సీతప్పని చూస్తే మనకు వెన్నెముక లేని మనిషి అనిపిస్తుంది. రావిశాస్త్రి సృష్టించిన “అల్పజీవి” సుబ్బయ్య గుర్తొస్తాడు. కాని రావిశాస్త్రి సుబ్బయ్య అంతరంగాన్ని చైతన్యస్రవంతి పద్ధతిలో వర్ణిస్తే, కుటుంబరావు సీతప్ప దిన చర్యలనీ, సంభాషణలనీ కళ్ళకుకట్టినట్లు చిత్రించాడు. సీతప్ప పిల్లలు పెద్దవాళ్ళయింతర్వాత వ్యక్తిత్వం అనేది పూర్తిగా కోల్పోకముందే బుద్ధి తెచ్చుకొంటారు. కాని సీతప్పకి కనువిప్పు కలిగే మార్గం లేదు. సీతప్ప సజీవ పాత్ర అంటే నమ్మ బుద్ధి గాదు. కాని అతని స్వభావంలోని కొన్ని లక్షణాలు మాత్రం ఇప్పటికీ కొందరిలో కనబడతాయి.
7
కుటుంబరావులో ఉద్రేకం లోపించందనీ, అందువలన ఆయన శైలికి లోపం జరిగిందనీ అంపశయ్య నవీన్ విమర్శించారు: “పాఠకుడికి సాహిత్యంలో కొంత ఉద్రేకం కావాలి. కన్నీళ్ళు కావాలి. లోకంలో జరుగుతున్న అన్యాయాల పట్ల వాళ్ళ హృదయాలు భగ్గున మండిపోవాలి. అప్పుడే సమాజంలోని కుళ్ళును, అన్యాయాన్ని సహించలేని సంస్కారం పాఠకుడికి సాహిత్యం యివ్వగలుగుతుంది. అప్పుడే సాహిత్యం గురజాడ అన్నట్లు “great civilizing medium” అవుతుంది.”అదే నిజమయితే “కన్యాశుల్కం” మనకేమీ సంస్కారం కలిగించలేదనుకోవాలి. దాంట్లో ఉద్రేకాలు తక్కువ, హాస్యం ఎక్కువ. ఆ హాస్యం వెనక అనేక జీవిత విషాద రేఖలు వున్నవి. నిజానికి కుటుంబరావు రచనల్లో గుండెలు పిండేసే సన్నివేశాలు చాలా వున్నాయ్. కాకపోతే అవి కవిత్వంతోటీ, వర్ణనలోతోటీ నిండి ఉండవ్ – ఓ చిన్న సంభాషణలోనో, జీవిత సత్యంలోనో అణిగి ఉంటాయి. ఉదాహరణకి “అనుభవం” నవలనుండి రెండు:”గర్భాదానపు గదిలో కాంతయ్య మొరటుగా ప్రవర్తించలేదు కాని – చాలా అసహ్యంగా ప్రవర్తించాడు… ఆకస్మాత్తుగా పార్వతి అతన్ని, “నన్ను పేరు పెట్టి పిలుస్తారా?” అని అడిగింది.”అదేమిటి?” అన్నాడు కాంతయ్య నిర్ఘాంతపోయి.
“తెలుసుకోవాలని అడిగాను” అన్నది పార్వతి.
“నీ పేరు నాకు తెలుసు – పార్వతి”
“మీ పేరూ నాకు తెలుసు – కాంతయ్య గారు.” ఆ “గారు” చేర్చకపోతే అసలే దడదడలాడుతున్న ఆమె గుండె బద్దలే అయ్యేదనిపించింది. ఆడది మొగుడి దగ్గిర ఒంటరిగా ఉన్నప్పుడుకూడా మొగుడి పేరు అనటానికి గుండె ధైర్యం కావాలి! ”
మరొకటి:
” కొంతమంది ఆడవాళ్ళ లాగా బయటపడేది కాదు గాని, పార్వతికి కూడా కబుర్లు వినటం సరదాగానే ఉండేది. … ఫలానా వారి కోడలు రంకు మరిగింది. పట్టుబడినప్పుడల్లా చావగొట్టేవాళ్ళు. చుట్టుపక్కలవాళ్ళు వినోదంగా చెప్పుకునే వారు.
పార్వతికి ఈ ఏర్పాటు అర్థం కాలేదు. అది మొగుడితో సరిగా ఉండలేకపోతే ఏ మిండగాడితోనైనా ఎందుకు లేచిపోదు? దానికి దెబ్బలు లక్ష్యం లేదని రుజువైనాకా కూడా వదిలేసి ఊరుకోక ఎందుకు చావగొడతారు? ఈ ప్రశ్నలకు సమాధానం పార్వతి ఎరగదుగానీ, అటువంటి సమాధానం లేకపోలేదు. అది మిండగాడితో ఎందుకు లేచిపోదంటే తనకింత పిండాకూడు పెట్టే మిండగాడు లేడుగనక. వాళ్ళు దాన్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు కొడతారంటే దాని బుద్ధి మార్చటానికి కాదు, తమ పరువు నిలబెట్టుకునేందుకు. ఎందుకు ఇంట్లో నుంచి దాన్ని గెంటెయ్యరంటే, అది ఇంటెడు చాకిరీ గొడ్డులాగా చేస్తుందిగనక!”
అలాగే ఓ చిన్న పిల్ల హృదయం లో జరిగే అంతఃర్మధనాన్ని గూడా మనల్ని కరిగించేలా చెయ్యగలడు. “ఔట్” కథలో శేషు అనే పదమూడేళ్ళ బాల్య వితంతువు హృదయావిష్కరణ చూడండి: “పదమూడేళ్ళ పిల్ల హృదయంలో కూడా ఈ లోకంలో ఏదో ఒక విధమైన న్యాయం వుంటుందనే విశ్వాసం వుంటుంది; ఆ విశ్వాసమే లేకపోతే అంత చిన్న హృదయం కూడా గాలికి బుడగ విచ్చినట్టు విచ్చిపోక తప్పదు. లోకంలో ఉండదగిన న్యాయం ప్రత్యక్షంగా కనిపించకపోతే అంత లేత హృదయమూ, సాలీడు తనకుతానే గూడు అల్లుకున్నట్టుగా, లోకంలో వుండదగిన ఆ న్యాయాన్ని సృష్టించుకుంటుంది. ఒకటే వ్యత్యాసం: సాలీడు తన గూడులో ఎన్నడూ చిక్కుకోదు. మానవ హృదయం తన గూడు విడిచి ఒకంతట పైకి రాలేదు.”
అలాగని నవీన్ గారు అన్నదాంట్లో కొంత నిజం లేకపోలేదు. కాని కుటుంబరావు శైలి ఆయన దృక్పధానికి సరిపడే విధంగా ఉంది: “సమాజంలోని కుళ్ళును దైవికంగానూ, అనివార్యంగానూ చిత్రించి హృదయాలను సంచలింపచేస్తే అందువల్ల సమాజం మారుతుందనేది కల్ల. దుర్భరమైన జీవిత సమస్యలక్రింద నలిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కథలు చిత్రించవలసింది వాళ్ళను కాదు, ఆ సమస్యలను పరిష్కరించటానికి ప్రయత్నించేవాళ్ళని.”
బాల్య వితంతువులు, బాల్య వివాహాల వాళ్ళు, ఆడపిల్ల పెళ్ళిళ్ళు చెయ్యలేని వాళ్ళు, కుటుంబాల్లో ప్రేమ లేక నలిగే వాళ్ళు, ఇలా అనేక సాంఘిక సమస్యలని చిత్రించటంలో కుటుంబరావు వీటిని అధిగమించేవాళ్ళ గురించీ, జీవితంలో ఆశ కలిగించేవాళ్ళ గురించీ రాశాడు. ఇందుకు కొన్ని ఉదాహరణలు:
“ఆడబ్రతుకే మధురం!” అనే కథ ఓ చిన్న అమ్మాయి స్వగతం. ఇలా మొదలవుతుంది:
తాతయ్య అమ్మమ్మని ఇప్పటికీ కొడతాడు. నాన్న అమ్మని కొడతాడు. అక్కయ్యని బావ కొడతాడు. మొగవాళ్ళు ఆడాళ్ళని కొడతారు తిడతారు కూడానూ.
“ఆడబ్రతుకే మధురం” అని రేడియో పాడుతున్నది. .. ” ఆడబ్రతుకులో వున్న కష్టాలన్నీ ఈపిల్ల నెమరు వేస్తుంటుంది. కిష్టమూర్తి గారి కుటుంబాన్ని మిగిలిన వాళ్ళలాగా కాక చెడిపోయినట్లుగా భావిస్తుంది – ఎందుకంటే ఆయన వాళ్ళావిణ్ణి కొట్టడు. ఆవిడ చదువుకుంది. బాగుంటుందికాని చెడిపోయే ఉంటుంది. రేడియోలో పాట వస్తూనే ఉంటుంది. కథ ఇలా ముగుస్తుంది:
నేను పెద్దదాన్నయితే కొట్టే మొగుణ్ణి మాత్రం చేసుకోను. పుణ్యం లేకపోతే పీడాపాయ, ఎవరు పడతారమ్మా దెబ్బలూ, తిట్లూనూ? పెద్దదాన్నయితే ఎవరికీ తెలీకుండా కిష్టమూర్తిగార్ని చేసుకుంటాను! …
“ఆడబ్రతుకే మధురం!” అనే పాట పాడటం మానేసింది రేడియో. ”
“చెడిపోయిన మనిషి” అనే కథలో పట్టుదల కల పార్వతీశానికి వున్న పెళ్ళికాని కూతురు వర్థని. కట్నమివ్వగూడదనే పట్టుదలతో కొంత, ఇవ్వలేక మరికొంతా, వర్థనికి పెళ్ళి సంబంధాలు రావు. పెళ్ళికోసం హైరానా పడక చదివించమని అడిగి, చదివి ఓ పంతులమ్మ ఉద్యోగం సంపాదిస్తుంది, తండ్రిని గూడా పోషిస్తుంది. నిశ్చింతగా కాలం గడుస్తుంటే, ఒకరోజు స్నేహితుడొకడు పార్వతీశం పరువు మర్యాదల గురించి విచారం వెల్లబరుస్తాడు. మర్నాడే వర్థని చాలా పొద్దుపోయి ఇంటికి వస్తుంది. ఎవరో దిగబెట్టారని గ్రహించిన పార్వతీశం గొడవ చేస్తాడు. తన జీవితం, తన ఇష్టమన్నట్టు మాట్లాడుతుంది వర్థని.
కోపమొచ్చి పార్వతీశం ఇల్లొదిలి, మద్రాసు వెళ్ళే రైలెక్కుతాడు. తిండిలేక దాదాపు చనిపోయే స్థితిలో ఓ డాక్టరు ఆదుకుని ఇంటికి తీసుకెళ్ళుతుంది. ఆవిడ సహాయానికి కృతజ్ఞత చెప్పుకున్నా, ఆవిడ మరొకరితో తన కూతురిలాగే చేస్తున్న స్నేహాన్ని హర్షించడు. ఆమెతో తన సమస్య చెప్పుకుంటాడు:
“కాని, మనిషికి కొన్ని కట్టుబాట్లుండవద్దా? ఒకరుచేసిన పనే అందరూ చేస్తే ఏమవుతుంది? మనిషి ప్రవర్తనను నిర్ణయించే గీటురాయి అది కాదా?” అన్నాడు పార్వతీశం.
“ఎవరన్నారామాట? అందరూ డాక్టర్లయితే ఏమవుతుందని నేననుకోలేదు. అందరూ టీచర్లయితే ఏమవుతుందని మీ అమ్మాయి అనుకోలేదు బహుశా. మగవాడు ప్రభాకర్ లాగా బ్రహ్మచారిగా ఉండిపోతే సంఘానికెంత నష్టమో, నాబోటిదీ, మీ అమ్మాయి బోటిదీ పెళ్ళి కాకుండా ఉండిపోతే అంతే నష్టం. ఒకప్పుడెప్పుడో ప్రిమిటివ్ కమ్యూనిటీలలో అందరికీ ఒకే నియమాలుండేవిట. ఈనాడు మనమింకా అదే మనస్తత్వంతో జీవించడం చాలా హాస్యాస్పదం. మనిషి నుంచి మనిషికి సాధ్యమైనంత హెచ్చు ఉపకారమూ, సాధ్యమైనంత తక్కువ అపకారమూ జరిగేటట్టు చూసుకోవడమే సరి అయిన ప్రవర్తన. మిగిలిన బూటకపు నీతినియమాలను నమ్మకండి” అన్నది డాక్టరు.
ఆ మధ్యాహ్నం జనతాలో పార్వతీశం తిరుగు ప్రయాణమైనప్పుడు ఆయన గొంతులో గరళం ఉండివున్న లక్షణాలేవీ లేవు.
8
Hippolyta: This is the silliest stuff that ever I heard.
Theseus: The best in this kind are but shadows; and the worst are no worse if imagination amend them.
— In “A Midsummer Night’s Dream”
Auden అంటాడు: “I find Shakespeare particularly appealing in his attitude towards his work. There’s something a little irritating in the determination of the very greatest artists, like Dante, Joyce, Milton, to create masterpieces and to think themselves important. To be able to devote one’s life to art without forgetting that art is frivolous is a tremendous achievement of personal character. Shakespeare never takes himself too seriously.”జీవితంలో చివరి క్షణం వరకూ సాహితీకృషిలో నిమగ్నమైనా కుటుంబరావు సాహిత్యమే జీవిత పరమార్థంగా భావించలేదు: ” మానవ జీవితంలో అనేక విషయాలకు అనేకరకాల ప్రాముఖ్యత ఉంది. అటువంటి వాటిల్లో సాహిత్యం ఒకటి. … సాహిత్యానికి పరిమితమైన ప్రాముఖ్యత ఉందని గుర్తించిన మీదట, దానివల్ల సాధించగలిగిన ప్రయోజనమేమిటో తేల్చుకుని, ఆ తరువాత … నిజమైన సాహిత్య లక్షణాన్ని అందరూ గుర్తించి తీరాలి. దానికి చిరత్వం లేదు. … సాహిత్యం వల్ల తాత్కాలిక ప్రయోజనం విశేషంగా ఉండటమే కాక అది త్వరగా అయిపోతే అంత మంచిది.””నాకు ఒకటే ఆశయం — నా రచనలవల్ల కూడా మనోవికాసం పొందదగిన వాళ్ళు తెలుగు వాళ్ళలో ఉండితీరాలి, వారందరూ నా కథలు చదవాలని నా కోరిక. వారందరికీ నా రచనలమీద ఎంత త్వరగా ఏవగింపు కలిగితే అంత ఉపకారం చేసిన వాణ్ణవుతాను తెలుగు సారస్వతానికి. అప్పటికి తెలుగు సారస్వతానికి నాతో పని అయిపోతుంది. నా కథలు చిరస్థాయిగా ఉండిపోవాలనే ఆశ నాకు ఏకోశానా లేదు.”
వితంతు వివాహాలు జరుగుతున్నాయి, బాల్య వివాహాలు ఆగిపోయాయి, ఆడవాళ్ళు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. మరి కుటుంబరావు రచనలు మనం ఇప్పుడు చదవాల్సిన అవసరం ఏమిటి?
స్త్రీ పురుషుల మధ్య, వివిధ వర్గాల మధ్య, తరాల మధ్య, మనుషుల మధ్య ఇంకా ఎన్నో గోడలున్నాయి. వీటికి మూలం మన కర్మలోనో, మానవుడికి అతీతమైన మరో శక్తిలోనో వున్నాయనే నమ్మకాలున్నాయి. అవి వున్నంతకాలమూ కుటుంబరావు రచనలకి ప్రయోజనం ఉంది. ఆ గోడలు కూలినపుడు, వాటితోపాటు ఆయన రచనలూ కాలగర్భంలో కలిసిపోతాయి. అప్పుడు కుటుంబరావు కన్నా ఎక్కువగా సంతోషించే వాళ్ళుండరు.
తెలుగు వాళ్ళ ఆలోచననే హత్య చేశాడని కుటుంబరావుని దోషిగా బోనులో నిలబెట్టారు. తీర్పు చెప్పాల్సింది పాఠకులు. ముద్దాయి ఎవరి దయా దాక్షిణ్యాలు కోరే వ్యక్తి కాదు. తీర్పు ఇచ్చేముందర, అతను పాఠకులని కోరేది ఒక్కటే – ఆలోచించమని.
పనికొచ్చిన పుస్తకాలు:
1. కుటుంబరావు సాహిత్యం, సంపుటాలు 2-6.
2. కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యవ్యాసాలు.
3. నవీన్ సాహిత్యవ్యాసాలు.
