సామాజిక నవలల్లో కథనా శిల్పం
సామాజిక నవలల్లో కథనా శిల్పం అన్న అంశంపై డా. మృణాళిని గారు కాలిఫోర్నియా లో చేసిన ప్రసంగం
నిడివి: షుమారు 90 నిమిషాలు (54.5 Mb)
(సేకరణ: సాయి బ్రహ్మానందం గొర్తి )
డా. మృణాళిని గారి సాహితీ పరిచయం
తెలుగు సాహిత్యంలో చాలా మంది నవలా రచయిత్రులున్నారు. తెలుగు నవల కి అత్యంత ఆదరణ తీసుకొచ్చిందీ నవలా మణుల్లాంటి రచయిత్రులే. నవల అంటే ఆడవాళ్ళే రాయాలి అన్నంతగా రచయిత్రులు నవలా రాజ్యాన్ని ఏలారు. కానీ, తెలుగులో నవలా విమర్శ అనేది అంతగా లేదు, అందులోనూ నవలలో తులనాత్మక విమర్శ అన్నది ఇంకా తక్కువగా ఉండేది. నవలల మీద విమర్శనాత్మకమైన సమీక్షలు కూడా రాలేదు. నవలకి కావల్సిన నేపథ్యం ఏమిటి? నవలల్లో శిల్పం ప్రాముఖ్యత ఏమిటి? ఇలాంటి విషయాల్లో ఇటీవలి వరకూ విమర్శ అంతగా రాలేదు. ఏ సాహితీ ప్రక్రియైనా విమర్శ అనే కొలిమిలో కాలితేనే రాణిస్తుంది. తెలుగు నవలా సాహిత్యం పై విమర్శనాత్మక, పరిశోధక వ్యాసాలు రాసిన మొట్ట మొదటి రచయిత్రి డా. మృణాళిని.
డా. మృణాళిని తెలుగులో ఎం ఏ, ఎంఫిల్, పీ హెచ్ డీ చేసి తెలుగు విశ్వ విద్యాలయంలో తులనాత్మక అధ్యయనాల (comparative studies) విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేసారు. “తెలుగు సాహిత్యంలో సామాజిక నవలల్లో కథనా శిల్పం” అనే అంశం పై వీరికి పీ హెచ్ డీ ఇచ్చారు. ఇంగ్లీషులోనూ, విమెన్స్ స్టడీస్లోనూ ఎం.ఏ. డిగ్రీలు పొందారు. “ఉదయం” అనే దినపత్రికలో దాదాపు 8 ఏళ్ళు విలేకరిగా పనిచేసారు. వీరివి ఇంత వరకూ అనువాదాలూ, విమర్శ, కథానికలూ, రచనలూ, వెరసి 9 పుస్తకాలు ప్రచురించ బడ్డాయి. మృణాళిని గారు రచనా వ్యాసంగమే కాక, తెలుగు టీవీలో అనేక సాహిత్య పరమైన కార్యక్రమాలూ, ఇంటర్వ్యూలూ, స్త్రీల సమస్యలపై అనేక కార్యక్రమాలు నిర్వహించారు. వీరు ఆంధ్రజ్యోతి దిన పత్రికలో “తాంబూలం” అనే శీర్షిక దాదాపు రెండేళ్ళు నిర్వహించారు. ప్రస్తుతం “ఇంతిహాసం” అనే శీర్షికని నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం వీరు World Space Satellite Radio వారి రేడియో స్పందన ప్రోగ్రాం డైరెక్టర్ గా పని పనిచేస్తున్నారు.
డా. మృణాళిని గారి అమెరికా పర్యటన సందర్భంగా శాంతాక్లారా, కాలిఫోర్నియా లో జరిగిన సాహితీ సభలో తెలుగు నవలా సాహిత్యంపై వారి ప్రసంగం ఇది.
-సాయి బ్రహ్మానందం గొర్తి
కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
July 12, 2008 2:47 pm
తెలుగు నవల బాగోగులు
మృణాళిని గారి విలువైన ఉపన్యాసాన్ని సేకరించినందుకు బ్రహ్మానందం గారికి చాలా కృతజ్ఞతలు. ఒక మనవి. సాహితీవేత్తలైన వక్తలు అమెరికా వచ్చినప్పుడు, వారికి అభ్యంతరం లేకపోతే ఈమాటలోనో రచ్చబండలోనో ఓ చిన్న ప్రకటన వెయ్యండి. వీలయితే వాళ్ళని సాహితీప్రియులు తమ తమ ఊళ్ళకి పిలిపించుకోవచ్చు.
మృణాళిని ఉపన్యాసం కేవలం డాక్టరేటు కోసం చేసిన పరిశోధన నుండి వచ్చినట్లు లేదు. లోతైన పరిశీలనతోబాటు తాదాత్మ్యంతో కూడిన విస్తృత పఠనంతో చేకూరిన అనుభూతితో సాధికారంగా మన నవలా చరిత్రని చెప్పి రక్తి కట్టించారు. ఎటు చూసినా కవితలూ, కథలూ, వాటి మీద చర్చావేదికలే కాని నవల గురించి మాట్లాడే వాళ్ళే తక్కువ. గత పాతికేళ్ళుగా స్తబ్ధుగా ఉండిపోయిన తెలుగు నవలా రంగానికి విశిష్ట చరిత్ర ఉందనీ, పాఠకుల సంస్కారానికి కథా కవితలకన్నా నవలలే ఎక్కువ దోహదిస్తాయనీ, ఆవేదనతో కూడిన ఉత్సాహంతో గంటన్నర పైగా అనర్గళంగా ఉపన్యసించి ఆకట్టుకున్నారు. గురజాడా, శ్రీశ్రీ రచనలకి సముచిత ఆదరణ వచ్చినా వారికే మాత్రమూ తీసిపోని నవలా రచయితల పేర్లన్నా ఇప్పటి వాళ్ళకి తెలియదే, కనీసం వారి రచనల ప్రస్తావన గూడా సాహితీ చర్చల్లో లేశమైనా కనబడదే అని గట్టిగా విమర్శించారు – ఎందువల్ల ఈ చిన్న చూపు?
ఇలా పారంభమైన ఉపన్యాసం వినడంతోటే నాకు ప్రముఖ కవి Auden రాసిన “Letter to Lord Byron” అన్న కవిత గుర్తొచ్చింది:
I don’t know whether
You will agree, but novel writing is
A higher art than poetry altogether
In my opinion, and success implies
Both finer character and faculties
Perhaps that’s why real novels are as rare
As winter thunder or a polar bear.
…
The average poet by comparison
Is unobservant, immature, and lazy.
You must admit, when all is said and done,
His sense of other people’s very hazy,
His moral judgements are too often crazy,
A slick and easy generalization
Appeal too well to his imagination.
కందుకూరి తో మొదలైన మన నవలలు సంఘ సంస్కరణకీ, భావ విప్లవానికీ, మానసిక వికాసానికీ బాట వేశాయనీ, దాదాపు వందేళ్ళ క్రితమే ఉన్నవ రాసిన మాలపల్లి ని ఆకాశానికెత్తేశారు. అసలాకాలానికి మన దేశభాషలు వేటిలోనూ అంతటి గొప్ప నవల రాలేదని ఇతర రాష్ట్రీయులు మెచ్చుకున్నా, తెలుగువాళ్లలో చాలా మందికి ఉన్నవ పేరు కూడ తెలియదని బాధపడ్డారు. చలం నవలలు చదిలోతే చెడిపోతారన్నవాళ్ళు ఆయనని సరిగా అర్థం చేసుకోలేదనీ, ఆయన రాసిన స్త్రీ, బిడ్డల శిక్షణ చదివితే గాని చలం భావ విప్లవం అర్థం కాదన్నారు. మైదానం కి వ్యతిరేకంగా విశ్వనాథ రాసిన చెలియలికట్ట ని ప్రస్తావిస్తూ, వీరిద్దరూ గొప్ప ప్రతిభావంతులనీ, వాళ్ళ మధ్య పోటీ సాహిత్యానికి మేలుచేసిందే కాని కీడు చెయ్యలేదన్నారు.
పల్లెటూరి జీవితాన్ని మరీ ఆదర్శప్రాయంగా కాక రాజకీయాలతో ఎలాముడిపడి ఉందో చిత్రీకరించిన జి.వి.కృష్ణారావు కీలుబొమ్మలు, మొట్ట మొదటిగా విశాలమైన ఉన్నతభావాలతో స్త్రీ పాత్రని ప్రవేశపెట్టిన ఉప్పల లక్శ్మణరావు అతడు-ఆమె, ఒక్క వ్యర్థ పదం కూడా లేకుండా గోపీచంద్ రాసిన గొప్ప మనోవైజ్ఞానిక నవల అసమర్థుని జీవయాత్ర, మనిషి జీవితంలో ఎదురైన ప్రతి సంఘటనా సంస్కార పరిణామానికి ఎలా దారితీస్తుందో చిత్రీకరించిన బుచ్చిబాబు చివరకు మిగిలేది, ఇలా అనేక పేరున్న తెలుగు నవలల గురింఛి, క్లుప్తంగా నయినా మనసుకి హత్తుకు పొయ్యేట్లు చెప్పి, అవి చదివిన వాళ్ళకి మరోసారి ఉద్విగ్నత కలిగించారు.
ఇంతటి ప్రాభవం ఉన్న నవలా ప్రక్రియ ఎనభయ్యో శతాబ్దం నాటికి వ్యాపార నవలలు విజృంబించడంతో ఓ ఊపు ఊగి, ఆ తర్వాత వచ్చిన ఉద్యమాల వరవడిలో చదివే పాఠకులు లేకా, పాఠకులేరని రాసే వాళ్ళు లేకా కుంటుబడిందన్నారు. ఉద్యమాల ప్రభావం గురించి మృణాళిని చేసిన వ్యాఖ్య చాలా ఆలోచించదగ్గది: ఉద్యమాల మూలంగా వచ్చే రచనల్లో ఆవేశం పాలెక్కువ. అందుకు కవిత్వానికి మించిన సాహితీ ప్రక్రియ లేదు. అయితే నవలకి కావలసింది స్పష్టతతో కూడిన ఆలోచన, మానవజీవితం గురించి సమగ్రమైన పరిశీలన – వీటితో రసవంతంగా ఏవో నాలుగు పాదాలు కాక కట్టదిట్టంగా నాలుగయిదొందల పేజీల సాహిత్యం సృష్టించాలంటే మాటలు కాదు. మరలా Auden రాసిన “The Novelist” అన్న కవితొకటి గుర్తొస్తుంది:
Encased in talent like a uniform,
The rank of every poet is well known;
They can amaze us like a thunderstorm,
Or die so young, or live for years alone.
They can dash forward like hussars: but he
Must struggle out of his boyish gift and learn
How to be plain and awkward, how to be
One after whom none think it worth to turn.
For, to achieve his lightest wish, he must
Become the whole of boredom, subject to
Vulgar complaints like love, among the Just
Be just, among the Filthy filthy too,
And in his own weak person, if he can,
Must suffer dully all the wrongs of Man.
ఉపన్యాసం అయింతర్వాత చాలా మంది మంచి ప్రశ్నలే వేశారు. మన సాహిత్యం ఉద్యమాలకే ఎందుకు పరిమితమైందని ఒకరడిగారు. మృణాళిని ఉద్యమాల వలన కలిగిన మంచిని గుర్తిస్తూనే, ప్రస్తుత సాహితీ వాతావరణంలో ఏదో ఒక గ్రూపుకి చెందకుండా మనడం కష్టమయిందన్నారు. చంద్రలత రాసిన రేగడివిత్తులు మంచి నవలే అయినా అది రచయిత కోస్తా ప్రాంత దృష్టితో రాసిందని విమర్శించి, సాహితీపరమైన విలువలకి విమర్శకులే తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇలాంటి వాతావరణం నెలకొని ఉండటం చాలా విచారకరమన్నారు.
ఇది సాహితీ అభిమానులందరూ తప్పక వినవలసిన ఉపన్యాసం. ఇచ్చిన మృణాళిని గారికీ, సేకరించిన బ్రహ్మానందం గారికి మరోసారి కృతజ్ఞ్తలతో,
కొడవళ్ళ హనుమంతరావు
Sai Brahmanandam Gorti అభిప్రాయం:
July 12, 2008 5:31 pm
హనుమంత రావు గారూ,
మీకు ఈ ఉపన్యాసం నచ్చినందుకు సంతోషించాను.
మృణాలిని గారి రాక నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. ఈ సారి నుండి తప్పని సరిగా రికార్డు చేసి ఉంచాలనే కోరిక. ఇటుపైన ఎవరైనా సాహితీవేత్తలు వస్తే తప్పక తెలియజేస్తాను. నవలకి తెలుగులో ఓ రకమైన చిన్న చూపే ఉంది. నవల అనేది పోయింది. సీరియల్ నవల అనేదే తెలుగులో ఉంది. మృణాలిని గారి ప్రసంగం ధారాళంగా సాగింది. వచ్చిన ఓ పాతిక మందీ గంటన్నర సేపు కదల్లేదు.
-సాయి బ్రహ్మానందం గొర్తి
baabjeelu అభిప్రాయం:
July 24, 2008 6:50 am
సాయి బ్రహ్మానందం గారూ,
అద్భుతవయిన వుపన్యాసాన్ని అందించినందుకు ధన్యవాదాలు.
ఇలాటి ప్రక్రియల్లో సహజంగానే నిరాశలుంటాయి. నా వరకైతే రాచకొండ విశ్వనాథ్ శాస్త్రి గారి “రాజు-మహిషి”, “రత్తాలు,రాంబాబు” అక్కినేని కుటుంబరావు గారి “సొరాజ్జెం”, అంగర వారు, ముళ్ళపూడి వారు నవలలు లాంటివాటి గురించి ప్రస్తావించకపోవడం. కాలపరిమితి వల్ల అయివుండొచ్చు. అయితే మ్రుణాళిని గారిని ఈ సారి కలిసినప్పుడు రావిశాస్త్రి గారి వి, ముళ్ళపూడి గారివి, మిగిలినవి చర్చించొచ్చు.
చిత్రం ఏవిటంటే, “ఫక్తు” నవల చర్చలో శ్రీశ్రీ “రిఫరెన్సులు”. వుద్యమాలంటే అంత భయమెందుకు? వుద్యమం బతుకు బాగుపడడానికి, బతుకులోంచీ సాహిత్యం వస్తుంది. రాజశేఖర చరిత్రము సంస్కరణోద్యమం లోంచి వచ్చిందంటున్నారు. మాలపల్లి హరిజనోద్యమం “ప్లస్” జాతీయోద్యమం వల్ల వచ్చింది కాదా? మీరు క్షమించకపోయినా నా “కామెంట్” కి వున్నవ వారు నవ్వి వూరుకుంటారు. అలాగే మిగిలిన సాహిత్యం కూడా.
ఒకటే ఇబ్బందికరవయిన తప్పు దొర్లింది. అది మ్రుణాళిని గారి మీ పరిచయం. మొదటి మూడు పంక్తులు, తరవాత వాక్యంలోని”కానీ,” వరకు నా దృష్టిలో నిజంగా అవసరం లేని వాక్యాలు. ఈ “పేరాగ్రాఫ్” ని చేరా గారికో, భద్రిరాజు గారికో, బూదరాజు గారికో పంపించండి. నవల విమర్శలేకపోవడానికీ రచయిత్రులు అన్ని అంత అద్భుతవయిననవలలు రాయడానికీ సంబంధం ఏవిటీ? (అయితే నవలామణి పదప్రయోగానికి, “సెబాస్” అనాలనిపించింది. “సెహబాస్”).
మామూలు పాఠకులవి అభిప్రాయాలు మీ లాటి వారు రాస్తే విమర్శ.
Kameswara Rao అభిప్రాయం:
July 26, 2008 10:45 am
శ్రోతలని కట్టిపడేసేలా మాట్లాడే నేర్పు మృణాళినిగారి గొప్పదనం. మంచి ఉపన్యాసాన్ని అందరికీ అందించిన సాయిగారికి ఈమాటకీ ధన్యవాదాలు. శీర్షిక మాత్రం కాస్త తప్పుదోవపట్టించేదిగా ఉంది. ఇది “తెలుగు నవలా చరిత్ర” గురించిన ఉపన్యాసం కాని “సాంఘిక నవలల్లోని కథన శిల్పా”న్ని గురించి కాదు కదా.
ఉపన్యాసం, తర్వాత ప్రశ్నలకిచ్చిన జవాబులూ విన్నాక వచ్చిన అనుమానం. మృణాళినిగారు తెలుగులో హాస్యరచనలకి ప్రాముఖ్యం ఇవ్వటం లేదని ఆవేదన చెందారు. మరి తన ఉపన్యాసంలో హాస్య నవలలని ఆవిడ పేర్కోకపోవడానికి కారణం ఏమిటి? అలానే, ఈ కాలంలో ఉద్యమాలకతీతమైన నవలలు మంచివి వస్తున్నా వాటికి గుర్తింపు రావడం లేదని కూడా చింతించారు. అటువంటి వాటి గురించి తన ఉపన్యాసంలో ఎందుకు ప్రస్తావించలేదు? ప్రశ్నకి సమాధానంగా అంపశయ్య నవీన్ మొదలైనవాళ్ళని గురించి చెప్పారు. అది తన ఉపన్యాసంలోనే ప్రస్తావించి ఉంటే బావుండేది.
Sai Brahmanandam Gorti అభిప్రాయం:
July 27, 2008 3:16 pm
కామేశ్వర రావు గారూ,
మృణాలిని గారే “సామాజిక నవలల్లో కథనా శిల్పం” అన్న అంశం ఇచ్చారు. గంటన్నర పాటు ఉన్న చోటునుండి ఎవరూ కదలలేదు. అందరికీ, ఉపన్యాసం అప్పుడే అయిపోయిందా అన్న భావన కలిగింది.
హాస్య నవలల గురించీ చెప్పారు. ముళ్ళపూడి వెంకట రమణ గురించీ ప్రస్తావించారని బాగా గుర్తు. ఎక్కడ మిస్సయ్యిందో తెలియదు.
- సాయి బ్రహ్మానందం గొర్తి