ఈమాట » కుటుంబరావు ఆలోచనని హత్య చేశాడా? లేక రేకెత్తించాడా?

Expand to right
Expand to left

కుటుంబరావు ఆలోచనని హత్య చేశాడా? లేక రేకెత్తించాడా?

6

“Gloucester: These late eclipses in the sun and moon portend no good to us: though the wisdom of nature can reason it thus and thus, yet nature finds itself scourged by the sequent effects: love cools, friendship falls off, brothers divide: in cities, mutinies; in countries, discord; in palaces, treason; and the bond cracked ‘twixt son and father.Edmund: This is the excellent foppery of the world, that, when we are sick in fortune,–often the surfeit of our own behavior,–we make guilty of our disasters the sun, the moon, and the stars: as if we were villains by necessity; fools by heavenly compulsion; knaves, thieves, and treachers, by spherical predominance; drunkards, liars, and adulterers, by an enforced obedience of planetary influence; and all that we are evil in, by a divine thrusting on: an admirable evasion of whoremaster man, to lay his goatish disposition to the charge of a star!” — In “King Lear”.కుటుంబరావు రచనల్లో దేవుడు, ఆచారాలు, నమ్మకాలు మొదలైనవన్నీ సాంఘిక చిత్రణలో సంభాషణలలో భాగంగా కనిపిస్తాయి. వీటిని ఒకరికి హాని కలిగించనంత వరకు ఎవరి నమ్మకాలు వాళ్ళవి అని ఊరుకోవడం, కానప్పుడు తీవ్రంగా విమర్శించటం చూస్తాం. “అనుభవం” నవలలో పార్వతి చివరి కాలంలో తమ ఇంట్లో అద్దెకుంటున్న ఆంజనేయులు గారి “వేదాంత” సంభాషణల్లో ఆసక్తి చూపుతుంది. ఆవిడ తమ్ముడు, “ఆయన చెప్పేది వేదాంతమవునో కాదో గాని అది ఒకరికి చెరుపు చేసేది మాత్రం కాదు” అంటాడు.కాని మనుష్యులకంటే ఎక్కువగా దేవుణ్ణే నమ్ముకునే వాళ్ళ గురించి “చిరంజీవి భక్తుడు” అనే గల్పికలో వ్యంగ్యంగా రాశాడు: “భక్తుడికి ఇంకా ధనం కావాలి. ఉద్యోగం కావాలి. రేసులో భక్తుడు కాసిన గుర్రం గెలవాలి. భక్తుడి లాటరీ టికెట్కు మొదటి బహుమతి రావాలి. భక్తుడు తీసిన ప్రతి పిక్చర్ హిట్ కావాలి.

మామూలు మనుషులు మనుష్యులని నమ్ముకుంటారు. భక్తుడు దేవుణ్ణి తప్ప నమ్మలేడు. ఎందుకంటే దేవుడు నీతులు చెప్పడు. దేవుడికి పెట్టే లంచం చట్ట విరుద్ధం కాదు.

దేవుడి సమక్షం లో దొంగతనం బాహాటంగా జరుగుతుంది. దేవాలయం గోడల క్రింద వ్యభిచారం అవిరామంగా కొనసాగుతుంది. దేవుడి విషయంలో మనుష్యుల హెచ్చుతగ్గులు ఖచ్చితంగా పాటించబడతాయి. ఒక్కముక్కలో భక్తుడికి కావాల్సిన జీవితం అంతా దేవుడి చుట్టు ఉన్నది.

భక్తుణ్ణి వీలయినప్పుడల్లా దొంగలు చంపి, డబ్బు లాక్కుని, శవాన్ని ఒకమూలలాగి పారేస్తారు. భక్తులు ప్రయాణించే బస్సులు బోల్తాకొట్టి జననష్టం జరుగుతుంది. దేవుడు దగాచేస్తే భక్తుడికి తీరని ధననష్టం జరుగుతుంది. భక్తుడి కోరికలు తీరవు.

అయినా భక్తుడు చావడు. వాడి వంశం వర్ధిల్లుతుంది. వాడి రక్తం చిందినచోట మరింత భక్తులు పుట్టుకొని వస్తారు.

దేవుడికి జననం లేదు.
భక్తుడికి మరణం లేదు.

“కుటుంబరావు “బెదిరిన మనుషులు”, దానికి sequelగా “బ్రతుకు భయం” అనే నవలలు రెండు రాశాడు. వీటిల్లోని ముఖ్యపాత్ర సీతప్ప లాంటి వాళ్ళు ఉంటారా అని సందేహం కలుగుతుంది. కాని ఇది “సహజ పాత్రే” అని చాలా మంది రచయిత కన్నా తెలివైన వాళ్ళే అన్నారట.

“సీతప్ప ఉత్తరం చూసుకుని సంగతులన్నీ గ్రహించుకున్నాడు. తొమ్మిదో తారీఖు రాత్రి పది గంటల నలభై రెండు నిమిషాలకి సీతారత్నం ఆడపిల్లను కన్నది. దుష్ట నక్షత్రం కావటం చేత పెద్ద పెట్టున శాంతీ, నవగ్రహపూజా వగైరాలు చేయించాలి. నాలుగైదొందలు ఖర్చుంటుంది. గనక సీతప్ప డబ్బు సేకరించి ఉత్తరం అందిన మూడోనాడు బయలుదేరి రావలెను. ఇంతే సంగతులు.”

నాలుగైదొందలే! ఎక్కడి డబ్బూ హరించి పోతోందిగద!

“అసలే ఆడపిల్ల. ఆపైన చచ్చే శాంతట! ఖర్చులు మనం భరించాలట! యెక్కడైనా కద్దా? ఎవరింట పురుడోసుకుంటే వారు భరించడం సులువు. ఏమంటావు?”

“శాంతికయే ఖర్చు మనవే భరించవలిసుంటుందేవో మరి” అన్నది రావమ్మ అనుమానంగా.

“అసలు నువుండు. వాళ్ళకేం తెలుసే వెర్రిదానా? వొట్టి నాస్తికులు! ఓ దేవుళ్ళేడు, ఓ దైవం లేడు! దీని వైనవంతా శాస్తుల్లుగార్నడిగి తెలుసుకొస్తాను. అలానే ఈ ప్రళయం విషయం కూడా కనుక్కొస్తా” అన్నాడు సీతప్ప. నాస్తికులే పెద్ద శాంతి అవసరమంటుంటే శాస్తుల్లు గారు యాగాలే చెయ్యాలంటాడేవోనని సీతప్పకు లోపల దడగానే ఉంది.

“ప్రళయవేవిటండోయ్!” అన్నది రావమ్మ.

“సారిపోయింది? నువ్వింకా వినలేదూ? నేను రాగానే దాన్ని గురించేగదూ చెప్తా? ప్రళయం వచ్చేస్తోందిట. నవగ్రహకూటం. అంటే తొమ్మిది గ్రహాలున్నూ ఆ పళంగా ఒక్కచోటచేరి ఊరుకుంటాయి. ఇంక అడిగావూ, భూకంపాలేవిటి, అగ్నిపర్వతాలు బద్దలు కావడవేమిటి, పిడుగులు పడిపోడవేవిటి, అంతలేసి మేడలు గభాల్న కూలిపోవడవేవిటి, సర్వనాశనమనుకో! ఒక్క ప్రాణి మిగల్దు! సూరీడు కనిపించట్ట! ఎటో వెళ్ళిపోయి దాక్కుంటాడు. సూర్యచంద్రులు గతులు తప్పడమంటే ఇదేనూ. నవగ్రహకూటవంటే మాటలే. అబ్బో!”

“అయితే మరి మీ ఆఫీసో?” అన్నది రావమ్మ అంతా విని.

“పురఁవేలేదు, అంతఃపురఁవన్నట్టు, ఓ చెంపని ప్రళయం వచ్చేసి సర్వనాశనవై పోతుంటే ఇంకా ఆఫీసేవిటే, వెర్రిదానా?”

“ఈ ప్రళయం ఎప్పుడొస్తుందిటా?”

“ఎప్పుడోనా? పై మాసం నాలుగైదు తేదీల్లోనే. మద్రాసు మీదికి వెయ్యి నిలువుల నీరొచ్చి ఇరవైనాలుఘంటల సేపు తియ్యకుండా ఉండిపోతుందట!”

రావమ్మ ఆశ్చర్యంతో బుగ్గలు నొక్కుకుని, “యీ ఉపద్రవం తప్పే దారే లేదా?” అని అడిగింది.

“ఎందుకు తప్పదూ? చాలమంది ప్రయాణపు ఏర్పాట్లు చేస్తున్నారు. మా ఆఫీసులో సహం మందికి పైగా ముందుగానే సెలవు దరఖాస్తులు పెట్టేశారు. జలప్రళయం తీసిపోయాక వస్తారు. మద్రాసు పట్టణవంతా మళ్ళీ కట్టుకోవాలి!” రావమ్మకు గొప్ప ఆలోచనతట్టింది. “అప్పుడు మనం కూడా ఎక్కడో ఇంత స్థలం కొని ఇల్లుకట్టేస్తాం. అద్దెకింద ఎంత డబ్బూ నాశనవై పోతోంది” అన్నది. “భేషుగ్గా చెప్పావు!” అన్నాడు సీతప్ప.

సీతప్పని చూస్తే మనకు వెన్నెముక లేని మనిషి అనిపిస్తుంది. రావిశాస్త్రి సృష్టించిన “అల్పజీవి” సుబ్బయ్య గుర్తొస్తాడు. కాని రావిశాస్త్రి సుబ్బయ్య అంతరంగాన్ని చైతన్యస్రవంతి పద్ధతిలో వర్ణిస్తే, కుటుంబరావు సీతప్ప దిన చర్యలనీ, సంభాషణలనీ కళ్ళకుకట్టినట్లు చిత్రించాడు. సీతప్ప పిల్లలు పెద్దవాళ్ళయింతర్వాత వ్యక్తిత్వం అనేది పూర్తిగా కోల్పోకముందే బుద్ధి తెచ్చుకొంటారు. కాని సీతప్పకి కనువిప్పు కలిగే మార్గం లేదు. సీతప్ప సజీవ పాత్ర అంటే నమ్మ బుద్ధి గాదు. కాని అతని స్వభావంలోని కొన్ని లక్షణాలు మాత్రం ఇప్పటికీ కొందరిలో కనబడతాయి.

ఇంకా ఉంది. పేజీలు: 1 2 3 4 5 6 7 8