ఈ మధ్య ఒక ఆరు నెలల క్రితం, పెళ్ళిళ్ళు అయి, అమెరికాలో స్థిరపడ్డ పిల్లల దగ్గర కొంత కాలం గడపడానికి బయలుదేరుతూ, ముంబయి వస్తున్నట్టుగా పాండురంగంగారు నాకు తెలియజేసినప్పుడు, నేనెంతో ఉద్వేగానికి లోనయ్యాను. వారికంటే ముందే, నేను విమానాశ్రయం చేరుకుని, వారికోసం ఎదురు చూస్తూ వుండగా, షటిలు బస్సు దిగుతూ పాండురంగంగారూ, పార్వతమ్మగారూ కనిపించేరు. సామాన్లవీ అందుకుని, తోపుడు బండితో లోనికి ప్రవేశించేము. చేతులు కట్టుకుని, నేల చూపులు చూస్తూ, మౌనంగా నిలబడ్డ నన్ను పార్వతమ్మగారు ఆప్యాయంగా పలకరించి ” ఒరే అబ్బాయీ, అమ్మా, నాన్నా జాగ్రత్త. చెల్లిని బాగా చదివించు. నువ్వు వేళ పట్టున భోంచెయ్యి” అని చెప్పేరు. నేను మాట్లాడకుండా తలాడించేను. అప్పుడు పాండురంగం గారు “అదేంట్రా, అదోలా వున్నావూ?” అని నా భుజం నొక్కి ప్రశ్నించేరు. అంతవరకూ, తొక్కిపెట్టిన భావాలకి అడ్డుకట్ట వెయ్యలేక, నా కళ్ళు నీటి చలమలయ్యేయి. గొంతు రుద్ధమై, మాట సరిగా పెగలక, కిందికి వంగి వారి కాళ్ళు పట్టుకుని “పెద్దయ్యగారూ, మీ ఋణం ఎలా తీర్చుకోను?” అని అడిగేను. ఆయన నన్ను లేవనెత్తి, “ఒరే, అవసరమున్నా, లేకున్నా నాఋణం నువ్వు నాకే తీర్చేటట్టయితే మనమిద్దరమే సమాజం అయిపోతాము. అందులో మూడో మనిషి ప్రస్తావన ఏదీ? అది స్వార్థం కాదూ? అప్పుడు వసుధ ఏక కుటుంబం ఎలా అవుతుందిరా, చెప్పు” అన్నారు. నిరుత్తరుడినై నేను వింటూ వుండగా మళ్ళీ ఆయనే “అందుకే, నువ్వు పంపిన డబ్బు తిరిగి పంపేసేను. నువ్వే ఓ పది మందిని బాగు చేసి, నీ ఋణభారాన్ని వాళ్ళ మీద వెయ్యి” అన్నారు. వింటున్న నా తల మీద దీవిస్తున్నట్టుగా ఒకసారి చెయ్యి వేసి, సామాన్లతో నిండిన తోపుడుబండి తోసుకుంటూ ఇద్దరూ లోపలికి వెళ్ళిపోయేరు.
ఆ రోజు, వారిద్దరినీ సాగనంపి, విమానాశ్రయం నుంచి తిరిగి వస్తున్నప్పుడు నా మనసెందుకో స్థిమిత పడ్డట్లనిపించింది. పెద్దయ్యగారి మాటలమీద ఆలోచించినకొద్దీ, నాకు తేలికగా అనిపించసాగింది. నా ఋణభారం తీర్చుకోవడానికి, ఓ పది మందిని బాగు చెయ్యాలంటే, ముందు డబ్బు సంపాదించాలి. ఆ తరువాత ఒక నిధి గానీ, ట్రస్టు గానీ ఏర్పాటు చేసి, ఈ ఆశయం నెరవేర్చాలి. అంటే, ముందు నా వాళ్ళ గురించి, అటు పైన నా ఉద్యోగమూ, సంపాదనల గురించి కనీసం ఓ పదేళ్ళు ఏకాగ్ర దృష్టితో కృషి చెయ్యాలని తీర్మానించుకున్నాను.
ఈ రోజెందుకు మనసులో ఈ అలజడో నాకు అంతు చిక్కడం లేదు. నాలో నేనే రెండుగా విడిపోయి, ఒకరు అవుననీ, ఇంకొకరు కాదనీ, కలహించుకున్నట్టనిపిస్తోంది. “ఈ హరి గాడి గురించేనా, నా చింతంతా? వాడి సమస్యకీ, నా బాల్యానికీ సారూప్యమున్నందుకా? ఇంకా కెరీరు ప్రారంభంలో వున్న నాకు, అమ్మా, నాన్నా, చెల్లీల బాధ్యత తలమీద వుంది. ఈ వీధి పిల్లల బాధ్యతంతా నాదెలా అవుతుంది? ప్రభుత్వమూ, ఈ బడా షరాబులూ ఏం చేస్తున్నారు? అయినా, హరీ, గిరీ అని ఇప్పటి నుంచే పూసుకు తిరిగితే నా జీవితాశయం, మహోన్నత లక్ష్యం నెరవేరేనా? నిధికి డబ్బు ఎలా సమకూరేను? ట్రస్టు ఎలా ఏర్పాటు చెయ్యగలను? కొంత కాలమాగి, డబ్బు పోగు చేసి, నిధి ఏర్పాటు చేస్తే, హరి లాంటి ఎంతో మంది పిల్లలు లాభం పొందగలరు. నాకూ ప్రస్తుతం, కాస్త వెసులుబాటుగా వుంటుంది.” అని సమాధానపడ్డాను.
కానీ, కాలయాపన చేస్తూ, డబ్బు మీది వ్యామోహంతో, పరిధి గీసి, హద్దులు నిర్ణయించుకుని నన్ను నేను మోసగించుకుంటున్నానేమోనని శంక పీడిస్తోంది. పాండురంగం గారి మాటలని, భవిష్యత్తులో పది మందికి ఉపయోగపడే నిధి, ఏర్పాటు చెయ్యాలన్న మహోన్నత లక్ష్యం పేరుతో, వక్రభాష్యం చెప్పుకుని ఎదురుగా వున్న సమస్యని కప్పదాటు చేస్తున్నానా అనిపించింది. తల్లి తండ్రుల నీడలో, కేరింతలతో, చదువుకుంటూ గడవ వలసిన బాల్యం, రెక్కల కష్టం చెయ్యడం అమానుషం కాదూ. నా జీవితంలో పాండురంగం గారి పాత్ర ని, హరి బాల్యంలో పోషించడానికి నాకు వచ్చిన అవకాశాన్ని, వితండ వాదనతో తోసిరాజంటున్నానా? సమాధానం తెలియలేదు.
బయట చెవులు చిల్లులు పడేటట్లున్న ఉరుముల మోత కి, పరస్పర విరుద్ధమైన ఆలోచనలని విదిలించుకుని, కిటికీ లోంచి చూసేను. వాన జోరు ఇంతకు ముందు కంటే ఎక్కువ అయ్యింది. లేచి, మొహం కడుక్కుని, ట్రైనింగు రూము కేసి నడిచేను. కొలిక్కి రాని, ఆలోచనలతో తలంతా దిమ్ముగా వుంది.
ట్రైనరు, అమెరికా లోని మా ప్రిన్సిపల్ కంపెనీ నుంచి వచ్చేడు. అతడి పేరు రిచర్డ్ బ్లాంటన్. తన పరిచయంలో, తనని “రిక్కీ” అని పిలవమని కోరేడు. చూడడానికి, ఒడ్డూ, పొడూగూ – పాండురంగం గారి లాగే వున్నాడు. వయసుకే ఓ పదేళ్ళు చిన్న అయి వుండొచ్చు. మధ్య మధ్యలో కధలూ, పొడుపు కధలూ, చలోక్తులూ జోడించి, వినేవారి దృష్టి మరలకుండా కాసుకోవడంలో నేర్పరి. సెషను మొదటి భాగంలో, నేను అన్యమస్కంగా వుండటం గమనించినట్టున్నాడు. టీ బ్రేకు తరువాత, నన్ను ముందు వరుస లో కూచోమని ఆహ్వానించేడు. నేను కాదనలేకపోయాను. విరామం తరువాత, టీము ఎలా నిర్మించాలి, భాగస్వాముల పని విలువ ఎలా పెంచాలి, వారి లోటుపాట్లని అంగీకరించడం ఎలా, నాయకుడిగా ఎలా ఎదగాలి, అని ఇంకా ఏవేవో చెబుతూ, గబుక్కున ఒక కధ లోకి జారుకున్నాడు.
“ఒక విహారి సముద్ర తీరంలో, పోటులో ఒడ్డుకి కొట్టుకొచ్చి దిగబడి పోయిన స్టారు చేపలని, ఒక్కొక్కటిగా ఏరి, తిరిగి నీళ్ళలోకి విసురుతున్నాడు. ఇది చూసిన మరో వ్యక్తి, ‘ఎంతో పొడవైన తీరం నిండా ఈ చేపలు వున్నాయి కదా’ అని అడగ్గా, ‘అయ్యా, నీళ్ళలోకి నే తిరిగి విసిరినవైనా, కనీసం బతుకుతున్నాయిగదా! వీలయితే, మీరూ ఒక చెయ్యి వెయ్యండి’ అన్నాడట విహారి.”
ఎవరో నా చెంప చెళ్ళుమన్నట్టనిపించింది. బుర్రలోని గజిబిజి ఆలోచనలు, నెమ్మదిగా ఒక త్రాటి మీదకి రావడం మొదలు పెట్టినై. నా సమస్యకి పరిష్కారం దొరికింది. ఇప్పటికి హరి మాత్రమే తారసపడ్డాడు. వీడికి దారి చూపించకుండా, పదేళ్ళు ఆగమనడం సబబు కాదు. రేప్పొద్దున ఇంకో గిరి కనబడితే, స్తోమత లేకపోతే ఆలోచింపవచ్చు. ముంబయి మహా నగరం లోని వీధి పిల్లలందరినీ నేను గాడి లో పెట్టలేను. కానీ, ఈ పరిస్థితి కి వ్యవస్థనో, ప్రభుత్వాన్నో నిందిస్తూ, నిర్లిప్తంగా ఏమీ పట్టనట్టు ఉండిపోవడం ఆత్మ వంచనే. నా జీవితంలో పాండురంగం గారి పాత్ర నాకొక అద్భుతం (మిరకల్). కానీ, వారు దాన్ని తన సహజ ధర్మంగా భావించేరే! తెర వెనుక నుంచి నే పిలిచిన ఒక్క పిలుపుకే, వారు అంతగా స్పందించి, నా బతుకు గీతని సరిదిద్దేరు. మరి హరి విషయం లో పదే, పదే వాడిచ్చిన పిలుపందుకోగలిగీ, అందుకోక తర్కించడం తగునా? పెద్దయ్య గారు హరి నే ఉద్దేశించి “మూడో మనిషి” అని వుంటారు. ఆలోచనలలో స్పష్టత లభించింది.
ఈ రోజే గుప్తా సేటు తో, మాట్లాడి, నా ఋణభారానికి హరిని ఒక బోయీని చెయ్యాలని, నిర్ణయానికి చేరిన నాకు మనసు హాయిగా, తేలికగా వుంది. సెషను పూర్తయ్యాక రిక్కీ కి కృతజ్ఞతలు చెప్పి, ఆటోగ్రాఫ్ తీసుకుని, కిందకి బయలుదేరేను. లిఫ్టు లాబీలోంచి బయటకి వచ్చి, గొడుగు తెరుద్దామని చూడబోతే, ఆశ్చర్యం. మూడు రోజులుగా పట్టిన ముసురూ, వానా పూర్తిగా వెలిసేయి. కురిసి, కురిసి అలసిపోయినట్టు, మబ్బులన్నీ విడిపోయి, ఆకాశం నిర్మలంగా వుంది. నేను నా బస్సు స్టాపు కేసి నడక సాగించేను. ఇన్నాళ్ళ వాన నీటిలో మునిగిన నేల ఇంకా పొడిబారి పోలేదు.