గత శతాబ్దంలో ప్రజాకవులు

3.

నేను ఈ నాటకాలు రకారకాల యాక్టర్లు,— చిన్న, పెద్ద, గొప్ప పేరొచ్చేసిన వాళ్ళూ, సరదాకి ఘట్టిగా పాడేసే bathroom పాటగాళ్ళూ, వెయ్యడం నా చిన్నతనంలో చూశాను. (ఆడియో టేపు పెట్టుకోని అనుకరిస్తూ పాడటం నేర్చుకున్న ఔత్సాహిక యన్.ఆర్.ఐ. లు పాడటం కూడా విన్నాను!) శ్రీ పాండవోద్యోగము నాటకంలో రెండవ అంకము ఎవ్వరూ, వేసినట్టు గుర్తు లేదు. అందులో కూడా మంచి పద్యాలు వున్నాయి; అవి బాగా అందరికీ నోటికి వచ్చేసినవి కావు! మంచి గొంతున్నవాళ్ళు, చక్కగా పాడేవాళ్ళు దొరికితే, ధర్మరాజుకి, భీముడికీ చక్కని పద్యాలున్నాయి. అవి ఇప్పుడు కేవలం academic interest కోసమే చెప్పుకోవాలి. ఆ పద్యాలు కొన్ని చవి చూపించి తరువాతి అంకంలోకి జారుకుందాం.

“ఏదో రకంగా” సంధి కుదర్చమని కృష్ణుణ్ణి వేడుకుంటాడు ధర్మరాజు.

సంధి యొనర్చి మా భరత సంతతి నిల్పుము లేదయేని గ-
ర్వాంధులు ధార్తరాష్ట్రుల సహాయులతో తునిపింపుమో జగ-
ద్బాంధవ! రెండు కర్జముల భారము పెట్టితిమయ్య నీభుజ-
స్కంధమునందు; తారసిలుగావుత మాకు యశంబొ, రాజ్యమో!

సౌబలేయులు సంధికిష్టపడి రేని
అన్నదమ్ముల మేము నూటైదుగురము
పాడిమెయి నిష్టపడరేని వారు నూఱు
గురె సహోదరు లేమైదుగురమె కృష్ణ.

భీముడు “ఇంతకూ సంధి ఏమని?” అని అడుగగానే, ద్రౌపది ఎకసక్కెముగా ధర్మరాజుని దెప్పిపొడుస్తూ అంటుంది, “ అర్థరాజ్యం ఇవ్వడం ఇష్టం కాకపోతే, కనీసం ఐదూళ్ళిస్తే చాలునట,” అని.

కృష్ణుడు సంధి పొసగడం అసంభవమేమో అని చెప్పుతూ, యుద్ధానికి ఉసి కొలుపుతున్నాడని భీముడికి అనుమానం వస్తుంది. ఒక్క క్షణం, ధర్మజుని సంధిబేరం వైపు మొగ్గు చూపిస్తున్నట్టు కనపడగానే, కృష్ణుడు భీముణ్ణి వేళాకోళం పట్టి అతణ్ణీ రెచ్చగొడతాడు:

నిదురవోచుంటివో లేక బెదిరి పల్కు
చుంటివో? కాక నీవు తొల్లింటి భీమ
సేనుడవె కావొ యెన్నడీచెవులు వినని
కనులు చూడని శాంతంబు గాన వచ్చె.

యుద్ధానికి బెదురుతున్నావని కృష్ణుడు హాస్యోక్తిగా భీముడిని ఉసికొలుపు చెప్పిన పై పద్యం వినంగానే, భీముడు రెచ్చిపోయి, కృష్ణుని “గొల్ల ఇల్లాళ్ళను వంచించి కొంపకొంపకూ వెళ్ళి పెరుగు దొంగిలించిన” వాడివినీవు అని అవమానిస్తాడు. తరువాత తన పరాక్రమం చెప్పుతాడు, ఈ కింది పద్యంలో:

బకునిం చంపితి, రూపుమాపితి హిడింబాసోదరున్, దుష్ట కీ-
చకులం దున్మితి మొన్న నూర్గుర, జరాసంధున్ దురాసంధునే-
నొకడం చంపితి నాకు భీమునకు వేరొక్కండు తోడేల! యె-
న్నక నన్నీగతి పోరికిం బెదరు చున్నాడం చనం పాడియే?

అర్జునుడికి కూడా రెండు చక్కని పద్యాలున్నాయి, ఈ సందర్భంలో!.

వాడిములు మోపినంతైన వసుధ యొసగ
ననుచు సూచించెగద! సంజయుని మొగమున
పాలనకు నిక్కమైదూళ్ళె చాలుననిన
లబ్ధి లేదు కదా! యేల లాఘవంబు

వాడి సూదిమోపినంత భూమినైనా ఇవ్వను అని సంజయ రాయబారం వల్ల మనకు తెలిసింది కదా! మరి ఐదూళ్ళడగడంలో అర్థం ఏమిటి? అయినా, భీష్మునితో, ద్రోణాచార్యునితో నా మాటగా చెప్పుము.

సూతుని మైత్రిచే పగకు జొచ్చిన గొంటు సుయోధనుండు, మీ-
రాతని పట్ల వారగుట న్యాయమ, గాండివధారి నయ్యు నే-
భీతిలుచుంటి నేమనుచు పెద్దలతో అని సేయువాడ నో
తాత! గురుండ! మీరయిన ధర్మము కాదని మందలింపరే!

గాండీవం ఉండికూడా, పెద్దలైన మీతో యుద్ధం చెయ్యడానికి భయపడుతున్నాను. సుయోధనుడు, సూతపుత్రుడైన కర్ణునితో స్నేహంచేసి కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. మీరు అతని పట్టున ఉండడం సబబా? మీరయినా అతనికి బుద్ధి చెప్పి మందలించండి, అని సారాంశం!

పాండవులందరూ, ద్రౌపదితో సహా కృష్ణుడిని సంధిచేసి పెట్టమని అడుగుతారు. ఆఖరున అందరూ తెరలో ఈ క్రింది పద్యం చదువుతారు.

ఆసన్నంబయ్యెను ముర-
శాసన! దేవా!ప్రయాణ సమయం బిదె భే-
రీ సముదితమగు రవము ది-
శా సముదాయంబు పగుల జయముగ మ్రోగెన్