తెలుగు కథల పోటీ
తెలుగు కథ శతవార్షికోత్సవ సందర్భంగా కౌముది వెబ్ మాస పత్రిక, రచన మాస పత్రికలు సంయుక్తంగా కథల పోటీ నిర్వహిస్తున్నాయి.
పోటీకి కథలు అందవలసిన చివరి తేదీ: జనవరి 31, 2009
ఫలితాల ప్రకటన: ఏప్రిల్ 1, 2009
తెలుగు కథ శతవార్షికోత్సవ సందర్భంగా కౌముది వెబ్ మాస పత్రిక, రచన మాస పత్రికలు సంయుక్తంగా కథల పోటీ నిర్వహిస్తున్నాయి.
పోటీకి కథలు అందవలసిన చివరి తేదీ: జనవరి 31, 2009
ఫలితాల ప్రకటన: ఏప్రిల్ 1, 2009
ఆశాజీవి అభిప్రాయం:
November 18, 2008 11:10 am
ఏమిటో, ఈ కథల పోటీ లేమిటో
నీ కథ కన్నా నా కథ గొప్పని నా ఘోష ఏమిటో!!
విద్యలో పోటీ, వ్యాపారంలో పోటీ
కథల్లో పోటీ, కవితల్లో పోటీ
ఇంట్లో పోటీ, వీధిలో పోటీ
ఈ పోటీల్లో నేనే గొప్పనే నా తపన ఏమిటో!!
దేశంలో రాజకీయాలు, రాష్ట్రంలో రాజకీయాలు
యూనివర్శిటీలో రాజకీయాలు, కాలేజీలో రాజకీయాలు
కథల న్యాయ నిర్ణేతల్లో రాజకీయాలు
అందరూ నా కథనే మెచ్చాలన్న నా కీర్తి కాంక్ష ఏమిటో!!
న్యాయ నిర్ణేతలదే తుది నిర్ణయం
పాఠకులకి అభిప్రాయాలు తప్ప హక్కులు లేవు
ఈ నియమాలకి లోబడే రచయితలకి వెన్నెముకలు లేవు
అయినా కథల పోటీలు వర్థిల్లుతూనే వుంటాయేమిటో!!
ఒక్క కథా బాగో లేదంటారు
అందుకే, ఒకటీ, రెండూ రద్దు చేసి, మూడో బహుమతి ముగ్గురికిస్తారు
రచయితలు అక్కడా, ఇక్కడా ఆక్రోశిస్తారు
అయినా క్రమం తప్పకుండా పోటీలో పాల్గొంటారెందుకో!!
సాహిత్య ప్రపంచంలో కూడా ప్రవేశించిన పోటీ సంస్కృతిని
హతమార్చడానికి రచయితలు చాలరు, పాఠకులే నడుం కట్టాలి
వర్గ బేధాలతో కుళ్ళి పోయిన సమాజంలో
కథల్లో పోటీని పెట్టిన పెట్టుబడిని నరికే దెవరో!!
- ఓ ఆశాజీవి
Sai Brahmanandam అభిప్రాయం:
November 19, 2008 8:29 pm
ఆశాజీవి గారూ,
మీ ఆక్రోశం బావుంది. కవితావేదనా నచ్చింది. కథల పోటీల ద్వారా మంచి కథలొస్తాయో లేదో తెలీదు. కొత్త కథకులు పుడతారో లేదో తెలీదు. సాహిత్యానికి ఏం ఒరిగినా, ఒరగక పోయినా పత్రికలకి ఏడాదికి సరిపడా ముడిసరుకు లభిస్తుంది. కథలకోసం ఎవరి వెంటా పడనవసరం లేదు. పాతికేళ్ళ క్రితం నాటి ( 1970 - 80 ల మధ్యకాలం ) నాటి కథలపోటీలకీ, ఇప్పటి కథల పోటీలకీ, కథల పరంగానూ, బహుమతులు పంచే తీరులోనూ చాలా తేడా ఉంది. కథల నాణ్యత పడిపోయినంత వేగంగానూ ఇవన్నీ పడిపోయాయి.
చాలా కాలం నాటి మాట. ఆంధ్రప్రభలో చివుకుల పురుషోత్తం ” ఏది పాపం?” నవలకి మొదటి బహుమతి ఇస్తే అది ప్రధమ బహుమతికి ఎంపిక ఎందుకు చేసారో మూడు పేజీల సమీక్ష రాసారు. అదే ఆంధ్రప్రభ ( యాజమాన్యం మారారులెండి ) రెండేళ్ళ క్రితం కథల పోటీలో బహుమతిచ్చిన కథలు నాసిరకం కన్నా హీనంగా ఉన్నాయి. పైగా పేరుమోసిన రచయిత ( త్రు ) లూ (అందులో ఒకరు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కూడా ) ఆ పోటీకి గుణనిర్ణేతలు. వచ్చిన చెత్తలోంచి మంచి చెత్తని ఏరి మనముందు పోసారంతే! ఆ కథల్లో కథనం లేదు. శిల్పం లేదు. పాత్రోచితం అంతకన్నా లేదు. కేవలం వస్తువు ఆధారంగా బహు”మతులు” ఇచ్చారు. దళిత పీడిత కథకొకటీ, స్త్రీల సమస్యలకొకటీ, ప్రాంతీయతత్వానికొకటీ, గ్లోబలైజేషన్ ప్రభావం మీదొకటీ ఇలా అన్ని వస్తువులూ ఏరారు. రాశి తప్ప వాసి లేదంటూ సరిపుచ్చుకున్నారు.
ఇలాంటివాటినెవరూ ప్రశ్నించరు! అడిగితే వచ్చే జవాబు తెలుసు. ఆంధ్రభూమి వాళ్ళు ఏటా ఉగాది కథల పోటీ పెడతారు. ఎందుకొచ్చిన పోటీలనీ ఆ పత్రిక సంపాదకులతో అంటే - ఎవరి వెంటా పడనవసరం లేకుండా ఈ పోటీ ద్వారా మాకు ఏడాదికి సరిపడా కథలొస్తాయంటూ నిజాయితీగానే చెప్పారు. మీరు ఓ విషయం గమనించారో లేదో తెలీదు. గత అయిదేళ్ళగా కథల పోటీలు చూస్తే అవే రచయితలు అన్ని పోటీల్లోనూ బహుమతులు కొట్టేస్తున్నారు. నిజాయితీ, నిబద్ధతా అందరికీ లోపిస్తోంది. మనం ఎంత గట్టిగా అరిచినా వారి చెవుల్ని చేరదు. ఆ మధ్య విపుల వాళ్ళు కథల పోటీ పెట్టారు. అందులో మొదటి బహుమతొచ్చిన “అతడు మనిషి” అనే కథ నిజంగా మొదటి బహుమతికి అర్హతున్న కథ. మిగతా కధలు షరా మామూలే! ఇలాంటి పోటీల ద్వారా మంచి కథలొస్తాయనుకోడం మన వెర్రితనం అంతే! పత్రికలు పదికాలల పాటూ నడుపుకోడానికిదొక పద్దతి. ఎంతకాదన్నా ప్రస్తుతం జరుగుతున్నదిదే! గొంతు చించుకొని ప్రయోజనం లేదు.
Bhushan అభిప్రాయం:
November 20, 2008 2:00 am
కధల పోటీకో, కవితల పోటీకో రాసేవాళ్ళ మనసుల్లో మొదట, ఆ పోటీ నడిపేవాళ్ళు ప్రకటించిన బహుమతులే మెదులుతూవుంటాయి. బహుమతి వొచ్చిన కధలు/కవితలు ఒక్కోసారి బావున్నా, స్వలాభాపేక్ష లేకుండా, సహజంగా రాసినట్టు పాఠకులకి అనిపిస్తుందా? మామూలుగా వొచ్చే పారితోషికం వేరు, బహుమతి వేరు. ఆశాజీవిగారి కవిత బావుంది అని వూరుకోవడంకన్నా, కవితలో చెప్పినట్టు పాఠకులే పోటీసంస్కృతిని రూపుమాపడానికి క్రుషి చెయ్యాలి. - భూషణ్
సుజాత అభిప్రాయం:
December 5, 2008 1:37 am
ఆశాజీవి గారి ఆవేదన, బ్రహ్మానందం గారి వివరణ, రెండూ బాగున్నాయి.
శ్రీనివాస్ అభిప్రాయం:
December 12, 2008 3:43 am
పైన వెలిబుచ్చిన పెద్దల అభిప్రాయాలతో నేను ఏమాత్రం విభేదించక పోయినప్పటికీ, పోటీల వల్ల కధా సాహిత్యానికి కొద్దో గొప్పో మేలే జరుగుతుందని నా విశ్వాసం. పోటీ ప్రేరణతో కొత్త కధకులు పుట్టుకొస్తారు. ఈ పోటీలు పూర్తి తేజం తో జరిగే రోజుల్లో, చెయ్యి తిరిగిన రచయితలు ఈ లక్ష్య సిద్ధికే పోటీల్లో పాలు పంచుకునే వారు కాదు. ప్రస్తుతం వస్తున్న కధల్లో లోతూ, వాసీ లేకపోవడం చింతింపదగ్గ విషయమే. చెయ్యి తిరిగిన రచయితలు, చెయ్యి వేసి కధ కి వూపిరులూదవలసిన అవసరం వుంది.
హేమ వెంపటి అభిప్రాయం:
December 16, 2008 9:43 pm
ఏడాది చదివిన చదువుకి నిగ్గు తేల్చేది సంవత్సరాంతంలో వచ్చే పరీక్ష ఐనట్లే ఈ కథల పోటీలు కూడా అనుకోవచ్చుకదా! బహుమతి పొందిన కథ వ్రాసిన రచయిత పరీక్షలో నెగ్గిన విద్యార్ధిలా ఆనందించడం సహజం. లోగుట్టు పెరుమాళ్ళకెరుక! కానీ, బహుమతి పొందిన రచయితకి గౌరవం హెచ్చుగా ఉంటుంది లోకంలో.
పరిస్థితులకు లొంగి సరిపెట్టుకోలేక మనం చెయ్యగల్గింది యేమిటి? వ్రాయడం మానెయ్యాలి. దానివల్ల లాభం కంటె నష్టం ఎక్కువ. దానివల్ల పత్రికలూ, రచయితలూ కూడా నష్టపోక తప్పదు.
కానీ, ఆపని అంత తేలిక కాదు. వ్రాయకుండా ఉండలేము కదా! ఆ తరవాత?
శంఖంలోపోస్తేగాని తీర్థం కాదు కదా. అలాగే పబ్లిష్షయితే గాని వ్రాసిన కథకు విలువలేదు. అందుకే పోటీకి పంపితే కనీసం సాధారణప్రచురణకైనా ఎంపిక కాకపోతుందా అనే ఆశతో ఉంటారు రచయితలు. ఇది వ్రాసేవాళ్లు ఎక్కువ కావడం వల్ల వచ్చిన కష్టం.
ఇటువంటివన్నీ పరస్పరాశ్రయవిషయాలు కావడంతో అందరూ ఉదాత్తంగా ఉండడం ఉచితం.
పైనున్న సమీక్షలను చూసాక నాకు ఇది రాయాలనిపించింది.
వెంపటి హేమ
కలంపేరు: కలికి
Sairamraju అభిప్రాయం:
December 22, 2008 4:39 am
తెలుగులో మంచి కథలు ఈమధ్య చాలా తక్కువగా వస్తున్నై. అందుకు కారణం కథకులలో సమకాలీన సమస్యలపట్ల సరియైన అవగహన లేకపొవటమే. అంతేగాక భాషమీద కూదా పట్టు ఉండడంల లేదు. ఉన్నవారికి తీరిక ఉండదు.