మనకు తెలియని మన త్యాగరాజు – 3

కృతీ, కీర్తనా పర్యాయ పదాలుగానే చాలామంది వాడుతారు. కీర్తనలు సులభ రీతిలో పదిమందీ మళ్ళీ మళ్ళీ పాడుకునేలా ఉంటాయి. ఒక ప్రథాన గాయకుడు పాడితే అతన్ననుసరించి బృందగానం ఉంటుంది. కానీ కృతులలా కాదు. కృతుల్లో సంగీతానిది ప్రథమ స్థానం. సాహిత్యం రెండోది. కీర్తనల్లో పల్లవీ, అనుపల్లవీ, చరణాలుంటాయి. కృతుల్లోనూ ఈ మూడూ తప్పని సరిగా ఉన్నా, సంగతులు అనేవి ప్రథాన పాత్ర పోషిస్తాయి. కృతుల్లో సంగతుల రూపానికి సృష్టి కర్త త్యాగరాజు.

కృతి – ‘సంగతి’

త్యాగరాజు ముందు కాలంలో రాగాలాపనా, పల్లవినీ కలిపి రాగం-తానం-పల్లవి అని పాడేవారు. ఇప్పటికీ ఇదొక అంశంగా కచేరీల్లో పాడడం ఒక రివాజు. ఈ పల్లవిలో ఒకటీ లేదా రెండు వాక్యాలుంటాయి. దాని చుట్టూ రాగ విస్తారణతో ప్రారంభించేవారు. పల్లవి లో ప అంటే పదం. ల అంటే లయ. వి అంటే విన్యాసం. పద, లయ విన్యాసాన్ని ఆవిష్కరించేది కాబట్టి పల్లవి అని చెప్పారు. ఈ పల్లవిననుసరించి అనుపల్లవి ఉంటుంది. ఇందులో పల్లవిలో చెప్పిన ఉద్దేశ్యానికి ఒక దృక్పథం ఏర్పడుతుంది. అంటే అనుపల్లవిలో భావం ఇంకాస్త విశదీకరించబడుతుంది. ఆ తరువాత ప్రతీ చరణంలో పల్లవీ, అనుపల్లవిలో చెప్పినవి ధృవీకరించబడతాయి. సాధారణంగా కృతుల్లో రెండూ లేదా ఇంకాస్త ఎక్కువగా చరణాలుండాలన్న నియమం వుంది. చివరి చరణంలో ఆ భావం పూర్తి చేయబడుతుంది. సంగీత కచేరీల్లో గాయకుడి ప్రతిభని చూపించుకోవడానికి, రాగ రసపోషణ చెయ్యడానికి, ముందుగా రాగాలాపనా, ఆ పైన స్వరకల్పన, తద్వారా చేసే లయవిన్యాసమూ అవకాశం ఇస్తాయి. సాహిత్యం (పల్లవి కానీ కృతికానీ) వీటన్నిటికీ ఒక వంతెనగా మిగిలింది తప్ప, దానికంటూ ఒక ప్రత్యేకత సంతరించుకోలేక పోయింది సంగీత సభల్లో. రాగతాళాల కసరత్తు లాంటి ఈ కచేరీలని సంగీత శాస్త్రపు లోతులు తెలిసిన వారు తప్ప సామాన్యులు ఆనందించలేక పోయేవారు. త్యాగరాజు కృతినొక చట్రంగా వాడుకొనీ, అందులో రాగాల్నీ, వాటి స్వరూపాల్నీ అందంగా అమర్చాడు.

పల్లవి చివరి చరణంలోనే రాసిన వారి ముద్ర కూడా ఉంటుంది. సంగీత రచనల్లో ముద్రా సాంప్రదాయం ఎప్పటినుంచో ఉంది. కేవలం ఎవరు స్వర పరిచారన్నది చెప్పడానికేనని అనిపిస్తుంది. సాహిత్యం అయితే లిఖితం కాబట్టి కవి పేరుంటుంది. సంగీతం అలా కాదు. దానికి గొంతే వాహకం. ఒక గొంతు నుండి ఇంకో గొంతుకు అవలీలగా మారుతుంది. ఒక్కోసారి పాడేవారికి పాట వరుసా, రాగం ముఖ్యం కానీ, ఎవరు రాసారన్నది ముఖ్యం కాదు. అలాంటప్పుడు కాల ప్రవాహంలో సంగీత రచయితలు కనుమరుగవుతారు. అలాకాకుండా వారి రచన్ని పదిమందికీ తెలపడానికి ముద్ర అనేది ఉపయోగపడుతుంది. ఉదాహరణకి త్యాగరాజు కృతులే తీసుకుందాం. త్యాగరాజ అనే ముద్ర కృతుల్లో లేకపోతే ఎవరు రాసారో ఎలా చెప్పగలం? పలానా వారి రచనా అన్నదానికి గుర్తే ఈ ‘ముద్ర’. అంతకుమించి ఏమీ కాదు.

పూర్వం కచేరీల్లో, ముందుగా రాగాలాపన పాడేవారు. ఆ తరువాత కృతులూ లేదా కీర్తనలు పాడీ, చివర్లో మనోధర్మంగా స్వరకల్పన చేసేవారు. ఇక్కడ మనోధర్మం అంటే ఆశువుగా స్వరకల్పన చేయడం. కీర్తన ఒకటే పాడినా, పాడే వారిని బట్టి స్వరకల్పన మారుతూ ఉంటుంది. రాగాలాపనలో రాగచ్ఛాయలు చూపిస్తూ విస్తారణ ఉంటుంది. ఈ రాగాలాపనకి తాళం అవసరం లేదు. కేవలం వివిధ కోణాల్లో రాగాన్ని ఆవిష్కరించడమే ఈ రాగాలాపన ప్రధానోద్దేశ్యం.


తిరువాయూరు సంస్కృత కళాశాల

ఇలా ఉన్న కృతిలో, త్యాగరాజు ‘సంగతి’ అనే ఒక కొత్త ప్రయోగాన్ని ప్రవేశపెట్టాడు. ఇది త్యాగరాజుకి ముందూ ఉంది. సాహిత్యం లేకుండా ఆలాపనలో భాగంగా పాడేవారు. కానీ త్యాగరాజు సంగతిని ఆలాపనలోంచి బయటకు తీసి సాహిత్యంతో అనుసంధానంచేసి కృతికి పరిపుష్టత వచ్చేలా చేసాడు. గాయకుడు తన ప్రతిభని చూపించుకోవడానికి, ఆ రాగంలోని రసాన్ని పండించడానికి, కృతిని పాడే పద్ధతిలోనే ఒక సృజనాత్మక మార్గం చూపెట్టాడు. ఈ సంగతి అనే ప్రక్రియని త్యాగరాజు వాడినంత విస్తారంగా ఎవరూ వాడలేదు. అంత సృజనాత్మకత చూపలేదు. ఈ సంగతులనేవి త్యాగరాజుకి పూర్వం “ప్రయోగాలు” అన్న పేరుతో వుండేవనీ కొంతమంది సంగీత విద్వాంసులు వాదిస్తారు. ఈ ప్రయోగాలని కృతికి ముందే పాడేవారనీ చెబుతారు. కాకపోతే ఎవరు రాసిన కృతిలో ఉన్నాయో, ఎలా ఉండేదో లిఖిత పూర్వకంగా ఎవరూ చూపించ లేదు.

సంగతి అంటే తెలుగులో విషయమని అర్థం. పల్లవిలో సంగతి చెప్పడం అంటే విషయ విశదీకరణ చేయడం. సాధారణంగా కృతి పాడేటప్పుడు పల్లవినొక శ్రావ్యత (మెలడీ) తో పాటని ఎత్తుకుంటారు. అదే పల్లవిని వివిధ రకాల శ్రావ్యతలతో పాడడం మొదలెడతారు. ఇలా కొన్ని సార్లు అదే తిప్పి పాడతారు. ఇక్కడ పల్లవి సాహిత్యం మారదు. కేవలం శ్రావ్యత మాత్రమే రూపాంతరం చెందుతుంది. గాయకుడు పల్లవిని చివరగా ఒక శ్రావ్యతతో ముగిస్తాడు. అదే శ్రావ్యతని కృతి చివరి వరకూ పాటిస్తాడు. చరణాల తరువాత పల్లవి తిరిగి పాడినప్పుడు చివర వాడిన శ్రావ్యతతో ముగిస్తాడు. ఉదాహరణకి ‘సామజ వరగమన’ అనే కృతి వినండి. అందులో పల్లవి వేర్వేరు రకాలుగా మారుతూ వస్తుంది. మారినప్పుడల్లా భావాన్ననుసరించి (టోన్) ఒక ప్రత్యేక రాగభావం ఆవిష్కరింపబడుతుంది. అలాగే అందరికీ చిర పరిచితమైన ‘వాతాపి గణపతిం భజే’ అనే ముత్తుస్వామి దీక్షితార్ కృతిలో కూడా ఈ సంగతులు స్పష్టంగా తెలుస్తాయి. త్యాగరాజు పరిచయానంతరం ఈ ప్రక్రియని ముత్తుస్వామి దీక్షితార్ ఆయన కృతుల్లోనూ అమలు పరిచాడనీ సంగీతకారుల అభిప్రాయం. త్యాగరాజు ఎవరూ ఈ సంగతుల్ని మార్చడానికి వీలులేకుండా ప్రతీ కృతిలోనూ స్థిరంగా బంధించేసాడు. కాబట్టి ఉత్తరోత్తరా ఎవరైనా ఆయన కృతులు పాడితే త్యాగరాజు స్వరపరిచిన విధంగానే పాడి తీరాలి. ‘గ్రహ బలమేమి’ అనే కృతిని ఎన్ని సంగతులతో పాడతారో ఉదాహరణగా చూద్దాం.

పల్లవి: గ్రహ బలమేమి శ్రీ రామాను – గ్రహ బలమే బలము
ఆనుపల్లవి: గ్రహ బలమేమి తేజోమయ వి – గ్రహమును ధ్యానించు వారికి నవ (గ్రహ)

చరణం: గ్రహ పీడల పంచ పాపములను (ఆ)-
గ్రహములు గల కామాది రిపుల ని-
గ్రహము జేయు హరిని భజించు త్యాగరాజునికి రసికాగ్రేసులకు (గ్రహ)

ఇందులో పల్లవిని ఇన్ని సంగతులతో పాడచ్చు

పల్లవి 1 – గ్రహ బలమేమి
పల్లవి 2 – గ్రహ బలమేమి శ్రీ రాముని
పల్లవి 3 – శ్రీ రాముని అనుగ్రహ బలమే బలము
పల్లవి 4 – అనుగ్రహ బలమే బలము
పల్లవి 5 – శ్రి రాముని అనుగ్రహ బలమే బలము

ఈ కృతి వింటే సంగతుల వివరం తెలుస్తుంది. ఈ సంగతుల ప్రయోగం వల్ల వినేవారికి సాహిత్యపరంగా రసానుభూతి కలుగుతుంది. ఈ విధంగా త్యాగరాజు కృతుల్లో సంగతులు చొప్పించి జనరంజకంగా చేసాడు. అందుకే త్యాగరాజు ప్రతిభ అసమానం అని ఘంటాపథం గా చెప్పచ్చు.

త్యాగరాజు కృతుల్లో సంగతులు ఒక దాంట్లోచి ఇంకోటి అల్లికలా సహజత్వంతో, ఒక క్రమంలో సాగుతాయి. ఈ క్రమానికీ ఒక అందముంది. ఇందులో ఏ ఒక్క సంగతినొదిలేసినా మొత్తం కృతి చెడిపోతుంది. కృతిహారంలో సంగతులు వజ్రాల్లాంటివి. అంతకు ముందు కచేరీల్లో ఒకే రాగాన్ని సాగదీస్తూ మూడు గంటలు పైగా పాడేవారు. దాంతో వినే సామాన్యుల ఓపిక నశించేది. సంగతులతో కృతులకి అందమొచ్చింది. సంగీతమంటే ఆసక్తి పెరిగింది. ఇదీ కర్ణాటక సంగీతానికి త్యాగరాజు చేసిన మహోపకారం. స్వభావ రీత్యా సంగతులు రెండు విధాలు.

  • రాగభావ సంగతులు
  • సాహిత్య భావ సంగతులు

రాగభావ సంగతులు రాగంలో మిళితమైన నాదాత్మని చూపిస్తాయి. కల్యాణ వసంతంలో ‘నాదలోలుడై’, బిలహరి రాగంలో ‘నా జీవాధార’, శుద్ధ సావేరిలో ‘దారిని తెలుసు కొంటి’ వంటివి రాగభావ సంగతులున్న కృతులకి ఉదాహరణలు. ఈ కృతులు వింటే రాగ భావ సంగతుల అర్థం తెలుస్తుంది. రాయడానికి సాధ్యపడదు. ఒకవేళ రాసినా అంత సులభంగా అర్థంకాదు. విని, అర్థం చేసుకోవాలంతే! మరో మార్గం లేదు. సాహిత్యభావ సంగతులు సాహిత్యంలో ఉన్న లోపలి పొరల్ని చూపిస్తాయి. పల్లవిలో భావాన్ననుసరించి సాహిత్యం మారుతుంది. అందువల్ల ఇంకో కొత్త కోణంలో భావం స్ఫురిస్తుంది. శుద్ధ సావేరి రాగంలో ‘కాల హరణ మేలరా’ కృతిలో అనుపల్లవిని సంగతులతో ఈ క్రిందివిధంగా పాడతారు.

  1. కాల హరణ మేల
  2. కాల హరణ మేలరా?
  3. కాల హరణ మేల రామా?
  4. కాల హరణ మేల సుగుణ?
  5. కాల హరణ మేల సుగుణ జాల కరుణాల వాల?

గమనిస్తే సాహిత్యం ఎలా మారుతూ వస్తోందో తెలుస్తుంది. దాన్ననుసరించీ శ్రావ్యత (మెలడీ) ఎలా మారుతుందో వింటే అర్థమవుతుంది. ఈ రెండూ కలిస్తే కొత్త అర్థం ఎలా పుట్టుకొస్తుందో గోచరమవుతుంది.

త్యాగరాజు తన శిష్యులెవరైనా ఈ సంగతుల్ని మార్చితే వూరుకునే వాడు కాదు. ఓ సారి వెంకటరమణ బాగవతార్ ఒక కృతిలో సంగతులు మార్చి పాడాడని అది తెలిసిన త్యాగరాజు అతనికి ఓ వారం పాటు సంగీత బోధన బహిష్కరించాడు. అందువల్ల శిష్యులెవరూ ఈ సంగతుల్ని మార్చడానికి ప్రయత్నించేవారు కాదు. ఈ వెంకటరమణ భాగవతారే ఎన్నో త్యాగరాజు కృతులు స్వరాలతో సహా పొందుపరిచాడు. తన శిష్యులకి నేర్పాడు. అలాగే ఆయన కొడుకు కృష్ణ భాగవతార్ కూడా త్యాగరాజు చివర్రోజుల్లో కొన్ని కృతులు దాచుంచాడు. వీణ కుప్పయ్యర్ దగ్గర కాగితాలపై రాసున్న చాలా కృతులు లభించాయి. వీరివల్లనే త్యాగరాజ కృతులిప్పటికీ అందరికీ అందుబాటులోకి వచ్చాయి.

అన్నమాచార్యుడు కొన్ని వేల కీర్తనలు రాసినా ఎలా స్వరపరిచారో తెలీదు. ఇప్పుడు మనం వింటున్న అన్నమాచార్య కీర్తనల వరసలు ఆయన స్వరపరిచినవి కావు. కొన్నింటికి రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారే స్వరాలందించారు. ఉదాహరణకి ముఖారి రాగంలో ‘బ్రహ్మ కడిగిన పాదము’ అనే కీర్తన స్వరం ఆయన కూర్చిందే. అలాగే నేదునూరి కృష్ణమూర్తీ తదితరులు కూడా మరి కొన్ని కీర్తనలకి స్వరాలందిచారు. ఈ రకంగా చూస్తే అడిగిన వారికి కాదనకుండా సంగీతం నేర్పే గుణం త్యాగరాజు సంగీతానికి చాలా మేలు జేసింది. పదికాలాలపాటు అది నిలిచేలా శిష్యులు పొందుపరచడం మన అదృష్టం.