3
బూదరాజుగారు తెలుగు అకాడెమీలో ఇరవై ఏళ్ళు భాషావిషయాలమీద పనిచేశారు. అకాడెమీ పనుల్లో అధికారుల చేతుల్లో ఆయన పడిన అవమానాలు అనేకం. కాని ఎప్పుడూ నిర్మొహమాటంగా అనుకున్నదాన్ని చెప్పటం, ఆత్మగౌరవాన్ని నిల్పుకోవడం ఆయన లక్షణం..
ఒకసారి భాషా సంబంధమైన సదస్సునొకదానికి గవర్నరుని అధ్యక్షత వహించమనికోరడానికి బూదరాజు వెళ్ళారు. అప్పటి గవర్నరు శారదా ముఖర్జీ. అక్కడి అధికారి బూదరాజు గారిని, ఇక్కడ నిలబడండి, గవర్నరు గారికి నమస్కరించి అడిగినవాటికి సమాధానమివ్వమని నిర్దేశించారు. ఆవిడ ప్రవేశించి, తనే ఎందుకు రావాలి, ప్రధానితో కలవాలసిన పనులున్నాయే, వస్తానని రాకపోతే ఏమవుతుంది, ఇలా యక్షప్రశ్నలు – ఆయనని నిలబెట్టే – వేస్తే, బూదరాజుగారికి విసుగొచ్చి, ఆమెకు వినబడీ వినబడకుండా, “యత్నే కృతే యది నసిద్ధ్యతి కో త్ర దోషః?” అని గొణుకున్నారు. ఆమె తక్షణమే లేచి నమస్కరించి నానా మర్యాదా చేయబోయింది. బూదరాజు గారు తటపటాయిస్తూంటే, “మఫ్లంకర్ గారి పుత్రిక ఒక సంస్కృత పండితుణ్ణి అగౌరవపరచిందన్న అపఖ్యాతి రానీకండి! దయచేసి కూర్చోండి!” అని సాదరంగా మాట్లాడింది.
బూదరాజుగారు చాలా ప్రచురణలకి శ్రమపడటం, చివర్లో వాటి బాధ్యతని వేరే వాళ్ళకి అప్పగించి పేరొస్తే వాళ్ళకీ విమర్శలొస్తే ఈయనకీ పంచడం పరిపాటి. ఒకసారి తెలుగు అకాడెమి ప్రచురించిన తెలుగు సాహిత్యకోశంలో అనేక తప్పులున్నాయి – ఆంధ్రమహాభారత రచయితల్లో తిక్కన మూడోవాడు! – దీనికి బాధ్యులెవరని విధానపరిషత్తులో విమర్శలొచ్చాయి. ఒక గౌరవ సభ్యులు సదరు గ్రంథనిర్మాతను ఉరి తీయాలన్నారు. విద్యామంత్రి గారు బూదరాజుని సంప్రదిస్తే ఉరి తీయడమే మంచిదని ఒప్పుకున్నారు. హతాశుడైన మంత్రి గారు తెలుసుకున్నదేమిటంటే ఆ గ్రంథ పరిష్కర్త ఎవరోకాదు – ఆరోపించిన సభ్యుని కుమార్తె!
నిజానికి బూదరాజు గారి ఆత్మకథలో, ఆయన విమర్శ వాత పడని వాళ్ళు బహు తక్కువ. దాదాపు ప్రతిపేజీలోనూ ఏదో ఒక విమర్శ ఉన్నట్లనిపిస్తుంది.
దిగజారిపోతున్న విద్యాప్రమాణాలని ఉదహరిస్తూ ఒక సంఘటన చెప్పారు. 1987లో ఆంధ్ర విశ్వకళాపరిషత్తులో కథానికల మీద PhD చేస్తున్న అభ్యర్థుడొకరిని – విజయనగరం వాస్తవ్యుణ్ణి – బూదరాజుగారు, “మీ ఊళ్ళొనే తెలుగు కథ పుట్టిందంటారు. నిజమా?” అని ఎన్ని రకాలుగా అడిగినా ఆ విద్యార్థికి గురజాడ “దిద్దుబాటు” గుర్తురాలేదు. “పోనీ చా.సో. గారు తెలుసా?” అంటే ఆయన ఎవరన్నాడు. ఇలాంటి దుఃఖం కలిగినప్పుడల్లా ఏదోఒక వెకిలి పద్యం రాసుకోవడం అలవాటయిన బూదరాజు రాసిన పద్యం:
“చాగంటి సోమయాజుల
రోగం కుదిరింది; ఎవ్వరున్ విజినగరం
లో గుర్తించరు కథకు
ల్లో గొప్పని; కాలమెంతలో మారినదో?”
ఇప్పుడంటే కంప్యూటర్ వచ్చి అవసరం కనిపించకపోవచ్చుగాని, ఇంగ్లీషు మాతృభాషగా వున్నవాళ్ళు కూడా రాసేటప్పుడు Dicitonary, Thesaurus, “The Elements of Style” లాంటి పుస్తకాలు చేతికి అందుబాటులో ఉంచుకుంటారు. తెలుగు వాళ్ళకి అలవాటు చేసుకుందామన్నా నిఘంటువుకి మించి వాడుక భాషకి సంబంధించిన పుస్తకాలు తక్కువ. ఈలోటుని తీర్చడానికి బూదరాజుగారు చేసిన కృషి చెప్పుకోదగ్గది. విలేకరుల కోసం రాసిన “తెలుగు భాషా స్వరూపం” లో తెలుగు రాయడం అలవాటు తప్పిన నాలాంటి వాళ్ళు నేర్చుకోదగ్గ విషయాలు ఎన్నో ఉన్నాయి. మచ్చుకొకటి:
తెలుగు ఇంగ్లిష్ నుడికారాలను సంస్కృతీకరించి సమాసాలు చేయవద్దు. అలాగే అన్యదేశ్య సమాసాలను మక్కికి మక్కిగా తెలుగు చేయవద్దు. ఉదా. “the cold touch of poverty”ని “దుర్భరదారిద్ర్యం” అని అనువదించండి గాని “దారిద్ర్యశీతలస్పర్శ” అనవద్దు. అలాగే “చల్లని కడుపు”ను “శీతలగర్భం” అని రాయవద్దు.
“ఈమాట”లో ఈమధ్య “ఏతావాతా” అనే పదం ఎక్కువగా వినబడుతోంది. దీని అర్థమేమిటా అని “శబ్దార్థరత్నాకరము”లో వెతికితే కనపడలేదు. బూదరాజు గారి “మాటల వాడుక: వాడుక మాటలు; అనుభవాలు-న్యాయాలు” పుస్తకంలో దీనికి చక్కని వివరణ ఉంది:
ఊతపదాలుగా వాడే మాటల్లో “ఏతావాతా” అనేదొకటి. ఇది ఒకానొక సంస్కృతపదం. అవ్యయం. అంటే విభక్తి ప్రత్యయాలుగాని, వచనంలో మార్పుగాని లేని పదం. దీని అసలర్థం “ఇంతమాత్ర”మని. ఆ అర్థంలో ఎందరీమాటను సరైన సందర్భంలో వాడుతున్నారో చెప్పలేం. దాని సరయిన రూపం “ఏతావత్” అనేది. సంస్కృతంలోని అవ్యయాలను తెలుగులో విడిమాటలుగా వాడకూడదని చిన్నయసూరి వంటి సంప్రదాయ పండితులు నిషేధించినా, “వృథా” వంటి అనేకావ్యయాలను అందరూ వాడుతూనే వున్నారు. “ఏతావాతా నేను చెప్ప వచ్చిందేమిటంటే…” మొదలైన ప్రయోగాలు ఉపన్యాసాల్లో వినిపిస్తుంటాయి. నిజానికి ప్రత్యేకించి ఏదో నిశ్చితార్థమున్న మాటనుగా దీన్ని వాడుతున్నవారు అత్యల్పసంఖాకులు. రాతకోతల్లో “కాగా, ఇది ఇలా ఉండగా, అయితే” వంటి అనేక పదాలను వాడుతున్నట్లే ఈ మాటను కూడా ఊతపదంగా వాడుతుంటారని చెప్పవచ్చు. దీని మూలార్థం తెల్సి ప్రయోగించాలంటే నూటికి తొంభై సందర్భాల్లో ఇది అతికే మాట కాదు.
బూదరాజుగారు ప్రస్తావించిన అనేక వ్యక్తులలో ఇద్దరు: ఆయనకు తెలుగు అకాడెమీలో ఇరవై ఏళ్ళు సహోద్యోగిగా దగ్గరి మిత్రుడిగా ఉన్న తాళ్ళూరి నాగేశ్వరరావు గారు. ఆయన అకాల మరణంతో అనిర్వచనీయ శూన్యభావం ఏర్పడిందని రాసుకున్నారు. తాళ్ళూరి, హితశ్రీ కలిసి “నూట పదహార్లు” అనే పేరుపొందిన కథా సంకలనం తెచ్చినట్లు గుర్తు. కాని దాంట్లో ఉన్నది అర్థ, క్షమించాలి, అర్ధ నూటపదహార్లు మాత్రమేననుకుంటాను. ఊరూపేరూ సంపాదించకుండానే వేరే ప్రపంచమనేది లేకుండా సారస్వత నికేతన గ్రంథాలయంలో పనిచేసిన లైబ్రరీ కామయ్య లాంటి వ్యక్తులు అరుదనీ, ఉన్నా వాళ్ళని గౌరవించేవాళ్ళు ఇంకా అరుదనీ విచారపడ్డారు.
బూదరాజుగారికి తెలుగువాళ్ళ చేతకానితనం మీద ఎంతో నిస్పృహ. మనకంటె చిన్న, పేద వాళ్ళయిన మళయాళ రాష్ట్రీయులు మహా నిఘంటువు కోసం కృషి చేయడం, ఇతర రాష్ట్రాలలో భాషా పండితులకున్న గౌరవం మనలో లేకపోవడం, మన చరిత్ర శాసనాలని సేకరించడంలో మన ప్రభుత్వానికున్న అలసత్వం, కాలం గడిచేకొలదీ అధికారుల పెత్తనం పెరగడం – ఇవన్నీ బూదరాజుగారిని చివరిదాకా బాధపెట్టిన విషయాలు.
చివరకి కొన్ని ప్రశ్నలు – మారిపోతున్న విలువలు ఆదర్శపాత్రమయినవా? పాశ్చాత్యుల జీవన విధానాల్లోని మంచి కన్నా చెడు పట్లే మనకి ఆకర్షణ పెరిగిందా? కులమతభాషా ప్రాంత విద్వేషాలతో తక్షణ సౌకర్యాలకోసం దీర్ఘకాలిక ప్రయోజనాలని విస్మరిస్తున్నామా? – ఇలాంటి ప్రశ్నలతో సమాధానాలను మనకే వదిలేసి స్వీయచరిత్ర ముగించారు.
ప్రతిదాన్నీ విమర్శించే వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. నిజానికి బూదరాజు గారి ఆత్మకథలో, ఆయన విమర్శ వాత పడని వాళ్ళు బహు తక్కువ. దాదాపు ప్రతిపేజీలోనూ ఏదో ఒక విమర్శ ఉన్నట్లనిపిస్తుంది. కాని Theodore Roosvelt అన్నట్లు:
“It is not the critic who counts, not the man who points out how the strong man stumbled, or where the doer of deeds could have done better. The credit belongs to the man who is actually in the arena; whose face is marred by the dust and sweat and blood; who strives valiantly; who errs and comes short again and again; who knows the great enthusiasms, the great devotions and spends himself in a worthy cause; who at the best, knows in the end the triumph of high achievement, and who, at worst, if he fails, at least fails while daring greatly; so that his place shall never be with those cold and timid souls who know neither victory or defeat.”
బూదరాజు గారి ముద్రాముద్రిత రచనలు, పరిశోధనలు ఆయన జయాపజయాలకు కలకాలం నిలిచే నిదర్శనాలు.
