మనకు తెలియని మన త్యాగరాజు – 3

ఘనరాగ పంచరత్నాలు

త్యాగరాజు అసమాన ప్రతిభ చూసి కొంతమంది సంగీత విద్వాంసులకి అక్కసుగా ఉండేది. అప్పట్లో సంగీతకారులు కీర్తనలూ, స్వరజతులూ, లక్షణ గీతాలూ, వర్ణాలు ఎక్కువగా స్వరపరిచేవారు. వర్ణం స్వరపరచని వాడు వాగ్గేయకారుడు కాలేడని ఒక నిందా ప్రచారం మొదలు పెట్టారు. త్యాగరాజు తన సంగీతాన్ని కేవలం కీర్తనలకీ, సంకీర్తనలకీ, కృతులకే పరిమితం జేసాడు. ఒక్క వర్ణం కూడా స్వరపరచలేదు. దాంతో త్యాగరాజు కృతులు జనరంజకంగా ఉన్నా పండితుల్ని అంతగా మెప్పించలేదు. తంజావూరు రామారావు ఎలాగైనా త్యాగరాజు చేత వర్ణాలు స్వరపరిచేలా చేయాలని ప్రయత్నించాడు. ఎన్ని సార్లో చెప్పి చూసినా ప్రయోజనం లేకపోయింది. ఒకసారి ఓ సంగీత విద్వాంసుడు వర్ణాలు త్యాగరాజు వల్లకాదని ఒక శిష్యుడి వద్ద హేళన చేసాడు. ఇది విన్నాక తాన వర్ణాల రీతిలో పెద్ద కృతుల్ని రచించాలని అనుకున్నాడు. తాన వర్ణాలకి నాలుగు పైగా చరణాలుంటాయి. వాటి కంటే ఘనంగా స్వర పరచాలన్న ధ్యేయంతో – ఆరభి రాగంలో ‘సాధించెనే’, శ్రీ రాగంలో ‘ఎందరో మహానుభావులు’, గౌళ రాగంలో ‘దుడుకుగల’, వరాళి రాగంలో ‘కన కన రుచిరా’, నాట రాగంలో ‘జగదానంద కారక’ అనే కృతులు కూర్చాడు. వీటినే ఘనరాగ పంచరత్న కీర్తనలనీ అంటారు. ఈ కృతుల్లో ఉన్న సాంకేతికపరమైన రాగవిస్తారణ చూసి సంగీత విద్వాంసులు ఆశ్చర్యపోయారు. ఈ రాగాల్లో వరాళి, నాట అతి ప్రాచీన రాగాలు.


బాల త్యాగరాజు

ఈ పంచరత్నాల్లో ఒక్క జగదానంద కారక మాత్రము పూర్తిగా సంస్కృత రచన. మిగతావన్నీ తెలుగులోనే ఉంటాయి. కొంతమంది జగదానంద కారక కృతే మొదటి కృతని వాదిస్తారు. ఇంకొంతమంది సాధించెనే ఓ మనసా కృతినే మొట్ట మొదట స్వరపరిచాడనీ చెబుతారు. ఏది ఎప్పుడు రాసాడన్నది ఇదమిత్థంగా తెలీదు. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పారు. ఈ పంచరత్నాలు త్యాగరాజు నలభయ్యో పడిలోకొచ్చాకే స్వర పరిచాడు. ఎందుకంటే త్యాగరాజు కూతురి వివాహ సమయంలో జగదానంద కారక కృతి పాడినట్లుగా కృష్ణ భాగవతార్ రాసాడు. ఈ విషయమాయనకి తండ్రి వెంకట రమణ భాగవతార్ ద్వారా తెలిసిందనీ చెప్పాడు.

ప్రతీ కృతిలోనూ ఏడు నుండి పది పైగా చరణాలుంటాయి. తాన వర్ణాలకి అప్పట్లో, అంటే 18 – 19వ శతాబ్ది కాలంలో ఒక పద్ధతుండేది. మామూలు పల్లవీ, అనుపల్లవీ కాకుండా, ఇందులో ఎత్తుగడ పల్లవనొకటుంటుంది. అలాగే ఆఖరి చరణానికీ, పల్లవికీ ఒక అనుబంధం ఉంటుంది. అంటే మొదట పల్లవిలో చెప్పిన విషయాన్ని ఆఖరి చరణంతో కలిపి ముగించడాన్ని అనుబంధం అంటారు. ఈ సాధించెనే ఓ మనసా కృతిలో సమయానికి తగు మాటలాడెనే అనే ఒక ఎత్తుగడ పల్లవుంది. ఈ ఎత్తుగడ పల్లవితోనే చరణాలన్నింటికీ సంబంధముంటుంది. ఒక్క ఆఖరి చరణానికి తప్ప. ఆఖరి చరణం మాత్రం మొదటి పల్లవనుబంధంతో ముగుస్తుంది. సాధించెనే కృతిలో ఈ తాన వర్ణ లక్షణాలు కనిపిస్తాయి. ఎందరో మహానుభావులు కృతిలో కేవలం అనుబంధం మాత్రమే కనిపిస్తుంది. ఎత్తుగడ పల్లవుండదు. ఈ అనుబంధాలని సాహిత్యంతోనే పాడాలి. స్వర సాహిత్యంతో కాదు. తాన వర్ణాలలో చరణాలు స్వర సాహిత్యంతోనే ఉంటాయి. అంటే మామూలు సాహిత్యం ఉండదు. కేవలం స్వరాలే ఉంటాయి. ఈ సాధించెనే కృతిలో చరణాలు రి, ప, ధ అనే స్వర స్థానాలతోనే ప్రారంభమవుతాయి.

నాట రాగంలో దైవతం ప్రత్యేకంగా ఉంటుంది. అంటే ఇది దైవతమైనా, నిషాదానికి అతి దగ్గరగా ఉంటుంది. అలా అని నిషాదం గానూ పరిగణించలేము. ఇది నాట రాగం ప్రత్యేకత. నాట రాగ కృతి జగదానంద కారక లో ఈ దైవతాన్ని పూర్తిగా విసర్జించాడు త్యాగరాజు. అలాని నాట రాగ స్వరూపమెక్కడా దెబ్బతినదు. ఇదీ ఈ పంచరత్న కృతి గొప్పతనం. అలాగే శ్రీ రాగం అవరోహణలో మరో రకమైన దైవతం వుంటుంది. ఎందరో మహానుభావులు కృతి సంచారంలో ఈ దైవతాన్ని అతి చాక చక్యంగా దాట వేస్తాడు. ఎక్కడా శ్రీ రాగం స్వరూపం మారదు. అదే విధంగా గౌళ రాగంలో (దుడుకుగల) గాంధార స్వరాన్నీ వదిలేస్తాడు (ఒకే ఒక్క చరణంలో తప్ప). వదిలేయడమంటే సంచారంలో ఆ స్వరం మీదుగా పోకుండా తెలివిగా దాటేయడమన్నమాట.

ఈ పంచరత్నాల్లో ఇంకో గమ్మత్తుంది. సాధారణంగా ఆఖరి చరణం వాగ్గేయకారుల ముద్రతో ముగుస్తుంది. కానీ వీటిల్లో త్యాగరాజ ముద్ర చివరి రెండు లేదా మూడు చరణాల్లో కనిపిస్తుంది ఒక్క కన కన రుచిరా లో తప్ప. ఈ పంచరత్నకృతుల్లో అన్ని చరణాలు ఒకేసారి స్వర పరచలేదనీ, కాలం గడిచే కొద్దీ ఒక్కొక్కటే కలుపుకుంటూ వచ్చారనీ ఒక ప్రచారముంది. ఇదే విషయాన్ని చాలామంది సంగీత విద్వాంసులు రాసారు. నమ్ముతారు కూడా. అందువల్లే త్యాగరాజ ముద్ర పలు చరణాల్లో కనిపించిందనీ చెబుతారు.

ఈ పంచరత్న కృతుల్లో వాడిన రాగాలు, ఆరభి, శ్రీ, నాట, గౌళ, వరాళి – ఇవన్నీ వరుసగా శంకరాభరణం, ఖరహర ప్రియ, చల నాట, మాయామాళవ గౌళ, ఝాలవరాళి మేళకర్త రాగాల జన్యాలు. ఈ జన్య రాగాలని తీసుకొని మేళకర్త స్థాయి రాగాల్లా భావించి అంత ఘనంగానూ స్వరపరిచాడు. అతి తక్కువ సంచార పరిమితులున్న గౌళ రాగాన్ని తీసుకొని అదొక సంపూర్ణ రాగంలా మలిచాడు. అసలు వీటిని త్యాగరాజు కాలం నుండీ ఘనరాగ పంచరత్నాలని ఎవరూ అనలేదు. కేవలం తాన వర్ణాల రీతిలో స్వర పరిచిన అతి పెద్ద కృతులుగానే భావించారప్పట్లో! ఇరవయ్యో శతాబ్దం మొదట్లో మహారాజపురం విశ్వనాథయ్యర్ అనే విద్వాంసుడు వీటికి ఘనరాగ పంచరత్నాలని నామకరణం చేసాడు. ఇవి అప్పట్నుండీ అలాగే చెలామణీ అవుతున్నాయి. ప్రతీ కచేరీలోనో ఏదో ఒక పంచరత్న కృతయినా ఖచ్చితంగా వింటాం. కనకన రుచిరా ఒక్క కృతే కచేరీల్లో అతి తక్కువగా పాడుతారు. ఎందుకో సరైన కారణం తెలీదు.

రాగ సుధా రస పానము

కర్ణాటక సంగీతంలో రాగ లక్షణాలూ, రాగ లక్ష్యాలూ, రాగ స్వరూపాలపై త్యాగరాజుకి పరిపూర్ణమైన అవగాహనుంది. సంగీత శాస్త్రాన్ని క్షుణ్ణంగా గ్రహించాడు. తంజావూరు సరస్వతీ మహల్ గ్రంధాలయంలో శరభోజి పేరుతో ‘రాగాలు’ అనే గ్రంధం ఉంది. ఇది మొదటి శరభోజి కాలం నాటిది. అంటే సుమారు 1710 అయ్యుండచ్చు. దీనిలో 72 మేళ కర్త రాగాల గురించీ, వాటి స్వరూపాల గురించీ వివరంగా ఉంది.ఈ గ్రంధాన్ని శొంఠి వెంకట రమణయ్య తన శిష్యుడు త్యాగరాజుకిచ్చాడు. ఆ విధంగా త్యాగరాజుకి రాగాల మీద ఆధిపత్యమొచ్చింది. అవన్నీ కేవలం చదవడమే కాదు, మనస్థం చేసుకున్నాడు కూడా. సంఖ్యాపరంగానూ, సృజనలోనూ త్యాగరాజు స్వరపరిచినన్ని రాగాలు ఏ వాగ్గేయకారుడూ ముట్టలేదు. రాగ లక్షణాలనీ, వైశాల్యాన్నీ అంతగా చూపలేదు. త్యాగరాజు కృతుల్లో రాగ విస్తృతి విశాలంగా ఉంటుంది. గొంతుకలో శ్రావ్యత తక్కువున్నవారు కూడా చాలా కీర్తనలు చక్కగా పాడుకోగలిగిన అనేకమున్నాయి. దానికి అపారమైన సంగీత జ్ఞానం అవసరంలేదు.

సుమారు 215 రాగాల్లో త్యాగరాజ కృతులున్నాయి. కొన్ని మరుగున పడ్డ రాగాలు వెలికి తీసాడు. కొన్ని కొత్త కొత్త రాగాలు కనుక్కున్నాడు. ఒకే రాగంలో చాలా కృతులు స్వర పరిచినా, ఏదీ ఒక దాన్ని పోలి మరోటుండదు. ఉదాహరణకి శంకరాభరణ రాగంలో 30 కృతులు స్వరపరిచాడు. ఒక్కోక్కటీ ఒక్కో విధంగా ఉంటాయి. తోడి రాగంలో త్యాగరాజు చూపించిన పాండిత్యం అంతా ఇంతా కాదు. ఎవరూ ముట్టని రాగాల్లోనూ, అసాధారణ రాగాల్లోనూ కృతులు కట్టాడు. ఈ అసాధారణ రాగాల్లో స్వరపరిచిన వాటినే ఏకరాగ కృతులన్నారు. సుమారు 90 కి పైగా ఏక రాగ కృతులు స్వరపరిచాడు.

త్యాగరాజు కాలం నాటికే బ్రిటీషు వారు తంజావూరులో తిష్ట వేసారని ఇంతకు ముందు తెలుసుకున్నాం. ఇంగ్లీషు బ్యాండు ఆధారంగా శంకరాభరణ రాగంలో ‘గత మోహాశ్రిత’ మరియు ‘వరలీల గానలోల‘, కుంతలవరాళి లో ‘శర శర సమరైకశూర‘ మరియు ‘కలి నరులకు మహిమలు’, బంగాళ లో ‘గిరి రాజ సుత తనయ’, సుపోషిణి లో ‘రమించు వారెవరురా‘ కీర్తనలూ స్వర పరిచాడు. కేవలం వరుస (Tune) వరకే ఇంగ్లీషు బ్యాండుని పోలి వుంటుంది. రాగాలు మాత్రం స్వచ్ఛమైన కర్ణాటక సంగీతంలోవే! త్యాగరాజు కాలంలో శరభోజి-2 గురువుగా ష్వార్ట్జ్ ఉన్నాడని మనకి తెలుసు. శరభోజి రాజుకి సంగీతమంటే ప్రీతి కనుక అతను పాశ్చాత్య సంగీతాన్నీ రుచి చూపించాడు. ఇంగ్లీషు బ్యాండుని పరిచయం చేసాడు. అప్పట్లో తంజావూరు వీధుల్లో ఈ బ్యాండు వాళ్ళు వాయిద్యాలు వాయిస్తూ ఊరేగింపుగా వెళ్ళేవారు. ఇంగ్లీషు బ్యాండులో తాళానికి (beat) ప్రాముఖ్యతెక్కువ. అది కర్ణాటక సంగీతంలో వాడే తాళాలకి వేరుగా ఉంటుంది. ఆ తాళ గతికి సంగీత విద్వాంసులే కాదు, త్యాగరాజు శిష్యులు కూడా సమ్మోహితులయ్యారు. ఓసారి ఈ ఇంగ్లీషు బ్యాండు వాళ్ళు ఊరేగింపుగా తిరువయ్యార్ వీధుల్లో వెళితే, త్యాగరాజు శిష్యుడొకడు ఆ పాటకి తాళం వేయడం మొదలెట్టాడు. ఇది చూసి మన సంగీతంలో కూడా ఇవున్నాయని చెప్పడానికి, త్యాగరాజు రమించు వారెవరురా కీర్తన రాసాడనీ చెబుతారు. ఈ ఇంగ్లీషు బ్యాండు వరుసల గురించి సాంబమూర్తి కానీ, పార్థ సారధి కానీ ప్రస్తావించలేదు. కానీ 1930 తరువాతొచ్చిన కొన్ని పుస్తకాల్లో వీటి గురించి అక్కడక్కడుంది. Ethel Rosenthal రాసిన Tyagaraja: A Great South Indian Composer అనే వ్యాసంలో కొంత కనిపిస్తుంది. అలాగే The Hindu ఇంగ్లీషు వార్తాపత్రికలో వచ్చిన సంగీతపరమైన కొన్ని వ్యాసాల్లో పాశ్చాత్య సంగీత ప్రభావం గురించి వుంది.
 
(సశేషం)


అదనపు గ్రంధసూచి

  • Robert Morris, Variation and Process in South Indian Music: Some Kritis and Their Sangatis Music Theory Spectrum, Vol. 23, No. 1
  • Essays on Tyagaraja and his Music – T. Lakshman Pillai, Thiruvananthapuram
  • త్యాగయ్య గారి నాద సుధా రసం – రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ