అలాగే వెంకట రమణ భాగవతార్ మనవడు కె.కె. రామస్వామి భాగవతార్ రచించిన త్యాగరాజ జీవిత చరిత్ర పుస్తకం (Tyagaraja: A Brief Biography) లో త్యాగరాజు భార్య కమలాంబ 1845 లో పోయినట్లుగా ఉంది. త్యాగరాజు జీవిత చరిత్ర రాసిన మంచాళ జగన్నాధ రావూ, టి. పార్థ సారధీ ఇలాగే చెప్పారు. ఇంతకుముందు సాంబమూర్తి గారు చెప్పిందానికీ, దీనికీ ఎక్కడా పోలిక లేదు. కాకపోతే సాంబమూర్తి గారి కథనం వాస్తవానికి దగ్గరగా ఉందని అనుకోడానికి ఆస్కారం ఉంది. త్యాగరాజు తన శేష జీవితంలో కోవూరు, మద్రాసు, తిరుపతి సందర్శించాడు. ఆ సమయంలో ఆయనొక్కరే ఈ ప్రదేశాలని సందర్శించినట్లుగా రూఢిగా ఉంది. అప్పటికే త్యాగరాజుకి కుటుంబ బాధ్యతలంటూ ఏవీ లేవనే పలుచోట్లా చెప్పారు. కాబట్టి రామస్వామి భాగవతార్ చెప్పింది సరికాదని గ్రహించాలి.
త్యాగరాజుపై వచ్చిన రెండు సినిమాల్లోనూ భార్యా సమేతంగా తిరుపతీ, కోవూరు సందర్శించినట్లుగా చూపించారు. పనిలో పనిగా అందులోంచి మరిన్ని కట్టు కథలు పుట్టుకొచ్చాయి. ఇవేమీ సరి కాదు. ఇందులో వాస్తవమెంతుందో చెప్పడం చాలా కష్టం.
శాంతమూ లేకా సౌఖ్యమూ లేదూ
ఓ సంగీత స్రష్టగా, ఓ రామభక్తుడిగా, ఓ వాగ్గేయకారుడిగా త్యాగరాజు మనకి తెలుసు. తను నమ్మిన సిద్ధాంతాలకి కట్టుబడీ, ఎవరినీ లక్ష్య పెట్టకుండా జీవించాడు. కానుకలకీ, సత్కారాలకీ చలించకుండా ఎవరికీ తలొగ్గకుండా బ్రతికాడు. ఎన్ని కష్టాలొచ్చినా రాముడే దిక్కన్నట్లుగా మసిలాడు. పూర్తి జీవితాన్ని పరికిస్తే మనకి తెలిసే త్యాగరాజు స్వభావమది. కానీ వ్యక్తిగతంగా, స్వభావసిద్ధంగా ఎదుటివారితో త్యాగరాజు ప్రవర్తన ఎలా ఉండేది? శిష్యుల్ని ఎలా చూసేవాడు? త్యాగరాజు కృతులు చదివిన ఎవరికైనా ఆయనొక పరమ భక్తుడిగానూ, ఎంతో శాంతంతో సంసార సాగరాన్ని అవలీలగా దాటినవాడిగానూ అనిపిస్తాడు. నిజ జీవితంలో అసలు త్యాగరాజు వ్యక్తిత్వం ఎలా ఉండేదో కొంతమంది చెప్పారు. కొంతమంది ఆ విషయాలే పట్టించుకోలేదు.

త్యాగరాజు చిత్రం మైసూర్ ప్యాలెస్
త్యాగరాజు సుమారు ఆరడగుల ఎత్తుండేవాడు. కాస్త సన్నగానే ఉండేవాడు. చామన చాయ. పెద్ద కళ్ళతో ఆకట్టుకునే ముఖవర్చస్సుతో ఉండేవాడు. మెళ్ళో తులసిమాల ధరించేవాడు. ఎప్పుడూ తెల్లటి వస్త్రాలే ధరించేవాడు. నుదుట విభూతి రేఖలుండేవి. మధ్యలో కాస్త గంధమూ, దాని మీద ఎర్రటి కుకుమ బొట్టూ ధరించేవాడు. అతి శుభ్రతా, చేదస్తమూ ఉండేవి. ఖంగుమన్నట్లుగా గొంతుండేది. ఈ వివరాలన్నీ త్యాగరాజు శిష్యుల్లో ఒకరైన వీణ కుప్పయ్యర్ రాసారు. త్యాగరాజు సినిమాలో చూపించినట్లుగా నెత్తిమీద హరిదాసు తలపాగా, చేతిలో చిరతలూ ఉండేవి కావు. ఉంఛవృత్తి సమయంలో మాత్రం నెత్తిపై హరిదాసు తలపాగా ధరించేవాడు. కాకపోతే త్యాగరాజని చెప్పగానే ఈ హరిదాసులు చిత్రీకరించిన రూపమే మన కళ్ళెదుట ఉంటుంది. ఇవీ త్యాగరాజు రూపం తాలూకు విషయాలు.
స్వభావ రీత్యా, త్యాగరాజుకి తోటి వారి యందు దయా, ప్రేమా ఉన్నాయి. కానీ సంగీత విద్య దగ్గర చండశాసనుడిలా ఉండేవాడు. ఎంతో క్రమశిక్షణుండేది. ఏమాత్రం తేడా వచ్చినా శిష్యులపై కోపగించుకునేవాడు. అందువల్ల శిష్యులందరూ ఎదుటపడి మాట్లాడ్డానికి భయపడేవారు, ఒక్క తంజావూరు రామారావు తప్ప. త్యాగరాజుకేదైనా చెప్పాలంటే శిష్యులు ఈ రామారావునే ఆశ్రయించేవారనీ కృష్ణ భగవతారూ, సాంబమూర్తీ రెండు మూడు చోట్ల వారి పుస్తకాల్లో ప్రస్తావించారు. ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ, తన గొంతుని ఎంతో జాగ్రత్తగా కాపాడుకునేవాడు. వారానికోసారి నువ్వుల నూనెతో తలంటుకుని స్నానం చేసేవాడు. వేయించిన పప్పూ, కాస్త పచ్చడీ రోజూ తినేవాడు. పొట్లకాయ కూరంటే ఎంతో ఇష్టపడేవాడు. ఇంటివెనకాల పెరట్లో శిష్యులు కూరగాయలు పండించేవారు. ఈ వివరాలు కృష్ణ భాగవతార్, సాంబమూర్తి రచనల ద్వారా తెలిసాయి.
త్యాగరాజుకి మంచి గొంతుంది. తారా స్థాయి నుండి మంద్ర స్థాయీ, అతి మంద్రస్థాయిలోనూ ఎంతో అవలలీగా పాడగలిగే వాడు. ఆయన సంగీత ప్రభావం విన్న వారందరి మీదా ఎంతగానో ఉండేది. ఎంతో మంది త్యాగరాజు గాత్రానికి ప్రభావితులై శిష్యులయ్యారు. త్యాగరాజుకి సోజిరి సీతారామయ్యనే శిష్యుడొకాయన ఉండేవాడు. ఇతని అసలు పేరు పల్లవి సీతారామయ్య. సంగీత కుటుంబాన్నుండే వచ్చాడు. కానీ ఈయన శరభోజి రాజాస్థానంలో సైనికుడిగా పనిజేసేవాడు. అందుకే ఇతన్ని సోల్జర్ సీతారామయ్య అని పిలిచేవారు. త్యాగరాజు సంగీతానికి ముగ్ధుడై ఉద్యోగాన్నొదిలేసి శిష్యుడుగా జేరాడు. వాడుకలో సోల్జర్ కాస్తా సోజిరిగా మారిందేమో. శిష్యులకెంతో శ్రద్ధతో సంగీతం నేర్పేవాడు. వాళ్ళు ఏమాత్రం శ్రద్ధ వహించకపోయినా తిట్టేవాడు. కొంతకాలం పాఠమేమీ చెప్పకుండా శిక్షించేవాడు. ఈ విషయాన్ని ఉటంకిస్తూ, టి లక్ష్మణ పిళ్ళై అనే ఆయన త్యాగరాజు గురించి Essays on Tyagaraja and his Music అనే పుస్తకంలో ఇలా రాసారు. “ప్రవర్తన రీత్యా త్యాగరాజు ముక్కోపి. అది భరించడం ఎదుటివారికి కష్టంగానే ఉండేది” అంటూ దానికొక శిష్యుడుదంతాన్నీ చెప్పారు. త్యాగరాజు వద్ద ఓ శిష్యుడు సంగీతం నేర్చుకోడానికొచ్చాడు. ఎంతో కాలం గడిచినా అతను ఒక్కడుగు ముందుకెళ్ళలేదు. పాడేటప్పుడతని తప్పుల్ని చూసి త్యాగరాజు మండిపడేవాడు. ఓ సారి ఆ శిష్యుడికి సహనం నశించి త్యాగరాజుని తూలనాడాడంటూ చెప్పారు.
త్యాగరాజు కోపాన్నుదహరించే ఓ కథ కూడా ఉంది. త్యాగరాజు ఇంటి ముందోసారి నువ్వులు ఎండబెట్టారు. ఓ కుర్రాడొకసారి ఆడుకుంటూ ఆ నువ్వుల మీదనుండి పరిగెత్తాడు. త్యాగరాజు అది చూసాడు. చటుక్కునెళ్ళి కోపంతో ఆకుర్రాడిని కొట్టాడు. ఇది చూసి భార్య కమలాంబ మందలించింది. కొంత సేపటికి త్యాగరాజుకి తను జేసిన తప్పు తెలిసింది. మనసు శాంతం కోల్పోయింది. వెంటనే ఆ పిల్లాడి తండ్రి వద్దకెళ్ళి క్షమాపణ కోరాడనీ, ఆ తరువాత ఆ పిల్లాడికి సంగీతం నేర్పాడనీ ఓ కథుంది. ఈ సందర్భంలోనే ‘శాంతమూ లేకా సౌఖ్యమూ లేదూ’ అన్న కృతిని రాసాడనీ అంటారు. ఈ కథ ముఖ్యంగా సాంబమూర్తి గారి పుస్తకంలో చాలా వివరంగా ఉంది. టి లక్ష్మణ పిళ్ళై ఇచ్చిన వివరాలు మాత్రం ఇంకెవ్వరూ ప్రస్తావించలేదు. త్యాగరాజు కోపం జూసి శిష్యులందరూ పారిపోలేదు. ఓపికా, సహనమూ ప్రదర్శించి త్యాగరాజు సంగీతాన్ని తాము నేర్చుకుని తరువాతి తరాలకి అందేలా జేసారు. ఆ విధంగా కర్ణాటక శాస్త్రీయ సంగీత ప్రాభవానికి కారకులయ్యారు.
ఆపాతమధురము – సంగీతము!
సంగీత మపి సాహిత్యం, సరస్వత్యాః పదద్వయం
ఏక మాపాత మధుర మన్య మాలోచనామృతం
ఈ శ్లోకం సంగీతరత్నాకరం లోనిది. సంగీతమూ, సాహిత్యమూ సరస్వతీ దేవి పాద పద్మాలు. ఒకటి చెవుల్లో పడగానే మధురంగా ఉంటుంది. రెండవదైన సాహిత్యం ఆలోచించే కొలదీ అమృతం ఊరుతుంది. ఈ రెంటినీ ఉపాసించినవాడు సరస్వతీ కటాక్షానికి పాత్రుడవుతాడనీ ఓ వ్యాఖ్య వుంది. (పై శ్లోకంలో పదద్వయం బదులుగా స్తనద్వయం అన్న పదం వాడుకలో ఉంది. పైనుదహరించిన శ్లోకం చర్ల గణపతి శాస్త్రి ‘గాంధర్వ వేదం – సంగీత రత్నాకరం’ అనే పుస్తకం నుండి గ్రహించబడింది. సంస్కృత మూల ప్రతికి తెలుగనువాద రచనిది. మొదటి ముద్రణ 1940లో అయితే, రెండవది 1987 లో ఆంధ్రా విశ్వవిద్యాలయం వారు పునర్ముద్రించారు.)
పై శ్లోకం చదివి త్యాగరాజ కృతులు వింటే అందులో తాత్పర్యం సులభంగా తెలుస్తుంది. త్యాగరాజు నిజంగా సరస్వతీ పుత్రుడన్న విశ్వాసం కలుగుతుంది. అలా స్వీయ సంగీతంలో స్వీయ సాహిత్యాన్ని నింపి గానం చేసే వాళ్ళని వాగ్గేయకారులన్నారు. కేవలం స్వరపరచడమే కాదు సాహిత్యమూ కూర్చాలి. తమ సొంత గొంతులో ఆ రెంటినీ నింపాలి. ఈ మూడూ వచ్చిన వాళ్ళు చాలా తక్కువమందే ఉంటారు. త్యాగరాజు అసలుసిసలైన వాగ్గేయకారుడు. ఆయనే కాదు, ఆయన శిష్యుల్ని కూడా చాలామందినీ వాగ్గేయకారులుగా మలిచాడు. ఆయన శిష్య పరంపరలో వీణ కుప్పయ్యర్, వెంకటరమణ భాగవతార్, మనచంబువాది వెంకట సుబ్బయ్యర్, పట్నం సుబ్రహ్మణ్యయ్యర్, ఇలా ఎంతో మంది వాగ్గేయకారులుగా రాణించారు. చిత్రం ఏంటంటే, శిష్యుల్లో చాలామంది మాతృభాష తమిళం అయినా అందరూ గురువుననుసరించీ, తెలుగులోనే కృతులు రచించారు.
కర్ణాటక సంగీతానికి త్యాగరాజొక కొత్త ఒరవడి చూపించాడని పండితుల అభిప్రాయం. శాస్త్రీయ సంగీతం త్యాగరాజుకి ముందూ ఉంది. ఆయనున్నప్పుడూ ఉంది. అంతకు ముందు మేళకర్త రాగ విభజన చేసిన వేంకటమఖి లాంటి ఎంతో మంది సంగీతకారులున్నారు. తన కాలంలో గురువు వెంకటరమణయ్య వాళ్ళూ వున్నారు. మరయితే ఈ త్యాగరాజు గొప్పతనం ఏమిటి? సంగీత సామ్రాజ్యానికి మకుటంలేని మహారాజుగా త్యాగరాజుని ఎందుకు కీర్తించారు? ఇది తెలియాలంటే కాస్తయినా సంగీత శాస్త్ర పరిజ్ఞానం కావాలి.
సామవేదం నుండి పుట్టిన శాస్త్రీయ సంగీతం కాలక్రమేణా అనేక మార్పులకి లోనయ్యింది. అంతవరకూ ప్రాచుర్యంలో ఉన్న రాగాలు విస్తరింపబడ్డాయి. కొత్త రాగాలు సృష్టించ బడ్డాయి. కాకపోతే అది స్థలాన్ని బట్టీ, చెప్పేవాళ్ళని బట్టీ మారుతూ వచ్చింది. ఇది పద్ధతి కాదని అప్పట్లో పురందరదాసు సంగీత బోధనకి దిశానిర్దేశం చేసాడు. ప్రాథమిక స్థాయిలో స్వరస్థాన పరిచయం కోసం సరళీ స్వరాలూ, అందులోనే అన్ని స్థాయిలూ చూపుతూ మంద్ర స్థాయీ, తారాస్థాయి పరిచయమూ జరిగేట్లా కొన్ని పాఠాలు చేకూర్చాడు. సరళీ స్వరాల తర్వాత జంట స్వరాలూ, దాని వెంబడీ వివిధ తాళ రీతులతో అలంకారాలూ చేర్చాడు. ఇందులో కాస్త ప్రవేశమొచ్చిందన్న తరువాత చిన్న చిన్న గీతాలు చేర్చాడు. వీటినే పిళ్ళారి గీతాలు అంటారు. పురందరదాసు రచించిన పిళ్ళారి గీతాలే ఇప్పటికీ ప్రథమ గీతాలుగా చెప్పడం ఆనవాయితీగా వస్తోంది. ఈ గీతాల తరువాత లక్షణ గీతాలనీ, తర్వాత వర్ణాలూ, కీర్తనలూ అంటూ ఓ పద్ధతిని సూచించాడు. పురందరదాసు సూచించిన ఈ పద్ధతి బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. పురందరదాసు సంగీత బోధనకే ఒక పద్ధతి చూపాడు తప్ప సంగీత శాస్త్రానికి కాదు. ఇది ఇక్కడ గమనించాలి.
పూర్వకాలం నుండీ శాస్త్రీయ సంగీతం భక్తి వాహకంగానే సాగింది. దేముణ్ణి కీర్తించేవి కాబట్టి ఆ పాటలని కీర్తనలన్నారు. కీర్తన నేపథ్యాన్ని సూచించే మొదటిసాహిత్యపు వరుసనే పల్లవి అన్నారు. ఆ పల్లవిననుసరించి సాగే వరుసల్ని చరణం అన్నారు. ఒక కీర్తనలో ఒకటికంటే ఎక్కువ చరణాలుండచ్చు. వీటి రూపంలోనే సంగీతం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ కీర్తనలనే కృతి అని కూడా అంటారు. కృతి అంటే సంస్కృతంలో చెయ్యబడినది అని అర్థం. ఒక కీర్తన రూపంలో సాహిత్యాన్ని అమర్చి దానికి సంగీతం కూర్చే పని చేయడం కాబట్టి కృతి అన్నారు. ఈ కృతి అనే పదాన్ని కీర్తనలకి పర్యాయ పదంగా పురందరదాసూ, అన్నమయ్యా వాడారు. కృతి, కీర్తనా ఒకదానికొకటి పర్యాయ పదాలుగా వాడినా, రెండూ ఒకటి కాదన్న తేడాని త్యాగరాజు విశదీకరించాడు.