నటీనటులను వెతకటంలో రాయ్ కష్టాలు
పథేర్ పాంచాలి సినిమాలోని ముఖ్యపాత్రలైన “దుర్గ”, “అపు” లను వెతకటంలో రాయ్ కష్టాలు మరో దశకు చేరుకున్నాయి. (ఈ నవలని సినిమాగా తియ్యటానికి నిర్మాతలు దొరక్క పోటంతో రాయ్ కష్టాలు మొదలయ్యాయి.) ఈ చిన్న పిల్లల పాత్రలు వేసే వాళ్ళ కోసం కలకత్తా లోని స్కూళ్ళన్నీ వెదికారు. కానీ, “అపు” పాత్రధారి మాత్రం దొరకలా! దిన, వార పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలవల్ల కూడా ఫలితం లేక పోయింది. రాయ్ తన మనస్సులో “అపు” పాత్రధారి ఎలా ఉండాలని అనుకున్నాడో అటువంటి కుర్రాడు దొరకలా.

అపు
సరిగ్గా తన మనసులో ఉన్న విషయాన్ని రాయ్ తన భార్య “బిజయ” కు చెప్పాడు. అనుకోకుండా ఒక రోజు బిజయకు పక్కింటి డాబా మీద ఆడుకుంటున్న కుర్రాళ్ళు కనపడ్డారు. అక్కడ కనపడ్డాడు “సుబిర్ బెనర్జి” అన్న కుర్రాడు. చూడగానే అతనే అపు అని అనిపించింది. వెంటనే రాయ్ని పిలిచి, “నాకు అపు దొరికాడు” అని చెప్పింది. రాయ్ కలకత్తా అంతా “అపు” కోసం గాలిస్తుంటే, “అపు” పక్కింట్లో దొరకటం యాదృఛ్చికం. అప్పటికే “దుర్గ” పాత్రకు “ఉమా దాస్ గుప్తా” ని తీసుకోటం జరిగింది.
ఈ పిల్లల తల్లిగా ” కరుణా బెనర్జీ” ని అనుకున్నారు. కరుణకు కొంత నాటకానుభవం ఉంది. కానీ, నాటకాల్లో అంత రాణింపు లేదు కరుణకి. కరుణ నాటకాల్లో కన్నా, సినిమాల్లో బాగా రాణిస్తుందని గమనించినవాడు ముందుగా రాయ్. అప్పటికే, రాయ్కి రంగస్థలానికి సరిపోయే నటన, సినిమాలకి కావలసిన నటనలో ఉన్న తేడాలను స్పష్టంగా గమనించినవాడు. సినిమా అన్న మాధ్యమాన్ని ఇంత తొందరగా గుర్తించడంలో రాయ్ జీనియస్ స్పష్టంగా కనపడుతుంది. ఈ సినిమాలో చెప్పుకోతగ్గ మరో పాత్ర హరిహరన్ పాత్రకు దూరపు చుట్టమైన విధవ ముసలి అక్క “ఇందిర్”. రాయ్ ఊహల ప్రకారం ఈ పాత్రకి చిల్లర దొంగతనాలు చేసే స్వభావం ఉండాలి. మళ్ళీ, మేనత్త వరసైన ఈమె, “దుర్గ”, “అపు” లకి చాలా ఇష్టమైన వ్యక్తి కూడా అయిఉండాలి. రాయ్ స్క్రీన్ ప్లే ప్రకారం పిల్లల తల్లి “సర్బోజయ” కి “ఇందిర్” కి ఎప్పుడూ పడదు. రాయ్ ముందు “ఇందిర్” పాత్రకు ఒక పల్లెటూరు ముసలి ఆమెను ఎన్నుకుందామనుకున్నాడు. చాలా మందే ఆ పాత్రకు సరిపోతారని తోచినా, వాళ్ళంతా కెమేరా ముందు నటించగలరా అన్న అనుమానం రాయ్కి వచ్చింది. పథేర్ పాంచాలి సినిమాకి అందరూ నటన వృత్తిగా లేనివారిని తీసుకోవాలని అనుకున్నా, “ఇందిర్” పాత్రకు నటనానుభవం ఉన్న వ్యక్తి ఎలా ఉంటుంది?

ఇందిర్, దుర్గ
రాయ్కి వచ్చిన ఈ ఆలోచనల ఫలితంగా ఎనభై ఏళ్ళ వయస్సున్న “చునిబాలా దేవి”ని తీసుకోటం జరిగింది. పాత్రకు తగ్గట్టు, జుట్టుని బాగా కత్తిరించుకొని, దాదాపు బోడిగుండు వేషంలో “ఇందిర్” పాత్రలో “చునిబాలా దేవి” జీవించింది.
హరిహరన్గా “కాను బెనర్జీ” అన్న రంగస్థల నటుడ్ని ఎన్నుకున్నాడు రాయ్. మొదటి రోజు షూటింగ్కి చక్కని క్రాఫుతో వచ్చిన “కాను”ని చూసి రాయ్ ఆశ్చర్యపోయాడు. ఆ రోజుకి షూటింగ్ రద్దు చేసి, కాను జుట్టు తను ముందు చూసినప్పుడు ఎంత పొడవుందో అంత పెంచుకున్న తరవాతే షూటింగ్ మొదలని రాయ్ తీర్మానించాడు (ఈ సినిమాలోని పాత్రలన్నీ ఎటువంటి మేకప్ లేకుండా నటించారన్న విషయం, ఈ సినిమా పరిచయం ఉన్న వారికి తెలిసిందే కదా!). ముందు కొంచెం బాధ పడ్డా, కాను ఆ విషయాన్ని కలకత్తాలో తనకి తెలిసిన వారందరికి, “ఇన్నాళ్ళకి ఒక గొప్ప దర్శకుడ్ని చూసాను” అని చెప్పుకున్నాట్ట!
మరపురాని దృశ్యాలు
ఈ సినిమాలో మరపురాని దృశ్యాలున్నాయి. కొన్ని మచ్చుకి:
అది 1952 సంవత్సరం. గత రెండేళ్ళగా నిర్మాతల కోసం వెతికిన రాయ్ చివరకు కొంత సినిమా షూట్ చేసి ఇతరులకు చూపిస్తే తప్ప నిర్మాతలు దొరకరని, తన ఇన్స్యూరెన్సు కంపెనీ నుంచి కొంత డబ్బు అప్పుగా తెచ్చి మరి కొంత స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి తెచ్చి సినిమా తియ్యటం మొదలు పెట్టాడు. మొదటి సీన్లో పిల్లలు దుర్గ, అపు తాము మొదటి సారిగా రైలు చూసే సంబరం చిత్రీకరించాలి. దుర్గ, అపు ఒకరినొకరు ఏదో విషయంలో దెబ్బలాడుకొని ఊరి చివరనున్న పొలాల కేసి పరిగెడుతూ తలవని తలంపుగా, దూరంగా రైలు వస్తున్న శబ్దం వింటారు. తరవాత, నల్లని పొగలు చిమ్ముతూ తమ వైపే వస్తున్న రైలుని చూస్తారు. ఈ రైలు ఘట్టాన్ని రాయ్ చాలా కళాత్మకంగా తీసాడు. అయితే, మొదటి రోజు షూటింగ్లో ఎనిమిది సీన్లు పూర్తి చేసుకొని ఆ రోజుకి షూటింగ్ పూర్తి చేసారు. పొలాల్లో షూటింగ్ పెట్టాటానికి కారణం, అక్కడున్న పొలాల్లో ప్రత్యేకంగా కనిపించే రెల్లుపూల గడ్డి (Kaash Flowers). వీచే గాలికి అవి కదులుతుంటే తీసిన దృశ్యం చాలా అందంగా ఉంటుంది (దాదాపు నాలుగు నిమషాలు ఉండే ఈ దృశ్యాన్ని వీడియోలో ఇక్కడ చూడచ్చు). రాయ్కి మాత్రం సంతృప్తి కలగలా. తరువాతి ఆదివారం మరికొన్ని సీన్లు తియ్యటానికి అదే లొకేషన్కి వెళ్ళారు. అన్నీ బాగున్నాయి కాని, రెల్లుపూలు మాత్రం మాయం. రెల్లుపూవు వర్షాకాలం తరవాత వచ్చే రుతువుకి సంబంధించిన పువ్వని తెలుసు కానీ మరీ రెండు, మూడు రోజుల్లో మాయమయ్యే పువ్వా అని ఆశ్చర్యపోయారు.

రైలు రాక
అసలు జరిగింది ఏమిటో అక్కడి రైతులు చెప్పే వరకు రాయ్కి అతని బృందానికి తెలియలా. మొదటి రోజు షూటింగ్ అయిన తరవాత, పొలాల్లో మేస్తున్న పశువులు వచ్చి ఆ రెల్లు పువ్వుల్ని, పొదల్ని తిని పారేసాయి. అక్షరాలా రాయ్ ఊహించుకున్న సీనరీని పశువులు నమిలి పారేసాయి. ఇంకో చోట ఇదే సీన్ మళ్ళీ తీద్దామంటే, మంచి రెల్లు పువ్వులున్న పొలాలు దగ్గర్లో లేవు. రెండేళ్ళ తరవాత, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం నిర్మాతగా మళ్ళీ అదే లొకేషన్లో, అదే నటీనటులు, సాంకేతిక వర్గంతో షూటింగ్ పూర్తి చేసారు.
అతి ఉత్సాహంతో ఈ సినిమాను చూసిన విమర్శకులు కూడా ఈ సినిమాలో కెమేరా పనితనం పూర్తిగా గమనించలేదు. అర్లీన్ క్రోస్ ఫిలం కల్చర్లో రాస్తూ – “రాయ్ కెమేరా ద్వారా చూపించిన భావ ప్రకటన అద్భుతమైనది. ఉదాహరణకు చనిపొబోతున్న దుర్గను సాకుతున్న తల్లి ఆ తుఫాను రాత్రి చీకట్లో చూపించిన దృశ్యాలు అతి తక్కువ లైటులో నెమ్మదిగా కదిలే కెమేరాతో ఒక భయాందోళన వాతావరణాన్ని సృష్టించాడు. అలాంటి దృశ్యాలు తీయటం సామాన్యమైన విషయం కాదు!”
మరొక దృశ్యం, వర్షం చిత్రీకరణ గురించి. భారత దేశంలో వర్షాకాలం గొప్ప అనుభూతుల్ని ఇవ్వగలదు. అప్పటిదాకా మాడ్చిన ఎండల తరవాత వచ్చే వర్షాలు అందరికీ ఉపశమనాన్ని ఇస్తాయి. రాయ్ ఈ సినిమాలో వర్షాన్ని అద్భుతంగా చిత్రీకరిస్తాడు. నెమ్మదిగా గాలిలా మొదలై, ఆ గాలికి చెరువులోని అలలు నెమ్మదిగా కదలటం, చెరువులోని తామరాకులు గాలికి పైకి లేచి ఊగటం, ఆ తరవాత నెమ్మదిగా ఒక్కొక్క చినుకులా ప్రారంభమైన వర్షం, చెరువు గట్టున కూర్చున్న ఒక వ్యక్తి బట్టతలపై వర్షపు చినుకు పడటం, బోడిగుండును తడుముకొని వర్షం పడబోతోందని ఆ వ్యక్తి నిర్ధారించుకోటం, దట్టమైన నల్లని కారు మబ్బులు కమ్ముకోటం – ఇలా వర్షం వచ్చేముందు సూచనలన్నీ అద్భుతమైన దృశ్యంగా, ఎటువంటి వ్యక్తులు, సంభాషణల ప్రమేయం లేకుండా చిత్రీకరించాడు రాయ్. వర్షం పెద్దదిగా మారిన తరవాత నేల మీద పడ్డ చినుకులు అన్నీ కలిసి అది ఒక చిన్న ప్రవాహమై, రానురాను ఒక పెద్ద ప్రవాహంగా మారటం, అంత వర్షంలో పెద్ద పెద్ద చెట్లు గాలికి అటూ, ఇటూ ఊగటం – మనమే వర్షంలో ఉన్నామా అన్న భ్రాంతి కలుగుతుంది. ఇంత వర్షంలో దుర్గ పొందే పరవశత్వం చూసి తీరవలసిందే!
సంగీతం
తనకున్న బిజీ స్కెడ్యూలు వల్ల సంగీత దర్శకుడిగా పండిట్ రవిశంకర్ ఈ సినిమాకి సంగీతాన్ని మొత్తం పదకొడు గంటల్లో పూర్తి చేసాడు. ఒక రోజు సాయంత్రం మెదలు పెట్టి, మరునాడు ఉదయం తెల్లవారు ఝామున నాలుగు గంటలకు పూర్తి చేసాడు. అప్పటికి పూర్తి అయిన కాస్త సినిమాని చూసి రవిశంకర్ చాలా మెచ్చుకున్నాడుట. ఈ సినిమాలో రవిశంకర్ సితార్ పై రెండు ట్యూన్లు కట్టాడు. ఒకటి దేష్ రాగంలో. ఇది వర్షాన్ని చూపించే సందర్భంలో ఉపయోగించారు. రెండవది తోడి రాగంలో. తుఫాను రోజు రాత్రి దుర్గ చనిపోయిన విషాదంలో తోడిని ఉపయోగించారు.
పథేర్ పాంచాలి సినిమా మొదలవుతూ వేణువు మీద ఒక చిన్న సిగ్నేచర్ ట్యూన్లా సంగీతం వినపడుతుంది. సినిమా అంతా అప్పుడప్పుడు ఇలా ఈ ట్యూన్ వినపడుతూ ఉంటుంది. పైన ఉదహరించిన అద్భుతమైన దృశ్యాలు చూస్తున్నప్పుడు బాక్ గ్రౌండులో వినపడే సంగీతం కూడా చూస్తున్న దృశ్యంతో కలిసిపోతుంది.
మానవతా దృక్పథం
ఈ సినిమాలోని ప్రధాన పాత్రలన్నీ కటిక పేదరికం అనుభవిస్తూ ఉంటాయి. అంత పేదరికంలో కూడా జీవితంలోని చిన్న చిన్న కోరికలు తీర్చుకుంటూ ఆనందం పడటం మనం చూస్తాం. నిజ జీవితంలో అటువంటి కుటుంబాలని ప్రత్యక్షంగా చూసినవారికి, జీవితంలో డబ్బు లేకపోయినా తీర్చుకో కలిగే సుఖాలున్నాయని తెలుస్తుంది. చిన్నతనంలో జామకాయలు దొంగతనం చెయ్యటం, కొంచెం పెద్దయ్యాక నెక్లెస్ దొంగిలించటం లాంటి పనులు దుర్గ చేసినా, అవి చిన్నప్పడు చేసిన చిలిపి పనుల కిందా లేకపోతే పేదరికం వల్ల ఏర్పడిన చర్యలగా భావించవచ్చు! ఈ విషయాలన్నిటివల్ల, పొరుగువాళ్ళతో సర్బజయ దెబ్బలాటలకి దిగిన సందర్భాలున్నాయి. కానీ, దుర్గ చనిపోయినపుడు (హరిహరన్ డబ్బుసంపాదనకై కొన్ని మాసాలు అప్పటికే ఇల్లు విడిచి ఉంటాడు), ఎవ్వరూ తోడులేని సర్బజయ, అపులకు ఆ పక్కవారే తోడవుతారు. కష్టాల్లో పేదవారికి, పేదవారే తోడు. నిస్సందేహంగా, పథేర్ పాంచాలి ఇలాంటి వివరాల వల్లే మానవతా దృక్పధం ఉన్న సినిమా అయ్యింది.
ప్రశంసలు
రాష్ట్రపతి బంగారు, వెండి పతకాలు, 1955. ఉత్తమ మానవతా డాక్యుమెంటరి, కాన్ 1956. ఉత్తమ డిప్లొమా, ఎడిన్బర్గ్ 1956. వాటికన్ ఎవార్డ్, రోమ్ 1956. ఉత్తమ చిత్రం, దర్శకత్వం, శాన్ఫ్రాన్సిస్కో 1957. సెల్జ్నిక్ గోల్డెన్ లారెల్, బెర్లిన్ 1957. ఉత్తమ చిత్రం, వాంకోవర్ 1958. విమర్శకుల బహుమతి, శ్ట్రాట్ఫోర్డ్, కెనడా 1958. ఉత్తమ విదేశీ చిత్రం, న్యూయార్క్ 1959. ఉత్తమ విదేశీ చిత్రం, టోక్యో, 1966.
ఈ వ్యాస రచనకు ఉపయోగపడిన పుస్తకాలు, డివిడి.
- పథేర్ పాంచాలి సినిమా డీవీడీ. సత్యజిత్ రే బాక్స్ సెట్ నుంచి.
- “The Inner Eye“, Andrew Robinson, University of California Press, 1989.
- “Portrait of a Director: Satyajit Ray”, Marie Seton, Indiana University Press, 1971.
- “Our films their films“, Satyajit Ray, Orient Longman Limited India, 1976.
- “పథేర్ పంచాలి”, బిభూతి భూషన్ బందోపాధ్యాయ్, తెలుగు అనువాదం – మదిపట్ల సూరి, హైదరాబాద్ బుక్ట్రస్ట్, జులై 2008.
- ఈ వ్యాసంలో ఉపయోగించిన చిత్రాలు కొన్ని సత్యజిత్రే.ఆర్గ్ నుంచి తీసుకోబడ్డాయి.
