గత శతాబ్దంలో ప్రజాకవులు

6.

రెండవ నాటకం, “శ్రీ పాండవ విజయము,” లో ఆఖరి రెండు అంకాలలో(ఏడవ అంకం, ఎనిమిదవ అంకం)చాలా కొద్ది పద్యాలు మాత్రమే ప్రసిద్ధికెక్కినాయి. ఆ పద్యాలు కలుపుకొని, “పాండవోద్యోగవిజయములు,” అని ప్రదర్శించడం ఆనవాయితీ!

పదకొండు అక్షౌహిణుల కౌరవ సేన నశించింది. దుర్యోధనుడు మడుగులో దాక్కుంటాడు. కృష్ణుడితో కలసి, పాండవులందరూ ఆ మడుగు దగ్గరకు వచ్చి, దుర్యోధనుని బయటకువచ్చి యుద్ధము చెయ్యమని అడిగే పద్యాలు, ఏడవ అంకంనుంచి:

ధర్మరాజు, దుర్యోధనుని సంబోధించి పాడుతున్నాడు:

చతురంభోధి పరీతమైన ధరణీ చక్రంబు శాసించి భూ-
పతివర్గం బరిగాపులై కొలువ సేవానమ్రరాజేంద్రమౌ-
ళి తలాలంకృత రత్నదీధితి సరోలీనుండవై యుండు నీ-
స్థితి ఈ రీతిగ నేటికిం పరిణమించెన్ గాదె దుర్యోధనా!

ఈ భూమండలాన్ని శాసించి, సమస్త రాజవర్గమూ సేవలు చేస్తూ ఉండే నీకు ఈ దుస్థితి పట్టిందా, దుర్యోధనా అని అంటూ, ఈ కింది పద్యం బిగ్గరగా పాడతాడు. ఎందుకంటే, ఈ పద్యం చాలామందికి నోటికొచ్చిన పద్యం!

చచ్చిరి సోదరుల్సుతులు చచ్చిరి చచ్చిరి రాజులెల్ల రీ-
కచ్చకు మూలకందమగు కర్ణుడు మామయు చచ్చిరీ గతిన్-
పచ్చని కొంప మాపితివి బాపురె? కౌరవనాథ! నీ సగం-
బిచ్చెద జీవితేచ్ఛ కలదేని బయల్పడుమయ్య గ్రక్కునన్

తమ్ములు, కొడుకులు, నీ సామంతరాజులు, అందరూ యుద్ధంలో చనిపోయారు. ఈ యుద్ధానికి ముఖ్యకారకులైన కర్ణుడు, శకుని మామ కూడా హతమార్చబడ్డారు. నీ సగపాలు నీకు ఇస్తాను, బతుకుదామనే కోరిక ఉంటే, మడుగునుండి బయటకు రమ్ము. “నీ సగపాలూ ఇస్తాననడం” భారతంలో లేదనే నా నమ్మకం. ఇది, తిరుపతి వెంకట కవుల చేర్పే!

తరువాత, భీముడు, నకులుడు, సహదేవుడు, అర్జునుడూ తలా ఒక్క పద్యం పాడతారు, దుర్యోధనుణ్ణి దెప్పిపొడుస్తూ. మడుగునుండి బయటకు వచ్చి క్షత్రియుని వలె యుద్ధ ధర్మాన్ని పాటించమని గుచ్చి గుచ్చి అడుగుతారు.

కృష్ణుడు, “ కౌరవేంద్రా! నాడు సభాముఖమున “బ్రతికినన్నాళ్ళు రారాజుననిపించుకొన వలె” నని మీ అమ్మతో చెప్పిన మాటలు గుర్తులేవా,” అని ఎద్దేవ చేస్తాడు.

దుర్యోధనుడు, పాండవులతో:

ఏలుము రాజ్యమంతయు మహీంద్రుడ; నేను పరిత్యజించితిన్
కాలము చేరువౌదనుక కానలలో తపమాచరింతు నే-
నాల మొనర్పగా తగిన యాయుధముల్దరి లేవు యుద్ధ మిం-
కేల? భవన్మనోరథము లే నొడగూర్చుచు నుండ నిత్తరిన్

వెంటనే ధర్మరాజు, “ దాన పూర్వకముగా గ్రహించుటకు మేము బ్రాహ్మలము కాము. నిన్ను కడతేర్చుటయే మా మనోరథమ్ము కాని, రాజ్యమేలుటయే కాదు. కావున తడయక, వెడలి రమ్ము,” అని హెచ్చరిస్తాడు.

తరువా త భీమునితో గదా యుద్ధం. కృష్ణుడు సైగచేసి దుర్యోధనుని తొడలపై భీమునిచే కొట్టించడం, ఆతడు తొడలు విరిగి నేల కూలడం జరుగుతుంది.

దుర్యోధనుడు ఆఖరిగా, కృష్ణునితో, “ గోపాలా! ఇది ధర్మమునకు కాలము కాదు. కలికాలము వచ్చినది. కపటోపాయము లేని వారికి జయము లేదు. ఇది వినుము,” అని ఈ పద్యం పాడతాడు:

చదివినాడను వేద శాస్త్రంబు లర్థుల-
కిచ్చినాడను మనోభీప్సితమ్ము-
లేలినాడను భూమి ఏకాత పత్రంబు
ప్రజలను సంతోష పరచినాడ
జరపినాడను పెక్కు జన్నముల్పుత్రుల-
గాంచితి పూనరకంబు వాయ
మెప్పించినాడ సుమిత్రుల నార్జించి
పొందినాడను సర్వభోగములను

క్షత్రియులచేత మిగుల పొగడ్తగన్న
కదన మరణంబు కంటి నా కంటె భాగ్య-
శాలి సుకృతి వదాన్యుండు చతురమతియు
పండితుండెవ్వడేమి లోపంబు నాకు?

బందుగులు లేక సైనయసంపదలు లేక
సంతసము లేక తగిన వంశంబు లేక
బహుళ దుఃఖాకరంబగు పాడునేల
ఈ యుధిష్టిరు చేత మోయింపుమయ్య.

మిగిలిన భాగాలు ఏవీ ప్రసిద్ధికెక్కినవి కావు. దుర్యోధనుని మరణం, దేవతల పూలవర్షం.

నాటకం అయ్యేటప్పడికీ, తెల్లవారుఝామున కోడికూత వినపడుతుంది. నిద్రపోయిన పిల్లలని బుజాలకెత్తుకొని ప్రేక్షకులందరూ ఆనందంతో ఇంటికి.

ఇవి మరిచిపోకూడని పద్యాలని నా ఉద్దేశం. మీరేమంటారు?

(ఈ మధ్య, షణ్ముఖి ఆంజనేయరాజు గారి కుమారుడు, ఈ నాటకాలని ప్రదర్శిస్తున్నట్టు విన్నాను. మూడు సంవత్సరల క్రితం, విశాఖజిల్లాలో ఒక కుగ్రామంలో, “రాయబారం,” వేస్తున్నారని చూడటానికి వెళ్ళితే, షణ్ముఖి జూనియర్ గారి కారు పాడయి, ఆయన రాలేక పోయారు. స్థానికంగా ఉన్న ఒక కుర్రాడు కృష్ణుడి వేషం వేశాడు! అతను బాగా పద్యాలు పాడలేకపోయినా, పద్యాలన్నీ విని ఆనందించారు, ఆఊరి జనం!)