నన్నయ హంసగీతికలు

సంస్కృత భారతములో వర్షర్తువు వర్ణన

ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నన్నయ మాత్రమే కాదు, ఎందరో కవులు తమ కావ్యాలలో, నాటకాలలో ఋతువర్ణనను చేశారు. అయితే, నన్నయగారు ఋతువర్ణనలను కథలో ఒక భాగంగా చేశారు. పాండురాజు మరణానికి ముందు వసంత ఋతువును గురించి రెండు లయగ్రాహి వృత్తాలలో వర్ణించారు. అది వసంతఋతు వర్ణనగా మాత్రమే నిలిచిపోక తరువాతి కథలో ఒక సంఘటన అయింది. అదే నన్నయగారి ప్రత్యేకత. సంస్కృత భారతములో కూడా ఋతువర్ణనలు ఉన్నాయి. ఉదాహరణకు –

పాతయన్నివ వృక్షాంస్ తాన్
సుమహాన్ వాతసంభ్రమః
మేఘసంకుల మాకాశం
విద్యున్మండలమండితం

పైన ఉదహరించిన నన్నయ పద్యాలలోలాగే ఈ శ్లోకం కూడా, ఎలా పెనుగాలి వేగానికి తట్టుకోలేక చెట్లు నేల కూలాయో, ఆకాశం ఎలా మేఘాలతో నిండియుండిందో, చుట్టూ ఎక్కడ చూచినా విద్యుల్లతలు మెరుస్తున్నాయో అనే భావాలు ఇందులో ఉన్నాయి.

నాలుగవ పద్యము –
అరుదగు తత్పయోద సమయంబున నొక్కట విస్తరిల్లె నం-
బరమున నంబుద ధ్వనియుఁ బల్వల భూముల భూరి దర్దురో-
త్కర రవముల్ మహీరుహ శిఖండములందు శిఖండి తాండవాం-
తర మద మంజుల స్వన ముదారతరంబగుచున్ వనంబునన్

మొదట భూమి ఎలా ఎండలో మాడిపోయిందని, తరువాత మేఘాలు ఎలా వ్యాపించి పెద్దగా వాన కురిసిందని, తరువాత ఎలా చీకటి అలముకొన్నదని నన్నయ వివరించారు. ఇప్పుడేమో వాన వచ్చిన తరువాత ప్రకృతిలో జరిగిన మార్పులను గురించి చెబుతారు. మెరుపులు మొదట, ఉరుములు తరువాత. కాంతివేగముకన్న ధ్వని వేగం తక్కువని నన్నయకు కూడా తెలుసు. నింగిలో ఉరుముల సడులు ప్రతిధ్వనించాయి. పల్లపు భూమి నీళ్ళతో నిండింది. నీళ్ళుంటే కప్పలకు తక్కువా? ఆ పల్లపు గుంటలు కప్పల బెకబెకలతో మ్రోగిపోతున్నాయి.

నా స్మృతిపథంలో ఈ కప్పల బెకబెకలను ఇంకా వింటూనే ఉన్నాను. ఒక కప్ప మొదట కూయడానికి ఆరంభిస్తుంది, తరువాత మరొకటి దానితో గొంతు కలుపుతుంది. పిదప మరి కొన్ని. కొంత సేపటికి అన్ని మండూకాలు ఉపనిషద్గానామృతాన్ని అందజేస్తుంది. ఒక కొన్ని నిముసాల పిదప మళ్ళీ నీరవత. తరువాత మళ్ళీ ప్రారంభమవుతుంది ఈ సంగీతపు కచేరీ! కప్పలను గురించి కాళిదాస మహాకవి కూడా ఋతుసంహారములో ఇలా చెప్పారు –

విపాండురం కీటరజస్తృణాన్వితం
భుజంగవద్ వక్రగతిప్రసర్పితం
ససాధ్వసైర్భేకకులైర్నిరీక్షితం
ప్రయాతి నిమ్నాభిముఖం నవోదకం –
– కాలిదాస, ఋతుసంహారం, 2.13

వాన నీళ్ళు నిర్మలంగా ఉన్నా, నదిని చేరే సమయానికి కీటకాలతో, బురదతో దాని రంగు మారి పారుతూ ఉంది. నదిలోని కప్పలు వాన నీటికోసం బయటికి వచ్చి నదిని చూచి కొండచిలువలా నది ప్రవహిస్తుందా లేక నదిలా కొండచిలువలా వక్రంగా నడుస్తుందా అని తికమక పడ్డాయి.

వర్షం వస్తే హర్షంతో నెమళ్ళు పురి విప్పి నాట్యం చేస్తాయనేది అందరికీ తెలిసిన విషయమే. ఇది కావ్యాలనుండి సినిమా పాటలదాకా ప్రసిద్ధమే. చెట్ల కొనలలో నెమళ్ళు నాట్యమాడుతున్నాయి, అలా నృత్యం చేసేటప్పుడు సంతోషంగా కేకలు వేశాయి. వర్షాకాలంలో వనదేవత నిమిష నిమిషానికి మార్చుకొన్న రంగులను, చేర్చుకొన్న హొంగులను తెలిపే పద్యం నన్నయది. ఈ చంపకమాలలోని సమయంబున, అంబరమున, అంబుదధ్వనియు, భూముల, భూరి, శిఖండ, శిఖండి, తాండవ లాటి శబ్దాలంకారాలు కూడ విన సొంపైనవే.

ఐదవ పద్యము –
దళిత నవీన కందళ కదంబ కదంబక కేతకీ రజో-
మిళిత సుగంధ బంధుర సమీరణుఁడన్ సఖుఁ డూచుచుండఁగా
నులియుచుఁ బువ్వు గుత్తు లను నుయ్యెల లొప్పుగ నెక్కి యూఁగె ను-
ల్లలదళినీకులంబు మృదులధ్వని గీతము విస్తరించుచున్

నాకు నచ్చిన నన్నయగారి పద్యాలలో ఇది ఒకటి. దీనిని చదువుతుంటే ఒక సంగీతపు వెల్లువ ప్రవహించేటట్లు తోస్తుంది. ఇక అర్థమో, ఇది ఎంత సహజంగా వాస్తవంగా ఉందో! నన్నయగారు ప్రకృతిని చక్కగా పరిశీలిచడం నేర్చుకొన్నారు కాబోలు. రవి గాంచనిచో కవి గాంచును గదా! వాన కురిసిన కొన్ని దినాలకు ప్రకృతి పచ్చని చీరతో సింగారించుకొంటుంది. కొత్త మొలకలు నేలను చీల్చుకొంటూ బయలుదేరుతాయి. కొత్త పూలు పరిమళిస్తాయి. సువాసన గాలిలో తేలియాడుతుంది. తరువాత కడిమిచెట్లలో పూలు గుత్తులు గుత్తులుగా విరబూసినాయి. ఇక దక్షిణ దేశస్థుడైన నన్నయకు మొగలి పూలు పరిచితమైనవే. ఆ మొగలిపూల పుప్పొడి గాలితో చేరింది. అట్టి సువాసనలతో కూడిన గాలి పూలగుత్తులనే ఉయ్యాలను ఊచుచుండినదట. ఆ ఉయ్యాలలో నల్లని ఆడు తుమ్మెదలు ఊగుతున్నాయట. అలా సంతోషంగా ఊగేటప్పుడు మృదువైన స్వరాలతో నిండిన పాటలు వినిపిస్తున్నాయట. ఇది మనకు సినిమాలో చెట్టు కొమ్మకు తాడుతో కట్టిన ఉయ్యాలలో పాడుతున్న ఒక అందమైన అమ్మాయిని కూర్చోబెట్టి ఊగించే అబ్బాయిని గుర్తుకు తెస్తుంది! అర్థపరంగా ఎంత అందమైన పద్యం. ఇందులోని అనుప్రాసలు ఎంత కర్ణానందముగా ఉన్నాయో? పాదాలలోని ళ-కారము (దళిత, కందళ, మిళిత, అళినీ), క-కారము (కందళ కదంబ కదంబక కేతకీ), ల-కారము (గుత్తులు, ఉయ్యెలలు, ఉల్లల, కులంబు, మృదుల) ఎంత అక్షర సుగంధ బంధురాలో? ఇలాటి చంపకమాలలను వ్రాయాలని ఎందరు నక్కకవులు నన్నయపులిని చూచి వాతలు పెట్టుకొన్నారో!

ఆరవ పద్యము –
సురచాపచిత్ర గగన-
స్ఫురణం బురుణించునట్లు భూవనిత నిరం-
తర చిత్రితయై యొప్పెను
సురుచిర నవతృణ శిలీంధ్ర సురగోపములన్

వాన ఆగిన తరువాత ఆకాశంలో కనబడేదేమి – ఇంధ్రధనుస్సు! ఆకాశంలో కనిపించే హరివిల్లు ఎక్కువ కాలము ఉండదు. కాని అలాటి రంగులతోనే చిత్రించబడి ఉన్నది భూమి కూడా. ఆ రంగుల చిత్రం ఇంధ్రధనుస్సులా క్షణికం కాదు, అది కొద్ది కాలం ఉంటుంది, చక్షువులను అలరింప జేస్తుంది. కొత్త కొత్త గడ్డి దినుసులు, కుక్కగొడుగులు, పూలు, ఇంకా ఎన్నో మొక్కలు – వీటి రంగులు సురచాపపు రంగులతో పోటీ పడుతున్నాయి. గగనాంగణమంతా పలు రంగుల సింగారం, ఆ రంగుల సింగారాన్ని చూచి పొంగిపోయిన భూసతి తాను కూడా అలాగే సప్తవర్ణాల వస్త్రముతో ఆచ్ఛాదితము చేసికొన్నదనే భావం జనిస్తుంది మనకు ఈ పద్యం చదివిన తరువాత.

ఏడవ పద్యము –
చివరి రెండు పద్యాలలో నన్నయగారు చూపించిన కవితాకౌశాలము అపారము, అద్వితీయము. వర్షాకాలం అంతమయింది. శరదృతువు ఆరంభమయింది. దట్టమైన నల్లని మేఘాలు మాయమయ్యాయి. ఆకాశం నిర్మలంగా మారింది.

భూసతికిం దివంబునకుఁ బొల్పెసగంగ శరత్సమాగమం
బాసకల ప్రమోదకరమై విలసిల్లె మహర్షిమండలో-
పాసిత రాజహంసగతి భాసి ప్రసన్న సరస్వతీక మ-
బ్జాసన శోభితం బగుచు నబ్జజుయానముతో సమానమై

ఈ పద్యము అతి సుందరమయినది. గొప్ప కవులకు – కాళిదాసు కానీయండి, నన్నయభట్టు కానీయండి – ఆడంబరాలు పట్టవు. సమయోచితంగా శబ్దాలంకారాలను, అర్థాలంకారాలను వాడుతారు. అంతే కానీ రసహీనంగా వాడరు. ఈ పద్యములో శరత్సమాగమము భూమికి, గగనానికి ఎలా వచ్చింది అన్నది వర్ణించబడినది. ఇందులో అలంకారము శ్లేష. పదాలు భూమికి వర్తిస్తాయి, ఆకాశానికి కూడా వర్తిస్తాయి. అదే ఇందులోని గొప్పదనం. సకలలోకానికి సంతోషదాయకంగా ఉండింది శరదృతువు రాక. భూమి మహర్షులు ఆరాధించే పరమహంసలా నిర్మలంగా ఉంది. నదులు, కాసారాలు విరబూసిన పద్మాలతో శోభాయమానంగా ఉన్నాయి. మొత్తంపైన భూదేవి స్వచ్ఛత తెల్లటి హంసతో పోల్చవచ్చును. ఇదే పద్యము ఆకాశపరంగా కూడా అర్థవంతమైనదే. అక్కడ ఉండే మహర్షి మండలం సప్తర్షిమండలం. దీనినే మనము ఆంగ్లములో big dipper లేక ursa major అంటాము. ఆ కాలంలో మరొక భావన ఉండేది. హంసలు శరత్తులో ఉత్తరంలో ఉండే మానససరోవరంనుండి మళ్ళీ దేశానికి తిరిగి వస్తాయి. బహుశా ఇది శీతాకాలానికి ముందు జరిగే పక్షుల వలస కాబోలు. ఏది ఏమైనా సప్తర్షిమండలం రాజహంసలతో ప్రకాశిస్తుంది. ప్రసన్న సరస్వతీ నక్షత్రంతో, బ్రహ్మ నక్షత్రంతో వెలుగుతూ ఉంది రాత్రి పూట ఆకాశం. ఆ నక్షత్రాల నడక హంస నడకలా ఉందట. ఇక్కడ ఇంకొక విషయం చర్చించాలి – ఈ సరస్వతీ నక్షత్రం ఏదని. తులారాశిలో స్వాతి నక్షత్రం మిక్కిలి కాంతివంతమైనది. స్వాతి అనేది శ్వేత (అంటే తెలుపు) పదమునుండి పుట్టినది. ఇదే సరస్వతీ నక్షత్రం. యా కుందేందుతుషారహారధవళాం వంటి పద్యాలలో సరస్వతి ఎప్పుడూ తెల్లని ఉడుపులను ధరిస్తుంది కదా! ఇది bootes అనే నక్షత్రమండలములో ఉంటుంది. మరి కొందరు సరస్వతీ నక్షత్రము cygnus (హంసమండలం) నక్షత్రరాశిలోని దంటారు. భారతీయ యవన ఖగోళ శాస్త్రజ్ఞుల మధ్య చాలా కాలంనుండి సంబంధాలు, సంభాషణలు, రాకపోకలు ఉండి ఉంటాయి. బ్రహ్మ నక్షత్రం అభిజిత్ నక్షత్రమని భావన. ఇది lyra (స్వరమండలం లేక వీణామండలం) రాశిలో మిక్కిలి ప్రకాశవంతమైన నక్షత్రం. భూమినుండి చూస్తే ఈ హంసమండలము, స్వరమండలము పక్కపక్కన ఉన్నట్లు తోస్తాయి. అంటే సరస్వతి, బ్రహ్మ దంపతులు సమీపంలో ఉన్నారన్న మాట. భూమిపైన, ఆకాశంలో శరదృతువును వర్ణించడానికి నన్నయ రెండు పద్యాలు వ్రాయలేదు. ఒకే పద్యంలో రెంటికీ అన్వయాన్ని కలిగించారు. అదే ఈ ఉత్తమకవి చాతుర్యం! ఇది buy one get one free లాటిది. అయితే మనకు ఏది ఉచితంగా దొరికింది – భూమియా లేక ఆకాశమా?