భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101

తెలుగు అంకెలు, సంస్కృత సంఖ్యలు

ఇకపోతే ఏక శబ్ద నుండి “ఒక”, దొందు శబ్దం నుండి “రెండు” సంఖ్యావాచకాల ఉత్పత్తి సాధ్యమా అన్న విషయం తులనాత్మక పద్ధతి ద్వారా పరిశీలిద్దాం. భారతీయ ఇండో-ఆర్యన్ భాషలలో మొదటి రెండు సంఖ్యావాచకాలు ఇలా ఉంటాయి[8]:

1. ఏక (సంస్కృతం) ఏక్ (హిందీ) ఏక (పాళీ) ఏకు (సింధీ) ఏక (ఒరియా) హెక్/ఇక్క (పంజాబీ)
2. ద్వ/ద్వౌ (సంస్కృతం) దో (హిందీ) దో బా (సింధీ) దుఇ/బేని(ఒరియా) బే (మరాఠీ)

ఇందులో ఏక శబ్దం అన్ని భాషలలో దాదాపు ఒకే రూపంలో ఉన్నా పంజాబీ భాషలో మాత్రం హెక్/ఇక్క గా మారింది. కానీ, పంజాబీ భాషలో నొక్కి పలికినపుడు ఎ- ధ్వని హె- ధ్వనిగా కానీ, హి- ధ్వనిగా కానీ మారుతుందని ఇతర ఉదాహరణల ద్వారా నిర్మించిన ధ్వని సూత్రాల ద్వారా నిరూపించవచ్చు. అలాగే వ- ధ్వని బ-ధ్వనిగా మారటం ఇండో-ఆర్యన్ భాషలలో సర్వ సాధారణం. ఈ ధ్వని సూత్రాల ద్వారా ద్వ- శబ్దం ద్బ- శబ్దంగా, ఆపైన బ- శబ్దంగా పరిణామం చెందిందని చెప్పవచ్చు. తెలుగు “ఒక” శబ్దం “ఏక” శబ్దం నుండి ఉద్భవించిందని చెప్పాలంటే *ఏ > ఒ ధ్వని పరిణామానికి క్రమబద్ధమైన ధ్వన్యనుగుణ్యత చూపించగలగాలి. అలాగే దొందు శబ్దం రెండు శబ్దంగా రూపాంతరం చెందిందని చెప్పడానికి పదాదిన ద- ధ్వని ర- ధ్వనిగా మారడానికీ, పదాంతంలో ద- ధ్వని డ- ధ్వనిగా పరిణమించడానికి మరిన్ని ఉదాహరణలతో క్రమబద్ధమైన అనుగుణ్యత చూపగలగాలి.

నిజానికి తెలుగులో మొదటి సంఖ్యా వాచక శబ్దం ఒకటి- మిగిలిన ద్రావిడ భాషలవలే *ఒన్, *ఒన్ఱు > *ఒండు, *ఒరు, *ఒక్ అన్న ధాతువులకు దగ్గరిదని నిరూపించడం సులభం. ఒంటి-, ఒంటరి- అన్న ప్రాచీన తెలుగు పదాలు ఇందుకు ఉదాహరణలు. అలాగే రెండు- అన్న శబ్దం *ఇరు-/*ఇరండు ధాతువు నుండి పరిణామం చెందిందని చూపడం తేలిక. ఇరువురు, ఇరువది (ఇరు+పది), ఇమ్మడి (రెండు రెట్లు), ఇరువాగు వంటి ఇరు- సంబంధ శబ్దాలు తెలుగులో కోకొల్లలు.

ఇండో-యూరోపియన్ కుటుంబంలోని వేర్వేరు భాషలలోనూ, ద్రావిడ భాషలలోనూ సంఖ్యా వాచకాలను ఒక్క సారి పరిశీలిస్తే తెలుగు అంకెలకు, సంస్కృత, ప్రాకృత సంఖ్యావాచకాలకు లంకె లేదన్న విషయం సుస్పష్టమవుతుంది.

ఇండో-యూరోపియన్ భాషలలో సంఖ్యా వాచకాలు
మూల ధాతువు Sanskrit Avestan Greek Latin Gothic English
*oi- eka aēuua oios ūnus ains one
*duwo / *dwo dva duua duō duo twai two
*treyes tri θri treis trēs þreis three
*kwetw- catur čaθware tessares quattuor fidwor four
*penkwe pañca paṇča pente quinque fimf five
*sweks / *seks ṣaṣ xšuuaš heks sex saihs six
*sept@m sapta hapta hepta septem sibun seven
*októ aṣṭa ašta oktō octō ahtau eight
*new@n nava nauua ennea novem niun nine
*dek@mt daśa dasa deka decem taihun ten
*dkm-tom śatam satem he-katon centum hund(rath) hund-red
ద్రావిడ భాషలలో సంఖ్యా వాచకాలు
మూల ధాతువు తమిళం తెలుగు కన్నడ
*ఒన్/*ఒన్ఱు ఒన్ఱు ఒండు ఒందు
*ఈర్/*ఇర్ ఇరు/ఇరంటు/రెండు ఇరు/రెండు ఇరు/ఎరడు
*మూహ్-/*మూ-/*మూన్ఱు- మూన్ఱు మూఁడు మూఱు
*నాల్- నాల్కు నాలుగు నాల్కు
*చయ్-మ్- ఐంతు/అంజు ఏను/అయిదు అయిదు
*చాఱ్- ఆఱు ఆఱు ఆఱు
*ఏఴు- ఏఴు ఏడు ఏఴు
*ఎణ్- ఎట్టు ఎణుంబొంది / ఎనిమిది ఎంటు
*తొల్-/*తొణ్- తొంటు తొమ్మిది ఒంబత్తు
*ప@-/*పత్తు- పత్తు పది పత్తు
*నూఱు- నూఱు నూఱు నూఱు

తెలుగు పత్రికలలో భాషావ్యాసాల తీరు

భారత కేంద్ర ప్రభుత్వం తమిళ భాషని ప్రాచీన భాషగా గుర్తించి ఆ భాషకు నూరు కోట్ల రూపాయలు బహూకరించిండంతో తెలుగు భాష ప్రాచీనత గత సంవత్సరంలో ముఖ్య చర్చనీయాంశం అయ్యింది. తమిళానికి దీటుగా తెలుగు భాష ఎంత ప్రాచీనమైనదో రుజువు చేయ్యడానికి పలురకాల ప్రతిపాదనలు పత్రికల్లో కనిపించాయి. అయితే ఈ వ్యాసాల్లో తర్కబద్ధమైన వివేచనతో, నిర్దిష్టమైన రుజువులతో శాస్త్రపరీక్షకు నిలువగలిగే విశ్లేషణ చాలా తక్కువనే చెప్పక తప్పదు.

ఉదాహరణకు ఒక రచయిత క్రీ. పూ. 3000 సంవత్సరాల క్రితం బహ్రేన్ లో వెలసిల్లిన తెల్‌మున్ నాగరికత తెలుగు వారిదేనంటూ, “సుస” అనే నగరంలో దొరికిన ‘క్లే టాబ్లెట్స్’ లో ఉన్న ఒక ఉత్తరంలోని భాషకు తెలుగు భాషకు సంబంధం అంటగట్టారు. అయితే, ఇందులో తెలుగు పదాలుగా చెప్పుకున్న పదాలు ప్రాచీన తెలుగు శబ్దాలు కావు. అసలైతే ఇందులో తెలుగు పదాలుగా పేర్కొన్న అన్నాయం, సకియం వంటి చాలా పదాలు అర్వాచీనాలైన సంస్కృత తద్భవాలు. మరో రచయిత ఊరు, గుడి, గుడియ అన్న పదాల ఆధారంగా సుమేరులో తెలుగుతేజం వెలిగిందని నిర్ణయించారు. క్రీ. పూ. 2000 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉండే తెలుగు వారు గోదావరి లోయ గుండా సముద్ర మార్గాన సుమేరు ప్రాంతాలకు వలస వెళ్ళారని తమ పూర్వజులతో వర్తక సంబంధాలు కొనసాగించారని ఈయన పేర్కొన్నారు. కానీ క్రీ. పూ. 1100 నాటి కంటే ముందు దక్షిణ భారత దేశంలో ఏ రకమైన నాగరికత వెలసిల్లినట్టుగా ఆర్కియలాజికల్ ఆధారాలు లేవు. మరో రచయిత కృష్ణుడు అంధక వృష్ణీయంలో పుట్టిన వాడు కాబట్టి తెలుగు జాతివాడేనని అభిప్రాయపడ్డారు. తమిళులు శ్రీలంక నుండి భారతదేశానికి వలస వస్తే, తెలుగు వారు బలూచిస్తాన్ ద్వారా భారత దేశానికి ప్రవేశించారని మరో రచయిత సూచించారు. ఇవేవీ శాస్త్ర పరిశీలనకు నిలువగలిగే వాదాలు కావు. బౌద్ధ జాతక కథలో ప్రస్తావించిన ‘తెలివాహ’ గోదావరి నదేనని రాసిన వ్యాసంలో మాత్రం కొంత భాషాశాస్త్ర బద్ధమైన విశ్లేషణ కనిపిస్తుంది.

తెలుగు, ఆంధ్ర శబ్దాలను తెలంగాణా, కోస్తాంధ్ర ప్రాంతాలకు చెందిన వేర్వేరు భాషలుగా చిత్రిస్తూ ఈ మధ్య వచ్చిన వ్యాసాలు కూడా ఈ కోవకు చెందినవే. “తెలుగు”, “ఆంధ్ర” శబ్దాల వ్యుత్పత్తి గురించి, వాటిని భాషా పరంగా, జాతి పరంగా, ప్రాంత పరంగా పూర్వ వాఙ్మయంలో వాడిన దృష్టాంతాల గురించి భాషాశాస్త్రవేత్తలు [గంటి] [భద్రిరాజు] చేసిన విశ్లేషణకు మించి, ఈ వ్యాసాల్లో శాస్త్ర విమర్శకు నిలువగలిగే వివరాలేవీ నాకు కనబడలేదు. జన్యుశాస్త్ర పరంగా తెలంగాణా ప్రజలు, కోస్తాంధ్ర ప్రజలు భిన్న జాతికి చెందినవారని చెప్పడానికి ఏ రకమైన ఆధారాలు లేవు. తెలంగాణా తెలుగు, కోస్తాంధ్రా తెలుగు భాషల వ్యుత్వత్తి వేరని నిరూపించాలంటే, తులనాత్మక పద్ధతిద్వారా ఈ భాషల ప్రాథమిక పదజాలంలో క్రమబద్ధమైన అనుగుణ్యత లేదని రుజువు చెయ్యగలగాలి. భాషాశాస్త్ర సిద్ధాంత దృష్టితో చూస్తే ఈ రెండు “భాషలు” ఒకే భాషకు చెందిన రెండు మాండలికాలుగానే తప్ప మరేరకమైన వాదన చేయడానికి వీలు లేదని తెలిసిపోతుంది. తెలంగాణా భాషకు లంబాడి, సవర భాషలకు సంబంధం ఉండవచ్చునేమోనని మరో రచయిత సందేహం వెలిబుచ్చారు. లంబాడీ భాష రాజస్థానీ ఉపశాఖకు చెందిన ఇండో-ఆర్యన్ భాష. సవర భాష ముండా ఉప శాఖకు చెందిన ఆస్ట్రో-ఏసియాటిక్ భాషా కుటుంబానికి చెందింది. తెలుగు భాషపై ఈ రెండు భాషల ప్రభావం చాలా తక్కువేనని చెప్పకోవచ్చు.

వచ్చిన చిక్కేమిటంటే భాషా చరిత్రలపై ఈ వ్యాసాలు రాస్తున్న చాలామంది ప్రధానంగా సాహిత్యకారులు. సాహిత్యం ఒక కళ అయితే భాషాశాస్త్రం విజ్ఞాన శాస్త్రం. సాహిత్య సృష్టికి కల్పనా శక్తి చాలా అవసరం. విజ్ఞాన శాస్త్ర పరిశోధనకు తార్కిక వివేచన, విశ్లేషణ ((Logical Reasoning and Analytical Skills) అత్యంత ప్రధానమైన అంశాలు. మౌలిక పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఏవో కొన్ని వాస్తవాంశాలకు తమ కల్పనా శక్తిని జోడించి తమ దృక్పథాల ప్రకారం, ఏవో తాత్కాలిక ప్రయోజనాలకోసం, చరిత్రలు రాయాలనుకోవడం దుస్సాహసమే అవుతుంది.