ఈమాట » జ్యోతిషమూ - లోపలి సంగతులూ - 1

Expand to right
Expand to left

జ్యోతిషమూ - లోపలి సంగతులూ - 1

ఏది ఏమైనా ఈ విచిత్ర వ్యక్తి అనుభవం చాలా పాఠాలు నేర్పింది. అనేక ప్రశ్నల్ని కూడా మిగిల్చింది. ఆయన కేవలమూ మోసగాడే అయితే కొన్నిసార్లు ఆశ్చర్యం కలిగించే విధంగా ఫలితాలు ఎలా చెప్పాడు? తనకు అస్సలు పరిచయం లేని వ్యక్తులకు కూడా ఆయన జాతకాలు చెప్పగా కొన్ని ఫలితాలు నిజమవ్వడం, వాళ్ళు సంతృప్తి చెందడం నేనెరుగుదును. ఏమీ విషయం లేని అటువంటి వ్యక్తి వెంట బెల్లం చుట్టూ ఈగలు చేరినట్టు మనుషులు ఎందుకు పడుతున్నారు? ఆయన ఎంతకాలం అల్లా నెట్టుకురాగలడు? ఎవరికో ఒకరికి విషయం తెలియకుండా ఉంటుందా? తెలిస్తే ఇంత కాలం వచ్చిన పేరుప్రతిష్టలు దెబ్బతినిపోవా? ఆయనకా భయం లేదా? ఇలా చేయడంలో ఆయన ఉద్దేశ్యం ఏమిటి? కేవలం డబ్బు సంపాదనేనా? మరి ఆయన ఉచితంగానే జాతకాలు చెప్తాడనికదా పేరు? అనేక సంవత్సరాలు ఈ ప్రశ్నలు వేధించినా, మెల్లమెల్లగా కలిగిన లోకజ్ఞానమూ, చక్కటి సైన్సు పుస్తకాలు చాలామటుకు సమాధానాల్ని ఇచ్చాయి. అవి ముందు ముందు వివరిస్తాను.

జ్యోతిషం పునాదులు

విచిత్రవ్యక్తి అనుభవాన్ని గురించి విన్నవాళ్ళు జ్యోతిష్కులంతా మోసగాళ్ళు అనే అభిప్రాయానికి రావడం తేలిక. కానీ అందరూ మోసగాళ్ళే అనడం అంత సులభమైన విషయం కాదు. జ్యోతిషంలో ఏ పట్టూ లేకపోతే ఇంతకాలం బహుళ ప్రాచుర్యంలో నిలబడ గలగడం, అనేకమంది అధ్యయనం చేసి జ్యోతిష్కులుగా సఫలమవ్వడం సాధ్యంకాదు. మరి నిజంగానే జ్యోతిషంలో ఖచ్చితంగా భవిష్యత్తు చెప్పగల ’సత్తా’ ఉందా? ఒక సైన్సుగా అది పరిశీలనకి నిలబడగలదా? ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలంటే మొదట జ్యోతిషం అసలు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి.

గ్రహాలూ - రాశిచక్రం - నక్షత్రాలు - భావాలు

జ్యోతిశ్శాస్త్రంలో ప్రాథమికమైన అవగాహన ఏమిటంటే గ్రహగతులు మానవజీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఇందులో సూర్యుడు, చంద్రుడు కూడా గ్రహాలుగానే పరిగణించబడతాయి. భూమిని కేంద్రంగా, దాని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్టుగా ఊహించుకుని భూమికి సాపేక్షంగా ఆయా గ్రహాల స్థితినీ గమనాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. అదేమిటి, ఈరోజుల్లో చిన్నపిల్లలికి కూడా భూమి కేంద్రం కాదనీ, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోందనీ తెలుసుగా అంటారేమో? జ్యోతిషం గురించి అస్సలు తెలియనివాళ్ళే జ్యోతిషం తప్పు అనడానికి ఈ విషయాన్ని లేవనెత్తుతారు.

జ్యోతిషం భూమిచుట్టూ సూర్యుడూ, గ్రహాలూ తిరుగుతున్నాయి అని చెప్పదు. భూమి మీద నుంచి చూస్తే గ్రహాలు ఎక్కెడెక్కడున్నాయో నాకు కావాలి అంటుంది. మరి భూమినుంచి చూసినప్పుడు గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో గణించాలంటే భూమిచుట్టూ సూర్యుడూ, గ్రహాలూ తిరుగుతున్నట్టుగానే ఊహించుకోవాలి. అంతేతప్ప నిజంగా గ్రహాలు భూమిచుట్టూ తిరుగుతున్నాయా లేక సూర్యుడిచుట్టూ తిరుగుతున్నాయా అనేది జ్యోతిషానికి అనవసరం. అయితే ఇక్కడో చిక్కుంది. గ్రహగతులు కట్టడానికి ఖగోళసూత్రాలు ఉపయోగిస్తారు. ఖగోళశాస్త్రం సూర్యుడే కేంద్రమని చెప్తుంది. పాతకాలంలోలాగా భూమికేంద్రంగా చేసుకుని ఖగోళసూత్రాలు నిర్మించుకుంటే లెక్కలు తప్పుతాయి. అందుచేత ఆధునిక జ్యోతిషం నిర్మొహమాటంగా ఆధునిక ఖగోళశాస్త్రం ప్రకారం లెక్కగట్టిన గ్రహస్థితుల మీదే ఆధారపడుతుంది. వీటినే భూకేంద్రంగాగల గ్రహ స్థితులు (జియోసెంట్రిక్ ప్లానెటరీ పొసిషన్స్ ) అంటారు.

ఇక సూర్యుడు, చంద్రుడు, రాహు, కేతువులు గ్రహాలు కావు కదా అని మరొక విమర్శ. గ్రాహయతీతి గ్రహ: - అంటే ప్రభావం చూపేది గ్రహము అని. జ్యోతిషంప్రకారం సూర్య చంద్రాదులకు మనమీద ప్రభావం ఉన్నది కాబట్టి వాటినికూడా జ్యోతిషం గ్రహాలుగానే వ్యవహరిస్తుంది. ఇక రాశి చక్రమంటే ఏమిటో చూద్దాం.

భూమధ్యరేఖను ఆకాశం మీదకి పొడిగించండి. గ్రహాలన్నీ ఈ రేఖకి కొంచం అటూ ఇటూలో తిరుగుతూ కనిపిస్తాయి. ఆ కొంచం ఒక ౮ డిగ్రీలు పైకీ ఒక ౮ కిందకీ ఉంటుంది. ఈ పదహారు డిగ్రీలు కలిపి ఈ రేఖని ఒక పటకా (బెల్టు) లాగా ఊహించుకోవాలి. అది సూర్య చంద్రాదులతో సహా, ఆకాశంలో గ్రహాలన్నీ తిరిగే మార్గం (బాట లాంటిది). అదే రాశి చక్రం.

ఈ రాశిచక్రాన్ని పన్నెండు భాగాలు చేసి వాటిని రాశులు అని పిలిచారు. మేషము, వృషభము మొదలైనవి. సూర్యుడు ఒక్కొక్క రాశిలోనూ ఒక నెల రోజులు ఉంటాడు. ఇదే రాశి చక్రాన్ని ౨౭ భాగాలు చేసి ఆ భాగాల్ని నక్షత్రాలు అన్నారు.

ఇక భావాలు అంటే ఏమిటో వివరిస్తాను. ఈ రాశిచక్రమూ, సూర్య చంద్రులూ, ఇతరగ్రహాలూ రోజూ ఉదయిస్తూ ఉంటాయి, అస్తమిస్తూ ఉంటాయి. ప్రతీ క్షణమూ రాశిచక్రంలో ఏదో ఒక బిందువు తూర్పున ఉదయిస్తూనే ఉంటుంది. అదే క్షణంలో పడమటి దిక్కున సరిగ్గా దానికి ఎదురుగా (౧౮౦ డిగ్రీలు ఎదురుగా) ఉండే బిందువు అస్తమిస్తూ ఉంటుంది. అదే క్షణంలో నడినెత్తిన మరొక బిందువు ఉంటుంది. అలాగే దానికి ఎదురుగా మన కాళ్ళకింద పాతాళంలో (భూమికి అడుగున) మరొక బిందువు ఉంటుంది. ఈ బిందువులు జ్యోతిషంలో చాలా ముఖ్యమైనవి.

ఇప్పుడు తూర్పున ఉదయించే బిందువుకీ నడినెత్తిన ఉన్న బిందువుకీ మధ్య ఉన్న ఆకాశపు భాగాన్ని మూడు సమాన భాగాలు చెయ్యండి. అలాగే మిగతా మూడు బిందువులకీ మధ్యనున్న భాగాల్ని మూడేసి సమాన భాగాలు చేస్తే మొత్తం పన్నెండు భాగాలు అవుతాయి. వీటినే భావములు లేక ఇళ్ళు అంటారు.

తూర్పున ఉదయించే బిందువు ఉన్న భాగాన్ని లగ్నము అంటారు. అక్కడినుంచి పడమటివైపుకి వరసగా వెనక్కి లెక్క పెట్టుకుంటూ పోవాలి. లగ్నం పైన పన్నెండో ఇల్లు (లేక భావము), ఆపైన పదకొండు, ఆపైన నడినెత్తి మీదకి వచ్చేస్తాము. నడినెత్తిమీద ఉన్న భావాన్ని దశమము (లేక పదో ఇల్లు) అంటారు. అక్కడినుంచి పడమటికి దిగుతుంటే తొమ్మిది, ఎనిమిది ఇళ్ళు వచ్చేస్తాయి. సరిగ్గా పడమటన అస్తమిస్తున్న బిందువు కలిగిన ఇల్లు ఏడవ ఇల్లు (లేక సప్తమ భావం). ఇంకా కిందకి దిగిపోతే ఆరో ఇల్లు, ఐదో ఇల్లు, నాలుగో ఇల్లు వస్తాయి. నాలుగో ఇల్లు అట్టడుగు స్థానం. దానితరవాత మూడు, రెండు వచ్చి మళ్ళా తూర్పున లగ్నం (లేక ఒకటోఇల్లు) లోకి వచ్చేస్తాము.

ఇవండీ మొత్తం జ్యోతిషానికి కావలసిన ముడిసరుకు.

ఇంకా ఉంది. పేజీలు: 1 2 3 4