గత శతాబ్దంలో ప్రజాకవులు
6.
రెండవ నాటకం, “శ్రీ పాండవ విజయము,” లో ఆఖరి రెండు అంకాలలో(ఏడవ అంకం, ఎనిమిదవ అంకం)చాలా కొద్ది పద్యాలు మాత్రమే ప్రసిద్ధికెక్కినాయి. ఆ పద్యాలు కలుపుకొని, “పాండవోద్యోగవిజయములు,” అని ప్రదర్శించడం ఆనవాయితీ!
పదకొండు అక్షౌహిణుల కౌరవ సేన నశించింది. దుర్యోధనుడు మడుగులో దాక్కుంటాడు. కృష్ణుడితో కలసి, పాండవులందరూ ఆ మడుగు దగ్గరకు వచ్చి, దుర్యోధనుని బయటకువచ్చి యుద్ధము చెయ్యమని అడిగే పద్యాలు, ఏడవ అంకంనుంచి:
ధర్మరాజు, దుర్యోధనుని సంబోధించి పాడుతున్నాడు:
చతురంభోధి పరీతమైన ధరణీ చక్రంబు శాసించి భూ-
పతివర్గం బరిగాపులై కొలువ సేవానమ్రరాజేంద్రమౌ-
ళి తలాలంకృత రత్నదీధితి సరోలీనుండవై యుండు నీ-
స్థితి ఈ రీతిగ నేటికిం పరిణమించెన్ గాదె దుర్యోధనా!
ఈ భూమండలాన్ని శాసించి, సమస్త రాజవర్గమూ సేవలు చేస్తూ ఉండే నీకు ఈ దుస్థితి పట్టిందా, దుర్యోధనా అని అంటూ, ఈ కింది పద్యం బిగ్గరగా పాడతాడు. ఎందుకంటే, ఈ పద్యం చాలామందికి నోటికొచ్చిన పద్యం!
చచ్చిరి సోదరుల్సుతులు చచ్చిరి చచ్చిరి రాజులెల్ల రీ-
కచ్చకు మూలకందమగు కర్ణుడు మామయు చచ్చిరీ గతిన్-
పచ్చని కొంప మాపితివి బాపురె? కౌరవనాథ! నీ సగం-
బిచ్చెద జీవితేచ్ఛ కలదేని బయల్పడుమయ్య గ్రక్కునన్
తమ్ములు, కొడుకులు, నీ సామంతరాజులు, అందరూ యుద్ధంలో చనిపోయారు. ఈ యుద్ధానికి ముఖ్యకారకులైన కర్ణుడు, శకుని మామ కూడా హతమార్చబడ్డారు. నీ సగపాలు నీకు ఇస్తాను, బతుకుదామనే కోరిక ఉంటే, మడుగునుండి బయటకు రమ్ము. “నీ సగపాలూ ఇస్తాననడం” భారతంలో లేదనే నా నమ్మకం. ఇది, తిరుపతి వెంకట కవుల చేర్పే!
తరువాత, భీముడు, నకులుడు, సహదేవుడు, అర్జునుడూ తలా ఒక్క పద్యం పాడతారు, దుర్యోధనుణ్ణి దెప్పిపొడుస్తూ. మడుగునుండి బయటకు వచ్చి క్షత్రియుని వలె యుద్ధ ధర్మాన్ని పాటించమని గుచ్చి గుచ్చి అడుగుతారు.
కృష్ణుడు, “ కౌరవేంద్రా! నాడు సభాముఖమున “బ్రతికినన్నాళ్ళు రారాజుననిపించుకొన వలె” నని మీ అమ్మతో చెప్పిన మాటలు గుర్తులేవా,” అని ఎద్దేవ చేస్తాడు.
దుర్యోధనుడు, పాండవులతో:
ఏలుము రాజ్యమంతయు మహీంద్రుడ; నేను పరిత్యజించితిన్
కాలము చేరువౌదనుక కానలలో తపమాచరింతు నే-
నాల మొనర్పగా తగిన యాయుధముల్దరి లేవు యుద్ధ మిం-
కేల? భవన్మనోరథము లే నొడగూర్చుచు నుండ నిత్తరిన్
వెంటనే ధర్మరాజు, “ దాన పూర్వకముగా గ్రహించుటకు మేము బ్రాహ్మలము కాము. నిన్ను కడతేర్చుటయే మా మనోరథమ్ము కాని, రాజ్యమేలుటయే కాదు. కావున తడయక, వెడలి రమ్ము,” అని హెచ్చరిస్తాడు.
తరువా త భీమునితో గదా యుద్ధం. కృష్ణుడు సైగచేసి దుర్యోధనుని తొడలపై భీమునిచే కొట్టించడం, ఆతడు తొడలు విరిగి నేల కూలడం జరుగుతుంది.
దుర్యోధనుడు ఆఖరిగా, కృష్ణునితో, “ గోపాలా! ఇది ధర్మమునకు కాలము కాదు. కలికాలము వచ్చినది. కపటోపాయము లేని వారికి జయము లేదు. ఇది వినుము,” అని ఈ పద్యం పాడతాడు:
చదివినాడను వేద శాస్త్రంబు లర్థుల-
కిచ్చినాడను మనోభీప్సితమ్ము-
లేలినాడను భూమి ఏకాత పత్రంబు
ప్రజలను సంతోష పరచినాడ
జరపినాడను పెక్కు జన్నముల్పుత్రుల-
గాంచితి పూనరకంబు వాయ
మెప్పించినాడ సుమిత్రుల నార్జించి
పొందినాడను సర్వభోగములను
క్షత్రియులచేత మిగుల పొగడ్తగన్న
కదన మరణంబు కంటి నా కంటె భాగ్య-
శాలి సుకృతి వదాన్యుండు చతురమతియు
పండితుండెవ్వడేమి లోపంబు నాకు?
బందుగులు లేక సైనయసంపదలు లేక
సంతసము లేక తగిన వంశంబు లేక
బహుళ దుఃఖాకరంబగు పాడునేల
ఈ యుధిష్టిరు చేత మోయింపుమయ్య.
మిగిలిన భాగాలు ఏవీ ప్రసిద్ధికెక్కినవి కావు. దుర్యోధనుని మరణం, దేవతల పూలవర్షం.
నాటకం అయ్యేటప్పడికీ, తెల్లవారుఝామున కోడికూత వినపడుతుంది. నిద్రపోయిన పిల్లలని బుజాలకెత్తుకొని ప్రేక్షకులందరూ ఆనందంతో ఇంటికి.
ఇవి మరిచిపోకూడని పద్యాలని నా ఉద్దేశం. మీరేమంటారు?
(ఈ మధ్య, షణ్ముఖి ఆంజనేయరాజు గారి కుమారుడు, ఈ నాటకాలని ప్రదర్శిస్తున్నట్టు విన్నాను. మూడు సంవత్సరల క్రితం, విశాఖజిల్లాలో ఒక కుగ్రామంలో, “రాయబారం,” వేస్తున్నారని చూడటానికి వెళ్ళితే, షణ్ముఖి జూనియర్ గారి కారు పాడయి, ఆయన రాలేక పోయారు. స్థానికంగా ఉన్న ఒక కుర్రాడు కృష్ణుడి వేషం వేశాడు! అతను బాగా పద్యాలు పాడలేకపోయినా, పద్యాలన్నీ విని ఆనందించారు, ఆఊరి జనం!)
unknown అభిప్రాయం:
September 1, 2006 10:31 am
వేలూరి గారికి,
అదిగో ద్వారక లో రధ్య అంటే మార్గము అనా లేక రధాలు అనా? మీరు ప్రతిపదార్ధం రాయలేదని గమనించేను కానీ రధాలు అని రాస్తే అనుమానం వచ్చింది.
సెలవు.
Rao Vemuri అభిప్రాయం:
September 3, 2006 7:27 am
ఉద్యోగవిజయాలు సిలికాన్ఆంధ్ర వారు ప్రదర్శించగా మొట్టమొదట సారి చూశాను. గుమ్మడి గోపాలకృష్ణ కృష్ణుడు. వేలూరి గారి వ్యాసం చదువుతూ ఇదే నాటకం మన పల్లెటూళ్ళల్లో చూసుంటే ఎలాగుండేదో ఊహించుకోగలిగేను.
డా.ఇస్మాయిల్ పెనుకొండ అభిప్రాయం:
September 4, 2006 6:11 pm
గురువు గారూ…
మీ ఈ వ్యాసం చదివాక చిన్నప్పుడు మా పెత్తాత అయిన బాబయ్య చేనులో నుండి చెఱుకు గడలు తెచ్చిఇచ్చి,దగ్గర కూర్చోబెట్టుకొని తన కంచు కంఠం తో “అలుగుటయే యెరుంగని…” అని తన్మయత్వం తో పాడే పద్యాలు గుర్తొచ్చాయి! శ్రీశ్రీ గారంటే నాకు చాలా అభిమానమున్నా ప్రజాకవులు అన్న బిరుదు తిరుపతి వెంకట కవులకు తగినది.
Akkiraju Bhattiprolu అభిప్రాయం:
September 5, 2006 12:45 am
వేలూరి గారూ…
చాలా పద్యాలు రేడియోలో వింటమో లేకపోతే మా నాన్న గారు పాడగా వింటమో తప్పా ఇలా ఒక చోట చదవగలగటం మీ వల్లనే సాధ్యమయింది. హడావిడిగా వినేటప్పుడు అర్థమవని చమత్కారాలు కూడా మీ వ్యాసం ద్వారా వివరణల ద్వారా తెలుసు కున్నాను. మీ లాంటి వాళ్ళు ఎంత ఎక్కువరాస్తే మాలాంటి వాళ్ళం అంత ఎక్కువ నేర్చుకుంటాం. ఏమన్నా అనండి, మీ వ్యాసం చదవగలను కానీ, ఇప్పటికీ తిరపతి కవుల పుస్తకాల్ని కొనిచదవలేను… ఎందుకో?
అయితే, ఈ వ్యాసంలోకి ప్రజాకవులంటే ఎవరు అనే చర్చని తేవటం అవసరమా? అసలు శ్రీశ్రీ ప్రసక్తి ఎందుకు?
ప్రజలు అంటే మీరు చెప్పిన నిర్వచనాన్ని అంగీకరించాక…. కవుల గురించి ఆలోచిద్దాం.
1. ప్రజాకవులు అంటే మీరు చెప్పినట్టే పాపులర్ కవులేనా?
2. లేక ప్రజల గురించి రాసిన కవులా?
3. లేక పై రెండులక్షణాలూ అటూ ఇటుగా సమంగా ఉన్న కవులా?
మొదటి లక్షణమయితే మీరు చెప్పినట్టు తిరుపతి కవులతో పాటు సముద్రాలనీ, ఆత్రేయనీ, వేటూరినీ, కూడా లెక్క వేయాలి.
రెండో లక్షణమయితే శ్రీశ్రీ, గురజాడల్ని లెక్క వేయాలి.
మూడో లక్షణ మయితే గద్దర, వంగపండు, ఎంకన్న లాంటి వాళ్ళని లెక్క వేయాలి.
కాదంటారా?
అక్కిరాజు భట్టిప్రోలు
ప్రసాద్ అభిప్రాయం:
September 5, 2006 8:55 am
ప్రజాకవులంటూ మొదలు పెట్టి ఒక్క తిరుపతి వేంకట కవులతో సరిపెట్టడం ఏమాత్రం ఉచితంగా లేదు. వారి మీద మీకున్న ప్రేమని “ప్రజల్లో తిరుపతి వేంకటకవులు” అని శీర్షిక పెట్టి వ్రాసినా సరి పోయేది.
మొత్తానికి పసందైన పద్యాలని మళ్ళీ గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు.
– ప్రసాద్
http://charasala.wordpress.com
విప్లవ్ అభిప్రాయం:
September 5, 2006 2:03 pm
“గతశతాబ్దపు” అని పేరు పెట్టారు కనుక సరిపోయింది. లేకపోతే ఇప్పటి
“ప్రజాకవులు” మీకొక కవిత్వపు noose తయారు చేసి వేలాడ దీసే వాళ్ళు.
గత శతాబ్దం అనే కంటే, శ్రీ శ్రీ కంటే ముందు ప్రజా కవులు అంటే మీ సొమ్మేం
పోయింది? శ్రీ శ్రీ ని అనవసరంగా గొప్పవాణ్ణి చేస్తామని భయమా :).
అయినా సరే, మొదట “ప్రజల గురించి” కొద్దిగా:
“ఇకపోతే, ఎవరయ్యా నీ ప్రజలు అని నిలదీసి అడిగితే, నా సమాధానం: వీధి
బడికెళ్ళి చదువుకోని వాళ్ళు, వీధిబడికి కూడా వెళ్ళలేని వాళ్ళు, ఏ రకంగానూ చదువుకోటానికి అవకాశంలేని వాళ్ళు, ఏదో ఒక చిన్న బడికెళ్ళి ఓ న మా లు నేర్చుకోని కాస్తోకూస్తో చదవడం చాకలిపద్దు రాయడం నేర్చుకున్న వాళ్ళు. వీళ్ళు అసలు సిసలైన ప్రజలు. మన మహానగరాలు, పెద్ద పెద్ద పట్టణాలూ వదిలేస్తే, నూటికి డెబ్భైమందో, ఎనభైమందో నేను పైన నిర్థారించిన
ప్రజలకిందే జమా కట్టచ్చు. ఈ ప్రజల్లోకి వెళ్ళి బలపడ్డ కవిత్వం ప్రజా
కవిత్వం.”
ఈ ప్రజల నిర్వచనం కూడా “గత శతాబ్ది” కి చెందేదే అనుకుంటాను.
ఇప్పటి ప్రజలు ఏ కొద్ది మందో తప్పితే పట్టణ లేక నగర వాసన, పత్రికల నీడ సోకని వాళ్ళు తక్కువ.
1991 జనాభా లెక్కల ప్రకారం అప్పటికే 25 శాతానికి పైగా పట్టణాల్లో ఉన్నారు, 2001 వచ్చే సరికి అది మూడవ వంతుకు చేరింది. అక్కడితో సరిపెట్టకుండా ఒక ఎస్టిమేట్ ప్రకారం ఈ దశాబ్ది చివరికి యాభై శాతానికి పైగా పట్టణ వాసులే అవుతారు మన జనాభా.
మీరన్న “ప్రజ” ఇప్పటి వాళ్ళు కాదు అనేది కొంత వరకూ క్లియర్. అంతే కాదు, ప్రజల కు నిర్వచనం మారుతుంది ఎప్పటికప్పుడు, స్థలాన్ని బట్టి, కాలాన్ని బట్టి, అవసరాన్ని బట్టి కూడా. (ఉదా: అమార్త్య సేన్ పుస్తకం ఐడెంటిటీ & వయలెన్స్).
ఇక ప్రజాకవుల గురించి:
“ఈ ప్రజలని ఉత్తేజ పరిచి, వాళ్ళకి ఉత్సాహాన్నిచ్చిన కవిత్వం రాసిన వాళ్ళు
ప్రజా కవులు. ”
ప్రజలు మారినప్పుడు కవిత్వం మారుతుందన్నమాట ఈ ప్రజా కవుల Definition పట్టుకుని వెళితే. ఏది ఉత్సాహాన్ని ఇస్తే, అది ఎట్లా డెలివరీ చేస్తే
వస్తుందో తెలిస్తే ప్రజాకవుల కు కావలసిన మినిమం క్వాలిఫికేషన్ తీరుతుందనుకుంటే ఇక సాధనాలదే ప్రధాన పాత్ర అవుతుంది, ఆ రాసింది ప్రజల నోళ్ళలో నానడానికి. నాటకాలు, అవధానాలు తిరుపతి కవులను ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్ళాయో ఆ తరువాత సున్నమేసిన తెల్ల గోడలు, సినిమాలు, ఇప్పుడు పత్రికలు శ్రీ శ్రీ ని (అతన్ని అనుకరించే వాళ్ళను) ప్రజల్లోకి
తీసుకెళ్తున్నాయి.
తిరుపతి వెంకట కవులు మీరిచ్చిన డెఫినిషన్ accept చేస్తారని నేననుకోను.
ఒక వేళ చేస్తే అది కూడా ముపటి మాట కిందికే వస్తుంది. గతం గురించి
చెప్పేటప్పుడు అనుకోవలసినమాట.
ఇక ఇప్పటి సంగతి: వీధి నాటకాలు ఇప్పటి ఊళ్ళలో అంతగా కానరావు. ఎప్పుడో ఏడేండ్లప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో రాత్రి పూట “బావా ఎప్పుడు వచ్చితివీవు …” లాంటివి వింటూ నాటకం చూస్తూ అక్కడే పడి నిద్రపోయి, సగంలో మళ్ళీ “చెల్లియో చెల్లకో …” అంటూ మొదలు పెట్టిన గొంతుకో, హార్మోనియం దెబ్బకో మళ్ళీ దడుచుకుని లేచి ఇక నిద్ర ఎగిరిపోయి ప్రొద్దున ఆ కప్పు చాయ పడే వరకూ చొప్ప బెండ్లతో కచ్రపు బండ్లు చేసుకోవటం వంటివి తీరి రెండు దశాబ్దాలైనా అవుతుంది అనుకుంటాను.
ఇప్పటి రోజుల్లో కొన్ని పట్నాల్లో, నేను కర్నూలు, వరంగల్లు లో కొద్దిగా
చూసాను, నాటక పోటీల పేరుతో; కానీ చాలా వరకు సాంఘికాలే అవి. మరీ గుంటూరు, గోదావరి జిల్లాల్లో అయితే ఇప్పట్లో దసరా సెలవుల్లో రాత్రిపూట స్టేజీ మీద జరిగేవి నాటకాలు అని వెళితే వేలూరి గారు “శివ శివా” అనుకుంటూనో లేక “శెవ్వా ఇదా వేషం” అంటూ అట్లాంటా పరిగెత్తుకు వచ్చేస్తారనుకుంటాను. (అది నా ఊహే, ఆయన అక్కడే పీఠం వేసుకు కూర్చుంటారేమో మరి నాకెరుక లేదు.)
చెప్పేదేంటంటే, ఇదివరకు ప్రజలకు సాహిత్యాన్ని చేరువ గా తెచ్చే ప్రయోగం
నాటకమైతే ఇప్పటి సాధనాలు వేరు అని. ఇప్పుడు పేపరు చదవని వాళ్ళు అతి తక్కువ. ఒక్క ఈనాడు పత్రికను కోటిన్నర మంది చదువుతారట వాళ్ళ లెక్కల ప్రకారం. ఉన్నది ఏడెనిమిది కోట్లే కదా, పిల్లలను తీసేస్తే మిగిలేది
అయిదు కోట్లే. ఇక పత్రికలు చదవని వాళ్ళు ఆ లెక్కన అతి తక్కువ.
అందుకే ఇప్పటి పత్రికల్లో వచ్చేవి ప్రజా కవితలు, కవిత్వం అనిపిస్తాయి ఈ
రోజుల్లో. అవి తవికలే కావచ్చు, మరింకేమైనా కావచ్చు. ఏ పత్రికయినా చదివే వాళ్ళను ఉద్దేశ్యించింది కాబట్టి వాళ్ళనుద్దేశించిన రాతలే ఎక్కువగా
వస్తయి. అవి ఎటువంటివి వస్తాయి అనడానికి పెద్ద ఊహాగానాలు అక్కరలేదు. చికెన్ గున్యా మీద సీస పద్యాలు వస్తయి. మొసపొటేమియా మీద పొటేలు రంకెలు వినిపిస్తయి. ఇదంతా ప్రజా కవిత్వమే.
దీన్ని బట్టి చూస్తే ఎవరైతే ఆ కాలపు మాధ్యమాన్ని, అప్పటి పరిస్థితులకనుకూలంగా, అతి ప్రతిభావంతంగా ఉపయోగించుకుంటారో వారే ప్రజా కవిగా మిగులుతారు, మిగతా వాళ్ళు ఉత్తుత్తి కవులుగా నిలబడి జాతర చూడవలసిందే.
తిరుపతి వెంకట కవుల నాటకాల్లో పద్యాలు అప్పటి కాలంలో ప్రజా కవిత్వం అయితే, ఇప్పటి ప్రజా కవిత్వం ప్రతి రోజూ అచ్చయే పేజీల మధ్య కనిపిస్తుంది.
చివరగా, వాళ్ళే ఇప్పటి కాలంలో ఉండేదుంటే అరాఫత్, ఒసామాల నుండి అంతర్జాతీయ ద్రవ్య నిధి దాకా పొయిట్రీ రాసి ఉండే వాళ్ళే. ఇదేం పోయేకాలమో ఇంతగా చదువుకుని, ఇంతింత విషయాల గురించి తక్కువ పదాలతో పొయెట్రీ రాయగల ఇప్పటి కవులు వాటినే ఇంకొంచెం సాగదీసి వ్యాసం రాయొచ్చుకదా. “ఈనాడు” లాంటి అటూ ఇటూ కాని పత్రిక(లు), వీళ్ళు వ్యాసాలు రాస్తే మీ పేరు పెట్టి వేయం అనే ఒక దరిద్రపు రూలు పెట్టినందుకే మనకు కవులెక్కువ, వ్యాస కర్తలు తక్కువ అని నా అనుమానం.
ఈ లెక్కన “గత శతాబ్దపు” ప్రజాకవుల పక్కన ఇప్పటి ప్రజా కవులను
నిలబెడతానంటే కుదరనిపని. అసలు ప్రజాకవి అనే పదమే అనవసరం అని outlaw చేస్తే మంచిదని నాకనిపిస్తుంది, లేకపోతే “మహాకవి” అనే పదానికి
బహుపదార్ధాలు వాటికి మళ్ళీ తాత్పర్యాలు చెప్పుకున్నట్టే ఇదీ తయారవుతుంది, only more often we get to define and redefine it.
విప్లవ్
Veluri Venkateswara Rao అభిప్రాయం:
September 7, 2006 2:27 pm
ఆలస్యంగా సమాధానాలిస్తున్నందుకు మన్నించండి. ముందుగా రథ్య అర్థం గురించి:
రథ్య అంటే రాజమార్గము అనీ, రథసమూహము అనీ రెండర్థాలూ ఉన్నాయి ( చూ: సూర్యరాయాంధ్ర నిఘంటువు, ఆరవ సంపుటము, 648 వ పేజీ, లేదా చూ: శబ్దరత్నాకరము, 922 వ పేజీ)
నాకూ శ్రీశ్రీ అంటే చచ్చే ఇష్టం, వల్లమాలిన అభిమానం. ఏ ప్రజలకి అతను “ప్రజాకవి” గా చలామణి అవుతాడో నావ్యాసంలో (నావ్యాస పరిథిలో అంటే ఇబ్బంది తక్కువ అవచ్చు!) చెప్పిందానికన్నా ఎక్కువగా చెప్పేందుకు ఏమీ లేదు.
గద్దర్, వంగపండుల పాటలని ముందుగా “కవితలు”గా బేరీజు వెయ్యాలి. అందుకు చెయ్యవలసిన కృషి వేరే ఉంది. (ఆ పని నేను మొదలెట్టా!)అసలు, ఆపాటలు కవిత్వమా? కాదా? అని నిర్థారణ చేసుకున్న తరువాత, వారు ప్రజాకవులా కారా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. (నన్ను అపార్థం చేసుకోకండి, అక్కిరాజు గారూ! ఆహా! ఎంచక్కని సినిమా డైలాగు!)
ఒకానొకప్పుడు, “తెలుసా”లో గద్దర్ పై నేను ఒక పెద్ద వ్యాసం రాసిన గుర్తు. ఆ వ్యాసం అంతా అతని ఒకేఒక్క పాటమీద! అప్పట్లో, కొందరు నన్ను చీవాట్లు కూడా పెట్టారు. అదివేరే విషయం, అనుకోండి.
గద్దర్ పైవ్యాసంకూడా త్వరలోనే ( సమీక్షకులు “సై” అంటేనే సుమా!) ఈమాట లో రావచ్చు.
విప్లవ్ గారు చాలా విషయాలు చెప్పారు. సాంఘిక చరిత్ర గురించి ఆయనకి నేను పాఠం చెప్పగల సమర్థుణ్ణి కాదు. అయినా, ఆయన నన్ను పూర్తిగా “అపార్థం” ( అబ్బ! ఇంతకన్నా మంచి మాట తెలుగులో లేదు కాబోలు!) చేసుకున్నట్టు అనుమానం గా వుంది. వ్యక్తిగత అభిప్రాయాలని మన్నించమని మా తెలుగు మేష్టారు ఎప్పుడో చిన్నప్పుడే, శొంఠిపిక్క పెట్టి మరీ నేర్పారు! అందుకు బద్ధుణ్ణి, ఇప్పటికీనూ!
ఇతి.
అభివాదాలతో, — వేలూరి వేంకటేశ్వర రావు.
విప్లవ్ అభిప్రాయం:
September 8, 2006 6:32 am
వేలూరి గారూ,
ఈ యూనికోడ్ తెలుగు ఎప్పుడో ఒక సారి నన్ను పప్పులోకి దింపుతుంది అని తెలిసీ ఈ గెస్ట్ బుక్ లో రాయకుండా ఉండలేక పోయాను, ఇదీ ఒక వ్యసనం గా మారే ప్రమాదం ఉందనిపిస్తుంది. ఏదో రాస్తూ పోయాను ఎట్లాగైనా ఈ “ప్రజాకవి” అనే అనవసర సిద్ధాంతాన్ని, నిర్వచనాన్ని కొంతైనా discredit చేయాలనే ఉద్దేశ్యంతో.
నా మటుకు నాకు ఇది ఒక నామ వాచకం లా లేక ఒక బిరుదు గా వదిలేస్తే బాగుంటుందనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనకు ప్రజాకవి కాళోజీ ఉన్నారు. ఆయన జన్మదినం సందర్భంగా రేపు (సెప్టెంబర్ 9 న) తెలంగాణ జిల్లాల్లో చాలా వరకు ఉత్సవాలు కూడా జరుగుతున్నయి. మీరిప్పుడు తిరుపతి వెంకట కవుల్ని ప్రజాకవులు అని చెబితే ఎవరో మాష్టారుకు ఇది నచ్చి అదే మాట తెలుగు పుస్తకాల్లోకి ఉన్నది ఉన్నట్లు దింపితే అప్పుడు నాలాంటి వాడొకడు తన పాళీని జియో పొలిటికల్ ఇంకులో ముంచి ఇవ్వాళ కాక పోతె రేపు ఇట్ల రాయ వీలయితది:
“బోగపోళ్ళ బాగోతపు పద్యాలను మా నెత్తిన /ప్రజల కవిత్వం పేర రుద్ది / సౌహార్ద్రం, సమైక్యం భాషంటివి / నా యాసను చిన్నబుస్తివి / నీ పాఠం నాకొద్దు / ప్రజలు నేను, కవిత్వం నాది, ప్రజాకవివి నువ్వెట్లయితవు”
అందుకే: వెల్చేరు గారు సెప్టెంబరు తెలుగు నాడిలో రాసిన తిరుపతి వెంకట కవుల పరిచయం చాలు, మీ వ్యాసం కూడా మొదటి నాలుగు పేరాలు (టైటిల్ తోసహా) మినహాయించి, “1999 జూన్ జులై ” కాడ్నించి అద్భుతం. అది నా అసలు అభిప్రాయం. ఆ మాట డొంక తిరుగుడుగా చెప్పాలనుకోవటం నా తప్పే.
అన్నట్టు, తొడ పాశం పెట్టిన సారు మీదికి ఎదురు మళ్ళానని నన్ను పక్క సెక్షనులో తోసారు, అప్పుడు ఏదో లే అని సరిపెట్టుకుని ఉంటే ఇప్పుడిట్లా తయారయి ఉండే వాడిని కాదేమో.
మీరు తప్పుగా అనుకోకపోతే ఇప్పటికే ఎక్కువ రాసాను,
ఇక సెలవ్, విప్లవ్