7. వ్యంజన – ఇన్ని భాషాంశాలని పరిశీలించి, ముఖ్యమైన లక్షణాన్ని గురించి ఇప్పటిదాకా ముచ్చటించనే లేదు! ప్రాచీన కవిత్వం నుండి ఆధునిక కవిత్వం దాకా, ఏ కవిత్వమైనా ఉపయోగించుకొనే ప్రాథమిక భాషా లక్షణం ఇది. ఒక పదానికి, అది ప్రయోగించబడిన సందర్భాన్నిబట్టి, వాక్య నిర్మాణాన్నిబట్టి, రచించిన కవిబట్టి, చదివే పాఠకునిబట్టి, సాధారణ అర్థానికి మించిన విశేష అర్థస్ఫురణ కలిగే శక్తి ఉంది. దీనినే మన పూర్వ ఆలంకారికులు వ్యంజన అన్నారు. భాషలో ఉండే అక్షరాలూ పదాలూ పరిమితమైనవైనా, ఆ భాష ద్వారా అనంతమైన సాహిత్యాన్ని సృష్టించ గలిగే అవకాశం ఈ వ్యంజన శక్తి వల్లనే సాధ్యం. అసలు ఒక పదానికే అనంతమైన వ్యంజనార్థాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇంతకుముందు పేర్కొన్న నానార్థాల వంటిది కాదిది. వ్యంజన, పదం ప్రయోగించబడిన సందర్భం మీద పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఒక మాష్టారు అల్లరిచేసే కుర్రాడితో, “ఒరేయ్ ! నీకు నా బెత్తంతో పెళ్ళిచేస్తాను.” అన్నప్పుడు, అక్కడ పెళ్ళికి ఉన్న అర్థం సాధారణార్థం కాదు కదా!
భాషకున్న యీ లక్షణమే కవిత్వ భాషకి పునాది. వాడుక భాషలో కూడా వ్యంజనని వాడుతూ ఉంటాం. కవిత్వంలో అది చాలా విరివిగా ఉంటుంది. ఈ శక్తి పదాలకే పరిమితం కాదు. వాక్యాలకి కూడా వ్యంజనా శక్తి ఉంది. ఉదాహరణకి “ఆమె బతికే ఉంది కానీ చనిపోయి జైలు శిక్ష అనుభవిస్తోంది” అనే వాక్యం విడిగా చూస్తే అర్థరహితం. అదే కొప్పర్తి రాసిన “తల్లి” అనే యీ కవితలో ఎంత గొప్ప అర్థాన్నిస్తోందో గమనించండి!
ఆమెకు
ఇద్దరు కొడుకులు
తమ్ముడు
అన్నను తుపాకీతో కాల్చాడు
అన్న మరణించాడు
తమ్ముడు జైలుకెళ్ళాడు
ఆమె
బతికే ఉంది
కానీ చనిపోయి
జైలు శిక్ష అనుభవిస్తోంది
ఇలాటి వ్యంగ్యవైభవం ప్రాచీన కవిత్వంలో తిక్కన భారతంలో ఎక్కువ చూడవచ్చు. కీచక వధ ఘట్టంలో భీముడి సంభాషణ దీనికి చక్కని ఉదాహరణ:
ఇట్టివాడవు కావున నీవు నిన్ను
బొగడి కొనదగు నకట నా పోల్కి యాడు
దాని వెదకియు నెయ్యడనైన నీకు
బడయ వచ్చునె యెఱుగక పలికితిట్లు
నా యొడలు చేర్చినప్పుడు
నీ యొడలేట్లగునొ దాని నీవెఱిగెదు, న
న్నే యబలలతోడిదిగా
చేయ దలంచితివి, తప్పు సేసితి కంటే
నను ముట్టి నీవు వెండియు
వనితల సంగతికి బోవు వాడవె! యయినం
దనువే బడసిన ఫలమే
కనియదవిదె చిత్తభవ వికారములెల్లన్
దీని గురించి వివరిస్తూ బేతవోలు రామబ్రహ్మంగారు తన “పద్యకవితా పరిచయం – నన్నయ్య నుంచీ కంకంటి దాకా” అన్న పుస్తకంలో ఇలా అన్నారు:
శ్లేషలు లేవు. సంస్కృతపదాలు లేవు. సమాసాలు లేవు. అన్నీ పొడిమాటలు. కానీ వాక్యనిర్మాణంతోనూ, కాకుస్వరంతోనూ – ఉచ్చరించే విధానం – వ్యంగ్యార్థం సులభంగా స్ఫురిస్తోంది. రంగస్థలం మీద మూడుపాత్రలుంటే అందులో మొదటి పాత్ర అంటున్న మాటలు రెండవ పాత్రకి ఒకలాగా, మూడవపాత్రకి మరోలాగా అర్థమవ్వడం, ఎవరికి స్ఫురించింది వారికి సరిపోవడం గొప్ప నాటకీయత. దీన్ని వక్రోక్తి అంటారు. డ్రెమెటిక్ ఐరనీ అంటారు. సన్నివేశాన్ని బట్టి సంభాషణలలో ఇది స్ఫురిస్తుంది.
వ్యంజనని అర్థం చేసుకోలేని పాఠకులు కవిత్వాన్ని అర్థం చేసుకోలేరు. ఉదాహరణకి “పైటని తగలెయ్యాలి” అని జయప్రభగారు అన్నప్పుడు దాని వాచ్యార్థాన్ని (సాధారణ అర్థం) తీసుకుంటే, చాలా గందరగోళానికి దారితీస్తుంది.నిజానికి అక్కడ పైట పైటా కాదూ, తగలెయ్యడమంటే నిప్పుపెట్టి కాల్చడమనీ కాదు! అయితే యీ విషయాన్ని జయప్రభగారు తన కవితలో వాచ్యంగానే చెప్పారనుకోండి, అది వేరే సంగతి.
భాషకున్న యీ వ్యంజన శక్తిని ఉపయోగించుకొనని కవిత్వం అసలు కవిత్వమే కాదని చెప్పవచ్చు.
10. భాషా వైఫల్యం – ఇంతవరకూ కవిత్వ భాషకుండే విశేషాలని చూసాం కదా. కొన్ని సందర్భాలలో ఇంత ప్రత్యేకమైన కవిత్వభాషా కూడా నిరుపయోగం అయిపోయే అవకాశం ఉంది. అతి సున్నితమైన భావాన్ని కానీ, అతి గాఢమైన అనుభూతిని కానీ వ్యక్తం చెయ్యవలసి వచ్చినప్పుడు ఒకోసారి భాష విఫలమవుతుంది. అప్పుడు ప్రత్యేకమైన భాషేదీ పనికిరాదు. అతి సహజంగా, అతి సాధారణమైన భాషలో ఆ అనుభూతి వ్యక్తమైతేనే అది గుండెను తాకుతుంది. అనుభూతిలో ఉన్న గాఢత కారణంగా ఇది జరుగుతుంది. ఏదైనా విశేషంగా చెప్పే ప్రయత్నం చేస్తే అసలుకే మోసం వచ్చే ప్రమాదం కూడా ఉంది. అయితే యిది అరుదైన విషయమనే చెప్పాలి. దీనిగురించి ఆలోచించినప్పుడల్లా నాకు గుర్తుకువచ్చేది భారతంలో ద్రౌపది ఆవేదనా, కసీ చిత్రించే, “ఈ వెండ్రుకలు పట్టి యీడ్చిన ఆ చేయి తొలుతగా…” అన్న తిక్కనగారి పద్యం. ఇందులో కవిత్వ భాష ఏమీ లేదు. ఉన్నది అతి సహజమైన, గాఢమైన భావోద్వేగం.
ఆధునిక కవిత్వంలో ఇలాటి కవిత్వాన్ని చూసిన గుర్తు నాకు లేదు.
11. విధ్వంసం – ఇంతవరకూ భాషనీ, అందులో ఉన్న విశేష లక్షణాలనీ కవిత్వంలో ఎలా ఉపయోగించుకోవచ్చునో పరిశీలించాము. కవిత్వభాషా పరిమితిని కూడా గమనించాము. ఆఖరుగా, భాషని ధ్వంసం చెయ్యడం ద్వారా కూడా కవిత్వాన్ని సృష్టించవచ్చని నేనంటే మీరు నమ్ముతారా? నమ్మాలి! ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించి భాషా విధ్వంసం ద్వారా కవిత్వాన్ని సృష్టించిన సందర్భాలు ఉన్నాయి. లేదు, అసలు అలాటిది కవిత్వమే కాదు పొమ్మంటే నేననగలిగేదేమీ లేదనుకోండి!
భావ కవిత్వం మీద తిరుగుబాటు చేసిన పఠాభి “ఫిడేల్ రాగాల”లో యీ భాషా విధ్వంసాన్ని చూడవచ్చు. పఠాభి తిరుగుబాటు పూర్తి అవహేళనా ధోరణిలో సాగింది. అందులో భాగంగానే భావకవిత్వంలోని భాషని కూడా అవహేళన చేసారతను. అయితే యిది పేరడీ కాదు. తన అపహాస్యమనే దుడ్డుకఱ్ఱతో భావకవిత్వంలో కనిపించే గ్రాంధికభాషా పోకడల నడ్డి విరగ్గొట్టినట్టే అనిపిస్తుంది అతని కవిత్వాన్ని చదివితే.
“అనుసరిస్తాను నవీన పంథా; కానీ
భావకవిన్మాత్రము కాన్నే; నే
నహంభావకవిని”
అని అన్నా,
“తగిలింపబడియున్నది జాబిల్లి
చయినా బజారు గగనములోన ; పయిన
అనవసరంగా అఘోరంగా! ”
అని అన్నా, అతను చేసిన గ్రాంధిక భాషా విధ్వంసం స్పష్టంగా కనిపిస్తుంది!
మొత్తం భాషనీ, భాషా సూత్రాలనీ విధ్వంసం చేసిన కవిత్వం అధివాస్తవిక (surrealist) కవిత్వం. వ్యక్తిని బంధించే ప్రపంచ వాస్తవికత మీద తిరుగుబాటుకి సూచనగా, భాషా వ్యాకరణాల మీద తిరుగుబాటు చేసి, అధివాస్తవిక కవిత్వం పుట్టింది. కాని, తెలుగులో యిది అంతగా ప్రచారం పొందలేదు.
ఉపసంహారం
వేల్చేరు నారాయణరావుగారు తన “తెలుగులో కవితా విప్లవాల స్వరూపం” అన్న వ్యాసంలో చెప్పిన యీ కింది మాటలు గుర్తుచేసుకోకపోతే యీ వ్యాసం అసంపూర్ణమవుతుంది.
కవిత్వం కూడా భాషే. కాకపోతే అదొక విశేష రూపంగల భాష. నిత్య వ్యవహారంలో ఉన్న భాషవల్ల కలగని విశేష ఫలితాలు యీ భాషవల్ల కలుగుతాయి. భాషకి నియమాలున్నాయి. వాటిని వ్యాకరించ వచ్చు. కవిత్వం కూడా వ్యాకరించడం సాధ్యమనీ, మామూలు భాషకిలేని కొన్ని అదనపు లక్షణాలు కవిత్వానికి ఉన్నాయనీ నిర్ధారించ వచ్చుననీ ప్రతిపాదించడం సహేతుకం.
కవిత్వభాషని వ్యాకరించడం సాధ్యమని నేననుకోను కానీ, కవిత్వ భాషలోని ఆ అదనపు లక్షణాలని గుర్తించడానికి ప్రయత్నించవచ్చు. ఆ దిశగా వేసిన చిన్న అడుగే యీ వ్యాసం. కవిత్వంలో భాష గురించి యింకా విపులమైన పరిశోధన జరగాల్సి ఉంది. ముఖ్యంగా, ఆధునిక కవిత్వంలోని భాష గురించి చాలా పరిశీలన జరగాలి. వివిధ కవిత్వ ధోరణులలోని భాషా ప్రయోగ వైవిధ్యము, కవిత్వంలో మాండలిక పద ప్రయోజనము, కవిత్వంలో క్లుప్తత సాధించే విధానము, వచన కవిత్వంలో పాద విభజన ప్రయోజనము (నాకు తెలిసి దీనికి ఎలాటి ప్రయోజనమూ లేదు), శబ్దం నుంచి నిశ్శబ్దం దిశగా ప్రయాణిస్తున్న కవిత్వంలో మారుతున్న భాషాప్రయోజనము మొదలైన అనేక విషయాలగురించిన పరిశీలన విశ్లేషణ అవసరం. ఆధునిక కవిత్వాన్ని మరింత బాగా అర్థం చేసుకొనే దిశగా విమర్శకులకూ, మరింత మంచి కవిత్వాన్ని సృష్టించే దిశగా కవులకూ కూడా యీ పరిశోధన ఉపయోగపడుతుందని నా నమ్మకం.
ఉపయుక్త గ్రంధాలు
- భాషాంతరంగం – ఆచార్య చేకూరి రామారావు
- కవిత 2006 – కవితా సంకలనం
- కవిసేన మేనిఫెస్టొ – గుంటూరు శెషేంద్ర శర్మ
- పద్య కవితా పరిచయం, నన్నయ నుంచి కంకంటి దాకా – బేతవోలు రామబ్రహ్మం
- సాహిత్య వ్యాసాలు – మధునాపంతుల సత్యనారాయణ
- తెలుగులో కవితా విప్లవాల స్వరూపాలు – వేల్చేరు నారాయణ రావు
- నేటి కాలపు కవిత్వం, తీరుతెన్నులు – తమ్మినేని యదుకుల భూషణ్