నామాట: తెలుగు అంతర్జాతీయ భాషగా…! (నిజంగానా?)
మొన్న మొన్నటి దాకా, మన పక్కింటి వాడి ధర్మవా అని, తెలుగుని ప్రాచీన భాషగా గుర్తించాలని నానా రకాలవాళ్ళూ, నానా రకాల వాదాలు, వివాదాలు, నినాదాలూ అల్లేశారు, వల్లించేశారు. అదికొంత సద్దుమణిగిందనుకుంటే, దానికి తోడుగా ఇప్పుడొక సరికొత్త నినాదం తెలుగునాట తయారయ్యింది.
- తెలుగు భాష అంతర్జాతీయ భాషగా గుర్తించాలి – అని. మన పక్కింటి వాడిమీద అనుమానం పుట్టిందో ఏమో తెలియదు. కారణం ఏదయితేనేం, ఈ నినాదం ఇప్పుడు వామపక్ష రాజకీయులకి, అరాజకీయుల (?)కీ కూడా ముఖ్య ఆయుధం అయ్యింది. ఇంతకుముందు ప్రాచీన భాషకోసం చేసిన సందడిలో వామపక్షీయులు మరీ యెడంగా ఉండబట్టి, చదువుకున్న వాళ్ళు ( అంటే intellectualsఅని నా భావం!) వాళ్ళని మరిచిపోయారనే బాధ కాబోలు!
అసలు, అంతర్జాతీయ భాష అంటే అర్థం ఏమిటి? దాని స్వరూపనిరూపణకి గుర్తు(లు) ఏమిటి? ఇది చాలా జటిలమైన ప్రశ్న.
అంతర్జాతీయ భాషగా గుర్తించాలన్న నినాదం, ఏ విధమైన ప్రమాదంలేని నినాదంగా మనం గుర్తించాలి. ఈ నినాదం, జనానికి ఎందుకూ పనికిరాని నినాదం! కొద్దిమంది రాజకీయప్రముఖులకి మాత్రం, ఈ నినాదం, ఆర్భాటంగా దిన పత్రికల్లో గ్రూపు ఫొటో వేయించుకోడానికి పనికి వస్తుంది.
ఐక్య రాజ్య సమితి వాళ్ళు అధికారయుతంగా గుర్తించిన భాష అంతర్జాతీయ భాష అనా? అదే అయితే, మన జాతీయభాష హిందీ కే దిక్కులేదు! అయినా, ఐక్య రాజ్య సమితిలో ఎవడి ఇష్టమైన భాషలో వాడు మాట్లాడచ్చు. ఎంతసేపు కావాలంటే అంతసేపు రొద పెట్టచ్చు. మిగిలేది కేవలం రణగొణ ధ్వనే తప్ప, అక్కడ ఎవడన్నా ఏదన్నా వింటేనా? ఒప్పుకుంటేనా?
అదికాకపోతే, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఫలానా ఈ భాషలో మాట్లాడితే అందరికీ కాకపోయినా చాలామందికి అర్థం అవుతుందనా? అదే అయితే, ఇంగ్లీషుకే దిక్కులేదు! యూరపులోను, రష్యాలోను, చైనా లోనూ, (ఉత్తర భారతంలోనూ కూడా!) ఇంగ్లీషు హుళక్కే! అందాకా ఎందుకు; - అమెరికా దేశంలోనే, కొన్ని రాష్ట్రాల్లో ఇంగ్లీషు చలామణి కావడం లేదు, స్పానిష్ చలామణీ అయినంత, సులువుగా, జోరుగా!
అంతర్జాతీయ భాషగా గుర్తించాలన్న నినాదం, ఏ విధమైన ప్రమాదంలేని నినాదంగా మనం గుర్తించాలి. ఈ నినాదం, జనానికి ఎందుకూ పనికిరాని నినాదం! అయితే, ఒక్క విషయం ఒప్పుకో తీరాలి. కొద్దిమంది రాజకీయప్రముఖులకి మాత్రం, ఈ నినాదం, ఆర్భాటంగా దిన పత్రికల్లో గ్రూపు ఫొటో వేయించుకోడానికి పనికి వస్తుంది.
అసలు విషయానికి వద్దాం. ఈ నినాదం నిజంగా తెలుగు భాషమీద మమకారంతో పుట్టిందని అనడం కేవలం భ్రమే! పైగా, ఇందులో చెయ్యి కలిపిన రాజకీయనాయకులకి కేవలం నిస్స్వార్ధ భాషాసేవా వాంఛ, ఈ నినాదానికి హేతువు అని ఎవరన్నా పొరపాటునైనా అనుకుంటే, వాళ్ళు తప్పకుండా తక్షణం మానసిక శాస్త్ర వైద్యుణ్ణి చూడటం అవసరం.
పాఠశాలల్లో తెలుగు బోధన, తెలుగుభాష మాధ్యమంగా బోధనా ఎంతదిగజారిపోయాయో వేరే చెప్పనక్కర లేదు. అసలు, తెలుగు medium బళ్ళకి వెళ్ళే వాళ్ళు ఎవరు? ముఖ్యంగా నిరుపేదలు. పోతే, చిన్న చిన్న పల్లెటూళ్ళల్లో ఇంగ్లీషులో బోధించే ప్రైవేటు పాఠశాలలు అరుదవడం మరోకారణం. కాస్తో కూస్తో డబ్బులున్నవాళ్ళు, వాళ్ళ పిల్లలని పట్టణంలో ఇంగ్లీషు బడికే పంపిస్తున్నారు. ఇదేమీ తప్పు అనటల్లేదు. ఇంగ్లీషు బడిలో చదువుకుంటే, అమెరికా వెళ్ళక పోయినా భారతంలోనే, ఎక్కడో అక్కడ, ఏదో ఒక call centerలో తేలిగ్గా ఉద్యోగం వస్తుందికదా! 2030 వ సంవత్సరం వరకూ ఈ ఉద్యోగాలకి ఢోకా లేదని కొందరి ప్రముఖుల అంచనా. ఇది వదంతే కావచ్చు! కానీ, తెలుగు బడిలోనే చదువుకుంటే, చప్రాసీ ఉద్యోగంకూడా రాదుకదా! ఇది ప్రస్తుత కాలంలో పచ్చి ఆర్థిక సత్యం అని వేరే చెప్పనక్కరలేదు.
అందుకనే కాబోలు, ఈ మధ్య లాభాపేక్షలేని కొన్ని స్వచ్ఛంద (?) సంస్థలు, ప్రభుత్వంతో లాయికీ అయి, ఇంగ్లీష్ medium బడులు, దిగువ మధ్య తరగతి వారికి, పేదలకోసం (నిరుపేదలు కాదని గమనించాలి!) ప్రారంభిస్తున్నారు. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. ఈ బడులలో, తెలుగు భాష optional గా తీసుకోవచ్చుట! ఈ బడుల ఉద్యమానికి, ప్రభుతలో ఉన్న రాజకీయ నాయకులు, విద్యాశాఖలో పెద్ద పెద్ద ఆఫీసర్లూ సుముఖులేనట! అయితే, పైకి అలాగని చెప్పరు; ఒప్పుకోరు! చూసీ చూడనట్టుంటారట. కూర్మపృష్టాన్ని కర్రతో బాదుతున్న మూర్ఖుడు, చెడగఱపు బోడ కథ తెలియదూ? ఇంతకన్నా వివరంగా చెప్పక్కరలేదనుకుంటా.
మనకి, రాజకీయ స్వాతంత్ర్యం రాకముందునుంచి ఒక elite class వుండేది. స్వరాజ్యం వచ్చిన తరువాత మన ప్రభుత్వం వారి సంకర విద్యావిధానం మూలంగా మరొక (NewClass ) తయారయ్యింది. ; — ఈ కొత్త ఇంగ్లీషు బడులతో సరికొత్త Newer Class తయారవబోతున్నది. అలాగని నేను ఒక సంస్థ అధికారితో ఒక చిన్న సభలో అంటే, ఆయన: So what? You have anything better? అన్నారు. Amen! అన్నారు సభికులందరూ, కరతాళధ్వనుల మధ్య!!
మళ్ళి మొదటికొద్దాం. అయితే, తెలుగు అధికార భాషగా, బోధనా భాషగా, –ప్రాచీన భాషగా, అంతర్జాతీయ భాషగా, Universal భాషగా (హా! హా!) — గందరగోళం చేస్తున్న రాజకీయనాయకుల గురించి ఏమంటారు? Fabulous Façade అని అందామా?
Ambanath అభిప్రాయం:
July 3, 2007 5:47 am
నవ్వులు నవ్వే ముందు మీరు ఈ విషయాలు అర్థం చేసుకోండి.
1. హిందీ మన జాతీయ భాష కాదు. మనం తెలుగుజాతి. మన జాతీయభాష తెలుగు మాత్రమే. ఒకడి మాతృభాష ఇంకొకడికి జాతీయ భాష కాజాలదు. హిందీ మన నెత్తిన రుద్దబడిన పరాయి భాష.
2. భాషలకి లేబుల్స్ (ప్రాంతీయభాష, జాతీయభాష, అంతర్జాతీయభాష, అధికారభాష, మైనారిటీ భాష వగైరా) వెయ్యడం వాటి యాదృచ్ఛిక ఎదుగుదలని అడ్డుకోవడం కాదా ? మానవజాతిని అగ్రకులాలు నిమ్నకులాలు అని విభజించి కొందరిని తొక్కించడం, కొందరిని ఎక్కించడం- దీనికి ఈ లేబుల్స్ కీ తేడా ఏమిటి ?
3. ప్రాథమికంగా ఇంగ్లీషుతో సహా (ఏదో ఒక అర్థంలో) ప్రతి భాషా ప్రాంతీయ భాషే అయినప్పుడు-తెలుగు అంతర్జాతీయ భాష అయితే/అంటే తప్పేమిటి ?
4. అంతర్జాతీయ భాష హోదా లాంటివి ఎవడి పడగ్గదిలో వాడు పడుకుంటే వచ్చేవి కావు. దానికి ప్రయత్నం కావాలి. కృషి కావాలి. ఏ ప్రయత్నమూ లేకుండా సింగపూర్లో తమిళానికి అధికార హోదా సిద్ధించలేదు. కాస్త ఆలస్యంగా నైనా తెలుగువాళ్ళు ఆ ప్రయత్నం చేస్తే మీకేంటి బాధ ?
5. తెలుగుకు ప్రస్తుతం ఆంధ్రదేశంలో పట్టిన దుర్గతి అది అంతర్జాతీయ భాష కావడానికి అవరోధం కాదు. బ్రాంచీలు లేని వ్యాపారాలు ఈ రోజుల్లో శోభించవు. అలాగే బ్రాంచీలు లేని భాషలు కూడా వృద్ధి చెందవు. అందుకని మన ఆంధ్రదేశం కాక మరో రెండు మూడు దేశాల్లో మన భాషకి అధికార హోదా సంపాదించి పెట్టడానికి మనం కృషిచెయ్యాలి. ఇదో చారిత్రిక అవసరం.
ఈ డిమాండు రాకముందే నా మనసులో ఈ అభిప్రాయం గత కొన్ని దశాబ్దాలుగా ఉంది.
Vamsi Krishna అభిప్రాయం:
July 8, 2007 7:59 am
యే భాష అయినా అంతజర్జాతీయమో, విశ్వాంతరాళ భాషో అవ్వాలంటే ఎవరో ఒక జీ.ఓ. తేవడమో ఇంకేదో కాదు జరగాల్సింది. భాష వాడుక పెరిగితే పేర్లు లేకున్నా వచ్చే నష్టం లేదు. చలామణిలో లేనప్పుడు ఎన్ని పేర్లున్నా శుధ్ధ దండుగే. అన్ని భాషలలో మంచిని కలిపి అదేదో భాష (పేరు గూడా గుర్తుకు రావట్లేదు వెంటనే) అంతర్జాతీయ భాష తయారు చేశారు. ఏమిటీ ఉపయోగం?
యే భాష అయినా ఎంత ప్రాచీనమైనదో ఏదో ప్రభుత్వం చేత డప్పా కొట్టించుకున్న మాత్రాన ఉపయోగం లేదు. ఇంకా ఎన్ని శతాబ్దాలవరకు నిలిచి ఉండేలా మన భాషను ఎలా పటిష్ట పరచగలమో ఆ పని చేయాలి. అది తక్షణ కర్తవ్యం. అంతర్జాతీయంగా వాడగలిగేలా మన భాషా సంపదను, పదజాలాన్ని పెంపొందిస్తే ఆ ప్రక్రియ మన భాషలో సులువు చేయగలిగితే, దానికి మనమందరమూ ప్రచారం చేస్తే అప్పుడు అంతర్జాతీయమేం ఖర్మ - ఏలియన్సు కూడా మన భాష నేర్చుకోవడానికి ప్రవేశ పరీక్షలు వ్రాసి మరీ వస్తారు ఆంధ్ర దేశానికి.
భాషాభిమానులుగా మన పని మనం చేయకుండా కొంతమంది; మన ఇంట్లోనే మన భాష మాట్లాడ్డం నామర్దా అయిన చాలామంది ఉండటమే మన భాష దుర్గతికి అసలు కారణాం. అసలు పని చేయకుండా గుర్తింపు కోసం వెంపర్లాడితే్ “ఉట్టికెక్కలేనమ్మ స్వర్గనికెగిరింద’న్న సామెత గుర్తుకువస్తుంది. మన పని చేస్తూ పోతుంటే (ఎక్కువ చలామణిలోకి వచ్చేలా ప్రయత్నం చేస్తే) గుర్తింపులు వాటంతట అవే వస్తాయి.
Sai Brahmaanandam Gorti అభిప్రాయం:
July 11, 2007 10:39 am
” అంతర్జాతీయ భాషగా గుర్తించాలన్న నినాదం, ఏ విధమైన ప్రమాదంలేని నినాదంగా మనం గుర్తించాలి. ఈ నినాదం, జనానికి ఎందుకూ పనికిరాని నినాదం! కొద్దిమంది రాజకీయప్రముఖులకి మాత్రం, ఈ నినాదం, ఆర్భాటంగా దిన పత్రికల్లో గ్రూపు ఫొటో వేయించుకోడానికి పనికి వస్తుంది.భాషగా గుర్తించాలన్న నినాదం, ఏ విధమైన ప్రమాదంలేని నినాదంగా మనం గుర్తించాలి. ఈ నినాదం, జనానికి ఎందుకూ పనికిరాని నినాదం! ” ఈ వాక్యం అక్షరాలా సత్యం. కనీసం ప్రాచీన భాషా ప్రపత్తే మనం సాధించుకోలేక పోయాం. నినాదాలు, ఊరేగింపులు, తీర్మానాలతో ఏ భాషకీ హోదా వస్తుందనుకోవడం నిజంగా వెర్రితనం తప్ప ఏమీ లేదు. పదిమందీ మాట్లేడే భాషని బట్టే దానికొక హోదా వస్తుంది. పాఠశాలల్లో తెలుగు భాషని చంపేసి, భావి తరాల వారికి తెలుగు రాయడం, చదవడం తెలీయనీయకుండా జాగ్రత్త పడుతూ, అంతర్జాతీయ భాష, ప్రాచీన భాష, అధికార భాష అంటూ టాగ్ తగిలించుకుంటే ఎవరికి ప్రయోజనం? సింగపూరులో తమిళ భాష అధికార భాష కావడానికి కారణం రాజకీయ అవసరమే అన్నది అందరికీ తెలిసిన విషయమే! మన రాజకీయ నాయకులకి భాష వల్ల రాజకీయ ప్రయోజనం ఉందని భావిస్తే తెలుగు భాషకి కావల్సిన టాగ్ హోదా రావడం క్షణం లో పని. కేవలం సభలకీ తీర్మానాలకే పరిమితం చేసి, తీరా విద్యాలయాల్లో తెలుగు భాష తప్పని సరి అని ప్రకటించే సమయం వచ్చే సరికి “శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు” తీరున మన నాయకుల ప్రవర్తన ఉంది.
ఆవేశం పడి చేసే తీర్మానల వల్ల వేలూరి గారన్నట్లు దండలకీ, ఫొటోలకీ, వార్తా పత్రికల్లో అచ్చుకీ ఉపయోగిస్తాయే తప్ప ఎందుకూ పనికి రావు.
నిజంగా అన్ని రాజకీయ పక్షాలు తల్చుకుంటే, తెలుగు ప్రతీ స్కూలులో నూ తప్పని సరి ( కనీసం పదవ తరగతి వరకూ ) అన్న జీ వో రావడం అంత కష్ట మైన విషయం కాదు. ఇందులో ప్రజలకీ, నాయకులకీ ఉన్న లోపం “చిత్తశుద్ధి” మాత్రమే ! వేలూరి గారి అభిప్రాయాలు అక్షర సత్యాలు. నిజం ఎప్పుడూ నిష్టూరం గానే కనిపిస్తుంది.
- సాయి బ్రహ్మానందం గొర్తి
నాగరాజా అభిప్రాయం:
July 13, 2007 9:16 pm
ఇంగ్లీషు పెరుగుతుంది, తెలుగు తరుగుతుంది అనే భావన పాత చింతకాయ పచ్చడి. దాన్నే మీరు సాగదీసారు, కొత్తదనమేముంది? (ట్రాయ్, మిచిగాన్) మా ఊరికి రండి ఎక్కడపడితే అక్కడ మీకు తెలుగు వినపడుతుంది, ఉగాదికి తెలుగులో పత్రికలు ప్రింటు చేసి అందరికి పంచుతారు!
మనం చేసే ప్రతి చర్య, పలికే ప్రతి వాక్యం ఎంతో బాధ్యతాయుతంగా ఉండాలి, అప్పుడు నిజంగానే అంతర్జాతీయ భాష అవుతుంది. ఎంతో కాలంగా నానా రకాల దెబ్బలకు తట్టుకొని ఇప్పుడిప్పుడే పైకొస్తున్న భాషను గురించి మనం జాగ్రత్తగా, గౌరవంగా మాట్లాడాలి. రాజకీయ నాయకులు ఏమైనా అనవచ్చు…
ఇంగ్లీషు నేర్పుతూనే, తెలుగులో కూడా సమానంగా శ్రద్ధ పెట్టాలి అని మీరు చెప్పి అందరిని మెప్పిస్తే ఎంత బాగుండేది?
Rohiniprasad అభిప్రాయం:
July 14, 2007 8:35 am
ప్రస్తుతం ఇంగ్లీషులో వెలువడుతున్న సమాచారాన్ని (వార్తలు, సైన్సు వగైరా) ఎంత త్వరగా, ఎంత చక్కగా తెలుగులో రాసి పాఠకులకు అందించగలిగితే తెలుగు భాష పటిమా, ప్రాముఖ్యతా అంతగా పెరిగే అవకాశం ఉంటుంది. అది కేవలం తర్జుమా అయినా సరే. పదేళ్ళ కిందట బొంబాయిలో National Centre for Science Communicators మొదలుపెట్టినప్పుడు ఈ విషయంలో కేరళ అందరికన్నా ముందున్నదని తెలిసింది.
ప్రస్తుతగా అమెరికా తదితర దేశాల్లో తెలుగువాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది కనక తెలుగులో రాసేవారు కూడా తగిన ప్రయత్నాలు చెయ్యాలి. ఈ విషయంలో కథల కన్నా వివిధ అంశాలను గురించిన వ్యాసాలూ, వార్తాకథనాలూ తెలుగు యొక్క పరిధిని ఎక్కువగా విస్తృతం చెయ్యగలవు. తగిన పరిణామాలు కలుగుతూ ఉన్నట్టయితే తెలుగు జాతీయంగానో, అంతర్జాతీయంగానో కొనసాగగలుగుతుంది.
ఇది కాక ఇంట్లో పిల్లల చేత తెలుగులో మాట్లాడించడం మొదలైన ప్రయత్నాలన్నీ వ్యక్తిగతస్థాయిలో జరగాలి. తెలుగును టీనేజర్లకు సులభపరిచయం చెయ్యడానికి lec dems, power point presentations మొదలైనవి స్థానికంగా ఏర్పాటు చేసుకోవచ్చు.
Sai Brahmaanandam Gorti అభిప్రాయం:
July 16, 2007 8:40 am
ట్రాయ్ మిచిగన్ లో అందరూ ( తెలుగు వాళ్ళే సుమా ! ) తెలుగు మాట్లాడడం సంతోషకరమైన విషయమే! కానీ - ఒక్కసారి ఆంధ్రా వెళ్ళి చూస్తే పరిస్థితి భిన్నం గా ఉంది. నేటి తరం విద్యార్థులకు తెలుగు చదవడం రాయడం అనేది పోతోంది అనేదే అందరి బాధా ! ఈ తరం వాళ్ళ సంగతి సరే ! ముందు తరాల సంగతి ఏమిటి? తెలుగు కేవలం కొద్ది మందికే పరిమితమైపోతోందన్న బాధ ఈ వ్యాసం. ఎనిమిది కోట్ల ఆంధ్రుల భాష విద్యా విధానంలో తొలగించి నినానాదాల కీ , వేదికలకే భాష గొప్పతనం మిగులుతోందన్న బాధే ఈ వ్యాస ఉద్దేశ్యం లా నాకనిపించింది.
- సాయి బ్రహ్మానందం గొర్తి
జె. యు. బి. వి. ప్రసాద్ అభిప్రాయం:
July 17, 2007 10:31 am
వేలూరిగారూ,
మీ సంపాదకీయం చదివాను. నాకు నచ్చింది. అందులో మీరు తెలుగుని ప్రాచీన భాషగా గుర్తించాలన్న వివాదాన్నీ, తెలుగుని అంతర్జాతీయ భాషగా గుర్తించాలన్న వివాదాన్నీ వ్యతిరేకించారు. అంతర్జాతీయ భాష గురించి కొన్ని చక్కటి ప్రశ్నలు వేశారు. భాషా దురభిమానాన్ని వ్యతిరేకించారు. ఇదంతా వుత్త రాజకీయం అని కూడా తేల్చారు. అంతా బాగుంది. అయితే నాకో ప్రశ్న. మనం మన ఈమాట ముందు పేజీలో, “ఇంటర్నెట్టులో తెలుగుకు మొదటి తరగతి పౌరసత్వం కావాలంటే యూనీకోడ్ వాడకం తప్పనిసరి అని మా నమ్మకం” అని రాసుకున్నాం కదా? యూనీకోడ్ని నేను కూడా ఇష్టపడతాను లెండి. కానీ ఈ “మొదటి తరగతి పౌరసత్వం” ఏమిటీ? కొన్ని భాషలకి “రెండవ తరగతి పౌరసత్వం”, ఇంకొన్ని భాషలకి “మూడవ తరగతి పౌరసత్వం” వున్నాయా? మొదటి తరవతి గొప్పదనుకుంటే, మూడవ తరగతి అధమం అనేగా అర్థం? భాషకి సంబంధించి ఈ పౌరసత్వ తరగతుల మీద వ్యతిరేకత మనకు లేదా? ఈ ఇంటర్నెట్టు తరగతి పౌరసత్వానికీ, అంతర్జాతీయ భాషకీ ఏదో రక్త సంబంధం కనబడుతోంది. తప్పంటారా?
మీరు మీ సంపాదకీయంలో, “మొన్న మొన్నటి దాకా, మన పక్కింటి వాడి ధర్మవా అని, తెలుగుని ప్రాచీన భాషగా గుర్తించాలని నానా రకాల వాదాలు, వివాదాలు, నినాదాలు అల్లేశారు, వల్లించేశారు. అది కొంత సద్దుమణిగిందనుకుంటే, దానికి తోడుగా ఇప్పుడొక సరి కొత్త నినాదం తెలుగునాట తయారయ్యింది.” అని స్పష్టంగా తెలుగుని ప్రాచేన భాషగా గుర్తించాలన్న వివాదాన్నీ, తెలుగుని అంతర్జాతీయ భాషగా గుర్తించాలన్న వివాదాన్నీ వ్యతిరేకించారు. కొంత మందికి ఇది అర్థం కాక, మీ సంపాదకీయాన్ని మెచ్చుకుంటూ, సమర్థిస్తూ, “కనీసం ప్రాచీన భాషా ప్రపత్తే మనం సాధించుకోలేక పోయాం” అని వాపోయారు. మీ సంపాదకీయం ప్రకారం ఈ వివాదాలన్నీ వుత్త రాజకీయాలు మాత్రమే అయినప్పుడు, ఇలా వాపోవడంలో అర్థమే లేదు. తెలుగుకి “ప్రాచీన భాషా ప్రపత్తి” ఎందుకు సాధించుకోవాలి? ఆ ప్రపత్తి వల్ల బోలెడు డబ్బు శాంక్షను అవుతుంది. అందుకోసమేనా? మీ సంపాదకీయంలో ఈ డబ్బు సంగతి మీరెత్తలేదు గానీ, అటువంటి ప్రపత్తి గోలని మీరు వ్యతిరేకించారు. అది జనాలకి అర్థం కాకుండా పోయింది.
భాషని ఒకరి మీద రుద్దడం ఏమిటీ? పాఠశాలల్లో హిందీని బలవంతంగా రుద్దినప్పుడు వ్యతిరేకించలేదా? “నిజంగా అన్ని రాజకీయ పక్షాలు తలుచుకుంటే, తెలుగు ప్రతీ స్కూలులోనూ తప్పని సరి (కనీసం పదవతరగతి వరకూ) అన్న జీ. వో రావడం అంత కష్టమైన విషయం కాదు” అంటూ తెలుగుని అందరి మిదా రుద్దడం ఎందుకు? ఒక రాష్ట్రంలో వేరే రాష్టాల నించీ వచ్చిన పిల్లలు ఎందరో వుంటారు. అంతేకాదు ఏ విషయమూ ఎవరిమీదా రుద్దకూడదు. వాళ్ళకిష్టం అయితే వాళ్ళు తెలుగు నేర్చుకుంటారు. లేకపోతే లేదు. “మాతృభాషలో విద్యాభోదన”లో వున్న మంచి విషయాలు తెలిస్తే నేర్చుకుంటారు. లేకపోతే లేదు. ఈ బలవంతంగా రుద్దడం అనే అభిప్రాయం మీరు మీ సంపాదకీయంలో ఎక్కడా రాయలేదు.
భాషాభిమానం వుండొచ్చు గానీ, దురభిమానం వుండకూడదు. “దేశ భాషలందు తెలుగు లెస్స” అని గర్వంగా చెప్పుకోవడం మిగిలిన భాషలని కించపరచడమే.
ఈ రకరకాల హోదాల వల్ల ధన ప్రాప్తి కూడా వుంటుంది మరి. ప్రాచీన భాష అనే ప్రపత్తి వల్ల అనేక లక్షల రూపాయలొస్తాయంట. వాటికోసం బోలెడు మంది తాపత్రయపడటం సహజమే మరి.
ఇక రాజకీయనాయకుల సంగతి. మన లాంటి “మేధావులు” ఈ రాజకీయ నాయకులని ఎంత తక్కువగా చూస్తామో, వాళ్ళు కూడా మన లాంటి “మేధావుల్ని” అంతే తక్కువగా చూస్తారుట. ఓట్లు వేసి వాళ్ళని గెలిపించేదీ, వాళ్ళకి అధికారం కట్టపెట్టేదీ మన లాంటి వాళ్ళు కాదుట. అందుకే వారు మనలాంటి వారి ఘోష పట్టించుకోరుట. ఇలా అని తెలుగు సంస్కృతి కోసం ఒక తెలుగు సంస్థలో పని చేసే ఆయన అన్నారు. ఆయన మాటలు వింటుంటే, ఇదంతా కంఠ శోషన్న నిరుత్సాహం కలుగుతుంది. ఆయనే మళ్ళీ, “అరకొరగా చదువుకున్న వారిలోనే ఈ విభేదాలన్నీ, బాగా చదువుకున్న వారికిగ్గానీ, బొత్తిగా చదువుకోని వారికిగ్గానీ విభేదాలుండవు” అని అన్నారు. హతోస్మి అనుకోవాలి మరి.
మొత్తానికి మీ సంపాదకీయంలో ఏ విషయం తేల్చకుండా వదిలేశారు. ఏం చెయ్యాలో స్పష్టంగా చెప్పలేదు. దాంతో కొంతమంది మీరు సంపాదకీయంలో బాధ పడిపోయారని, బాధ పడిపోయారు. ఒక్కో విషయం ఒక్కక్కరికి ఒకలాగా అర్థం అవడంలో ఆశ్చర్యమేమేమీ లేదు. ముందుగా మనమే భాషని సరిగా వుపయోగించుకోవాలీ అనిపిస్తుంది. దీర్ఘాలూ, ఒత్తులూ, కామాలూ, గట్రా లేని జనాలు రాసే తెలుగు చూస్తే నిరుత్సాహం కాక ఏం కలుగుతుందీ? ఒకరైతే ఏది కర్తో, ఏది కర్మో, ఏది క్రియో బొత్తిగా అర్థం కాని వాక్యాలు రాస్తారు. కొంతమంది అకర్మక క్రియలతో కర్మణి వాక్యాలు రాస్తారు. వాడుకలో లేని కర్మణి వాక్యాలు అప్పుడప్పుడు తెచ్చేసుకుని మురిసిపోతూ వుంటారు. ఇంకొకరైతే, మీరేం రాసినా, వాళ్ళకిష్టమైన అర్థం తీసేసుకుంటారు, మీరు రాసింది మెచ్చుకుంటూ. తెలుగు భాషలోనేనా ఇంత గందరగోళం అని అనిపిస్తుంది.
ప్రసాద్
raavi subbaa rao అభిప్రాయం:
July 17, 2007 1:42 pm
నేనూ, జె యు బి వి ప్రసాద్ గారితో ఏకీభవిస్తాను. వేలూరి గారి వ్యాసం ఏమీ కొత్తగా చెప్పలేదు. ప్రసాద్ గారన్నట్లు కొంతమంది ఏం రాసినా మెచ్చుకుంటారు. మరికొంత మంది మారుపేర్లతో తమకు నచ్చినవి కక్కుతారు. వస్తువునీ, వ్య క్తులనీ వేరు వేరుగా చూడలేని కుహనా మనుష్యులకి ఒక్క తెలుగు భాషేం కర్మ, యావత్ ప్రపంచం తప్పుగానే అనిపిస్తుంది. తెలుగు భాష ఎందుకు నేర్చుకోవాలి? మన పిల్లల బొడ్డూడని వయసులో, వాళ్ళ్ ముందు పప్రంచం్ లో ఉన్న భాషలన్నీ ఉంచుదాం. వాళ్ళకి ఏ భాష నచ్చితే అది నేర్చుకుంటారు. ఈ ఐడియా బాగుంది.
- రావి సుబ్బారావు
Kameswara Rao అభిప్రాయం:
July 18, 2007 7:24 am
తెలుగు భాషని తెలుగువాళ్ళ మీద ఎందుకు రుద్దాలి (ప్రభుత్వం ప్రజలమీద కాని, బడులు బడి పిల్లలపై కాని, తల్లిదంద్రులు పిల్లలపై కాని) అన్నది చాలా మౌలికమైన ప్రశ్నే (అయినా, చాలా దురదృష్టకరమైన ప్రశ్న)!.
ప్రభుత్వం అధికార భాషగా తెలుగుని సరిగా అమలు చెయ్యడం, ఆ భాషని ప్రజలపై రుద్దడం అవదు.
ఇంగ్లీషుని, అది చదువుకోలేని ప్రజలపై రుద్దకుండా ఉండడమౌతుంది. ఈ మధ్య ఈనాడులో ప్రచురితమైన ఈ వ్యాసం చదివితే అధికారభాషగా తెలుగుని ప్రభుత్వ కార్యాలయాల్లో అమలుపరిస్తే ప్రజలకి కలిగే వెసలుబాటు చక్కగా అర్థం అవుతుంది.
ఇక బడిలోనూ, ఇంటిలోనూ పిల్లలపై రుద్దడం విషయానికి వస్తే:
1. ప్రతి మనిషి తనకి ఇష్తమైన భాషని నేర్చుకోవచ్చనడం సబబుగానే తోస్తుంది. అయితే, సమాజంలో వ్యవహారానికి, ఇతర వ్యక్తులతో సంభాషించడానికి, ఒక సామాన్య భాష అవసరం ఉంది కదా. అది అందరికీ రావాల్సిన అవసరం కూడా ఉంది కదా. అది ఇంట్లో మాట్లాడుకునే భాషకి ఎంత దగ్గరైతే అంత సులువుగా నేర్చుకోవచ్చు. ఎంత ఎక్కువమందికి ఆ భాష ఇంటి భాష అయితే అంత సులువు. ఈ దృష్ట్యా మన రాష్ట్రంలో తెలుగు అందరూ నేర్చుకోవాలి అనుకోవడంలో తప్పేమీ లేదు.
2. పై కారణం కన్నా బలమైనది సాంస్కృతిక కారణం. ఇది ప్రవాసాంధ్రులకి కూడా వర్తించేది. ప్రాణులలోకెల్ల మనిషి పురోగమనానికి ప్రధానమైన కారణాలలో ఒకటి సమాజాలుగా ఏర్పడడం అన్న విషయం శాస్త్రీయమైనది. సమాజాలు ఏర్పడడానికీ, నిలబడడానికీ సంస్కృతి ఒక ప్రధాన సాధనం. భాష సంస్కృతిలో భాగం. అయితే ప్రస్తుత సామాజిక, ఆర్థిక పరిస్థితులలో సంస్కృతిని నిలబెట్టుకోవడం ఎంతవరకూ అవసరం అన్న విషయం శాస్త్రీయంగా ఎవరైనా పరిశోధించారో లేదో నాకు తెలియదు. దాని అవసరం ఇంకా ఉన్నది అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ దృష్టితో చూసినా తెలుగు భాషని కాపాడుకోవడం అవసరం.
ఇక, రాజకీయ నాయకులపై మనమందరం చాలా తేలికగా, హాయిగా తప్పు(ల)ను నెట్టేస్తాం.
నిజమే, రాజకీయనాయకులు స్వార్థపరులే (ఏం మనం కామా?)! వాళ్ళకి ఓట్లువేసే జనాలకి తెలుగు భాషాభివృద్ధి ఒక ప్రధాన విషయం అయితే, వాళ్ళు దానిగురించి పట్టించుకోక ఏం చేస్తారు? ఓట్లు వేసే ప్రజలోఅత్యధిక శాతం సామాన్య ప్రజలు (చదువులేనివాళ్ళు, పేద వాళ్ళు). సహజంగా వాళ్ళకి భాషాభివృద్ధి ఒక ప్రధాన విషయం కాదు. కాబట్టి రాజకీయ నాయకులకి దానిగురించి పట్టదు.
అంచేత తెలుగు భాషాభివృద్ధి జరగాలంటే, అవసరమైనవి రెండు పనులు:
1. చదువుకున్నవాళ్ళు ముందు తెలుగు భాషాభివృద్ధి తాలూకు (శాస్త్రీయమైన) అవసరాన్ని గుర్తించి, దాన్ని తమ పరిధిలో అమలు పరచడం.
2. సామాన్య ప్రజకి దీని అవసరాన్ని తెలియజెప్పడం. సామాన్య ప్రజలకి తెలియాలంటే అది శాస్త్రీయ విధానంలో సాధ్యపడదు. ప్రజలలో భాష పట్ల (దుర)అభిమానం కలిగించడమొక్కటే సాధనం. దీనికి ఒక ఉద్యమం అవసరం.
తమిళభాషాభివృద్ధిలో ఈ పై విషయాల పాత్రని గుర్తించవచ్చు.
In this context, I have recently come across a link on “Orality to literacy: Transition in Early Tamil Society” by IRAVATHAM MAHADEVAN. It contains interesting points on Popular versus elitist literacy, comparing Tamil and Upper South India (Telugu and Kannada) in the ancient period.
జె.యు.బి.వి.ప్రసాద్ అభిప్రాయం:
July 18, 2007 9:32 am
ఇండియాలో ఇంచుమించు ప్రతీ రాష్ట్రానికీ ఒక సొంత భాష వుంది. ఆ రాష్ట్రం ఆ సొంత భాషని తమ అధికార భాషగా చేసుకోవడం కరక్టైన విషయమే. ఎటొచ్చీ పలు రాష్ట్రాలు అనేక విషయాలలో కలిసి వుంటాయి కాబట్టి, అన్ని రాష్ట్రాల మధ్య ఒక లింకు భాష కూడా వుంటుంది. ఒక రాష్ట్ర ప్రజలు ఇంకో రాష్ట్రంలోకి వెళ్ళినపుడు, లింకు భాషలో మేనేజ్ చేస్తారు. తర్వాత కాలంలో రాష్ట్ర భాషని నేర్చుకుంటారా, లేదా అనేది వారి అవసరాల మీద ఆధారపడి వుంటుంది.
పైన చెప్పిన విధంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగు అధికార భాషగా వుండటంలో తప్పేమీ లేదు. ప్రతీ స్కూల్లోనూ తెలుగు నేర్పడం, తెలుగులో ప్రాధమిక విద్యా బోధన చెయ్యడం చాలా మంచి పనులే. ఆంధ్రప్రదేశ్లో ఒక లింకు భాష కూడా వుండాలి, మిగిలిన రాష్ట్రాలతోటీ, మిగిలిన ప్రపంచంతోటీ సంబంధాలలో వుండటానికి.
ఇదంతా బాగుంది. అభ్యంతరం అల్లా స్కూల్లో తెలుగుని అందరూ నేర్చుకుని తీరాలన్న జీ.వో నిబంధన. ఏ విషయాన్నీ ఎవరి మీదా రుద్దకూడదు. దాని అవసరాన్నీ, దాని లోని మంచినీ వివరించి మనుషులని ఎడ్యుకేట్ చెయ్యాలి. దాని ద్వారా ప్రజలు ఆ భాష నేర్చుకోవడానికి ఇష్టపడాలి.
తమిళనాడులో తమిళ భాషాభివృద్ధి ఎంతగానో జరిగిందంటారు కదా? మేము మద్రాసులో వుండే రోజుల్లో తమిళం మా పిల్లల మీద రుద్దుతారేమోనని భయపడ్డాము. కానీ అలా అప్పుడు జరగలేదు. మేము పిల్లల్ని చేర్చిన స్కూల్లో తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఒక భాష సెలక్టు చేసుకోమన్నారు. అలా తమిళం రుద్దక పోవడం బాగుంది. మిగిలిన రాష్ట్రం అంతా తమిళ బోర్డులూ, తమిళ పోస్టర్లూ, గట్రా చాలా వున్నాయి. అవి చదువుకోవాలంటే తమిళం తప్పని సరి అని గ్రహించి, తమిళం చదవడం కొంచెం నేర్చుకున్నాను. టీవీ అవసరాన్ని గానీ, సినిమాల అవసరాలని గానీ వేరేగా చెప్పక్కరలేదు.
మనిషి తనుండే పరిసరాలను బట్టీ, అందులోని అవసరాలను బట్టీ ఒక భాష నేర్చుకునే పద్ధతి వుండాలి. మనుషులకి తమకి ఏం కావాలో తాము తెలుసుకునే స్వేచ్చ వుండాలి, అది ఎంత తప్పుగా వున్నప్పటికీ. ఎడ్యుకేషన్తో మాత్రమే మనుషులని చైతన్యం చేయాలి. బలవంతంతో కాదు. నేను చెప్పే ఈ స్వేచ్చ ప్రతీ విషయానికీ వర్తించదు. భాషకి మాత్రం తప్పకుండా వర్తిస్తుంది.
రాష్ట్ర అధికార భాషగా తెలుగుని అమలుపరచడం పట్ల నాకు వ్యతిరేకత లేదు. దాన్ని సమర్ధిస్తాను కూడా. అది స్కూల్లో ప్రతీ ఒక్కరూ నేర్చుకుని తీరాలన్న జీవో నిబంధన పట్ల మాత్రమే నా వ్యతిరేకత. ట్రాన్సఫర్ల మీద తలో రాష్ట్రం తిరిగే పిల్లలు, రెండేళ్ళకో భాష నేర్చుకోవాలనడంలో అర్థం లేదు. అందుకని స్కూల్లో కూడా తెలుగు గానీ, దాని బదులుగా వేరే భాష గానీ నేర్చుకునే పరిస్థితి వుండాలి. బలవంతంగా రుద్ది మనుషులకి వుండే స్వేచ్చని హరించకూడదు. ఇదీ నా పాయింటు.
ప్రసాద్
J K Mohana Rao అభిప్రాయం:
July 18, 2007 11:38 am
తెలుగుదేశములో తెలుగు మాతృభాషగా ఉన్నవారు సుమారు
90% ఐనా ఉంటారు. ఇతర భాషలు మాతృభాషగా గలవారు,
కేంద్ర ప్రభుత్వములో ఉద్యోగము చేసేవాళ్ళు, ఇతర రాష్ట్రాల
నుండి వచ్చినావాళ్ళు 10% ఉంటారేమో. ఈ 90% తెలుగు
వాళ్ళకు తెలుగును తప్పని సరిగా బోధించడములో తప్పేమి
లేదు గదా! వాళ్ళు ఆంగ్లము నేర్చుకోనీ, కాని తెలుగును
ఎందుకు నిరసన చెయ్యాలి? ఇక తమిళనాడులో తమిళమును
రుద్దలేదనుట అతశయోక్తి అవుతుంది. మదరాసు మాత్రమే
కాదు, హొసూరు, సేలం, ఉత్తర ఆర్కాడు, మదురై,
కోయముత్తూరు జిల్లాలలో తెలుగు మాటలాడేవారు చాల
మంది ఉన్నారు. ఎక్కడో తప్ప వారికి తెలుగు బడులు లేవు, ఇతర
భాషల బడులు లేవు, ఒక్క తమిళము తప్ప. మదరాసులోనే
50లలో స్థితికి, ఇప్పటి స్థితికి ఎంతో తేడా ఉంది. అప్పుడులా
ఇప్పుడు తెలుగు తమ మాతృభాష అని జనాలు ప్రకటించుకొనుట
అరుదే! - మోహన
జె.యు.బి.వి.ప్రసాద్ అభిప్రాయం:
July 18, 2007 12:45 pm
“ఇతర రాష్ట్రాల నించీ వచ్చిన వారు” అని ఎలా గుర్తు పడతారు? ఇలా గుర్తు పట్టడానికి ఎటువంటి పద్ధతులు అవలంభించినా, అందులో ఎంచడానికి బోలెడు తప్పులుంటాయి. వేరే రాష్ట్రం నించీ వచ్చి పదేళ్ళయినా, వాళ్ళ స్వతంత్ర ప్రతిపత్తి వాళ్ళు పోగొట్టుకోనక్కరలేదు కదా? తరాలు గడిచే కొద్దీ వాళ్ళే ఇష్టపడి, అవసరాల కొద్దీ, లేదా ఇష్టం కొద్దీ స్వేచ్చగా నేర్చుకుంటే, అది వేరే సంగతి. ఇక 90% మనుషులకి మాత్రం ఈ నిబంధన ఎందుకు వుంచాలీ? అందులో కొంత మంచి త్వరలో వేరే రాష్ట్రాలకి పోవచ్చు. కొంత మంది వేరే దేశాలకి పోవచ్చు. అక్కడ వేరే బాషను ఎక్కువగా పట్టించుకోవలసి వుంటుంది కాబట్టి, వారు వేరేలాగా నిర్ణయించుకోవచ్చు. ఎవరి స్వేచ్చను బట్టీ వారు నిర్ణయించుకోవాలి. ఒక విషయంలో మంచి విషయాలను ప్రచారం చెయ్యడం, అవి విడమరిచి అవతలవారికి చెబుతూ వారిని ఎడ్యుకేట్ చెయ్యడం మాత్రమే కరెక్టు పద్ధతి. పబ్లిక్ పరీక్షల్లో ఎక్కువ మార్కులు రావని చాలా మంది తెలుగు వారు హిందీనో, సంస్కృతాన్నో తీసుకునే రోజులు ఇవి. భాష విషయంలో నిర్భంధమే పెద్ద తప్పు.
ఎవరైనా ఆంగ్లం నేర్చుకుంటే, అది తెలుగును నిరసించినట్టు ఎందుకవుతుందీ?
తమిలనాడులో, ముఖ్యంగా మద్రాసులో, తమిళాన్ని 1982-91 వరకూ అన్ని స్కూళ్ళలోనూ రుద్దలేదు. మా కజిన్ అక్కడే పుట్టి, బి.కాం వరకూ తెలుగు సెకండ్ లాంగ్వేజీగా, తమిళం లేకుండా, ఇంగ్లీషు మీడియంలో చదువుకున్నాడు. మిగిలిన వూళ్ళ సంగతి నాకు తెలియదు. నేనొక వుదాహరణ చెప్పానే గానీ, దాంతో మొత్తం తమిళనడుని జనరలైజ్ చెయ్యలేదు. ఒకవేళ తమిళనాడులో తమిళం రుద్దుతూ వుంటే, వాళ్ళకీ ఈ విమర్శలు వర్తిస్తాయి. హిందీ రుద్దినపుడు వాళ్ళు ఎంత గొడవ చేశారో అందరికీ గుర్తే కదా? 1967 సంవత్సరాలలో హిందీ రుద్దడాన్ని వ్యతిరేకించడంలో ఆంధ్రప్రదేశ్ విఫలమయినా, తమిళనాడు సఫలమయింది కదా? రుద్దడం ఎప్పుడూ తప్పే ఇలాంటి విషయాల్లో.
తెలుగు మాట్టాడ్డం చిన్నతనం అనుకునే తెలుగువారి గురించి అస్సలు మాట్టాడ్డమే లేదు ఇక్కడ, అటువంటి వారి మీద ఎన్ని విమర్శలున్నా. మాతృభాషకి ఎవరూ వ్యతిరేకం కాకూడదు అనేదే నా భావం కూడా. ఎటొచ్చీ వాళ్ళని ఎడ్యుకేట్ చెయ్యడం ఒక్కటే కరెక్టు పద్ధతి. అది తప్ప ఏదైనా తప్పు పద్ధతిగానే వుంటుంది. నియంత్రత్వం ఎప్పుడూ మంచిది కాదు.
ప్రసాద్
(This message has been edited. — editors)
Sai Brahmanandam Gorti అభిప్రాయం:
July 18, 2007 3:22 pm
మోహన రావు గారు,
మీరు చెప్పంది కరక్టు. తమిళ నాడులో ఎన్ని స్కూళ్ళ్లో తెలుగు నేర్పుతారో అందరికీ తెలుసున్నదే! ఏదో ఒకటీ అరా స్కూల్లో తెలుగు బోధిస్తే మొత్తం అన్ని స్కూళ్ళూ అలాగే ఉంటాయనుకోవడం మన అవివేకం. అంతెందుకూ, బళ్ళారి, హాస్పేట జనాభాలో నలభై శాతం పైగా తెలుగు వాళ్ళున్నారు. కానీ అక్కడ తెలుగు నేర్పే స్కూళ్ళు ఒక్కటీ లేవు. కన్నడం మాత్రం చచ్చినట్లు నేర్చుకోవాలి - ఇష్టం ఉన్నా, లేక పోయినా ! దీనికి కారణం పాలించే ప్రభుత్వాల చలవే !
-సాయి బ్రహ్మానందం గొర్తి
(This message has been edited. — Editors)
Rohiniprasad అభిప్రాయం:
August 26, 2007 8:29 am
తెలుగు భాష ప్రాచీనత గురించిన తర్జనభర్జనలు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితిలో తెలుగు భాష యొక్క చరిత్ర పట్ల ఆసక్తి పెరుగుతోంది. అందుచేత ఇంతవరకూ తెలుగుభాషా శాస్త్రంలో జరిగిన కృషి గురించి నలుగురూ తెలుసుకోవలసిన అవసరం కనిపిస్తోంది. సామాన్యంగా తెలుగు సాహిత్యం అంటే ఇష్టపడేవారు సైతం ఇటువంటి అంశాలతో ఎక్కువ పరిచయం కలిగి ఉండరు. ఇటీవల ‘ఆంధ్రభూమి’లో దీన్ని గురించి సురేశ్ కొలిచాలగారి వ్యాసం వెలువడింది. విషయాలని గురించి సులభశైలిలో విశదపరిచే వ్యాసాలని ఆయన ‘ఈమాట’లో ఒక పరంపరగా రాస్తే బావుంటుందని నేననుకుంటున్నాను.
JP అభిప్రాయం:
February 16, 2008 5:29 am
తెలుగుని మన తెలుగు వారికి తెలుగు కాని వారికి నేరుపుటకు ఇంటరునెటుని మాధ్యమంగా ఎందుకు ఉపయొగించరాదు? అన్ని ముఖ్య బాషలలొ interactive WEBSITE should be there to learn Telugu. I have seen lot of discussion on extinction of Telugu but I don’t believe it. Because of development of INTERNET medium, we have a good opportunity to teach the language all over the world. Language is also getting richer by adding lot of new words by bloggers all around the world.
I am able to see lot of rich content, thoughts, affection for the language in blogs. But i have not come accross when web site solely dedicated for learning Telugu. All should start to contribute to develop such a rich and multi media site. This will help every Telugu who don’t know the language to learn language. The site should be developed in such a way that any non-telugu who learns the TELUGU should immediately realise the SWEETNESS of Telugu.
Sorry, For typing in English as this is 1st time for me to use RTS.