మనకు తెలియని మన త్యాగరాజు – 3

ప్రతీ ఏటా త్యాగరాజు శ్రీరామ నవమి ఉత్సవాలు చేసేవాడు. ఏడాదిలో చైత్రమాసం మొత్తమూ శిష్యులు తనవద్దే ఉండేలా ఆదేశించేవాడు. రామబ్రహ్మం బ్రతికున్నన్నాళ్ళూ ఆయనే ఈ ఉత్సవాలు జరిపేవాడు. తండ్రిపోయిన తరువాత త్యాగరాజు ఆ బాధ్యత తన నెత్తిమీద పెట్టుకున్నాడు. ఈ సీతారామ కల్యాణం చేయడమన్న ఆచారం భద్రాచల సీతారామ కల్యాణాన్ననుసరించి వచ్చిందేనని నా ప్రగాఢ విశ్వాసం. రామబ్రహ్మం పూర్వీకులు కర్నూలు దగ్గరున్న ఓ చిన్న గ్రామం నుండి తంజావూరు వలసవెళ్ళారని ఇంతకుముందు ప్రస్తావించుకున్నాం. తన ఆఖరి శ్వాస విడిచే వరకూ త్యాగరాజు ఈ శ్రీరామ నవమి జరిపాడు, ఒకే ఒక్క ఏడాది తప్ప. ఆ ఒక్క ఏడాదీ చేయలేకపోవడానికీ ఓ పెద్ద కథుంది. కారణం ఉంది.

ఎందు దాగినాడో? – రార మాయింటి దాక!

శరభోజి ఆహ్వాన తిరస్కారంతో త్యాగరాజుకీ, పంచనదయ్యకీ మధ్య అభిప్రాయ బేధాలొచ్చాయి. ఇల్లు వాటాలు పడింది. త్యాగరాజు తల్లి సుమారు 1804 లో మొదట్లో పోయింది. త్యాగరాజు అన్నగారి ప్రవర్తన్ని పట్టించుకునే వాడు కాదు. ఎంత సేపూ తనూ తన సంగీతమూ, రామ భక్తీ తప్ప, వేరే ధ్యాసుండేది కాదు. శిష్యులు కొంతమంది త్యాగరాజు ఇంట్లోనే ఉండే వారు. ఏ ఉద్యోగమూ సద్యోగమూ లేకుండా ఇంతమంది త్యాగరాజుని అంటిపెట్టుకుండడం పంచనదయ్య భరించలేకపోయాడు. ఎంతో అక్కసుగా ఉండేది. దాంతో ఈర్ష్యాసూయలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎలాగైనా త్యాగరాజుకి మనస్తాపం కలిగించాలి అని పథకం వేసాడు. ఆ యేడు సంక్రాంతి భోగి పండుగ తర్వాత అనుకున్నంత పనీ జేసాడు.


కావేరీ నది

ఓ రోజున ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పంచనదయ్య త్యాగరాజు పూజించుకునే సీతారామ విగ్రహాలనపహరించాడు. ఏ కంటికీ కనపడకుండా అవి తీసుకెళ్ళి కావేరీ నదిలో పడేసాడు. పూజా గృహంలో విగ్రహాలు మాయం కావడంతో దాదాపు మూణ్ణెల్లు పైగా త్యాగరాజు మనస్తాపం చెందాడు. ఆ సందర్భంలోనే ‘ఎందు దాగి నాడో ఈడకు రానెన్నడు దయ వచ్చునో ఓ మనసా’ అనే కృతిని రాసాడని అంటారు. ‘నేనెందు వెతుకుదురా హరిని’ అనే కృతి కూడా ఈ సందర్భంలో స్వర పరిచిందేనని సంగీతజ్ఞుల అభిప్రాయం. త్యాగరాజుకి విగ్రహాలు పోయాక తిరువయ్యారు జీవితంపై విరక్తి కలిగింది. మనస్థిమితం లేకుండా పోయింది. స్థలం మారితే మనస్థిమితం వస్తుందని ఆ ఏడాది శివరాత్రి పూజకి మనచంబువాది వెంకటసుబ్బయ్యర్ ఇంటికెళ్ళాడు కానీ కొద్ది రోజులుండి తిరువయ్యారు తిరిగొచ్చేసాడు. ఈ విషయాన్ని రామస్వామి అయ్యరూ, టి. సుందరేశ శర్మా, మంచాళ జగన్నాధరావూ, సాంబమూర్తితో సహా అందరూ చెప్పారు.

తిరువారూర్లో ఏటా జరిగే త్యాగలింగేశ్వర స్వామి ఉత్తర ఫల్గుణి ఉత్సవానికి ఆ ఏడాది త్యాగరాజు వెళ్ళి వచ్చాక ఓ రాజు రాత్రి కలలో రాముడు కనిపించి, విగ్రహాలు కావేరీ నదిలో ఉన్నాయి, వెతకమని చెప్పినట్లుగా ఓ కథుంది. నిద్రలేచి వెళ్ళి కావేరిలో వెతికితే, అందులో పోయిన విగ్రహాలు కనిపించాయి. ఆ తరువాతే త్యాగరాజు మామూలు మనిషయ్యాడు. ఇదీ ఈ విగ్రహాల వెనుకున్న కథ. ఇది సుమారుగా 1805 లో జరిగింది. ఈ కథని ప్రస్తావించని వారు లేరు. తెలియని వారూ లేరు. బహుళ ప్రాచుర్యమున్న ఈ సంఘటనలో కొన్ని అభిప్రాయ బేధాలున్నాయి.

త్యాగరాజు పూజా మందిరంలో ఉన్న సీతా రామ లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలు పంచనదయ్య కావేరీ నదిలో పడేయలేదనీ, అవి ఇంటి వెనకాల నూతిలో పడేసాడనీ ఒక వివాదముంది. ఇది సుబ్బరామ దీక్షితార్ అనే ఆయన 1893 లో రాసిన సంగీత సంప్రదాయ ప్రదర్శిని అనే పుస్తకంలో ప్రస్తావించారు. అందులో ఈ త్యాగరాజ చరిత్ర గురించి ఉంది. కేవలం ఈయనొక్కడే విగ్రహాలు నూతిలో పడేసినట్లుగా చెప్పాడు. దీనికాధారం మాత్రం చెప్పలేదు.

ఇహ రెండోది త్యాగరాజుకి కలలో రాముడు కనిపించాడన్న విషయం. కలలో రాముడు కనిపించి, కావేరీ నదిలో విగ్రహాలు వెతకమని చెప్పాడని పురాణీకులందరూ రక్తిగా చెప్పారు. కానీ ఇది నిజం కాదని మరికొందరి అభిప్రాయం. 1805 లో తంజావూరులో అతి భీకరమైన కరువొచ్చింది. అలా ఎండిపోయిన కావేరీ నదొడ్డున ఇసకలో కూరుకుపోయిన విగ్రహాలు త్యాగరాజుకి కనిపించాయనీ వారి వాదన. కల విషయంలో వాస్తవమెంతుందో తెలీదు కానీ, ఇది మాత్రం నమ్మేలా ఉంది. “హిందువులకి పురాణ కథల మీదున్న మక్కువతో చరిత్రని వక్రీకరించీ, మహిమలు జోడించీ, భక్తుల జీవిత గాథలు రాయడమన్నదొక పద్ధతిలా కనిపిస్తుందని విలియం జాక్సన్ తన Tyagaraja: Life and Lyrics లో అభిప్రాయపడ్డాడు. ఆలోచిస్తే ఇదీ నిజమే ననిపిస్తుంది.

చివరగా మూడోది నాకొచ్చిన సందేహం. త్యాగరాజుకి రామబ్రహ్మం వంశపారంపర్యంగా ఇచ్చిన రామ విగ్రహం ఇప్పటికీ మదురై సౌరాష్ట్ర సభలో ఉంది (ఆ చిత్రాన్నే ముందు భాగాల్లో వేయడం జరిగింది) ఆ విగ్రహం భధ్రాచల రాముడి విగ్రహాల్ని పోలుంటుంది. అందులో సీతా, రామ, లక్ష్మణ, ఆంజనేయ విగ్రహాలన్నీ ఒకే అచ్చులో ఉంటాయి. విడి విడి విగ్రహాలు కావు. కానీ నేను తిరువయ్యారులో త్యాగరాజు సమాధి మందిరంలో విడి విడిగా ఉన్న సీతా రామ లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలు చూసాను. మదురై సభలో నున్న విగ్రహం ఏమిటది? అది రామబ్రహ్మమిచ్చిందనీ ఖచ్చితమైన ఆధారాలున్నాయి. అది త్యాగరాజు తదనంతరం ఆయన శిష్యులు పొందు పరిచారనీ రాసారు. అంటే త్యాగరాజు పూజాగృహంలో రెండు రకాలైన విగ్రహాలుండేవి. ఒకటి తండ్రిచ్చిన రామ పంచాయతన విగ్రహమూ (మదురైలో ఉన్నది), రెండోది త్యాగరాజు సమాధి మందిరంలో (తిరువయ్యార్ లో) ఉన్నదీ అయ్యుండాలి. పైన చెప్పిన కథ చూస్తే పంచనదయ్య కావేరీలో విసిరేసినవి శ్రీరామ నవమి సందర్భంలో కళ్యాణం జరిపిన ఉత్సవ విగ్రహాలే ఆయ్యుండాలని నా అభిప్రాయం. అలాగే హిందూ పూజా విధానంలో ఉత్సవ విగ్రహాలు వేరు, పంచాయతన విగ్రహాలు వేరు. ఇక్కడ ఉత్సవ విగ్రహాలంటే కళ్యాణం చేసే విగ్రహాలు. సాధారణంగా కళ్యాణ విగ్రహాల్ని నిత్య పూజా విధానంలో ఉంచరు. పోయినవి ఏ విగ్రహాలయితేనే అనిపించచ్చు. కానీ ఎన్నో పుస్తకాలు చదివాక, కొన్ని ప్రత్యక్షంగా చూసాక అన్నీ సమన్వయం చేసుకునే ప్రయత్నమే తప్ప ఇది మరోటి కాదు.


సీతారాముల విగ్రహాలు

ఈ విగ్రహాల కథ సాంబమూర్తి గారి ది గ్రేట్ కంపోజర్స్ లోనూ వుంది. కాకపోతే ఆయన రాసిన ఒక విషయం మాత్రం సరికాదని రూఢిగా చెప్పచ్చు. ఈ విగ్రహాలు పోయిన సంఘటన త్యాగరాజూ, పంచనదయ్యల ఇల్లు పంపకం ముందు జరిగిందని చెబుతూ, ఇది 1805 లో జరిగిందని రాసారు. ఇల్లు పంపంకం సుమారు 1802 చివర్లో జరిగింది. ఆ తరువాత 1804 లో వారి తల్లి పోయింది. చారిత్రిక విషయాలొచ్చేసరికి చాలామంది రచయితలు పొంతన లేకుండా చెప్పారు. పైన చెప్పిన కథా సమయంలోనే ‘రార మాయింటి దాకా’ అనే కృతి రచించినట్లుగా ఒక అపోహుంది. సినిమాలోనూ ఆ విగ్రహాలు ఇంటికి తిరిగి తీసుకొస్తూనే ఈ కృతి పాడుతున్నట్లుగా చూపించారు.అసావేరి రాగంలోని ఈ కృతి ప్రహ్లాద భక్తి విజయం నృత్యనాటికలోది.

విగ్రహాలు దొరికిన తర్వాత పంచనదయ్యకి పక్షవాతమొచ్చింది. ఆ సమయంలోనే తను చేసిన పనికి పశ్చాత్తాప పడుతూ త్యాగరాజుని క్షమించమని అడిగాడనీ కొంతమంది రాసారు. కావేరీ నదిలో ఎక్కడ పంచనదయ్య విగ్రహాలు పడేసాడో అదే ప్రదేశంలో అతని ముని మనవడు నీళ్ళల్లో మునిగి చనిపోయాడని కొంతమంది రాసారు. ఈ విషయం సాంబమూర్తి గారూ రాసారు. టి. ఎస్. సుందరేశ శర్మ సంస్కృతంలో రాసిన త్యాగరాజ చరిత్రంలో ఈ సంఘటన ప్రస్తావించారు. ఇది ఒక నాటక రూపంలో అంకాలుగా రాసారు. పోయిన విగ్రహాలు ఓ ఏడాది వరకూ దొరకలేదన్నట్లుగా ఈయన రాసారు. అంతేకాకుండా విగ్రహాలు పోవడంతో త్యాగరాజు పడే బాధ చూసి మనసు మార్చుకొనీ, పశ్చాత్తాపంతో పంచనదయ్య కూడా కావేరీ నదిలో విగ్రహాలు వెతికినట్లుగా చెప్పారు. విగ్రహాలు పోయి దొరికిన సంఘటనలో నాటకీయత ఎక్కువగా ఉండడం వల్ల ఈ కథ బహుళ ప్రాచుర్యం పొందింది. త్యాగరాజు రామ భక్తుడవడం వల్ల ఇదో పురాణ గాధయ్యింది.

నను పాలింప నడచి వచ్చితివో?

త్యాగరాజుకి సీతాలక్ష్మి అనే కూతురుంది. అమ్మాళ్ అగ్రహార వాస్తవ్యుడైన కుప్పుస్వామి అయ్యర్ తో ఆమెకు పదమూడో ఏట వివాహం జరిపించాడు. ఈ పెళ్ళి పనులన్నీ తంజావూరు రామారావే దగ్గరుండి జరిపించాడు. ఈ పెళ్ళి సంబంధం కుదిర్చింది కూడా ఇతనే. సరిగ్గా ఈ పెళ్ళి కుదిరే సమయానికి వెంకటరమణ భాగవతార్ స్వంత పని మీద వాలజపేట వెళ్ళాల్సి వచ్చింది. సీతాలక్ష్మి పెళ్ళి ఇంకో నాలుగు రోజులుందనగా తెలిసింది. వెంటనే బయల్దేరాడు. పెళ్ళికి ఉత్తి చేతుల్తో వెళితే బాగుండదనిపించింది. వెల్లూర్ లో ఉన్న తన స్నేహితుడు పల్లవి ఎల్లప్పయ్యర్ తో తిరువయ్యార్ పెళ్ళికి వెళుతున్నట్లుగా చెప్పాడు. ఎల్లప్పయ్యర్ మంచి చిత్ర కారుడు. అతను చిత్రించిన రామ పట్టాభిషేకం చిత్రాన్ని వెంకటరమణ భాగవతార్ అడిగి తీసుకుని బహుమతిగా పట్టుకెళ్ళాడు. తను తెచ్చిన రామ పట్టాభిషేక చిత్రాన్ని గురువుగారికి బహుకరించాడు. ఆ పెళ్ళి రోజు సాయంత్రం జరిగిన సంగీత కచేరీలో త్యాగరాజు ‘నను పాలింప నడచి వచ్చితివో’ అనే కృతిని ఆశువుగా స్వరపరిచి పాడాడనీ వెంకటరమణ భాగవతారే రాసాడు. ఈ చిత్ర పటం మదురై సౌరాష్ట్ర సభలో ఉంది. ఇంతకు పూర్వమిది పంచనదయ్య మనవడు పట్టాభిరామ భాగవతార్ ఇంట్లో ఉండేది. కూతురు వివాహం జరిగే సమయానికి త్యాగరాజు వయసు సుమారు నలభై మూడేళ్ళు. ఈ వివాహం 1810 లో జరిగింది. ఇది జరిగిన రెండేళ్ళకి కమలాంబకి అస్వస్థత చేసి, కొంతకాలానికి జబ్బుతో పోయింది.

చాలా పుస్తకాల్లో కమలాంబ మరణం గురించి వివరంగా లేదు. కొంతమంది అసలు ఆ ప్రస్తావనే తీసుకు రాలేదు. సాంబమూర్తి గారి ది గ్రేట్ కంపోజర్స్ లో ఒక చోట కొన్ని కృతుల రచనా సందర్భాన్ని చెబుతూ ఈ విషయం ప్రస్తావించారు. “అన్నగారు పంచనదయ్య త్యాగరాజుకి నలభై నాలుగో ఏట పోయారు. ఆ తరువాత కొంత కాలానికి త్యాగరాజు రెండో భార్య మరణించింది. అప్పటికి త్యాగరాజు కూతురి సీతాలక్ష్మికి అయిదారేళ్ళుంటాయి. ఆ చిన్నపిల్ల ఆలనా పాలనా శిష్యులు చూసుకునేవారు. పల్లవి దొరైస్వామి అనే శిష్యుడు ప్రతీ రోజూ సీతాలక్ష్మిని పదునైదు మండపం (ఇది ఇప్పటికీ ఉంది. దీన్ని తుల్జాజీ పండితుల వసతి కోసం కట్టించాడు.) లో ఉన్న తన ఇంటికి తీసుకెళ్ళేవాడు. ఇది చూసి పంచనదయ్య కొడుకులు పట్టాభిరామం మరియు సుబ్రహ్మణ్యమూ, సీతాలక్ష్మి పెంపకం కోసం త్యాగరాజు మరో వివాహం చేసుకునే విషయం బంధువర్గంలో చర్చించారు. ఇదే విషయాన్ని త్యాగరాజుతో చెబితే ఒప్పుకోలేదు. ఒకటికి పదిసార్లు బ్రతిమాలితే, ‘ఒక మాట, ఒక బాణం’ అంటూ కృతి కట్టి మరీ చెబుతూ ఆ వివాహాన్ని తిరస్కరించాడు. ఈ విధంగా త్యాగరాజు అపత్నీకుడు గానే మిగతా జీవితం గడిపాడు” అంటూ రాసారు. దీన్ని బట్టి చూస్తే కమలాంబ త్యాగరాజుకి నలభై అయిదేళ్ళ వయసులోనే పోయిందన్న విషయం తెలుస్తుంది. కానీ సాంబమూర్తి గారి పై వ్యాఖ్యలో సీతాలక్ష్మి వయసు విషయంలోమరో తప్పు కనిపిస్తుంది. సీతాలక్ష్మి వివాహం పదమూడవ ఏట, తల్లి బ్రతికి ఉండగానే జరిగింది. మరి పైన చెప్పిన దాని ప్రకారం తల్లి పోయేనాటికి సీతాలక్ష్మి అయిదారేళ్ళ పిల్ల. ఈ రెండూ చూస్తే ఎక్కడా పొంతన కుదరదు. ఇలాంటివి చదివాక ఏది కట్టు కథో, ఏది నిజమో తెలీదు.