ఈమాట » గత శతాబ్దంలో ప్రజాకవులు

Expand to right
Expand to left

గత శతాబ్దంలో ప్రజాకవులు

2.

మన నాటక సంప్రదాయంలో ముందుగా నాంది. ఒకశ్లోకమో, పద్యమో చదివింతరువాత, సూత్రధారుడు వచ్చి, వెయ్యబోయే నాటకాన్ని గురించి నటీనటులగురించి, నాటక కర్త గురించి, ‘ప్రస్తావన,’ చేస్తాడు.

ఈ వివరాలన్నీ వ్రాత ప్రతిలోనే! సర్వసాధారణంగా, తెరవెనుక హారతి వెలిగించి, నటీనటులందరూ కలిసి ఒక ప్రార్థన చదువుతారు. తమాషా ఏమిటంటే, ఈ ప్రార్థన కూడా అందరికీ నోటికొచ్చిందే. ఇదిగో ఆ ప్రార్థన:

పరా బ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద
పరంజ్యోతి పరాత్పర పతిత పావన స్వ ప్రకాశ
వరదాయక సకలలోక వాంఛిత ఫల ప్రదాయా
పాహి పాహి మాం పాహి …

అని, ఆ నాటక కంపెనీకి జై అని అంటూ కొబ్బరికాయ కొట్టంగానే, ప్రేక్షకుల్లో ఉత్సాహం పెల్లుబికి పోతుంది. చాలా మంది ప్రేక్షకులుకూడా ఈ ప్రార్థన పద్యం వల్లించడం నేనెరుగుదును!

తెరతియ్యగానే మొట్టమొదటి నటుడు వేదికపైకి రావడం, ప్రేక్షకులనుంచి ఉత్సాహంగా ఈలలు, చప్పట్లు మామూలు. కారణం : ఆ నటుడు చాలా పేరున్న వాడు కావచ్చు; అంతకన్నా ముఖ్యం, జనానికి వాడు పాడబోయే పద్యం, రాగంతో సహా తెలుసు. అతను చెప్పబోయే వచనం అందరికీ కంఠతా!

ఇదిగో చూడండి:

రాబోయే కురుపాండవుల యుద్ధంలో అర్జునుడు కృష్ణుడి సహాయం కోరడం కోసం ద్వారకకి వస్తాడు. ఈలలు ఆగింతర్వాత, అర్జున పాత్రధారి హార్మోనియం వాయించే వాడికేసి చూసి శ్రుతికోసం సైగ చేసి అందుకుంటాడు:

అదిగో ద్వారక! ఆలమందలవిగో! అందందు గోరాడు, అ-
య్యదియే కోట, అదే అగడ్త; అవె రథ్యల్ వారలే యాదవుల్
యదుసింహుండు వసించు మేడ అదిగో; నాలావదంతావళా-
భ్యుదయంబై వరమందురాంతర అతురంగోచ్చండమై పర్వెడున్

ఇది ద్వారకని వర్ణిస్తున్న పద్యం. కోట, ఆవులు, గోపాలురు, కందకం, కృష్ణుడి మేడ, కట్టేసిన ఏనుగులూ, రథాలూ— వగైరా వగైరా! పద్యం పూర్తికాకముందే, ఈలలు, చప్పట్లు, కేరింతలూ మొదలవుతాయి.

పీసపాటి వారు ఈ పద్యం పాడుతూవుంటే, పల్లెటూళ్ళల్లో ప్రేక్షకులందరికీ ద్వారక చూసినట్టే భ్రమ కలిగేదని చెప్పేవాళ్ళు. పద్యం ఆఖర్న ఆలాపన ఒకేగుక్కలో కనీసం ఐదునిమిషాలు పట్టేదిట! ఈ ఆలాపన అవంగానే, ఈలల మధ్యలో once more, once more అని అరుపులు. నటుడు ఆ పద్యం మళ్ళీ చదవాల్సిందే! జనాన్ని ఉర్రూతలూగించాల్సిందే!! నిజం చెప్పాలంటే, ఏ నటుడైనా once more కోసం ఎదురు చూస్తాడు.

రంగస్థలం మొత్తం రెండువందల చదరపుటడుగులు కూడా వుండదు. దాని మధ్యలో రెండు బెంచీలు కలిపి వేసిన పానుపు (దీనిని హంసతూలికా తల్పంగా ప్రజలు ఊహించుకునేవారు!). పానుపు తలవైపు, కాళ్ళ వైపూ రెండు కుర్చీలు, కుర్చీలు దొరక్కపోతే, రెండు ముక్కాలి పీటలు! పానుపు మీద కృష్ణుడు ఎడమ చెయ్యి తలకింద పెట్టుకొని నెమలిపింఛం ఉన్న కిరీటంతోసహా సర్వ ఆభరణాలూ పెట్టుకొని నిద్రపోతున్నట్టు నటిస్తుంటాడు. (చిన్నప్పుడు, కృష్ణుడు ఆభరణాలన్నింటితో నిద్రపోతాడెందుకూ అని ఎవరినన్నా పెద్దవాళ్ళని అడుగుదామనిపించేది, ఈ నాటకం చూసినప్పుడల్లా!)

తనకన్నా ముందుగా వచ్చిన దుర్యోధనుణ్ణి చూసి అర్జునుడు ఆశ్చర్యం ప్రకటిస్తాడు. ఇక్కడ ఒక చిన్న పద్యం. ముగ్గురు కృష్ణులు, ముగ్గురు అర్జునులూ వుండి, ఆరు గంటల పైచిలుకు పట్టే పెద్ద నాటకం అయితేనే ఈ పద్యం అర్జునుడి వేషధారి చదువుతాడు. లేకపోతే, “ఏమి ఈ విచిత్రము”, అని ఊరుకుంటాడు. ప్రేక్షకులకి తెలుసు, దుర్యోధనుడు ముందుగానే వచ్చాడని!

ఇదిగో ఆ చిన్న పద్యం:

మనకన్న మున్ను దుర్యో
ధనుడిటకరుదెంచె కృష్ణు తనవానిగ క్ర-
న్నన చేసికొన చనన్ తన
మనమందు తలంపబోలు మందుండకటా!

(ఈ పద్యానికి అర్థం చెప్పడం అవమానించడమే అవుతుంది.)

తరువాత, అర్జునికి ఒక మంచి పద్యాలు:

అరవిందాక్షుడు శేషశాయి జగదేకారాధ్యు డంభోధిజా-
వరు డర్తావను డంగజాంగజుడు శ్రీవత్సాంకుడేమో! నిరం-
తర నిర్ణిద్రుడు నిద్ర జెందెడి బవల్; తచ్చీర్షపుంబక్కన-
క్కురునాథుండదె కూరుచుండె దళుకుల్ గుల్కంగ బీఠమ్మునన్

కృష్ణుడికి దుర్యోధనుడు వచ్చాడని తెలుసు. అర్జునుడు ఇంకా రాలేదేమా అని అనుకుంటూ (తనలో తను!) ఒక పద్యం పాడతాడు, జనంకోసం; ఆ పానుపుమీద పడుకోనే! ఈ పద్యం ప్రసిద్ధికెక్కిన పద్యమే.

రాడాయె అర్జునుడు? కురు-
రాడవతంసంబు వచ్చె రమ్మని అనికిన్
తోడుగ నను కోరగ మో
మోడంగా వలసివచ్చు ఒక్కింత ఇటన్

(ఈ పద్యంలో మోమోడం అంటే మనం మామూలుగా వాడే మోమాటం అన్న పదానికి వికృతి!)

అర్జునుడు కృష్ణుడి పాదాలకి నమస్కరించి, కాళ్ళవైపు కూర్చుంటాడు. దుర్యోధనుడు, కృష్ణుడి తలవైపున్న కుర్చీలో కూర్చుంటాడు. దుర్యోధనుడు కూర్చుంటూ మీసం మెలిపెట్టడం చూసి, ప్రేక్షకులు హేళనగా అరవడం మామూలే! ప్రేక్షకులు ఈ నాటకంలో భాగస్వాములు; పూర్తిగా లీనమైపోయిన వాళ్ళు!

కృష్ణుడు దొంగనిద్రనుండి మేలుకొని, ఆవులించి, వళ్ళువిరుచుకొని, కాళ్ళవైపు కూర్చున్న అర్జునుడిని చూసి, కౌగలించుకొని, హార్మనిస్ట్ సంజ్ఞ వినంగానే అందరికీ రాగంతోసహా కంఠతా వచ్చిన ఈ పద్యం పాడతాడు:

ఎక్కడనుండి రాక ఇట? కెల్లరున్ సుఖులేగదా? యశో-
భాక్కులు నీదునన్నలును భవ్య మనస్కులు నీదు తమ్ములున్
చక్కగ నున్న వారె? భుజశాలి వృకోదరుడగ్రజాజ్ఞకున్
దక్కగ నిల్చి శాంతుగతి దాను చరించునె తెల్పు మర్జునా!

బందా కనకలింగేశ్వర రావు గారు ఈ పద్యం విడమర్చి, ప్రతి ప్రశ్నా రెండుసార్లు వేస్తూ పాడేవారు. షణ్ముఖి ఆంజనేయరాజు గారు భీముడిని గురించి అడిగే కుశలప్రశ్నని, అతిసుందరంగా “వృకోదరుడు అగ్రజాజ్ఞకున్” అని విడదీసి, వృకోదరుడులో “కో” మీద ఆలాపన కొంచెంసాగదీసి పాడేవారు. ఈ విషయం ఎందుకు చెప్పుతున్నానంటే, పద్యం పాడటంలో ఒక్కొక్క నటుడిది ఒక్కొక్క ఫక్కీ. అదికూడా, ప్రేక్షకులకి తెలుసు.

మళ్ళీ మరోసారి ప్రేక్షకులనుంచి once more, once more! బందా వారు, షణ్ముఖి వారూ ఈ పద్యం కనీసం రెండుసార్లన్నా పాడడం నాకు తెలుసు! కృష్ణుడు మెల్లిగా దుర్యోధనుడి వైపు తిరిగి, ఆశ్చర్యాన్ని అభినయిస్తూ,

బావా! ఎప్పుడు వచ్చితీవు? సుఖులే భ్రాతల్-సుతుల్-చుట్టముల్?
నీవాల్లభ్యము పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే?
మీ వంశోన్నతికోరు భీష్ముడును మీ మేల్గోరు ద్రోణాది భూ-
దేవుల్ సేమముమై నెసంగుదురె? నీ తేజంబు హెచ్చించుచున్

అని అడుగుతాడు. ఈ పద్యం పాడేటప్పుడు అందులోని వ్యంగ్యం విడమర్చి పాడగల నటుడు బందా కనకలింగేశ్వర రావుగారే! కృష్ణుడి పాత్ర పోషించడంలో ఆయన్ని మించిన వారు లేరని ప్రతీతి.

ఈ పద్యాలు పూర్తి అవడానికి కనీసం అరగంట పైన పడుతుంది!

శ్రీకృష్ణుడు, సుయోధనుణ్ణి “పొగుడుతూ”,

నీ వచ్చిన పని తెల్పు ము-
దావహుడవు గమ్ము నాకు అఖిలావని పా-
లావళి మౌళీమణి సం-
భావిత చరణుడవు నీవు వచ్చుట యసదే

దుర్యోధనునికి కృష్ణుని పై అనుమానమే! “ నేను వచ్చి చాలా సేపయినది,” అంటాడు. అంటే నేను ముందుగా వచ్చాను సుమా, కానీ నువ్వు అర్జునుడిని ముందు పలకరించావు అనే దెప్పు ఉన్నది. అయినా చాలా పెద్దమనిషి తరహాగా ఈ పద్యం పాడతాడు:

కౌరవ పాండవుల్ పెనుగు కాలము చేరువ యయ్యె, మాకు న-
వ్వారికి కూడ నెక్కుడగు బంధుసముద్రుడవీవు కాన, నీ
చేరిక మాకు నిర్వురకు సేమము కూర్చెడిదౌట సాయమున్
కోరగ ఏగుదెంచితిమి గోపకులైక శిరోవిభూషణా!

పెద్ద సైజు నాటకంలో, మరో చిన్న పద్యం కూడా పాడతారు. ఆ పద్యం:

ఇరువురకు సముడవు ని-
న్నరసితి నే ప్రప్రథమమునం దటుగానన్
సరసిజలోచన! నాకున్
కర మనుకూలుడవు గమ్ము కయ్యమ్ము నెడన్

కౌరవులు, పాండవులూ యుద్ధం చేసే సమయం వచ్చింది. నువ్వు, మాకూ వాళ్ళకీ కావలసిన వాడివి. నీ సాయం కోరడానికి వచ్చాను. నేను ముందుగా వచ్చాను. అందుకని మాకు అనుకూలుడవు కమ్మని అడుగుతున్నాను అని సారాంశం. ఈ పద్యానికి అర్థం చెప్పవలసిన అవసరం ఉన్నదా?

రెండో పద్యం పాడేటప్పుడు, “నిన్నరసితి, నే ప్రప్రథమమునన్” అన్న మాటలు రెండుసార్లు గుచ్చి గుచ్చి చదవడం ఆచారం. ప్రేక్షకులకి ముఖ్యం, నటుడు పద్యం పాడటమే కాదు; నటనకూడా కావాలి.
ఆ విషయం ఆరితేరిన నటులందరికీ తెలుసు!

శ్రీకృష్ణుడు మంత్రాంగం తెలిసిన గొప్ప ఉపాయశాలి. అంటాడు:

ముందుగ వచ్చితీవు మునుముందుగ అర్జును నేను చూచితిన్
బందుగులన్న యంశ మది పాయకనిల్చె సహాయ మిర్వురున్
చెందుట పాడి; మీకునయి చేసెద సైన్యవిభాగ మందు మీ-
కుందగుదాని గైకొనుడు, కోరుట బాలుని కొప్పుమున్నుగన్

నువ్వు ముందుగా వచ్చావు, నిజమే. నేను అర్జునుడిని ముందు చూశాను. ఇద్దరికీ సహాయం చేస్తాను. సైన్య విభాగం చేస్తాను. మీకు తగినది తీసుకోండి, చిన్నవాడు ముందు కోరుకోవడం ధర్మం, అంటూ, అర్జునుడివైపు తిరిగి, “ధనంజయా! నీఅభిప్రాయమేమి?” అని అడుగుతాడు. ముందుగా అర్జునుడి అభిప్రాయం అడగడంతో, పాండవపక్షపాతం చూపిస్తున్నాడని దుర్యోధనుడు ఎత్తి పొడుస్తాడు. అందుకు కృష్ణుని సమాధానం: (సాధారణంగా ఈ పద్యం అందరూ పాడరు.)

సుయోధనా! అట్లు కాదు, అని,

నీవు స్వతంత్రుడ వీతడు
సేవకు డగ్రజుని చెప్పుచేతలకున్ లో-
నై వర్తించెడి నందుల-
కై వేరుగ నడగవలసె నది యట్లుండెన్

అని, దుర్యోధనుడి “అహంకారాన్ని” (ego ని) బలపరుస్తాడు.

వెంటనే, ఈ క్రింది రెండు పద్యాలు పాడతాడు. ఒకవేళ పద్యాలు కత్తిరిస్తే, వచనం లో వాటి సారాంశం చెప్పుతాడు. “నేను ఒకవైపు, మహాబల సంపన్నులైన పదివేలమంది గోపాలురు మరొకవైపు. నేను ఆయుధం పట్టను. కానీ, బుద్ధికి తోచిన సాయం మాత్రం చేస్తాను.”

ఇవిగో ఆ రెండు పద్యాలు:

అన్నియెడలను నాకు దీటైనవారు
గోపకులు పదివేవు రకుంఠబలులు
కలరు నారాయణాఖ్య చెన్నలగువారు,
వారలొకవైపు నేనొక్కవైపు, మఱియు

యుద్ధమొనరింత్రు వార ల-
బద్ధమ్మెందులకు? నేను పరమాప్తుడనై
యుద్ధము త్రోవం బోవక
బుద్ధికి తోచిన సహాయమును పొనరింతున్

సుయోధనుడు “ఆశ్చర్యం” ప్రకటిస్తూ, కాస్త వికటంగా, హేళనగా, ఈ క్రింది పద్యం పాడతాడు. నటుడు ఈ పద్యం చదివే పద్ధతి ప్రేక్షకులలో విపరీతమైన నవ్వు పుట్టిస్తుంది. మాధవపెద్ది వెంకట్రామయ్య గారు దుర్యోధన పాత్ర కి గొప్ప పేరు ప్రఖ్యాతీ తెచ్చిన వారిలో ముఖ్యులు. (యస్.వీ. రంగారావు గారి పాత సినిమాలు గుర్తుంటే, ఈ పద్యాన్ని ఆయన చదువుతున్నట్టు మనం ఊహించుకోవచ్చు.)

ఆయుధము పట్టడట, అని
సేయండట! “కంచిగరుడ సేవ,” ఇతనిచే-
నేయుపకృతి యుద్ధార్ధికి
నేయెడ నగు నిట్టివాని నెవ్వండు గొనున్

అర్జునుడు శ్రీకృష్ణుని కోరుకోవడం దుర్యోధనుడు “పరిశేషన్యాయము” గా పదివేల గోపకుల సైన్యాన్ని తీసుకోవడం జరుగుతుంది. అర్జున వేషధారి ఈ క్రింది రెండు పద్యాలూ పాడతాడు.

నందకుమార! యుద్ధమున నా రథమందు వసింపుమయ్య! మ-
ధ్యందిన భాను మండల విధంబున నీదగు కల్మి చేసి నా-
స్యందన మొప్పు గాక! రిపుసంతతి తేజము తప్పుగాక నీ-
వెందును ఆయుధమ్ముదరి కేగమి కొప్పుదుగాక కేశవా!

ఈవొకరుండవే జగములెల్ల జయించెద; నేనుకూడ న-
ట్లే విలయం బొనర్పగల నెందును పేర్గలవాడనౌట నీ-
కీ విజయ ప్రశస్తి యగు నేమొ అటంచు మదిన్ తపింతు స-
ద్భావము కల్మి నా అభిమతం బొడగూర్చితి, కొండనెక్కితిన్

ఈ రెండూ చక్కని పద్యాలే! ఎందుకనో, ప్రజలనోళ్ళల్లో పడలేదు. కారణం: చాలా సార్లు అర్జునవేషధారి పెద్ద పేరున్న నటుడు కాకపోవడం చేత, ఇవి కత్తిరించేసే వాళ్ళు. (పులిపాటి వెంకటేశ్వర్లు గారు అర్జునుడిగా నటించినప్పుడు, ఈ పద్యాలు పాడేవారని విన్నాను.)

మూడునిమిషాలపాటు గుక్కతిప్పకుండా ఆలాపన ముగిసిం తరువాత, తెరలాగే కుర్రాడు కంగారుగా తెరవెయ్యడానికి ప్రయత్నించడం మామూలే! సరిగ్గా సమయానికి తెర తాళ్ళు పని చెయ్యవు. రెండుపక్కలా తెరని పట్టుకొని మూసెయ్యడం కూడా మామూలే!(ఇది తెరలాగిన కుర్రాడిగా నా స్వానుభవం!)

ఇంకా ఉంది. పేజీలు: 1 2 3 4 5 6