5.
మొత్తం ఉద్యోగ విజయాలు నాటకం వేసేటప్పుడు నాలుగో అంకం బాగా కుదించి వేస్తారు. నా అనుభవంలో బహుశా రెండుసార్లు చూశానేమో, ఈ అంకం కూడా ప్రదర్శనలో ఒక భాగంగా! తిరుపతి వెంకట కవులు కర్ణ పాత్రని ఈ అంకంలో అత్యద్భుతంగా పోషించారు. ఇందులో, కృష్ణుడికి, కర్ణుడికీ, చాలా చక్కని పద్యాలున్నాయి. ఈ పద్యాలు “రేడియో నాటకాలు” విన్న వాళ్ళకి బాగా తెలిసే వుంటాయి. ఇవి, తప్పక గుర్తు పెట్టుకోవలసిన పద్యాలు!
కృష్ణుడు కర్ణుడిని “బావా!” అని సంబోధించి:
కన్నె ప్రాయమునందు భాస్కరునికరుణ
పదినెలలు మోసి నిన్ను కన్న పడతి కుంతి
చేరగా దీసి నిన్ను పెంచినది రాధ
నీవు రాధేయుడవు కావు నిశ్చయముగ.
“దుర్యోధనుడు సంధికి ఒప్పుకోడని తెలిసికూడా నేను వచ్చాను; నేను వచ్చిన అసలు కారణం: ఈ నిజవిషయం నీకు చెప్పి, నిన్ను నావెంట తీసికొని పోదామనుకుంటున్నాను. నీవు కూడా పాండవుడవే!” అని చెప్పుతూ,
అంచితులైన బందుగుల అందరిముందఱ చెప్పి నిన్ను మె-
ప్పించెద, కుంతి చేత, రవి చేత నిజంబని నీకు సాక్ష్య మి-
ప్పించెద ఫల్గుణ ప్రముఖ వీరులు కొల్వగ యెల్లభూమి యే-
లించెద నచ్ఛకీర్తి విరళీకృత సర్వదిగంతరంబుగన్
“అంతే కాదు. నిన్ను చక్రవర్తిగా పాండవులందరూ కొలిచేటట్టు చేస్తాను. ద్రౌపది నిన్ను ఆరవ భర్తగా స్వీకరిస్తుంది,” అని కూడా చెప్పుతాడు. చూడండి, కృష్ణుడి diplomacy! అతని పన్నాగం!
ఏ సతి వహ్నిలోన జనియించెను జన్నమొనర్చు వేళ ము-
న్నే సతి పెండ్లినాడు నృపులెల్ల పరాజితులైరి క్రీడిచే
నేసతిమీది మోహమున నింతలుచేసిరి రాజు నీవు? ని-
న్నాసతి పెండ్లియాడ గల దాఱవ భర్తగ సూర్యనందనా!
కర్ణుడు “ కృష్ణా! ఇంద్రుడు నా కవచకుండలము అర్థించడానికి వచ్చే సమయంలో, సూర్యుని వలన నేను నా కథ కొంత విన్నాను. నువ్వు, నాయందు సౌహర్దం తో పూర్తి కథ చెప్పావు. అయినా,
సూతుని చేతికిం దొరికి సూతకళత్రము పాలు ద్రావి, యా-
సూతుని అన్నముం గుడిచి సూతకులాంగనయందు నందన
వ్రాతము గాంచి నేటికొక రాజకుమారుడ నంచు తెల్ప నా-
చేతము సమ్మతించునె, ఇసీ! యెవరేగతి సిగ్గు మాలినన్
కామము చేతగాని భయకంపిత చిత్తము చేతగాని ఈ-
భూమి సమస్తమేలుకొను పూనిక చేతనె గాని నేను నా-
సేమము గోరి చుట్టముల స్నేహితుల న్విడనాడి నేడు మ-
త్స్వామి సుయోధను న్విడిచి వత్తునె? వచ్చిన మెత్తురే జనుల్
“అర్జునుడికి భయపడి, నేనూ పాండవుడనే అని నీతోకలిసి ఒక కొత్త పన్నాగం పన్నానని, నిన్నూ నన్నూ కూడా జనులందరూ దూషిస్తారుగదా! ధర్మరాజు, నిత్యసత్యవంతుడు. నేను అగ్రజుడనని తెలిసిన అతడు రాజ్యపరిత్యాగము చేయును గదా! ఆతనికి, నా పుట్టుక గురించి తెలియనియ్యకుము,” అని ప్రాధేయ పడతాడు.
కృష్ణుడు నిష్క్రమించగనే, కుంతి ప్రవేశించి, “ నీవు కౌంతేయుడవే గాని, రాధేయుడవు కావు,” అని చెప్పగా:
కర్ణుడి సమాధానం:
ఇంచుకయైన లోగరుణ యెంచక కన్నకుమారు గంగ క-
ర్పించిన గొడ్డురాల విక ప్రేముడి యెక్కడిదమ్మ నీకు? నా-
యంచితమైన రాచకొల మాఱడిపుచ్చితి సూతధర్మము
ల్గాంచితి నీటపుచ్చిన కులంబిక వచ్చునె? సంధి చేసినన్
పంచపాండవులను మాటను వేరు చేయుట నా అభిమతము గాదు. అదియునుగాక,
సిన్నతనంబునుండి దయచేసి రమావిభవంబొసంగి నా-
యున్నతి గోరి నాపయి జయోద్ధతి పూంచిన రాజుకన్న నా-
కన్నలు తమ్ములుం కొడుకు లాప్తులు యెక్కువ కాదు వాని దీ-
నున్నువప్రాణి వాని విడనాడుట నాపని కాదు మానినీ!
కుంతి వెంటనే, “పంచపాండవులను మాట వేరు చేయుట నీ అభిమతము కాదన్నావుకదా! అట్లే నాకు వరమిమ్ము,” అని అడగ్గానే:
సమరమున చేత పడినను చంప నేను
ఫల్గుణుడ దప్ప తక్కిన పాండుసుతుల
నేను మడసిన నున్నవా రేగురుందు-
రతడు మడసిన నాతోడ నైదుగురము.
కుంతి “ఉపపాండవులేవురపైన కూడా దయ ఉంచుము,” అని కోరుతుంది. కర్ణుడు “ నీ అభిమతమ్మట్లే నెరవేర్చెదను,” అంటాడు.
ఐదవ అంకం, ఆరవ అంకం ప్రదర్శించడం నేను ఎప్పుడూ చూడలేదు. కృష్ణుడు, తన సంధి విఫలమైనట్టు చెప్పడం, ధర్మరాజు బాధ పడటం, కృష్ణుడికి జరిగిన పరాభవానికి, పాండవులకు విపరీతమైన కోపం రావడం, ఐదవ అంకం సారాంశం. అర్జునుడు యుద్ధవిముఖుడైనప్పుడు, అర్జునుడికి “ నీవు నిమిత్తమాత్రుడివి! ఈ యుద్ధం అనివార్యం,” అని కృష్ణుడు “విశ్వరూపం” చూపడం, అర్జునుడు యుద్ధానికి సన్నద్ధుడు కావడానికి కృష్ణుడు చేసిన బోధన, ఆరవ అంకం సారాంశం.