ఈమాట » “మనసున మనసై” నవల: మధ్యతరగతి ఉద్యోగిని మానసిక సంఘర్షణ

Expand to right
Expand to left

“మనసున మనసై” నవల: మధ్యతరగతి ఉద్యోగిని మానసిక సంఘర్షణ

1.5 నవలలో రచనాశైలి

రచయిత్రి శైలి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే బాగుండునేమో! “లొంగదీసుకోవడం”, “కొంగుని కట్టేసుకోవాలనుకోవడం” వంటి పదాలను ఎక్కువగా ప్రయోగించారు. తెలుగు పలుకుబడి, జాతీయాల ప్రయోగాలతో సహజత్వం కోసం అలాంటి శైలి పాటించినా, సమయం, సందర్భం కూడా ముఖ్యం కదా!

ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అందులోనూ, కొన్ని సాంస్కృతిక విషయాలను పదేపదే ప్రస్తావించడం, తెలుగువాళ్ళు పొడవుగా ఉండరు. ఎర్రగా ఉండరు, అందంగా ఉండరు. ఇలాంటి ప్రకకటనలు రచయిత్రి అవగాహనను ఆనుమానించే విధంగా ఉంటాయి. ఇవి ‘జయంతి’ మనస్తత్వంగా చెప్పినా బాగుండేది. ఆలోచనల వల్ల రచనాశైలిలో రచయిత్రి ఆత్మాశ్రయత్వ గుణం తొంగి చూస్తుంది. సౌందర్య దృష్టితో చూసినపుడు సౌందర్యమనేది వస్తువులో ఉంటుందా? వస్తువుని చూసే వారిలో ఉంటుందా? అనేది పెద్ద చర్చనీయాంశం.

సౌందర్యం ఉభయగతమైనా వస్తువుని బట్టి కూడా ప్రధానంగానే ఉండవచ్చు. పైగా ‘సౌందర్యాన్ని’ నిర్వచించడంలో కులం, ప్రాంతం, భోగోళిక పరిస్థితులను కూడాపరిగణనలోకి తీసుకోవలసి వస్తుంది. అప్పుడే ఒక్కో అంశానికి ఒక్కోరకమైన సౌందర్య భావన వ్యక్తమవుతుంది. తమ సంస్కృతి మాత్రమే గొప్పదని భావించే “సాంస్కృతిక స్వవర్గవాదం” గురించీ, అన్ని సంస్కృతులూ ఆయా పరిస్థితులను బట్టి గొప్పవని భావిస్తూ, గౌరవించే “సాంస్కృతిక సాపేక్ష వాదాన్ని” కూడా ఈ నవలలో అధ్యయనం చేసే అవకాశం ఉంది. ఒక కులానికే కట్టిపడేసి పరిశీలించే పరిమితినికూడా రచయిత్ర నవలకు కల్పించారు. ‘బ్రహ్మణ కులా’నికి చెందిన అని సూచించడం వల్ల రచయిత్రి బ్రాహ్మణ మధ్యతరగతి కులానికి (వర్గానికి) చెందిన వారి జీవితాల్లో, అదీ చదువుకొన్న, మళ్ళీ భార్య భర్తలిద్దరూ చదువుకొని ఉద్యోగం చేసే వారికే పరిమితం చేస్తున్నారేమో అనే అనుమానానికి కూడా అవకాశం కల్పించేటట్లు నవలా రచన సాగింది. దీని వల్ల ‘వస్తువు’ ని ‘ఇతివృత్తం’ గా మార్చడంలో కొంత నైపుణ్యాన్ని సాధించలేని లోపం కనిపిస్తుంది. కొన్ని పరిమితులకు లోబడినా, చదువుకొన్న మధ్యతరగతి ఉద్యోగిని జీవిత సంఘర్షణను సమర్థవంతంగానే నవలలో ప్రతిఫలించగలిగారు.

ఇంకా ఉంది. పేజీలు: 1 2 3 4 5 6 7