గత శతాబ్దంలో ప్రజాకవులు
4.
ఇక మూడవ అంకం. ఈ అంకమే ప్రసిద్ధికెక్కిన “కృష్ణరాయబారం.”
ఈ అంకంలో చాలా పద్యాలు పల్లెల్లో చాలామందికి కంఠతా వచ్చు. ఇప్పటికీ, పద్యం మొదలు అందిస్తే చాలు, ఈ రాయబారంలో పద్యాలు రాగయుక్తంగా పాడగలరు.
ఒక్క శ్రీకృష్ణ రాయబారమే నాటకంగా వేస్తే (ఏలూరులో బందా కనకలింగేశ్వర రావు గారి ప్రభాత్ థియేటర్స్ వారు అప్పుడప్పుడు కృష్ణరాయబారం మాత్రమే వేసేవారు. బందా వారు కృష్ణుడు! ఆయన, పద్యం చక్కగా విడదీసి, “గుత్తివంకాయ కూరోయి బావా,” అన్నధోరణిలో పాడేవారు. ఆయన ఎక్కడ కృష్ణుడిగా వేషంకట్టినా, ప్రేక్షకులు ఆయనచేత “గుత్తి వంకాయ కూరోయి బావా,” అనే పాట పాడించుకునేవాళ్ళు.)
మూడవ అంకంలో, కర్ణుడికి, అశ్వత్థామకి, భీష్ముడికి, సుయోధనుడికీ, చక్కటి పద్యాలున్నాయి. మచ్చుకి ఒకటో రెండో ఆ పద్యాలు చెప్పుకొని, ఎకాయెకీ రాయబారంలో కృష్ణుడి పద్యాలు గుర్తు చేసుకుందాం!
కృష్ణుడు చిరునవ్వుతో కౌరవ సభకి వస్తాడు. వచ్చి, ధృతరాష్ట్రుడితో:
“మామా! ధార్తరాష్ట్రులకు పాండవులకును సంధి గావించి ఈ రాజలోకమునెల్ల కాపాడుమని నిన్ను యాచించుటకై పాండవ దూతగా వచ్చితిని.
తమ్ముని కొడుకులు సగపా-
లిమ్మని రటులిష్టపడవయేనియు నైదూ-
ళ్ళిమ్మని రైదుగురకు ధ-
ర్మమ్ముగ నీ తోచినట్లు మనుపుము వారిన్”
అని చెప్పి పాండవుల గురించి ఇలాగ అంటాడు.
పతితులు గారు నీయెడల భక్తులు, శుంఠలుగారు విద్యలం-
చతురులు, మంచివారు, నృపసంతతికిన్ తలలోని నాల్క ల-
చ్యుతునకు కూర్చువారు, రణశూరులు, పాండవులట్టివార లీ-
గతి నతిదీనులై యడుగగా నిక నేటికి సంశయింపగన్
ధృతరాష్ట్రుడు “ అల్లుడా! వాసుదేవా! సర్వమూ తెలిసి నాపై నెపము ఎందుకు పెట్టుచున్నావు? అని అంటూ,
గ్రుడ్డినగుటచేత కొంతకాలం బేలె
పుడమి పాండురాజు; కొడుకులిప్పు-
డేలుకో దొడంగి రీ కారణంబున
గ్రుడ్డిదయ్యె మాటగూడ నాకు.
కృష్ణుడు తరువాతి పద్యంలో “నీ కట్టిన పాపమెట్టిదియొ,” అని అనగానే, కర్ణుడు “అధిక ప్రసంగము మానుము,” అని కృష్ణుడితో అంటాడు.
వెంటనే భీష్ముడు, “కృష్ణుని మాట అటుంచుము, సూతపుత్రా! నీ అధిక ప్రసంగమునకు అధికారమెవ్వరిచ్చినారు?” అని మందలిస్తూ,
చెప్ప దొరకన్న విషయం
బొప్పో! తప్పో; ముగింపకుండగ నడుమన్
తప్పనుట తగునె సభలో
నెప్పుడు గురునంతవాని కేనియు కుమతీ!
గురువంతవాడు కూడా అవతలవాడు చెప్పేది పూర్తికాకండా మధ్యలో మాట్లాడటం తప్పు, అంటే interrupt చెయ్యడం నాగరిక లక్షణం కాదు అని అర్థం. ద్రోణుడు కూడా, కర్ణుడిని మందలిస్తే, కర్ణుడు అంటాడు: “కూడు గుడ్డ పెడుతున్న రాజుని దూషిస్తే మాట్లాడకుండా కూర్చోడానికి నేను ముదుసలి భీష్ముడిని కాదు; అతన్ని వెనకేసుకొచ్చే ద్రోణుడినీ కాదు,” అని అనగానే, అశ్వత్థామ, వికర్ణుని మధ్య కాస్త ఘర్షణ జరుగుతుంది. ఇక్కడ అశ్వత్థామకి ఒక చక్కని పద్యం:
కచ్చియ మాన్పి కౌరవుల గాచు తలంపున సంధి సేయగా
మచ్చిక నేగుదెంచి హరి మంచియొ చెడ్డయొ చెప్పుచుండగా
నచ్చపు రాజ భక్తి గల దంతయు వెల్లడి చేయుభంగి నీ
మచ్చరి సూతపుత్రుడభిమానముచే కలహింప నేటికిన్?
ఈ మాటల యుద్ధం తరువాత, దుర్యోధనుడు, తల్లి తండ్రులనుద్దేశించి ఈ పద్యం పాడతాడు:
ఐదూళ్ళిచ్చిన చాలును
లేదే నని సేత నిజము లెండనుచున్ దా-
యాదులు కబురంపిన నే-
నీదలుచుట వారి కోడుటే యగు గాదే?
విదురుడు, భీష్ముడు చెప్పిన మాటలు కూడా దుర్యోధనుడు పెడచెవిన పెడతాడు. ఇక్కడ విదురుడికి ఒక పద్యం, భీష్ముడికీ ఒక పద్యం; ఈ రెండు మంచి పద్యాలే!
విదురుడు దుర్యోధనుడితో:
వాసవితోడ పోరగలవాడని కర్ణుని యందు నీవు పే-
రాస గలట్టి వాడవు కదా ఇపుడిర్వుర పోరచేసి యం-
దోసరినట్టివాని తెగ యోడినటుల్మన మెంచుకొంటిమే
నీ సమరంబు మాను జగమెల్లరకుం కడు సంతసంబగున్
వెంటనే భీష్ముడు:
కవ్వడితోడి పోరితము కర్ణునకిష్టము వానిచేత నా-
కవ్వడి నొవ్వ చేసి రణకార్యము తీర్చుట నీ మనోరథం-
బివ్వరుసన్ ఫలించుగద, ఇర్వురకోరుకు లెల్ల రాజులుం
జవ్వకు బాసి సంతసముచే మన చూచెదు రాలు బిడ్డలున్
సుయోధనుడు, భీష్మ,ద్రోణ విదురులు పాండవ పక్షపాతులని మరీ మరీ దెప్పుతాడు. కర్ణునిపై తనకున్న విశ్వాసం చెప్పుతూ, ద్రోణుని దూషిస్తాడు. కర్ణుడు కూడా ద్రోణుని పరిహసిస్తాడు. ఈ అవమానం భరించలేక, అశ్వథ్థామ లేచి పోబోతూ, ఈ క్రింది పద్యం పాడతాడు:
మీరంబోకుము పొల్లు మాట వినికిన్మీరాజు రండంచు మ-
మ్మారాధించిననాడె వచ్చెదము లేరా (ద్రోణుని వైపు, కృపుని వైపూ చూసి) తండ్రి రావయ్య మా-
మా! రా పోదము పోరికై యెవరినీక్ష్మాపాలుడాసించెనో
వారే గెల్తురు వారి వారల బలావాల్లభ్యముల్చూచెదన్
కృష్ణుడు, వారించి, దుర్యోధనుడితో, ఈ మాటలు అంటాడు:
బావా! నీకొల్వు కూటము క్రమముగా రణకూటమగుచున్నది. పదుగురుండగ, నే చెప్పబోవు పల్కులు గూడ నాలింపుము:
(ఈ డైలాగు, ప్రేక్షకులందరికీ వచ్చిందే!బాగా నచ్చిందే కూడాను! కృష్ణుడు తరువాతి పద్యం మొదలెట్టకమునుపే, కరతాళ ధ్వనులు మిన్ను ముట్టుతాయి. కారణం: ఈ కింది పద్యాలు అందరికీ కంఠతా!)
చెల్లియొ చెల్లకో తమకు చేసిన యెగ్గులు సైచిరందఱుం-
తొల్లి గతించె, నేడు నను దూతగ పంపిరి సంధిసేయనీ-
పిల్లలు పాపలున్ ప్రజలు పెంపు వహింపగ పొందు సేసెదో
యెల్లి రణంబు కూర్చెదవొ యేర్పడ చెప్పుము కౌరవేశ్వరా!
అలుగుటయే యెరుంగని మహామహితాత్ము డజాతశత్రుడే
అలిగిననాడు సాగరము లన్నియు ఏకము కాక పోవు క-
ర్ణులు పదివేవురైన అని నొత్తురు చత్తురు రాజ రాజ నా-
పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకులగావు మెల్లరన్
జెండాపై కపిరాజు ముందు సిత వాజశ్రేణియుం కూర్చి నే-
దండంబుం గొని తోలు స్యందనము మీద న్నారిసారించుచుం-
గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకం చెండుచున్నప్పు డొ-
క్కండు న్నీమొఱ నాలకింపడు కురుక్ష్మానాధ సంధింపగన్
సంతోషంబున సంధి చేయుదురె; వస్త్రంబూడ్చుచో ద్రౌపదీ
కాంతం చూచిననాడు చేసిన ప్రతిజ్ఞల్ తీర్ప భీముండు నీ
పొంత న్నీ సహజన్ముఱొమ్ము రుధిరమ్ముంద్రావునాడైన ని-
శ్చింతం తద్గదయుం త్వ్దూరుయుగమున్ ఛేదించునాడేనియున్
ఈ నాలుగు పద్యాలూ మరొక్క సారి చదవండి. కృష్ణుడు నిజంగా సంధి చెయ్యడానికే వచ్చాడా అన్న అనుమానం వస్తుంది.
ప్రారంభంలోనే, “మీరు పాండవులకు చేసిన ఎగ్గులు, అంటే కీడు, అనాదరం, వాళ్ళు సహించారు. మరి ఇప్పుడు సంధిచేస్తావో, యుద్ధమే చేస్తావో, చెప్పుము. తరువాతి పద్యంలో, దుర్యోధనుణ్ణి బెదిరిస్తున్నాడు, భయపెడుతున్నాడు; ధర్మరాజుకి కోపం వస్తే, సముద్రాలు ఉప్పొంగిపోతాయి. పదివేలమంది కర్ణులున్నా సరే, యుద్ధంలో చావక మానరు. నామాట వినుము. అంతేకాదు. నేను చర్నాకోల్ పట్టుకొని, అర్జునిడి రథం తోలుతూ ఉండగా, గాండీవం ధరించి అర్జునుడు మీమూకని చెండాడుతున్నప్పుడు, ఏ ఒక్కడూ నీ మొర ఆలకించరు. ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో భీముడు చేసిన ప్రతిజ్ఞలు (దుశ్శాశనుడి రొమ్ము చీల్చి రక్తం తాగుతానని, నీ తొడలు విరుగ కొడతాననీ) గుర్తు చేస్తున్నాడు! నిజంగా సంధికోసం వచ్చిన రాయబారి, ఇట్లా భయపెడుతూ, బెదిరిస్తూ, అవమానిస్తూ మాట్లాడితే, సంధి చేద్దాం అనే కోరిక ఏమాత్రం ఉన్నా అది కొండెక్కదూ! కృష్ణుడికి, నిజంగా సంధి చెయ్యడం ఇష్టం లేదని స్పష్ట పడుతుంది.
మహా భారతంలో ఈ సందర్భంలో తిక్కన గారి పద్యాలు, “సారపుధర్మమున్,….వారలు శాంతశూరులు….”అని ధృతరాష్త్రుడితో చెప్పడం, ……. “అరయంగ తప్పు లేదంటి నీవలన……అన్నదమ్ముల నెత్తంబులాడి…….” అని దుర్యోధనుడితో చెప్పడం వంటి పద్యాలతో పోల్చి చూడండి.
ఈ పై నాలుగు పద్యాలూ, ఒక్కక్కటీ కనీసం రెండుసార్లన్నా పాడాలిసిందే!చాలా మంది ప్రేక్షకులు “శ్రీకృష్ణ” దర్శనం అయినట్టే భావిస్తారు. కృష్ణుడిపాత్రలో లీనమైపోతారు. తరువాత, ఎల్లాగో విశ్వరూప సందర్శనం ఉన్నదిగదా!
సుయోధనుడుకి కోపం వస్తుంది. శకుని, కర్ణ, దుశ్శాసనులతో లోపలికి పోయి, కృష్ణుడిని బంధించటానికి ‘పలుపులు” తెస్తారు!
కృష్ణుడు, తనదైన చిరునవ్వుతో:
బావా! ధార్తరాష్ట్రాగ్రజా! ఇటు చూడుము.
ఒక్కని చేసి నన్నిచటనుక్కడిగింప తలంచినావె? నే-
నెక్కడ పోగలాడ! ఇక ఇక్కడచిక్కితి బక్కి కైవడిన్
దక్కితి నీకు, పట్టు మొగిదక్కకుమిట్టిటు చేరరమ్ము, బల్-
చక్కటి యూహ పుట్టె, ననుజన్ములతో నరుదెమ్ము పార్థివా!
శ్రీకృష్ణుడు తన విశ్వరూపం చూపుతాడు. ధృతరాష్ట్రుడికికూడ దివ్యదృష్టి ప్రసాదిస్తాడు. భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, ఆనందపారవశ్యం నటిస్తూ, కృష్ణుడికి నమస్కరిస్తూ నిలుచుండిపోతారు. దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, శకునీ మొదలైన వారు, భయపడి, కళ్ళు మూసుకుంటారు.
మారుమూల పల్లెటూళ్ళల్లో కూడ, spot light ముందు ఒక చక్రం కట్టి, దానికి రకరకాల రంగు కాయితాలు పెట్టి ఆ చక్రాన్ని తిప్పుతారు, కృష్ణుడిపై రంగులు పడేట్టు! విశ్వరూపం అంటే, అదీ!!
మీరు మొదటిసారి ఈ నాటకం చూస్తే, నటులు పెద్ద పేరున్న వాళ్ళు కాకపోయిన సరే, ఈ సమయంలో ఆనందంతో ప్రేక్షకులు వేసే ఈలలకి, మీకు చెవుడు రాక మానదు.
శ్రీకృష్ణుడు సభని వదిలి పోతూ, కర్ణుడిని పక్కకి పిలిచి:
రాధేయా! ఏకాంతంబుగ ఒక ముహూర్తమాత్రము నీతో మాటలాడ నా
కవకాశ మొసగుదువే:
ఎల్లి సూర్యోదయంబున నేగు వాడ
ఇట వసించెద విదురుని ఇంట మాపు
ఈవటకు వత్తువో లేక ఇంటికేను
వత్తునో ఆనతీగదవయ్య కర్ణా!
కర్ణుడు, కృష్ణుడు తన జన్మ రహస్యం చెప్పడానికేమో నని అనుమానిస్తూనే, “తప్పక నీవరుగు సమయమునకు వచ్చి కలుసు కొనియెద,” అని చెప్పుతాడు.