మనకు తెలియని మన త్యాగరాజు – 3

త్యాగరాజు వాడిన భాష సరళమైన వ్యవహారిక భాష. అందువల్ల ఆయన రచనలు ప్రజలకి సులభంగా అర్థమయ్యేవి. మొదట్లో సంస్కృత ప్రభావం కనిపించినా, రానురానూ అచ్చ తెలుగులోనే రాసాడు. ప్రజల నాల్కలపై ఉండే కుటుంబ భాషా, ఉపమానాలూ వాడాడు. ప్రతాపవరాళి అనే రాగంలో ‘విననాశకొనియున్నానురా’ అనే కృతిలో, పూర్వకాలం ఆంధ్రదేశంలో ఇళ్ళలో ఆడే వామన గుంటలు గురించి ప్రస్తావన ఉంది.

పల్లవి: విననాశకొనియున్నానురా విశ్వ రూపుడనే
అనుపల్లవి: మనసారగ వీనుల విందుగ మధురమైన పలుకుల (విన)

చరణం: సీతా రమణితో వామన గుంటలాడి గెలుచుట
చేత నొకరికొకరు జూచి ఆ భావమెరిగి సా..
కేతాధిప నిజమగు ప్రేమతో పల్కుకొన్న ముచ్చట
వాతాత్మజ భరతులు విన్నటుల త్యాగరాజ సన్నుత (విన)

ఇంతగా సంగీతంలో సాహిత్యాన్ని మేళవిస్తే తెలుగు సాహితీకారులెందుకు త్యాగరాజ కృతుల్లో సాహిత్యాన్ని తగినంతగా మెచ్చలేదు? సంగీతంలో ఒక్క అపస్వరమొచ్చినా సంగీత కారులు ఎలా తట్టుకోలేరో, అలాగే సాహిత్యంలో ఒక్క వ్యాకరణ దోషం కనిపించినా సాహితీ వేత్తలు ఒప్పరు. సంగీతంలో సాహిత్యం బంధించే ప్రక్రియలో త్యాగరాజు కొన్ని వ్యాకరణ నియమాలు ఉల్లంఘించాడన్న ఒక వాదనుంది. రామభక్తినీ, సంగీతాన్నీ ఒక ఉత్కృష్ట స్థాయికి తీసుకెళ్ళిన త్యాగరాజు, సాహిత్యంలో కవిత్వాన్ని పెంపొందిచలేకపోయాడు అంటూ ప్రముఖ సంగీత విద్వాంసుడూ, సాహిత్యకారుడూ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారు ‘త్యాగయ్య గారి నాధ సుధా రసం’ వ్యాసంలో అభిప్రాయపడ్డారు. సంగీతంలో తాళానికి సరిపడేందుకు కొన్ని పదాలు కుదించాడని వీరి వాదన. నృత్యనాటికల్లో రాసిన కొన్ని కంద, సీస పద్యాల్లో చందస్సు భంగమయ్యిందని వారు వేలెత్తి చూపించారు.

“త్యాగరాజు తెలుగు భాష నాలుగైదు తరాలుగా తమిళ దేశంలో నిలబడి, సహజమైన పెరుగులూ, మెరుగులూ, చాలా వరకూ కోల్పోయింది. జడ్డు గట్టింది, మూడు రెండు నది నాధుడు, నిద్దుర జతుడు వంటి కృత్రిమ రూపాలతో అందదుకులైన వాక్యాలతో నడిచింది. ఆయన సంకృతం కూడా ఎక్కువ వ్యాసంగానికవకాశం చాల లేదనిపిస్తూ, నేర్చిన దానికంటే విని గ్రహించిందే ఎక్కువ అని పదే పదే సూచిస్తుంది. కేచన నిజ భక్త విచయ, ముఖ జిత భార్యే ఇత్యాదులుదహరించ వచ్చును. త్యాగయ్య వ్యాకరణ నియమాలు ఉల్లంఘించినాడనే కాదు నా మనవి. ఆ ఉల్లంఘన కూడా సహజమైన సరళమైన మార్గంలో నడవలేదనే! తాళ్ళపాక వారూ, క్షేత్రయ్య మొదలైన ఎందరో కవులూ వైయాకరణుల అధికారానికి మితి కల్గించిన వారే. శబ్ద శాస్త్ర నియమాలను ఎదిరించి దొమ్మ గలవారు అప్పుడప్పుడుండబట్టే, ఏ భాషగాని ప్రవాహినిగా నడుస్తుంది… .”

త్యాగరాజు కృతుల్లో ఎన్నోచోట్ల ఆ భావాలు అపక్వతనే చూపిస్తున్నాయని రాళ్ళపల్లి వారు అభిప్రాయబడ్డారు. కేదారగౌళ రాగంలో ‘కరుణా జలధి’అన్న కృతి ఒక చరణంలో నీ తండ్రి సొమ్ము వెరవక పోనేరదు, శంకరాభరణ రాగంలో ‘ఎదుట నిలిచితే’ కృతిలో ఈ హరామి తనమేల? వంటి బాల భావాలు ఆయన రచనల్లో కనిపించుతాయి. సరళంగా చెప్పగలిగిన ఓర్పూ లేకపోవడమూ, త్వరగా ముగిస్తే చాలునన్నుట్లుగా ముందుకెళ్ళిన రచనెలెన్నో ఉన్నాయి. ఇప్పటికి కొన్నింటికర్థం అస్పష్టంగానే ఉందని వీరి వాదన. ఉదాహరణకి కళ్యాణి రాగంలో ఈ క్రింది కృతి పల్లవీ, అనుపల్లవీ ఓ పట్టాన కొరుకుడు పడవు. పద నిబద్ధత లోపించినట్లుగా అనిపిస్తుంది.

పల్లవి: కారు వేల్పులు నీకు సరి
అనుపల్లవి: కారుకు జిలకర సంబా కంతరమైనట్టు కాని (కా)

కాకపోతే ఆయన శిష్యులకి తెలుగు సరిగా రాకపోవడం వల్ల కూడా రాసేటప్పుడు ఈ కృతుల్లో తప్పులు దొర్లుండవచ్చున్న సందేహం వెలిబుచ్చారు. త్యాగయ్యది ఆశు కవిత. సంగీతమూ అంతే! అందువలన కొన్ని తప్పులు జరిగే అవకాశముందని అన్నారు.

“కేవలం సంగీత సృజనవల్లా, అందులో ఇమిడ్చిన భక్తి తత్వంవల్లా, త్యాగరాజ కృతులు ఇంతకాలం బ్రతికున్నాయి. కేవలం సాహిత్య పరంగా అయితే ఇవి కాల ప్రవాహంలో వెనక్కెళ్ళిపోయుండేవి” అంటూ సి. తిరుమలయ్య నాయుడు వ్యక్తీకరించారని టి. పార్థసారధి ఒక చోట ప్రస్తావించారు. ఈ తిరుమలయ్య నాయుడే Tyagaraja: The Greatest Musical Composer of South India పుస్తకాన్ని రచించారు. ఇందులో త్యాగరాజు కృతుల్లో సాహిత్యం అతి తక్కువ స్థాయిలో వుందనీ పలు కృతులు చర్చించారు.

త్యాగరాజ కృతులు 1900 దాటాక ప్రసిద్ధి చెందాయి. మద్రాసులో సంగీత కారులు త్యాగరాజ సంగీతంపై దృష్టి సారించారు. ఎన్నో కృతులు వెలికి దీసే ప్రయత్నం చేసారు. ఆ దశలో ఆది అండ్ కంపెనీ వారు శ్రీనివాస అయ్యంగార్ అనే ఒకాయనకు తమిళంలోనూ, తెలుగులోనూ ఉన్న త్యాగరాజ కృతులు సేకరించమని పురమాయించారు. ఈ పనిలో భాగంగా శ్రీనివాస అయ్యంగార్ తెలుగు భాషాకోవిదుల్ని సంప్రదించాడు. వాళ్ళకి ఆయన సేకరించిన కృతుల ప్రతులిచ్చి, వాటిలో తప్పులుంటే సరిదిద్దిమనీ చెప్పాడు. తీరా చూస్తే ఆ సవరణలు తాళానికి కుదర్లేదు. వారిచ్చిన సవరణలతో పాడితే తాళం తప్పుతోంది. ఇవన్నీ చూసి శ్రీనివాస అయ్యంగార్ త్యాగరాజు కృతులపై ఓ వ్యాసంలో ఈ తప్పులన్నీ ఎత్తి చూపాడు. అందులో ఒక చిన్న ఉదాహరణ. అఠాణా రాగంలో స్వర పరచబడిందీ కృతి. ‘చెడె బుద్ధి మానురా ఇడె పాత్రమెవరో జూడరా’ అన్న దీంట్లో చెడె, ఇడె అన్న పదాలు వ్యాకరణ పరంగా సరికావు. వీటిని చెడెడు మరియు ఇడెడు అన్నట్లుగా మార్చాలి. అప్పుడే సరైన అర్థం స్ఫురిస్తుంది. ఇలా చెడెడు, ఇడెడు అని మారిస్తే సాహితీకారులకి వినసొంపుగానే ఉంటుంది. కానీ సంగీత ప్రియులకి తాళం కుదరక కర్ణ కఠోరంగా అనిపిస్తుంది. ఇలాంటి ఉదాహరణలు చాలా చూపించారు. ఈ వాదనతో రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మా అంగీకరించారు. కానీ ఆ కృతుల్లో ఉన్న సంగీత విశేషాల దృష్ట్యా, చిన్న చిన్న తప్పులు దొర్లినా పట్టించుకోనవసరం లేదన్నారు. అన్నమయ్య కీర్తనలకి సంగీతం కట్టేటప్పుడు కొన్ని పదాలను మార్చాల్సి వచ్చిందనీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మా అనేక సార్లు చెప్పారు. అది వేరే విషయం.

కొన్ని త్యాగరాజ కృతుల్లో పల్లవి సంస్కృతంలోనూ, చరణాలు తెలుగులో, మరికొన్ని కృతుల్లో పల్లవి తెలుగులో ప్రారంభమైనా, హఠాత్తుగా మధ్యలో ఒక చరణం సంస్కృతంలో ఉంటాయి. హుసేని రాగంలో ‘రామా నిన్నే నమ్మినాను’ అనే కృతుంది. పల్లవి చక్కటి తెలుగులో మొదలవుతుంది. తీరా చరణాల దగ్గరకొచ్చే సరికి అన్నీ సంస్కృత పదాలే!

పల్లవి: రామా నిన్నే నమ్మినాను నిజముగ సీతా
అనుపల్లవి: కామ జనక కమనీయ వదన నను కావవే కారుణ్య జలధీ (రా)

చరణం: సార సామాది వేద సార సంతత బుధ విహార రాజిత ముక్తా
హార కనక కేయూర ధర సుగుణ పారావార సురారాధిత పద (రా)

అలాగే ‘శివే పాహిమాం’ అని కళ్యాణి రాగంలో కృతుంది. అందులో పల్లవి సంస్కృతంలో సాగుతుంది. మొదటి చరణం తెలుగులో ఉంటుంది. మిగతా చరణాలన్నీ సంస్కృతంలో ఉంటాయి. ఇటువంటి మిశ్రమ భాష ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఖరహర ప్రియ రాగంలో ‘చక్కని రాజ మార్గములుండగ’ అనే కృతి అనుపల్లవిలో ఛీయను గంగా సాగరమేలే అన్న ప్రయోగం కనిపిస్తుంది. చాలా మంది ఇలాగే పాడుతారు. కొంతమంది సాహిత్య కారులు, ఈ గంగా సాగర ప్రయోగాన్ని తప్పు పట్టారు. మూల కృతిలో లిఖితంగా “గంజా” సాగరమనే వున్నా గంగా సాగరమనే పాడుతారు. విలియం జాక్సన్ రాసిన Tyagaraja – Life and Lyrics లో దీనికే మరో భాష్యం చెప్పాడు. శరభోజి రాజు ఆస్థానంలో గంగా సాగర భట్టు అనే ఒక సారాయి వ్యాపారస్తుడుండేవాడనీ, త్యాగరాజు కూడా ఈయన్ని దృష్టిలో పెట్టుకొని గంగా సాగరం అనే ప్రయోగం చేసుంటాడన్న ప్రతిపాదన తీసుకొచ్చారు. అప్పట్లో సారాయిని గంగాసాగరమనే వ్యవహరించేవారనీ చెప్పారు. ఇది ఖండించలేం. ప్రస్తుతం గంగా సాగరమనే అందరూ పాడతారు.

వ్యాకరణ దోషాలున్నా, త్యాగరాజు కృతుల్లో భావ ప్రకటన్ని అందరూ మెచ్చుకున్నారు. సాహిత్యం అతి సరళంగా ఉండడం వల్లా, నిత్యమూ వాడుకలో ఉన్న పదాలుండడం వల్లా త్యాగరాజు సంగీతం బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. తెలుగువారు త్యాగరాజుని అంతగా పట్టించుకోలేదని నా ఆవేదన. సంగీతం దృష్ట్యా మనవాడే అని జబ్బలు చరుచుకున్నా, సాహిత్యంలో ఇవ్వాల్సినంత స్థానం ఇవ్వలేదు. చూపవల్సినంత అభిమానం చూపలేదు. నచ్చినా, నచ్చకపోయినా తెలుగువారందరూ అంగీకరించాల్సిన వాస్తవమిది. ఈ విషయంలో భాషతో నిమిత్తం లేకపోయినా తమిళులే చాలా నయం. ఇప్పటికీ త్యాగరాజ కృతులు అందరినోటా పలుకుతున్నాయంటే అది తమిళుల చలవే! తెలుగువారు అంతగా త్యాగరాజు నారాధించక పోవడాని కొక కారణం నాక్కనిపిస్తుంది. త్యాగరాజు తమిళ దేశంలోనే పుట్టి, పెరిగాడు. జీవితమంతా తమిళనాడులోనే గడిచింది. తెలుగుభాషతో సంబంధం ఉంది కాబట్టి మనవాడు అని అనుకుంటామంతే! అంతకు మించి దగ్గర కెళ్ళలేకపోయాం. ఎందుకంటే తెలుగు జీవితంపైనా, ఆచార వ్యవహారాల పైనా, రాజకీయ పరిణామాల పైనా తెలుగు వాళ్ళకి ఉన్న బంధం త్యాగరాజుతో లేదు. మన మట్టిలో పుట్టిన బిడ్డే అన్న భావన లేకపోవడమేనని నా అభిప్రాయం.