సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా అవస్థలు పడేకంటే వేషాలే వెయ్యరాదా అని ముళ్ళపూడి వెంకటరమణ అనేవారట. ఆ విధంగా ఆదుర్తి తీసిన ‘దాగుడుమూతలు’ సినిమాలో ఒక డాక్టరు వేషం లభించింది. దాని తరవాత రామారావు వంటి పెద్దనటులతో తనకున్న పరిచయాల ద్వారా క్రమంగా చాలా సినిమాల్లో వేషాలు వెయ్యసాగారు. ఒక సందర్భంలో పి.పుల్లయ్య తీసిన ‘ప్రేమించి చూడు’లో అవకాశం వచ్చింది. దీన్ని గురించి కొంత కథ జరిగింది. తక్కిన వ్యాపకాలు ఎన్ని ఉన్నా కొండలరావు హాస్య ప్రియత్వం ఏ మాత్రం తగ్గలేదు. శ్రీకాకుళంలో తన చిన్నప్పటి తెలుగు మేస్టరు మిమిక్రీని ఆయన అందరికీ వినిపిస్తూ ఉండేవారు. మద్రాసులో మా ఇంట్లోనూ, బాపూ, రమణలున్న ఇతర ఇష్టాగోష్ఠుల్లోనూ ఇది తప్పక జరిగే వ్యవహారం. నాటక, సాహితీ రంగాల్లోని స్నేహితులేకాక చాలామంది సినీప్రముఖులు అది విని ఆనందించేవారు. ఇదెంతవరకూ వెళ్ళిందంటే ఆ రోజుల్లోనే ఆసక్తి పట్టలేక ఆరుద్ర శ్రీకాకుళం దాకా వెళ్ళి సదరు మాస్టార్ని కలుసుకుని మరీ వచ్చారు. ఎవరి మాటా వినిపించుకోకుండా, దబాయింపు ధోరణిలో “సాయ్లెన్స్” అని కేక పెట్టే తెలుగు మేస్టరుది ఒక వింత స్వభావం.
ఈ వైఖరి కలిగిన పాత్రగా ముళ్ళపూడి వెంకటరమణ ప్రేమించిచూడులో నాగేశ్వరరావు తండ్రి పాత్రకు డైలాగులు రాశారు. పి.పుల్లయ్యకు ఈ నేపథ్యమేమీ తెలియదు. రమణ మాట విని ఆయన కొండలరావును తన ఆఫీసుకు పిలిపించి, మొదటిసారిగా చూస్తూనే “గెటవుట్” అని కేకలేశారట. “ఇంత చిన్నవాడివి నాగేశ్వరరావుకు తండ్రిగా నువ్వేం పనికొస్తావు” అని పంపేశారట. రమణ సిఫార్సు చేసినట్టు తెలిసి కుటుంబరావుగారు కూడా కొండలరావును తనతో మళ్ళీ తన పాత మిత్రుడైన పుల్లయ్య దగ్గరికి తీసుకెళ్ళి, “ఇతని మిమిక్రీ నువ్వు చూడలేదు, నా మాట విని అతనికా వేషం ఇయ్యి” అని గట్టిగా చెప్పాకగాని పుల్లయ్య సరేననలేదట. చిత్రం రిలీజయాక ఆ కామెడీ పాత్ర అందరికీ నచ్చింది.
తక్కిన సినీనటుల్లాగా కాకుండా కొండలరావు తన నాటక, సాహితీరంగాల కృషిని విడిచి పెట్టలేదు. కుటుంబరావుగారి ద్వారా కొండలరావుకు చందమామవారి విజయచిత్ర సినీ మాసపత్రికలో ఎడిటర్గా ఉద్యోగం వచ్చింది. విజయచిత్రలో పాఠకుల ప్రశ్నలకు ఆయన జవాబులు రాసేవారు. ఒక పాఠకుడి ప్రశ్న: నా ఫోటో విజయచిత్రకు ముఖచిత్రంగా వేస్తే ఎలా ఉంటుంది? కొండలరావుగారి జవాబు: మీ ముఖంలా ఉంటుంది! అంతకుముందు ఆయన జ్యోతి మాసపత్రిక సంపాదకవర్గంలో ఉండేవారు. వివిధ పత్రికల్లో కథలూ, వ్యాసాలూ, సెటైర్లూ, నాటికలూ రాశారు. వాటి వివరాలు కింద చూడవచ్చు.
ఆయన హాస్యధోరణి ఎలాంటిదంటే కథ కంచికి అనే నాటికలో పాత్రల పేర్లు ఇవి: (అన్నమో) రామచంద్ర, (అరచేతిలో) వైకుంఠం, (ఆబాల) గోపాలం, (వల్లకాట్లో) రామనాథయ్య, (లోగుట్టు) పెరుమాళ్ళు, (నీతి) చంద్రిక వగైరా. ఆయన రాసి, దర్శకత్వం వహించిన నాలుగిళ్ళ చావిడి, పట్టాలు తప్పిన బండి, ప్రొఫెసర్ పరబ్రహ్మం మొదలైన నాటకాలు బాగా ప్రజాదరణ పొందాయి. పొట్టి ప్రసాద్, కాకరాల, నాగరాజారావు తదితరులు ఆయనకు మంచి సహనటులు. రాధాకుమారికి ముఖ్య పాత్రలుండేవి. ఒకవంక సినిమాపత్రిక పనులు చూస్తూ, రచనలు చేస్తూ, సినిమాలూ, నాటకాల్లో పాత్రలు పోషిస్తూ ఆయన నిత్యమూ బిజీగా ఉండేవారు. మద్రాసులో ఆయన నాటకాలు చూసిన దర్శకులు సినిమా వేషాలకు పిలిచేవారు. పట్టాలుతప్పిన బండిలో కాకరాలను చూశాకనే ఆయనకు బి.ఎన్.గారి ద్వారా రంగులరాట్నంలో అవకాశం వచ్చింది.
1974లో రామనవమి సందర్భంగా మేము బొంబాయిలో నడిపిన తెలుగు సాహిత్యసమితి అనే సంస్థ తరఫున కొండలరావుగారిని ప్రొఫెసర్ పరబ్రహ్మం నాటకం వెయ్యడానికి ఆహ్వానించాం. యవ్వన గుళికలవంటి వాటిని కనిపెట్టేందుకు ఒక నడివయసు పరిశోధకుడు చేసే విఫలప్రయత్నాలను గురించిన ఆ హాస్యనాటకం బ్రహ్మాండమైన జనాదరణ పొందంది. మద్రాసు నుంచి వచ్చిన కొండలరావు గారి బృందం మంచి నాటకాన్ని సమర్థవంతంగా ప్రదర్శించడమే కాక మాకున్న పరిమిత ఆర్థిక స్థోమతను సహృదయతతో అర్థం చేసుకుని మాతో సహకరించడం మేమెన్నటికీ మరిచిపోలేదు. అందులోని డైలాగులనూ, హాస్యసన్నివేశాలనూ మా మిత్రబృందం ఎంతో కాలంపాటు గుర్తు చేసుకుంటూనే ఉండేవాళ్ళం.
ఎవరినీ ప్రాధేయపడకుండా కేవలం నాటకానుభవంవల్ల కొండలరావు, రాధాకుమారి గార్లకు సినిమాల్లో వేషాలు దొరుకుతూ ఉండేవి. తరవాతి కాలంలో ఆయన చందమామ-విజయావారి భైరవద్వీపం సినిమాకు కథారచన, నిర్మాణనిర్వహణ చేశారు. సినిమా రంగం చరిత్ర గురించి ఇప్పటికీ ఎన్నో మంచి వ్యాసాలు రాస్తున్నారు. టీవీలో గొల్లపూడి మారుతీరావు గిరీశంగా కన్యాశుల్కం నాటకానికి దర్శకత్వం వహించారు. ఈ రోజుల్లో సినిమా పద్ధతులు తనకు సరిపడవనీ, కథ, స్క్రిప్టు, పాత్రపోషణ వగైరాలమీద ఎవరికీ శ్రద్ధలేదనీ అన్నారు. నాటకాల్లో ఆసక్తి ఉన్న మిత్రులతో కలిసి ఇప్పటికీ క్రియాశీలంగా ఉన్న కొండలరావు, రాధాకుమారిగార్ల ఉత్సాహం ఆదర్శప్రాయం అనిపిస్తుంది.
రాధాకుమారిగారు ఆయనకు అన్నివిధాలా తగిన సహచరి. నటిగా ఎంతో ప్రతిభ కలిగిన నటీమణి. నేటికీ సినిమా, టీవీ, నాటకరంగాల్లో బిజీ ఆర్టిస్టు. ఆమె జన్మించినది విజయనగరంలో. స్త్రీలు ఎక్కువగా నాటకాల్లో వేషాలు వెయ్యని ఆ రోజుల్లోనే తన చిన్నతనంలో నటిగా కృషి మొదలుపెట్టారు. క్రమంగా ప్రొఫెషనల్ ఆర్టిస్టుగా అనేక సాంఘిక, పౌరాణికాల్లో నటించసాగారు. ఇక చదువు వెనకబడక తప్పలేదు. ఆమెకు సహనటులు జె.వి.సోమయాజులు, రమణమూర్తి, కొండలరావు మొదలైనవారు. అప్పటికే ఆమె ఉత్తమనటిగా బహుమతులు తెచ్చుకుంది. ఆమెకు సినిమా ఉత్సాహం కూడా కలిగింది. అప్పటికే కొండలరావు సినిమాల్లో వున్నారు గనక ముందు డబ్బింగ్ చెప్పడం నేర్చుకోవటానికి ఆమెను మద్రాసు పిలిపించారు. అప్పట్లో ఆయన సహకార దర్శకుడుగా ఉన్న ‘ముగ్గురు వీరులు’ సినిమాలో ఒక ముఖ్యపాత్రకి ఆమె డబ్బింగ్ చెప్పింది. త్వరలోనే డబ్బింగ్ ఆర్టిస్ట్గా చాలా చిత్రాల్లో ఆమెకు అవకాశాలు రాసాగాయి. కొండలరావు ఇంట్లోనే ఆమె తన తండ్రిగారితో వుండేది. అభిరుచులూ, వ్యాపకాలూ ఒకటే కావడంతో కొండలరావు, రాధాకుమారి ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు.
రాధాకుమారి నటించిన నాటకాలు చూసిన సినీప్రముఖులు ఆమెకు చిత్రాలలో అవకాశాలు ఇవ్వసాగారు ఆమె తొలి చిత్రాలు: తేనెమనసులు, దాగుడుమూతలు. తర్వాత గయ్యాళి పాత్రలు, సాధు పాత్రలు చాలా చిత్రాల్లో వేశారు. అయితే కొందరు ఇతర సినీకళాకారుల్లాగా వీరిద్దరూ తమ సంస్కారాన్ని మరిచిపోలేదు. అందుకనే నాటకాలు వెయ్యడం మానలేదు. ఆమె దాదాపుగా 400 సినిమాల్లో వేశారు. ప్రస్తుతం 5, 6 సినిమాల్లో పాత్రధారణ చేస్తున్నారు. ఇటీవల ‘ఒకరికి ఒకరు’ ‘చందమామ’ చిత్రాల్లోని ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. ఓ పక్క టీవీ సీరియల్స్, ఇంకోపక్క సినిమాలూ, నాటకాలూ – నిత్యం బిజీగానే వున్నారు.
ప్రస్తుత కాలంలో తెలుగు నాటకరంగం పరిస్థితి గురించి బాబ్జీలు అడిగినప్పుడు కొండలరావుగారు చెప్పినది ఇది.
“టిక్కెట్ కొనుక్కుని చూసే ప్రేక్షకులు లేకపోవడం వల్ల తెలుగు నాటకం ఈ పరిస్థితుల్లో వుంది. ‘కమిట్మెంట్’ లేని ప్రేక్షకులూ ‘కమిట్మెంట్’ లేని నాటకరంగం. ఇదీ పరిస్థితి. మిగిలిన రాష్ట్రాల నాటకరంగాలతో అసలు పోలికే లేదు. నంది నాటకోత్సవాలకి విరగబడి జనం వస్తారు. రవీంద్రభారతి నిండిపోయి బయట కూడా స్క్రీన్స్ పెట్టవలసి వస్తుంది. ఒక రూపాయి అయినా టికెట్ పెట్టండి అని ఎంత చెప్పినా వినరు. టికెట్ పెడితే రారండీ అంటారు. వచ్చినవాళ్ళే చాలు అన్నా వినరు. ఇటీవల ‘పడమట గాలి’ అనే నాటకం వేసినప్పుడు యాభైమంది ఆర్టిస్టులు, హాల్లో పదిమంది ప్రేక్షకులు, ఇదీ పరిస్థితి. నాటకం మీద అధారపడి బతకడం కుదరదు. ప్రొఫెషనల్ నాటకం కుదరదు. ఎమెచ్యూర్స్ మంచి నాటకాలే వేస్తున్నారు. ఎస్ వీ శేఖర్ రేపూ ఎల్లుండీ రెండు రోజులు ఇక్కడ తమిళ్ నాటకాలు ఆడుతున్నాడు. రెండు నాటకాలు. వెళ్ళి చూడండి. హౌస్ ఫుల్ అవుతాయి రెండురోజులూ. మెడ్రాస్ లో ఇరవై దాకా సభలున్నాయి. అందులో మెంబర్లుంటారు. ప్రతీ నెలా ఫీజు కడతారు. వాళ్ళకోసం ప్రతీ నెలా ఏదో వొక ప్రోగ్రాం వుంటుంది. ఆటో, పాటో, నాటకవోఁ. మెంబర్లు కాని వాళ్ళు టికెట్ కొనుక్కుని వెళ్తారు. ఇక్కడ మెంబర్లుగా చేరినా ఫీజు కట్టరు. రారు.”
తెలుగు నాటకరంగం పరిస్థితిని గురించి చాలామంది పెద్దలు చాలానే రాశారు. అది ప్రస్తుతపు తెలుగువారి సంస్కారాన్ని సూచిస్తుంది. ఏది ఏమైనప్పటికీ పట్టువదలని విక్రమార్కుళ్ళా కొండలరావుగారి వంటి కళాకారులు మాత్రం తమ వంతు కృషిని చేస్తూనే ఉన్నారు.
రావికొండలరావు రచనలు (ఇవన్నీ విశాలాంధ్ర బుక్హౌస్ తదితర దుకాణాల్లో దొరుకుతాయి):
- రావి కొండలరావు నాటకాలు
- రావి కొండలరావు కథలు
- రావి కొండలరావు నాటికలు
- బ్లాక్ అండ్ వైట్ (సినిమా వ్యాసాలు – నంది అవార్డ్ పురస్కృత)
- మల్లీశ్వరి నవలా రూపం
- మాయాబజార్ నవలారూపం
- షావుకారు నవలారూపం
- హ్యూమరథం – 1
- హ్యూమరథం – 2 (సినిమావారిలోని చమత్కారాలు)
- (సి) నీతి చంద్రిక (సినిమా సెటైర్)
- అన్నీ అడ్డంకులే (సినిమా సెటైర్)
- చిత్తూరు వి.నాగయ్య (జీవిత చరిత్ర)*
- నేనూ – నా దర్శకులు (అక్కినేని)*
(* వాళ్ళు చెప్పగా రావి కొండలరావు రాసినవి)

