. అమరులు త్రావుచో నమృతమందురు దీని, నహివ్రజం బజ
        స్రముఁ గొని యానుచో నిది రసాయనమందురు, భూసురౌఘ మా
        గమవిధి సోమపాన మని గైకొని యానుదు, రెందుఁ జక్రయా
        గమునెడ వస్తువందు రిది కౌళికు, లీ సుర పేర్మి వింతయే!(9.130)

దేవతలు తాగితే అది అమృతము అవుతుంది, పాతాళంలోని నాగులు తాగితే అది ఒక రసౌషధము అవుతుంది, ఇక బ్రాహ్మణులు శాస్త్రోక్తముగా దీనిని సోమపానమని తాగుతారు, ఇక శాక్తేయులకు శ్రీచక్రయాగ సమయములో ఇది వస్తువవుతుంది. ఎందరు ఎన్ని పేరులతో తాగినా, మద్యపు గొప్పదనం వింతయే సుమా! ముల్లోకాలలో ఇది ముచ్చటైనదే అని ఈ రాజకవి అంటాడు. మరి రాజు కదా, రాజు రత్నహారి, అతనికి దొరకని మధువులుంటాయా?

తాను వ్రాయబోయే గ్రంథాన్నిగురించి ఇలా చెప్పుకొన్నాడు –

చం. రవికులశేఖరుండు కవిరాజశిఖామణి కావ్యకర్త స
        త్కవి భువి నన్నెచోడుఁ డటె, కావ్యము దివ్యకథం గుమార సం
        భవ మటె, సత్కథాధిపతి భవ్యుఁడు జంగమ మల్లికార్జునుం
        డవిచలితార్థ యోగధరుఁ డట్టె, వినం గొనియాడఁ జాలదే(1.57)

సూర్యవంశపు రాజు సత్కవి కవిరాజశిఖామణి నన్నెచోడుడు కావ్యకర్త, మరి కావ్య వస్తువో దివ్యమైన కుమారసంభవ వృత్తాంతము, ఇక కథానాయకుడో భవ్యుడు, అచలిత యోగియైన జంగమ మల్లికార్జునుడు, దీనిని విన్నవారు పొగడకుండ ఉండగలరా? ఈ పద్యమే బహుశా పోతనను పలికెడిది భాగవతమట అనే పద్యాన్ని రాయడానికి ప్రోత్సాహించిందేమో?

జాను తెనుగు

తెలుగు కవిత్వంలో మార్గ కవిత, దేశి కవిత, వస్తు కవిత, జాను తెనుగు అనే పదాలను నన్నెచోడుడు సృష్టించాడు. ఆ పదాల ఉపయోగాన్ని కింద గమనించవచ్చు. మొట్టమొదట మార్గకవిత పుట్టింది, తరువాత చాళుక్యరాజులు దేశికవితను తెలుగులో పుట్టించారు అనే భావంతో ఉన్న పద్యమును చూడండి-

కం. మును మార్గకవిత లోకం
        బున వెలయఁగ దేశికవితఁ బుట్టించి తెనుం
        గున నిలిపి రంధ్రవిషయం
        బునఁ జనఁ జాళుక్యరాజు మొదలుగఁ బలువుర్(1.23)

 

చం. సరళముగాఁగ భావములు జానుఁదెనుంగున నింపు పెంపుతోఁ
        బిరిగొన, వర్ణనల్ ఫణితి పేర్కొన, నర్థము లొత్తగిల్ల, బం
        ధురముగఁ బ్రాణముల్ మధు మృదుత్వ రసంబునఁ గందళింప న         క్షరములు సూక్తు లార్యులకుఁ గర్ణరసాయనలీలఁ గ్రాలగన్(1.35)

సహజముగా అందముగా పెనవేసికొనిన భావాలతో, అర్థవంతములైన మంచి పదాలతో, మృదు మధుర రసముతో ప్రాణము పోసికొని, మొలకెత్తి బుధజనుల చెవుల కింపుగా జాను తెలుగులో కావ్యం రాస్తానని పై పద్యంలో చెప్పుకొన్నాడు. అంటే తాను వాడే తెలుగు భాష అందరికీ అర్థమయ్యేటట్లు ఉంటుంది అన్నాడు కవి. జాను తెలుగు అంటే అచ్చ తెలుగని అనుకోరాదు.

సీ. మృదురీతి సూక్తు లింపొదవింప మేలిల్లు
        భావమ్ము నెలమిఁ బ్రీత్యావహముగ
        మెఱుగులఁ గన్నులు మిఱుమిట్లు వోవంగఁ
        గాంతి సుధాసూతి కాంతిఁ జెనయ
        వర్ణన లెల్లచో వర్ణన కెక్కంగ
        రసములు దళుకొత్తి రాలువాఱ
        దేశి మార్గంబులు దేశీయములుగా న-
        లంకారములఁ దా నలంకరింప

 

ఆ. నాదరించి విని సదర్థాతిశయమున
        బుధులు నెమ్మనమున నిధులు నిలుప
        వలవదే సమస్త వస్తుకవీశ్వర
        నూత్న రుచిర కావ్య రత్నవీథి(1.36)

మెత్తని మాటలు ఇంపునీయగా, మంచి భావాలు వికసించి ఆనందం కలిగించగా, మెరుపుతో చీకటి కమ్మిన కనులకు చంద్రుని వెన్నెలవలె కాంతి కలిగించగా, వర్ణనలు అన్నిచోట్ల మెప్పు పొంది నవరసాలు వన్నెతో ప్రవహించగా, దేశి మార్గ రీతులు దేశీయములైన అలంకారాలతో శృంగారించుకొనగా, వస్తువునే ప్రధానముగా నుంచుకొని వ్రాసిన కవిశ్రేష్ఠుల కావ్యాలనే రతనాల వీథిలో పండితులు ఆదరంచి విని తమ మనసులో నిధులని ఎంచుకొనరా ఈ కావ్యాన్ని అన్నాడు ఈ పద్యంలో.