వాడుక భాషలో తెలుగు కవితావికాసము

వచన కవితలు

అప్పారావుగారైనా సరే, శ్రీశ్రీ ఐనా సరే – వీళ్ళందరు కొత్త కొత్త ఛందస్సులను సృష్టించి పాడుటకు అనువుగా ఉండేటట్లు కవితలను అల్లినారు. పాశ్చాత్య రచనల ప్రభావంవల్ల కవులు కవితలను వచనాలుగా అల్లడానికి ఆరంభించారు. పంక్తికీ పంక్తికీ మధ్య ఉండే అంతరము, చదివేటప్పుడు వచ్చే విరామాలు ఇట్టి రచనలను ఇంకా పటిష్ఠము చేస్తాయి. మనసులో ఉదయించిన భావాలను ఏ నిర్బంధం లేకుండా బహిర్గతం చేయడానికి వీలవుతుంది. ఇవి ఆంగ్లములోని blank verse లాంటిది, మాడర్న్ ఆర్ట్ వంటిది. ఇందులో ప్రాసలు, శబ్ద సౌందర్యాలు కేవలం ఐచ్ఛికము. ఏ పత్రిక చదివినా, ఏ కవితాసంకలనం చదివినా వచన పద్యాలు అందులో తప్పకుండా ఉంటాయి. ఇట్టి పద్యాలకు వస్తువు ఏదైనా కావచ్చు. ఇక్కడ ఈ మాధ్యమంలోని కొన్ని కవితలను మీముందు ఉంచుతున్నాను –

ఏ మహారాణి మెళ్ళోదో
నీలాలపేరు ఇట
తెగి పడిపోయిందేమి
కాదు – విష్ణుక్రాంత
కడు చిన్ని పూలు
తీగెపై అడనద తీరుగా ఉన్నై
నీలాల కంటేను మేలుగా ఉన్నై
– టేకుమళ్ళ కామేశ్వర రావు, మిణుగురు పురుగు

అక్షరంఅక్షరంలో నీ మధురస్వర ఆలాపన వింటాను
పంక్తి పంక్తిలో నీ జీవన దృక్కోణం స్పర్శిస్తాను
లేఖలో నీవు కనబడతావు
కరిగిస్తావు
గరళం త్రాగే శక్తి నిస్తావు
– గంగినేని, ఉదయిని

ఓటు నువ్వు ఎయ్యకుండ
సీటు రాదు నాయకులుకీ
పాటు నువ్వు పడకుండా
బువ్వలేదు పెద్దలకీ
దళితన్నల రాజ్యంకై
దండు నడుపుతున్నట్టి
దండధరుల గిరిజనులా
దండులో కలవండిరో
– చుండూరు పాట, వంగపండు

ఒకడు చేసిన నేరానికి
ఒకడు వెళ్ళాడు కారాగారానికి
ఒకడు చెప్పాడు దొంగ సాక్ష్యం
ఒకణ్ణి హింసించడమే అతని లక్ష్యం

న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు
అతనికి కలిగించలేదు నిట్టూర్పు
దోషి వీధిలో తిరుగుతున్నాడు
నిర్దోషి ఖైదులో మురుగుతున్నాడు
– దాశరథి, జ్వాలాలేఖిని

నేను ఏ అడవుల్లో తిరిగానో
సింహశార్దూలాల గర్భాల్లో నిద్రిస్తూ
నన్ను ఏ అందమైన లేడి మేసిందో
శాద్వలాల్లో తన రక్తమాంసాల్ని బుజ్జగిస్తూ
నేను ఏ అడవి అనుభూతికోసం కొమ్మలు జాపానో
నా ఆకుల అంగుళులతో శూన్యం స్పృశిస్తూ

ఏ ప్రాచీన సముద్ర చేతనలో తేలానో
నిరింద్రియ నిరవయవ కాంతికణాన్నయ్ స్పందిస్తూ
ఏ ఘడియలో ఊగానో
కాలంలో వ్రేలాడే బొమ్మల్లా ఉన్న
సూర్యచంద్రులకూ నాకూ అభేదం అనుభవిస్తూ

నా స్మృతులన్నీ రక్తప్రవాహాల్లో పడికొట్టుకొస్తున్నాయి
గుల్మొహర్ ఒక నూతన రుతువును ప్రకటించిన ఈనాడు
ఏ రుతువు సృష్టి అనంతత్వాన్ని
గానం చేస్తూ ఉందో ఆ రుతువును

మా వూళ్ళో ఇవాళ నన్నెరిగిన వాళ్ళు నలుగురే
శిథిలమైన వంతెన
గ్రామ కాలువ
పాత గుడి
ముసలి చెరువుగట్టు
– గుంటూరు శేషేంద్ర శర్మ, నీరైపోయింది

సినిమా పాటలలో వ్యావహారిక భాష

ముప్ఫైయవ దశకంనుండి చలనచిత్రాలు తెలుగులో విడుదలవుతున్నాయి. ఇవి అప్పుడూ, ఇప్పుడూ ప్రజల జనరంజనానికి అత్యవసరమైన పరికరమే. తెలుగు చిత్రసీమ చేసిన అదృష్టం ఏమంటే, సుప్రసిద్ధులైన కవులు సినిమా పాటలను రాశారు. సినిమా పాటలను పల్లెలలో, పట్టణాలలో ప్రజలు పాడుకొంటూ ఉంటారు. దేవులపల్లి, రజనీకాంతరావు, సముద్రాల, ఆరుద్ర, శ్రీశ్రీ, సిరివెన్నెల, వేటూరి మున్నగువారి పేరులు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. కింద కొన్ని ఉదహరణలు –


అదిగదిగో గగనసీమ
కృష్ణ శాస్త్రి, నా యిల్లు

అదిగదిగో గగనసీమ
అందమైన చందమామ ఆడెనోయీ

ఇదిగిదిగో తేలి తేలి
చల్లనైన పిల్లగాలి పాడెనోయీ

హాయి హాయి ఈ లోకం
తీయనైన దీ లోకం
నీ యిల్లే పూలవనం
నీ సర్వం ప్రేమ ధనం
మరవకోయి ఈ సత్యం

నీకోసమె జగమంతా
నిండెనోయి వెన్నెలలు
తేలెనోయి గాలిపైన
తీయనైన కోరికలు

చెరుచుకోకు నీ సౌఖ్యం
చేతులార ఆనందం
ఏనాడును పొరబడకోయి
ఏమైనా త్వరబడకోయి

మరల రాదు రమ్మన్నా
మాయమైన ప్రేమధనం
చిగిరింపదు తిరిగి
వాడి చెడిన పూలవనం
మరవకోయి ఈ సత్యం
– కృష్ణ శాస్త్రి, నా యిల్లు


కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడి దాన
ఆత్రేయ, తోడికోడళ్ళు

కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడి దాన
బుగ్గమీద గులాబిరంగు ఎలా వచ్చెనో చెప్పగలవా

[…]

గాలిలోన తేలిపోయే చీర కట్టిన చిన్నదానా
జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా
చిరుగు పాతల బరువు బ్రదుకుల నేతగాళ్ళే నేసినారు
చాకిరొకరిది సౌఖ్య మొకరిది సాగదింక తెలుసుకో
– ఆత్రేయ, తోడికోడళ్ళు


కలకానిది విలువైనది – బ్రతుకు
శ్రీశ్రీ, వెలుగునీడలు

కలకానిది విలువైనది – బ్రదుకు
కన్నీటి ధారలతోనే బలిచేయకు
[…]
అగాధమౌ జలనిధిలోన ఆణిముత్య మున్నటులే
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే
ఏదీ తనంత తానై నీ దరికి రాదు
శోధించి సాధించాలి అదియే ధీరగుణం
– శ్రీశ్రీ, వెలుగునీడలు


వటపత్రశాయికి వరహాల లాలి
– నారాయణ రెడ్డి, స్వాతిముత్యం

లాలీ లాలీ లాలీ లాలీ
వటపత్ర్రశాయికి వరహాల లాలి

కళ్యాణరామునికి కౌసల్య లాలి
యదువంశవిభునికి యశోద లాలి
కరిరాజముఖునికి గిరితనయ లాలి
పరమాబ్జభవునికి పరమాత్మ లాలి

జో జో జో జో
– నారాయణ రెడ్డి, స్వాతిముత్యం

ముగింపు

నాకు ఛందస్సు అంటే ఇష్టం. తాళవృత్తాలు, మాత్రాఛందస్సు నాకు ప్రియమైనవి. ఈ రంగంలో కొన్ని ఏళ్ళుగా నేను పరిశోధన కూడా స్వతంత్రంగా చేస్తున్నాను. ఐనా కూడా, నా మనసు లోతులలో ఉండే కొన్ని భావాలకు ఆకృతి ఇవ్వాలనే అపేక్ష కలిగినప్పుడు, గేయ కవితనో లేక వచన కవితనో ఎన్నుకొంటాను. ముఖ్యంగా, హృదయాన్ని స్పందింపజేసే శక్తి ఈ మాధ్యమానికి ఉంది. ఈ ఇంటర్నెట్ యుగంలో మనం దైనందినం మాట్లాడే వాడుక భాషలో చాలా మంది కవితలను రాస్తున్నారు, అంతకంటే ఎక్కువగా చదువుతున్నారు. ఆన్‌లైన్ పత్రికలు, బ్లాగులు కూడా వీటికి ప్రోత్సాహం ఇస్తున్నాయి. ఈ విధంగా ఇవి సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉన్నాయి. పాతంతా మంచీ కాదు, చెడూ కాదు. కొత్తంతా చెడూ కాదూ, మంచీ కాదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణం ఉంది, ప్రభావం ఉంది. కవి యోచించి మాధ్యమాన్ని ఎన్నుకోవాలి. అందుకే నారాయణ రెడ్డిగారంటారు –

కొత్త నీటిని చేర్చుకొని తర-
గెత్తు నదివలె యెట్టి జాతియు
ముందు కేగిన యంత కాలము
మూడు పూవులు, ఆరు కాయలు

గ్రంథసూచి

  1. ఆధునికాంధ్ర కవిత్వము – సంప్రదాయములు, ప్రయోగములు – సీ. నారాయణ రెడ్డి, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు, 1989.
  2. ఆధునిక కవిత – అభిప్రాయ వేదిక – ఆచార్య తిరుమల, మద్దాళి రఘురాం, కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు, 1981.
  3. ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు – కే. కే.రంగనాథాచార్యులు (సం.), ఆంధ్ర సారస్వత పరిషత్, హైదరాబాదు, 1982.
  4. ఆంధ్రమహాభారతము, ఆదిసభా పర్వములు – ఒస్మానియా యూనివర్సిటీ, హైదరాబాదు, 1968.
  5. కవనకుతూహలం – అబ్బూరి వరదరాజేశ్వరరావు, విశాల గ్రంథశాల, హైదరాబాదు, 1993.
  6. కిన్నెరసాని పాటలు, కోకిలమ్మ పెళ్ళి – విశ్వనాథ సత్యనారాయణ, ఆంధ్ర గ్రంథాలయ ముద్రాశాల, బెజవాడ, 1934.
  7. జడకుచ్చులు – రాయప్రోలు సుబ్బారావు, ఆంధ్ర గ్రంథాలయ ముద్రాక్షరశాల, బెజవాడ, 1925.
  8. జాతీయగీతాలు – గురజాడ రాఘవశర్మ, ఆంధ్రప్రదేశ సాహిత్య అకాడమీ, హైదరాబాదు, 1978.
  9. తెలుగు చలనచిత్ర గేయ సౌందర్యం – ఎచ్. ఎస్. బ్రహ్మానంద, వెరైటీ ప్రింటర్స్, ఏలూరు, 1992.
  10. దళిత గీతాలు – జయధీర్ తిరుమలరావు (సం.), సాహితీ సర్కిల్, హైద్రాబాదు, 1993.
  11. నీరై పారిపోయింది – గుంటూరు శేషేంద్రశర్మ, ది ఇండియన్ లాంగ్వేజెస్ ఫోరం, హైదరాబాదు, 1976.
  12. మహాప్రస్థానం – శ్రీశ్రీ, బీ. ఎన్. కే. ప్రెస్, మద్రాసు, 1950.
  13. మిణుగురుపురుగు – టేకుమళ్ళ కామేశ్వరరావు, నవ్య సాహిత్య పరిషత్, గుంటూరు, 1940.
  14. ముత్యాలసరాలు – గురజాడ అప్పారావు, ఎం. శేషాచలం అండ్ కో, మచిలీపట్నం, 1972.
  15. మేఘమాల – దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి, దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి సన్మాన సంఘం, మద్రాసు, 1975.
  16. మొల్ల రామాయణాము – మొల్ల, ఎమెస్కో సంప్రదాయ సాహితి, విజయవాడ, 1997.
  17. వైతాళికులు – ముద్దుకృష్ణ, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు, 1987.
  18. శశికళ – అడివి బాపిరాజు
  19. శిలాలోలిత – రేవతీదేవి
  20. సూర్యుడు కూడా ఉదయిస్తాడు – విశ్వనాథ సూర్యనారాయణ, జయప్రభ, యువభారతి, హైదరాబాదు, 1980.

జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి:

జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు.

 ...