జమిలి వేలుపు కావ్యం – ఉత్తర హరివంశం

నాల్గవ కథ పౌండ్రక వధ, మళ్ళీ దుష్ట శిక్షణ. ఈ పౌండ్రకుడు రాక్షసుడు కాదు. మూర్ఖుడైన రాజు. తానే దేవుడనుకుంటాడు. నిజమైన వాసుదేవుడు తానేనని చాటుకుంటాడు. భౌతికమైన, యాంత్రికమైన ఆయుధాలతో శ్రీకృష్ణుని జయించగలనని విఱ్ఱవీగుతాడు. కృష్ణునిపై దండెత్తుతాడు కానీ అతని చక్ర ధాటికి తునాతునకలైపోతాడు. ఈ కథనం కావ్య పురాణ శైలీ మిశ్రమంగా సాగుతుంది. దీని తర్వాత వచ్చే కృత్యా సంహారం మరీ విచిత్రమైన కథనం. ఇందులో మూడువంతుల ముప్పావు పాచికలాట వర్ణనే! ఈ పాచికలాట గురించిన విశేషాలు చెప్పాలంటే దానికి మరో వ్యాసం అవసరమవుతుంది.

తర్వాత వచ్చేది హంసడిభకుల కథ. ఇది కూడా దుష్ట శిక్షణే. వీళ్ళు కూడా రాక్షసులు కారు. అయినా వీళ్ళు మూర్ఖులు కారు. వీళ్ళలో హంసుడు చాలా తెలివైనవాడు కూడాను. పౌండ్రకునిలా వీళ్ళు వట్టి భౌతికమైన ఆయుధాలమీద ఆధారపడరు. శివుని మెప్పించి దివ్యాస్త్రాలని పొందుతారు. దానితో వీళ్ళలో అహంకారం పెరుగుతుంది. సన్యాసి అని దుర్వాసుని అవమానిస్తారు. రాజులందరినీ గెలిచి రాజసూయ యాగం చెయ్యాలని హాఠాత్తుగా బుద్ధిపుడుతుంది వీళ్ళకి. శ్రీకృష్ణుని కూడా కప్పం కట్టమని అతని భక్తుడయిన జనార్దనుని రాయబారం పంపిస్తారు. అప్పటికే దూర్వాస మునిని అవమానించినందుకు వాళ్ళకి శాస్తి చెయ్యాలని ఆలోచిస్తున్న కృష్ణుడికి వెదుకబోయిన తీగ కాలికి తగిలినట్లవుతుంది. కప్పం కట్టడానికి ఒప్పుకోననీ యుద్ధానికి సిద్ధం కమ్మనీ జవాబు పంపిస్తాడు. యుద్ధం చేసి హంసుడిని యమునలో ముంచేస్తాడు. అన్న చావుతో డిభకుడు కూడా యమునలో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ కథ మొత్తం పూర్తి నాటకీయ శైలిలో సాగుతుంది. సోమనపై తిక్కన ప్రభావం యీ రచనలో స్పష్టంగా కనిపిస్తుంది.

ఉత్తరహరివంశంలో చివరి కథ బాణుడి వృత్తాంతం. ఇది దుష్ట శిక్షణ అనీ చెప్పలేము, శిష్ట రక్షణ అనీ చెప్పలేము! బాణుడు రాక్షసుడు. బలి చక్రవర్తి కుమారుడు, శివునికి పరమ భక్తుడు అయిన అతడిలో క్రూరత్వం లేదు. బాణుడికి ఉన్నదల్లా చేతుల తీట. అతడికి వెయ్యిచేతులుంటాయి. వాటితో యుద్ధం చెయ్యకపోతే ఎలా అని అతడి బాధ. శివుని కోసం తపస్సు చేసి ఒక మహా యుద్ధాన్ని వరంగా కోరుకుంటాడు. తన భక్తుని మూర్ఖత్వానికి నవ్వుకొని, శివుడు సరే నంటాడు. నాటకానికి పార్వతీదేవి నాంది పలుకుతుంది. బాణుడి కూతురు ఉషకి, కాబోయే భర్త ఫలానా రోజు కలలో కనబడతాడని చెపుతుంది. కలలో కృష్ణుడి మనుమడైన అనిరుద్ధుడు కనిపించడంతో అతని ప్రేమలో పడుతుంది ఉష. చెలికత్తె ద్వారా తన అంతఃపురానికి అతడిని రప్పించుకుంటుంది. ఉషా అనిరుద్ధులు ప్రేమ సాగరంలో ఓలలాడుతూ ఉంటారు. అది తెలిసిన బాణుడు అనిరుద్ధునితో యుద్ధం చేసి అతడిని బంధిస్తాడు. అది తెలుసుకున్న కృష్ణుడు బాణుడి మీదకి దండెత్తి వస్తాడు. శివుడు, కుమారస్వామి బాణుడికి అండగా నిలుస్తారు. ఘోర సంగ్రామం జరుగుతుంది. కృష్ణుడు చివరికి బాణుడి రెండు చేతులు మాత్రం మిగిల్చి తక్కినవన్నీ చక్రంతో నరికివేసి అనిరుద్ధుణ్ణి విడిపించుకొని తీసుకుపోతాడు. యుద్ధానంతరం బాణుడు బుద్ధి తెచ్చుకొని తిరిగి శివుని ప్రార్థించి యథాస్థితిని పొందుతాడు. అలాగే శివుని ప్రమథగణాలలో స్థానాన్ని కూడా సంపాదిస్తాడు. ఇదీ కథ! ఇది చదివితే, ఇదంతా హరిహరులిద్దరూ ఆడిన పెద్ద నాటకమని అనిపించక మానదు. ఇది పూర్తిగా ప్రబంధ శైలిలో సాగే కథ.

ఇలా ఒకే కావ్యంలో యిన్ని శైలీ భేదాలని చూపించాడు సోమన. వైవిధ్య భరితంగా సాగే ఆ కథనం అర్థమైతే, చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

వక్రత

వక్రత అంటే, చెప్పే విషయాన్ని సాధారణంగా సూటిగా కాకుండా, విభిన్నంగా చెప్పడం అని నా ఉద్దేశ్యం. ఉదాహరణకి “శ్రామికుని నెత్తురు చెమటగా కారిపోతోంది” అని చెప్పడం సాధారణ అలంకారం. అదే, “శ్రామికుని నెత్తురు ఎఱ్ఱదనం కోల్పోయి పల్చబడి ఒంటిమీంచి జారిపోతోంది” అని అంటే అది వక్రత. వక్రత చెప్పే విషయాన్ని గూర్చి అనేక కోణాలని చూపించగలుగుతుంది, కానీ కొన్నిసార్లు కవిత్వంలో అస్పష్టతకి కూడా దారితీస్తుంది. ఉత్తరహరివంశంలో అడుగడుగునా యీ వక్రత అగుపడుతుంది. చెప్పే విషయం కానీ, చేసే వర్ణనకానీ ఏదో విలక్షణతతో, వక్రమార్గం లోనే సాగించడం సోమన ప్రత్యేకత. ఉదాహరణకి యీ పద్యం చూడండి:

కుజము కుంజరముచే కూలునో కూలదో?
కూలు; కుంజరము నీ కుజము గూల్చె!
మ్రాను పేరేటిచే మడుగునో మడుగదో?
మడుగు; పేరేటి నీ మ్రాను మడచె!
గాలునో యొకనిచే గాలదో సాలంబు?
గాలు; నీ సాలంబు గాల్చె నొకని!
దునియునో పరశుచే దునియదో వృక్షంబు?
తునియు; నీ వృక్షంబు తునిమె బరశు!
 
ననుచు దమలోన జర్చించు నమరవరుల
కభిమతార్థ ఫలార్థమై యంద వచ్చు
పారిజాతంబు నా మ్రోల బండియుండ
నంద గంటి నా కోర్కుల నంద గంటి!

ఇది కృష్ణుడు శివుని స్తుతించే పద్యం. పద్యం చదివిన వెంటనే ఇందులో కవి చెప్పదలచుకున్న విషయమేమిటన్నది బోధపడదు. వాక్య నిర్మాణంలోనూ, చెప్పిన విధానంలోనూ ఉన్న వక్రత దీనికి కారణం. శివుని పారిజాతవృక్షంతో పోలుస్తున్నాడు కృష్ణుడు. చెట్టు ఏనుగు చేత కూలుతుందా కూలదా? కూలుతుంది. కాని ఇక్కడ చెట్టు ఒక ఏనుగుని కూల్చింది! అలానే తర్వాత పాదాలలో చెట్టు పెద్ద ఏరువల్ల వంగిపోవడం, అగ్ని వలన కాలడం, గొడ్డలిచేత విరగడం శివుని విషయంలో తారుమారవ్వడం కనిపిస్తుంది. మొదటి పాదంలో ప్రశ్నకి రెండవ పాదం మొదటి పదంతో సమాధానం చెప్పడం, ఆ తర్వాత దానికి వ్యతిరేకమైనది శివుని విషయంలో జరగడాన్ని ప్రస్తావించడం ఇక్కడ పద్య (వాక్య) నిర్మాణంలో సోమన చూపించిన వక్రత. ఇదే అస్పష్టతకి దారితీస్తోంది. అలాగే ఇక్కడ ప్రస్తావించబడిన అంశాలు అర్థమవ్వాలంటే కొంత పురాణ జ్ఞానం అవసరమవుతుంది. శివుడు గజాసురుని సంహరించడం, గంగ గర్వాన్ని అణచడం, మన్మథ దహనం – ఇవి మొదటి మూడు పాదాలలోని అంశాలు, ప్రసిద్ధమైనవే. నాల్గవ అంశం శివుడు పరశువుని ఖండించడం. దక్ష యజ్ఞ ధ్వంసమప్పుడు శివుడు విష్ణుమూర్తి పరశువుని ఖండించాడని ఒక కథ ఉంది. బహుశా ఇక్కడ ప్రస్తావించినది అదే. ఈ కథలు తెలియకపోతే పద్యం అసలు అర్థం కాదు.