ఈమాట » నన్నయ హంసగీతికలు

Expand to right
Expand to left

నన్నయ హంసగీతికలు

నింగికి నేలకు సంగమం

నింగికి నేలకు ఉండే ద్వైతాద్వైత స్వభావం నాటినుండి నేటివరకు భారతీయ సాంస్కృతిక మేధస్సులో నిలిచి ఉన్నది. వేదాలలో ఇది పదేపదే చిత్రించబడినది. వేదకాలంలో దీనిని ద్యావా-పృథ్వీ అనేవారు. ఋగ్వేదంనుండి ఉదాహరణ నొకటిని కింద ఇస్తున్నాను -

తే నో గృణానే మహినీ మహి శ్రవః
క్షత్రం ద్యావా-పృథివీ ధాసథో బృహత్
యేనాభి కృష్టీస్తతనామ విశ్వహా
పనాయ్యమోజో అస్మే సమిన్వతం
- ఋగ్వేదము, ద్యావా-పృథ్వీ

ఓ భూమీ, ఓ ఆకాశమా, మిమ్ములను మేము ఎన్నో విధాలుగా స్తుతించాము. మాకు కీర్తిని, భూసంపదను ప్రసాదించండి. మాకు బలాన్ని, శౌర్యాన్ని ఇవ్వండి, దానితో మేము ప్రజలను మా అధీనంలో ఉంచుకొన వీలవుతుంది.

నన్నయ భారతానికి, పంపకవి రాసిన కన్నడ భారతనికి ఎన్నో పోలికలు ఉన్నాయి. కాని ఒక మాట మాత్రం మరువరాదు. పంపకవి జైనుడు. నన్నయ భారతరచనతో వైదిక మతాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేశారు. అందుకే ఈ భూమ్యాకాశ సమాగమాన్ని అందంగా ఈ పద్యంలో చిత్రించారు.

చివరి పద్యము -
శారద రాత్రు లుజ్జ్వల లసత్తర తారక హార పంక్తులం
జారుతరంబు లయ్యె వికసన్నవ కైరవ గంధ బంధురో-
దార సమీర సౌరభముఁ దాల్చి సుధాంశు వికీర్యమాణ క-
ర్పూర పరాగ పాండు రుచి పూరములం బరిపూరితంబులై

ఇది నన్నయగారు రచించిన చిట్టచివరి పద్యం. నాకు ఇది ఎంతో నచ్చిన ఉత్పలమాల. దీనిని చదువుతుంటే వయ్యారంగా నడుస్తుండే ఒక అసమాన రూపవతి జ్ఞాపకానికి వస్తుంది. ఇందులో సంస్కృత సమాసాలు ఎక్కువగా ఉన్నా, దీనిని చదువుతుంటే ఒక అందమైన గేయాన్ని చదువేటట్లుంటుంది. పందొమ్మిది ర-కారాలు, ఎనిమిది ల-కారాలు, ఏడు శసలు, ఆరు ప-కారాలు, త-కారాలు ఈ పద్యానికి ఒక ఊపునిస్తుంది. మనం నగరాలలో ఎక్కువగా నివసిస్తూ ఉంటాము. అందువల్ల కలుషితమైన వాతావరణం, అధికమైన కాంతి నక్షత్రాలను బాగుగా చూచే అవకాశాన్ని ఇవ్వవు. నక్షత్రాల అందాన్ని చూడాలంటే ఆకాశం నిర్మలంగా ఉండాలి, చుట్టుపట్ల ఎక్కువ కాంతి ఉండరాదు. శరదృతువులో ఆకాశం స్వచ్ఛంగా ఉంటుంది, మేఘాలు ఉండవు. తారకలను కళ్లు తరించేలా చూడవచ్చు అరణ్యంలో. శరత్కాలములో రాత్రిళ్లు మిక్కిలి అందమైన నక్షత్రమాలలతో విరాజిల్లుతూ ఉంటాయి. అప్పుడే వికసించిన కలువ పూల సుగంధాన్ని పిల్లగాలి మోసి తెస్తూ ఉంది. ఇక చంద్రుడు ప్రసరించే వెన్నెల అంటారా? అది తెల్లని కర్పూరపు పొడి వెదజల్లినట్లుంది. నన్నయగారు శారద యామినుల సౌందర్యాన్ని వర్ణిస్తున్నా, దీనిని ఒక యువతికి కూడా అన్వయించవచ్చు. అదే ఇందులోని చమత్కారం. ఆడవాళ్లు అందమైన హారాలను ధరిస్తారు గదా! వాళ్లు మంచి సుగంధాన్ని కూడా అలదికొంటారు గదా! వాళ్ల ముఖాలలో వెన్నెల పరాగాలలా చిమ్ముతుంది గదా! కాళిదాసు ఋతుసంహారములో శరదృతువును వర్ణించేటప్పుడు రాత్రిని కన్యతో పోల్చినట్లు ఒక వసంతతిలకవృత్తము ఉన్నది. అది –

తారాగణప్రచురభూషణముద్వహంతీ
మేఘోపరోధపరిముక్తశశాంకవక్త్రా
జ్యోత్స్నాదుకూలమమలం రజనీ వసనా
వృద్ధిం ప్రయాత్యనుదినం ప్రమదేవ బాలా
- కాలిదాస, ఋతుసంహారం, 3.07

బాలిక యువతిగా మారే విధంగా రాత్రిళ్లు పొడుగవుతున్నాయి. యువతివలెనే రాత్రి కూడా తళుక్కుమనే తారాగణాలనే నగలను ధరించింది. యువతి ముసుగు తొలగిస్తే ఆమె అందమైన ముఖం కనబడేటట్లు, దూదిపింజాలాటి మేఘాలు తొలగినప్పుడు చంద్రబింబం కనబడుతుంది.

నన్నయగారి ఆఖరి పద్యానికి ఒక పాఠాంతరం కూడా ఉంది. చివరి పదము పరిపూరితంబులై-కు బదులు పరపూరితంబులై అని కొందరంటారు. అంటే భారతము ఇక మీద ఇతరులతో పూరించబడుతుంది అని భావన. దీని నిజానిజాలు దేవుడికి, దేవుడిని చేరిన నన్నయకు మాత్రమే తెలుసు, మనకెవరికీ తెలియదు.

ముగింపు

ఈ పద్యాలను రాసేటప్పుడు నన్నయగారి సృజనాశక్తి ఒక ఉన్నత శృంగాన్ని తాకింది. బహుశా అతనికి ఉన్నట్లుండి హృదయాఘాతము వంటిది ఏదైనా సంభవించి ఉంటుంది. అది మన దురదృష్టం. తిక్కన ఎఱ్ఱనలు తరువాత భారతాన్ని పూర్తి చేసినా, వారి పద్ధతి వేరు. అది నన్నయ ప్రణాళిక కాదు. మిగిలిన పర్వాలను నన్నయగారు ఎలా పూర్తి చేసి ఉంటారో అన్న విషయాన్ని మనం ఊహించవలసిందే, కాని చదివి ఆనందించడానికి వీలు కాదు.

అంకితము

ఉన్నత పాఠశాలలో ఆరవ ఫారం చదివేటప్పుడు నన్నయ యెఱ్ఱనలు వ్రాసిన వర్షశరదృతువర్ణనలు మాకు పఠనీయాంశముగా ఉండేది. ఈ పద్యాల అర్థాలను చక్కగా విడమర్చి చెప్పింది మాత్రమే కాక తెలుగు సాహిత్యంలో నాకు ఆసక్తి కలిగించిన తెలుగు పండితులు విద్వత్కవిభూషణ విద్వాన్ శ్రీ వేదం వేంకటకృష్ణశర్మగారి (కుందమాల, భామినీవిలాసము, శతకవాఙ్మయసర్వస్వము, తేనెసోనలు మున్నగు పుస్తకముల రచయిత) స్మృతికి వినయంగా భక్తితో ఈ వ్యాసాన్ని అంకితం చేస్తున్నాను.

ముందరి పేజీ(లు) 1 2 3
 

(7 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. Kameswara Rao అభిప్రాయం:

    May 9, 2008 10:56 am

    మంచి పద్యాల గురించి మంచి వ్యాసం!
    ఈ పద్యాల కథ, ధర్మరాజు సారస్వత యాగం జరిగిన తీర్థంలో స్నానమాడి పొందిన మహానుభూతి దగ్గర మొదలౌతుందని “నన్నయ్యగారి అక్షర రమ్యత”లో వి.వి.ఎల్. నరసింహారావు గారి అభిప్రాయం. ఇక్కడ నన్నయ్యగారు పేర్కొన్న “ప్రసన్న సరస్వతీకము” రాబోయే కథలోని సరస్వతీ గీతకి (తార్క్ష్యునికి సరస్వతి చెప్పిన గీత) సూచన అని అతనుద్దేశం. అయతే ఆ భాగాన్ని ఎఱ్ఱన పూరించాడు.
    ఈ భాగం చదువుతూ ఉంటే నాకూ, అంతర్లీనంగా సాగే ఏదో అంతస్సూత్రం కనిపించీ కనిపించకుండా కనిపిస్తుంది.
    ఎఱ్ఱన చేసే సరస్వతీ నది వర్ణనకీ నన్నయ్య “భూసతికిన్…” పద్యానికీ చాలా సామ్యం కనిపిస్తుంది. ఈ పద్యంలో, భూమినీ ఆకాశాన్నీ హంసతో పోల్చినట్టుగా మీరన్నారు. కానీ ఇక్కడ శరత్కాలాన్ని సరస్వతీ బ్రహ్మల సమేతమైన “శారద”హంసతో పోల్చినట్టు నాకనిపిస్తోంది. శారద రాత్రులు, సరస్వతీ ఒకదానికొకటి విడదీయలేనంతగా అనిపిస్తాయి. ఇది ఎఱ్ఱన సరస్వతీ గీత తర్వాత చేసిన సరస్వతీ స్తుతి “అంబ! నవాంబుజోజ్వల కరాంబుజ! శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి!” అనడంతో పరిపూర్ణమైనట్టుగా తోస్తుంది.
    ఈ మొత్తం భాగంలో (నన్నయ్య శరత్కాల వర్ణన మొదలు ఎఱ్ఱన సరస్వతీ స్తుతి వరకూ), చాలా పద్యాల్లో తిరిగి తిరిగి కనిపించే పదాలూ పదబంధాలూ కూడా ఈ ఏక సూత్రతని స్ఫురింపజేస్తాయి.
    నన్నయకి హృదయఘాతం వంటిది సంభవించి ఉంటుందని కన్నా, శారద హంసనెక్కి బ్రహ్మలోకానికి ఎగిరిపోయి ఆ సరస్వతిలో కలసిపోయాడని ఊహిస్తే మనకి ఆత్మసంతృప్తి కలుగుతుంది కదా!
    మధునాపంతుల వారు ఇంచుమించు ఇలాగే ఊహించారు. ఊహించడమే కాక, దానికి ఈ వ్యాసంలో మీరిచ్చిన ఈ నన్నయ్య చివరి పద్యాలని ఆధారం చేసుకొని ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు, “నన్నయ్య భారతి” పుస్తకంలో “నన్నయగారి వెన్నెల రేయి” అన్న వ్యాసంలో.

  2. Lyla yerneni అభిప్రాయం:

    May 10, 2008 9:00 am

    ఈ వ్యాసము నేను ప్రచురించిన రోజు నుండీ, రోజూ చదువుతున్నాను. మరి ఎంచుకున్న పద్యాలు అంత అందమైనవి. వ్యాసకర్తకు విషయం పైన అధికారము, అభిమానము, పాఠకులమీద ప్రేమతో, ఓర్పుతో విషయాన్ని విశదీకరించటం, భాషమీది మమకారం గౌరవంతో చక్కని (మధ్యలో ముక్కలు కాని, చివర్లో తునిగిపోని) వాక్యాలు రాయటం - ఇవి కొన్ని నాకు నచ్చిన గుణాలు. ఈ రచయిత వ్యాసాలు నాకు ఒయాసిస్సులు.

    హంస గీతికలు అన్న శీర్షిక ఎంతో బాగుంది. కాని ఇంగ్లీషు సంగతి ఎత్తినప్పుడు ’swan song’ అన్నమాటే వ్యాసము లో ఉండాలని నా అభిప్రాయం.

    కామేశ్వర రావు వివరణ కూడా ఎంతో ఎంతో బాగుంది. మళ్ళీ భారతంలో ఈ ఘట్టంలో ముందు వెనుకల పద్యాలన్నీ చదివాను. నాకు మీకున్న పాండిత్యం లేదు. చాలా పద్యాలు అర్థం చెప్పి, వివరణలిస్తేనే చదువుకోగలను.
    ఐనా, “అబ్జజు యానముతో సమానమై” అన్నచోట ఆ హంస బ్రహ్మ వాహనమైన హంస కాదా? అబ్జజుడు బహ్మ కదా?

    లైలా

  3. కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    May 11, 2008 6:52 pm

    శారద రాత్రులు

    దాదాపు రెండేళ్ళ క్రితం, రచ్చబండలో ఈ పద్యం గురించి రాశాను: గొప్ప కవిత్వం రాయాలంటే గొప్ప కవిత్వం చదవాలన్నారు (తమ్మినేని అనుకుంటా); దానిని వచనానికి అన్వయించుకొని, శ్రీపాద “అనుభవాలూ - జ్ఞాపకాలూనూ” చదవడం మొదలెడితే “శారద రాత్రులు” పద్యం మీద ఆయన వ్యాఖ్యానం నన్ను కట్టేసింది. ఎవరన్నా వివరిస్తే తప్ప నాకై నాకు మన పాత పద్యాల్లోని కవిత్వాన్ని ఎలా ఆస్వాదించాలో తెలియదు.

    (కొడవటిగంటి కుటుంబరావుకి శ్రీపాద ఇచ్చిన సలహా: “ఆడవాళ్ళు మాట్లాడుకునేది వినవోయ్. అసలైన తెలుగు వస్తుంది.” పుస్తకభాషగా ఉన్న కుటుంబరావు రచనాధోరణి దానితో మారిపోయిందట! సౌమ్య గారు చెప్తున్న మాటలు నిజమయితే, శ్రీపాద పాతబడిపోయాడా అని అనుమానమేస్తుంది. ఆవిణ్ణి తప్పుపట్టడం లేదని మనవి.)

    అప్పుడు గూడా రచ్చబండలో ముచ్చటించుకున్నాం - పాత్రలు ఇవే. మోహనరావు గారూ, కామేశ్వరరావు గారూ పాత సాహిత్యంలో (ఇతరేత్రా కూడా) ఉద్దండులు. సమగ్రమైన చక్కటి వ్యాసం రాసినందుకు JKM గారికి అభినందనలు.

    “దళిత నవీన” పద్యం వివరణ మనోహరంగా ఉంది. కప్పల బెకబెకలలో ఉపనిష్ద్గానామృతం అతిశయోక్తి అనిపించింది. (మా ఇంటి వెనకాల ఉన్న చెరువులో కప్పలు పాడే సంగీతానికి ఇంట్లో ఫ్యాను మోత జత చేస్తే తప్ప నాకు నిద్ర పట్టదు.) వానా, వెన్నెలా కలిసిన మంచి ఇస్మాయిల్ కవిత “కప్పల నిశ్శబ్దం.”
    మోహనరావు గారు పద్యాల గురించి రాసే కొన్ని వాక్యాలు - “పందొమ్మిది ర-కారాలు, ఎనిమిది ల-కారాలు, ఏడు శసలు, ఆరు ప-కారాలు, త-కారాలు ఈ పద్యానికి ఒక ఊపునిస్తుంది” - చదివితే నాబోంట్లకు చెవిటివాడి ముందర శంఖం ఊదినట్లుంటుంది. లైలా గారి లాంటి ప్రతిభావంతులు మాత్రం ఉత్తేజపడి ఠకీ మని ఓ కవిత అల్లేస్తారు! పాఠకుల్లో రకాలు అనేకం.

    కామేశ్వరారావు గారు చెప్తేనే మధునాపంతుల వారి వ్యాసం చదివాను. “శారద రాత్రులు” అను ఉత్పలమాలలో చుట్టుకొని నన్నయ గంటము ఇక కదలలేదట! నన్నయ మొదటి ఉత్పలమాల “రాజుకులైక భూషణుడు” లోనూ చివరి ఉత్పలమాల “శారద రాత్రుల” లోనూ వెన్నెల ప్రస్తావనే అన్నారు. అది గూడా మంచి వ్యాసం.

    కొడవళ్ళ హనుమంతరావు

  4. rama bharadwaj అభిప్రాయం:

    May 12, 2008 9:59 pm

    కొడవళ్ళ హనుమంతరావు గారు,

    పద్యాన్ని చదివి అర్ధం చేసుకుని ఆస్వాదించగల అవకాశం ఇంగ్లిష్ చదువులు చదువుకున్న ఇటీవలి వారందరి లోను అరుదుగానే వుంటోది మరి. ఇది మీ ఒక్కరి అనుభవమే కాదు. అయితే పూర్వ కవుల సాహిత్యానికి వ్యాఖ్యానాలు పండితులు రాసినవి వున్నాయి. అవి ఎక్కువగా “వావిల్ల” వారివి. వాటి కాపీలని మీరు సంపాదించుకోవచ్చు. వావిల్లవారివి పుస్తకాలు మళ్ళీ కొన్నింటిని కొనుక్కుందికి వీలుగ అందుబాటు లోకి తెస్తున్నారు. మీరు వాటిని సేకరించుకొగలిగితే మీ అంతట మీరే పెద్దన మనుచరిత్రని, రాయల ఆముక్తమాల్యదని కూడా స్వయంగా చదివి ఆనందించవచ్చు. కవిత్రయ మహాభారతాన్ని ఈమధ్యనే తి.తి.దే. వాళ్ళు ఒక 15 సంపుటాల్లో అర్ధ టీకాతాత్పర్య సహితంగా అచ్చువేసారు. మీరు వాటిని కొనుక్కొగలిగితే కవిత్రయ భారతాన్నికూడా స్వయంగానే అర్ధం చెసుకుందికి వీలుంది.

    పింగళి సూరన “కళాపూర్ణోదయం” మీద కట్టమంచి రామలింగారెడ్డి గారి విశ్లేషణ వుంది. మీరు మీ ఆసక్తిని బట్టి వీటిని సేకరించుకుని వీలున్నప్పుడు చదువుకోగలిగితే పాత సాహిత్యం చదివి అర్ధం చేసుకొవటం మరీ అసాధ్యం కాదు అని మీకే తెలియగలదు. మీ ఇష్టాన్ని గమనించి, సంతోషంతో నాకు తెలిసిన విషయాలని మీకు చెబుతున్నాను.

    wish u best of luck.

    rama.

  5. Kameswara Rao అభిప్రాయం:

    May 14, 2008 8:16 am

    లైలా గారు,
    “అబ్జజుయానము” అంటే ప్రతిపదార్థం మీరనట్టు బ్రహ్మ వాహనం అయిన హంస అనే. ఇక్కడ హంస మీద సరస్వతి, బ్రహ్మఇద్దరూ ఉన్నారు కాబట్టి సరస్వతి హంసకూడా అని అనుకోడంలో తప్పులేదనుకుంటాను. బ్రహ్మకీ సరస్వతికీ ఈ మధ్య తగువు వచ్చి వేరే వేరే వాహనాలు ఏర్పాటు చేసుకుంటే మాత్రం నాకు తెలీదనుకోండి :-)

  6. కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    May 17, 2008 11:24 am

    పాత సాహిత్యాన్ని చదివించడం ఎలా?

    భరద్వాజ గారూ,

    మీ సూచనలకి కృతజ్ఞతలు. మీరు చెప్పిన పుస్తకాలు కొనే శక్తీ, చదవాలనే ఆసక్తీ ఉన్నాయి. కాని అవి చాలవు; చదవాలనే దీక్షా, పట్టుదలా కావాలి! నేను పాత సాహిత్యాన్ని సులభంగా ఆకళింపు చేసుకోలేకపోవడానికి కారణం నా ఇంగ్లీషు చదువు కాదు. నేను ఇటివలి వాణ్ణీ కాదు.

    పదో తరగతిదాకా తెలుగు మీడియం లోనే చదివాను. ఇంటర్ ఇంగ్లీషు మీడియం అయినా తెలుగు కూడా ఒక సబ్జెక్ట్. కాలేజీ చదువుల తర్వాత గత పాతికేళ్ళుగా సాహిత్యపరిచయం తక్కువ. వావిళ్ళా, దేవస్థానం వాళ్ళూ చేస్తున్న కృషి చెప్పుకోదగ్గదే కాని, సామాన్య పాఠకుడు తనంతటతాను మన కావ్యాలు - వ్యాఖ్యానాలున్నా - చదవడం శ్రమతో కోడిన వ్యవహారం అన్నది నాకు అనుభవపూర్వకం.

    అయితే ఎవరైనా సందర్భోచితంగా ఏదన్నా పద్యాన్ని ఉదహరిస్తే, దాని గురించి ఇంకాస్త తెలుసుకోవాలనే కుతూహలం కలుగుతుంది. అందుకు స్వానుభవం నుంచి ముచ్చటగా మూడు ఉదాహరణలు :

    1.. ఉప్పల లక్ష్మణరావు రాసిన “అతడు-ఆమె” నవలలో ‘కమ్యూనిస్టు’ చెల్లి అక్కదగ్గర కెళ్ళి పెద్దన మీద ఫిర్యాదు చేస్తుంది - వరూధిని, “నిన్ను వలచి వచ్చాను,” అని ప్రవరుడితో అంటే చులకనయిపోతుందా? అని:

    “అనుటయు మాటలేక హృదయాబ్జము జల్లన మోము వెల్లనై
    కనలుచు నీరుదేరు తెలిగన్నుల నాతనిఁ బుల్కుపుల్కునం
    గనుఁగొని మాటలంబొదువుగద్గదికందలయూచి యక్కటా
    వనిత తనంతఁ దా వలచి వచ్చినెఁ జుల్కనగాదె యేరికిన్.”

    నేను మనుచరిత్ర కాస్తయినా చదవడానికి ఇదే కారణం!

    2. తానా 2005 సూవనీర్లో వెలగా వెంకటప్పయ్య వ్యాసం, “తెలుగునాట చదివే అలవాటు పెంచిన గ్రంథాలయోద్యమం,” లో మనరాష్ట్రంలో ప్రస్తుత గ్రంథాలయాల దుస్థితిని వివరిస్తూ ఈ పద్యం ఉదహరించారు. “యుద్ధం ఆపడం నీ చేతిలో ఉంది,” అని ధృతరాష్ట్రుణ్ణి కృష్ణుడు హెచ్చరించే సందర్భం:

    “సారపు ధర్మమున్ విమల సత్యము బాపముచేత బొంకుచేఁ
    భారము బొందలేక చెడఁబాఱినదైన యవస్థ దక్షు లె
    వ్వార లుపేక్ష సేసిరది వారలచే టగుఁగాని ధర్మని
    స్తారక మయ్యు సత్యశుభదాయక మయ్యును దైవముండెడున్.”

    “సమాజంలో సత్యం, ధర్మం దారుణంగా పతనమౌతూ ఉంటే, దానిని నిరోధించే శక్తి కలిగి ఉండి, ఉపేక్షచేస్తే, ఆ ఉపేక్ష ఫలితం తమ పతనానికి, సర్వ అనర్థాలకు కారణం అవుతుంది.”

    3. సైన్సూ, సాహిత్యాలలో ప్రతిభావంతుడైన మహీధర నళినీమోహన్ రాసిన “కేలెండర్ కథ” లో మన దేశంలో కాలాన్ని ఎలా విభజించారో విశదపరుస్తూ, క్రీడాభిరామంలో ఇద్దరు మిత్రులు ఓరుగల్లు వీధుల్లో తిరుగుతూ నగర విశేషాలని వర్ణించిన పద్యం ప్రస్తావన ఉంది:

    “ఉడువీథిన్ శిఖరావలంబియగు నంధ్రోర్వీశు మోసాలపై
    గడియారంబున మ్రోసె రెండెనిమిదుల్ ఘంటా ఘణత్కారముల్
    సడలెన్ భానుడు పశ్చిమంబునకు వైశ్యా! పూటకూటింటికిన్
    కడువుం బోదమె లెక్క యిచ్చి? కడు నాకొన్నార మిప్పట్టునన్.”

    అది చదివి క్రీడాభిరామం ఇంకాస్త చదవాలనే ఆసక్తి పెరిగింది.

    ఈ రీతిన అప్పుడప్పుడు అరా ముక్కా చదివితే ఎన్నేళ్ళకి ఏ కావ్యమైనా గట్టెక్కుతుంది? నిజమే, బహుశా ఇది కావ్య పఠనా మార్గం కాదు. కాని యుక్త వయసులో ఇలా పాత సాహిత్యంతో పరిచయం పెరిగితే కొన్నాళ్ళకి తమంతట తామే చదువుకోగల స్థాయికి చేరుకోవచ్చు. అందుకు తెలుగునాడి లో “రసధుని” శిర్షికా, ఈమాటలో పాత సాహిత్యంపై వచ్చే కొన్ని వ్యాసాలూ సహాయపడతాయి.

    ఇది నేను రాయడానికి కారణం మిమ్మల్ని ఖండించడానికి కాదు; నా అనుభవం మిగిలినవాళ్ళకి కొంత ఉపయోగపడుతుందేమోనని ఆశతో.

    కొడవళ్ళ హనుమంతరావు

  7. rama bharadwaj అభిప్రాయం:

    June 7, 2008 5:37 am

    కొడవళ్ళ హనుమంత రావు గారు, నేను ఇప్పుడే చదివాను మీ అభిప్రాయాన్ని. మీ అభిప్రాయం తో నాకు పూర్తి ఏకీభావం వుంది.

    అసలు ఆసక్తిఅంటు వుండాలి గాని ఎలాంటి పుస్తకాన్నైనా చదవ వచ్చు. మీకు కొన్ని కారణాల వల్ల పద్యం మీద ఇష్టం కలిగితే, మరి కొందరికి మరికొన్ని కారణలకి పద్యం గాని లేదా ఇతర కవిత్వం గాని ఆకట్టుకొవచ్చును. అందువల్ల విషయం ఏదైనా, కారణం ఏమైనా పద్యం చదవాలన్న ప్రేరణ కలగటం కదా ముఖ్యం.

    చాలామంది దృష్టికి రాని అనేక సరదా పద్యాలు వున్నాయి మన సాహిత్యంలో. అవి చదివే సందర్భం మీకు తటస్థపడాలని మనసా కోరుకుంటున్నాను.

    వుదాహరణకి:

    • “సహసా నఖంపచ” మనుచరిత్ర లో,
    • అలాగే “చలిగాలి బొండు మల్లెల పరాగము రేచి” మనుచరిత్ర లో
    • “తరగల్ పిప్పల పాత్రముల్” “పవి పుష్పంబగు” లాంటివి కనీసం ఒక 25 పద్యాలైనాదూర్జటి కాళహస్తీశ్వర శతకం నించి.
    • కందుకూరి రుద్రకవి జనార్దనాష్టకం మొత్తంగా 8 పద్యాలు
    • ఒక చిన్న పద్యం పాండురంగ మహత్మ్యం నించి తెనాలి రామకృష్ణునిది. “వెడదకన్నుల వాని, వే నామముల వాని” అన్నది
    • క్రీడాభిరామం లో “శ్రీమదసత్యమధ్యకును, చిన్నివయారికి ముద్దులాడికిన్” అనే ప్రేమ లేఖ

    ప్రస్తుతానికి వీటితో ఆపుతాను. మీకు వుద్దేశించి నేను ఇది రాస్తున్న. మీతోపాటు మంచి పద్యాలంటే సరదాపడే ఇతర సాహితీ మిత్రులు కూడ చదివి ఆస్వాదిస్తారన్న ఆశతో వీటిని పేర్కొంటున్నాను. ఇవి మీరు చదివి మీకు నచ్చితే సంతొషమే.

    సాహిత్యాకాంక్షలతో,
    rama.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a