నింగికి నేలకు సంగమం
నింగికి నేలకు ఉండే ద్వైతాద్వైత స్వభావం నాటినుండి నేటివరకు భారతీయ సాంస్కృతిక మేధస్సులో నిలిచి ఉన్నది. వేదాలలో ఇది పదేపదే చిత్రించబడినది. వేదకాలంలో దీనిని ద్యావా-పృథ్వీ అనేవారు. ఋగ్వేదంనుండి ఉదాహరణ నొకటిని కింద ఇస్తున్నాను –
తే నో గృణానే మహినీ మహి శ్రవః
క్షత్రం ద్యావా-పృథివీ ధాసథో బృహత్
యేనాభి కృష్టీస్తతనామ విశ్వహా
పనాయ్యమోజో అస్మే సమిన్వతం
– ఋగ్వేదము, ద్యావా-పృథ్వీ
ఓ భూమీ, ఓ ఆకాశమా, మిమ్ములను మేము ఎన్నో విధాలుగా స్తుతించాము. మాకు కీర్తిని, భూసంపదను ప్రసాదించండి. మాకు బలాన్ని, శౌర్యాన్ని ఇవ్వండి, దానితో మేము ప్రజలను మా అధీనంలో ఉంచుకొన వీలవుతుంది.
నన్నయ భారతానికి, పంపకవి రాసిన కన్నడ భారతనికి ఎన్నో పోలికలు ఉన్నాయి. కాని ఒక మాట మాత్రం మరువరాదు. పంపకవి జైనుడు. నన్నయ భారతరచనతో వైదిక మతాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేశారు. అందుకే ఈ భూమ్యాకాశ సమాగమాన్ని అందంగా ఈ పద్యంలో చిత్రించారు.
చివరి పద్యము –
శారద రాత్రు లుజ్జ్వల లసత్తర తారక హార పంక్తులం
జారుతరంబు లయ్యె వికసన్నవ కైరవ గంధ బంధురో-
దార సమీర సౌరభముఁ దాల్చి సుధాంశు వికీర్యమాణ క-
ర్పూర పరాగ పాండు రుచి పూరములం బరిపూరితంబులై
ఇది నన్నయగారు రచించిన చిట్టచివరి పద్యం. నాకు ఇది ఎంతో నచ్చిన ఉత్పలమాల. దీనిని చదువుతుంటే వయ్యారంగా నడుస్తుండే ఒక అసమాన రూపవతి జ్ఞాపకానికి వస్తుంది. ఇందులో సంస్కృత సమాసాలు ఎక్కువగా ఉన్నా, దీనిని చదువుతుంటే ఒక అందమైన గేయాన్ని చదువేటట్లుంటుంది. పందొమ్మిది ర-కారాలు, ఎనిమిది ల-కారాలు, ఏడు శసలు, ఆరు ప-కారాలు, త-కారాలు ఈ పద్యానికి ఒక ఊపునిస్తుంది. మనం నగరాలలో ఎక్కువగా నివసిస్తూ ఉంటాము. అందువల్ల కలుషితమైన వాతావరణం, అధికమైన కాంతి నక్షత్రాలను బాగుగా చూచే అవకాశాన్ని ఇవ్వవు. నక్షత్రాల అందాన్ని చూడాలంటే ఆకాశం నిర్మలంగా ఉండాలి, చుట్టుపట్ల ఎక్కువ కాంతి ఉండరాదు. శరదృతువులో ఆకాశం స్వచ్ఛంగా ఉంటుంది, మేఘాలు ఉండవు. తారకలను కళ్ళు తరించేలా చూడవచ్చు అరణ్యంలో. శరత్కాలములో రాత్రిళ్ళు మిక్కిలి అందమైన నక్షత్రమాలలతో విరాజిల్లుతూ ఉంటాయి. అప్పుడే వికసించిన కలువ పూల సుగంధాన్ని పిల్లగాలి మోసి తెస్తూ ఉంది. ఇక చంద్రుడు ప్రసరించే వెన్నెల అంటారా? అది తెల్లని కర్పూరపు పొడి వెదజల్లినట్లుంది. నన్నయగారు శారద యామినుల సౌందర్యాన్ని వర్ణిస్తున్నా, దీనిని ఒక యువతికి కూడా అన్వయించవచ్చు. అదే ఇందులోని చమత్కారం. ఆడవాళ్ళు అందమైన హారాలను ధరిస్తారు గదా! వాళ్ళు మంచి సుగంధాన్ని కూడా అలదికొంటారు గదా! వాళ్ళ ముఖాలలో వెన్నెల పరాగాలలా చిమ్ముతుంది గదా! కాళిదాసు ఋతుసంహారములో శరదృతువును వర్ణించేటప్పుడు రాత్రిని కన్యతో పోల్చినట్లు ఒక వసంతతిలకవృత్తము ఉన్నది. అది –
తారాగణప్రచురభూషణముద్వహంతీ
మేఘోపరోధపరిముక్తశశాంకవక్త్రా
జ్యోత్స్నాదుకూలమమలం రజనీ వసనా
వృద్ధిం ప్రయాత్యనుదినం ప్రమదేవ బాలా
– కాలిదాస, ఋతుసంహారం, 3.07
బాలిక యువతిగా మారే విధంగా రాత్రిళ్ళు పొడుగవుతున్నాయి. యువతివలెనే రాత్రి కూడా తళుక్కుమనే తారాగణాలనే నగలను ధరించింది. యువతి ముసుగు తొలగిస్తే ఆమె అందమైన ముఖం కనబడేటట్లు, దూదిపింజాలాటి మేఘాలు తొలగినప్పుడు చంద్రబింబం కనబడుతుంది.
నన్నయగారి ఆఖరి పద్యానికి ఒక పాఠాంతరం కూడా ఉంది. చివరి పదము పరిపూరితంబులై-కు బదులు పరపూరితంబులై అని కొందరంటారు. అంటే భారతము ఇక మీద ఇతరులతో పూరించబడుతుంది అని భావన. దీని నిజానిజాలు దేవుడికి, దేవుడిని చేరిన నన్నయకు మాత్రమే తెలుసు, మనకెవరికీ తెలియదు.
ముగింపు
ఈ పద్యాలను రాసేటప్పుడు నన్నయగారి సృజనాశక్తి ఒక ఉన్నత శృంగాన్ని తాకింది. బహుశా అతనికి ఉన్నట్లుండి హృదయాఘాతము వంటిది ఏదైనా సంభవించి ఉంటుంది. అది మన దురదృష్టం. తిక్కన ఎఱ్ఱనలు తరువాత భారతాన్ని పూర్తి చేసినా, వారి పద్ధతి వేరు. అది నన్నయ ప్రణాళిక కాదు. మిగిలిన పర్వాలను నన్నయగారు ఎలా పూర్తి చేసి ఉంటారో అన్న విషయాన్ని మనం ఊహించవలసిందే, కాని చదివి ఆనందించడానికి వీలు కాదు.
అంకితము
ఉన్నత పాఠశాలలో ఆరవ ఫారం చదివేటప్పుడు నన్నయ యెఱ్ఱనలు వ్రాసిన వర్షశరదృతువర్ణనలు మాకు పఠనీయాంశముగా ఉండేది. ఈ పద్యాల అర్థాలను చక్కగా విడమర్చి చెప్పింది మాత్రమే కాక తెలుగు సాహిత్యంలో నాకు ఆసక్తి కలిగించిన తెలుగు పండితులు విద్వత్కవిభూషణ విద్వాన్ శ్రీ వేదం వేంకటకృష్ణశర్మగారి (కుందమాల, భామినీవిలాసము, శతకవాఙ్మయసర్వస్వము, తేనెసోనలు మున్నగు పుస్తకముల రచయిత) స్మృతికి వినయంగా భక్తితో ఈ వ్యాసాన్ని అంకితం చేస్తున్నాను.
