కుటుంబరావు ఆలోచనని హత్య చేశాడా? లేక రేకెత్తించాడా?

అందవిహీనతని ముఖ్యాంశంగా తీసుకున్న నవల “కురూపి”. సరస్వతి తనని బస్సులో చూసి నవ్వినందుకు కనకం ఆమెను వెకిలిదనుకుంటాడు. తన స్టాపులోనే దిగితే, “ఇది నన్ను పట్టుకుందేమిటి?” అనుకున్నాడు. “మా ఇల్లు దగ్గిరే, రండి పోదాం” అంటే, ఆమె సాహసానికి నిర్ఘాంతపోయి, “ఆమె అభిప్రాయం ఏమిటి? ఏ ఆడ కుక్క చూపుడువేలు ఆడించినా తాను పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడనా?” అనుకుంటాడు.

కనకం వెటకారంతో “వద్దునుగాని నాకు మరో చోట ఎంగేజ్మెంటున్నది” అంటూ చేతిలో వున్న కాగితం ముక్క చూపిస్తే, ఆమె దానిని చూసి “ఇదే మా ఇల్లు” అంటుంది. దానితో గట్టి దెబ్బ తిన్న వాడై, “నేనెవరో తెలుసన్న మాట!” అంటాడు. “మీరెవరో తెలియకుండానే మా యింటికి ఆహ్వానించా ననుకున్నారన్న మాట” అని గొప్ప దెబ్బ తీస్తుంది.

ఆదెబ్బతో శిఖండి చాటునుంచి అర్జునుడు భీష్ముణ్ణి కాలసర్పంలాటి బాణం వేసి కొడుతూ ఆపేక్షగా నవ్వితే భీష్ముడికెట్లా ఉండి ఉండునొ కనకానికి అర్థమవుతుంది.

సరస్వతి ఎమ్మే చదివి లెక్చరరుగా పనిచేస్తున్నదని తెలిసి ఆమె మొహం చూస్తే ఇప్పుడామెలో ఎమ్మే జాడలూ, లెక్చరరు కవళికలూ కనకానికి కనిపించాయి. సరస్వతిని కలిసిన ప్రతి సారీ, ఆమెలోని అనాకారి తనం తగ్గిపోవడం, హృదయ సౌందర్యం పెరగడం అనుభవం లోకొస్తాయి — ఇల్లు చక్క పెట్టుకోవడం, అన్న వదినల పిల్లల్ని ఆపేక్షతో పెంచటం, వాళ్ళలో ఒక పిల్ల హఠాత్తుగా చనిపోవటంతో అందుకు తాను లేకపోవడమే కారణమని కుమిలిపోవడం, ఇవన్నీ ఆమె హృదయ సౌందర్యాన్ని, సౌకుమార్యాన్ని తెలుపుతాయి. కనకం ఆమెకి దగ్గరయి ప్రేమలో పడతాడు. చివరకి గాఢ నిద్రలో సరస్వతి అతని డొక్కలోకి దూరితే తాను సరస్వతికి తల్లి అయినట్లుగా తోచి కనకానికి నవ్వొస్తుంది.

ఈ నవలలో సరస్వతి కనకం ప్రేమకోసం చేసిందేమీ లేదు. తను అనాకారినని, తననెవరూ ప్రేమించరనే ఆత్మన్యూనతా భావంతో తనకెవరి ప్రేమా పొందే అవకాశం లేదనే నిర్లిప్తత అలవరచుకుంది. కాని ఆమే తన ప్రేమనంతా తన అన్న పిల్లలమీద చూపెట్టి ఆవిధంగా గాఢమైన ఆపేక్ష పెంచుకుంటుంది. ఇదే ముఖ్యంగా కనకాన్ని కట్టేస్తుంది.

మనిషి నుంచి మనిషి పొందే లక్షలాది అనుభూతుల్లో అందం ఇచ్చేది ఒక్కటి మాత్రమే అని, స్త్రీ పురుషుల మధ్య గోడలు పడిపోతే అలాంటి అనుభూతులకి అవకాశాలు, విలువ పెరుగుతాయనీ, సరస్వతి పాత్రని కనకం పాలిటి అంతరాత్మలాంటిదిగా చిత్రించాననీ, అందచందాలు లేని భార్యలను ఆప్యాయంగా ప్రేమించే భర్తలు చిన్నతనం నుండీ తనకు తెలుసనీ, మరి ఈ కాలపు యువకుల ఉద్దేశం మాత్రం తనకు తెలియదనీ కుటుంబరావే చెప్పాడు.

3

“ప్రేమించిన మనిషి” నవలలో నాయకుడు గోపాలం సరోజని చూసీ చూడటంతోటే ఆకర్షించబడతాడు. “నిజంగా అందమైన పిల్ల. కొంచెం బొద్దుగా ఉంటుంది. భలే రంగు. దబ్బ పండు. మంచి కళ్ళూ, కనుబొమలూనూ. జెర్రిపోతులాంటి జడ నడుముదాకా వచ్చి కత్తిరించినట్టు ఆగిపోయింది.”తరవాత బీచిలో సరోజ స్నేహితురాలు పద్మ కనిపిస్తుంది. “ఆమె తనకేసి కన్నార్పకుండా చూస్తూ ఉండటం అతను గమనించాడు. అతని వంటి మీద తేళ్ళూ, జెర్రులూ పాకినట్టయింది. ఆ పిల్ల అనాకారిదనటానికి వీల్లేదు. చిన్న మొహమే అయినా కుదురుగానే ఉంది. నల్లతోలు. అయితే నల్లతోలంటే గోపాలానికి ద్వేషం లేదు. కానీ, ఈ పిల్ల వంటి చర్మం పదును పెట్టి చెప్పులు కుట్టటానికి తయారు చేసినట్టుగా వికారంగా ఉంది. అసలు మనిషిని చూస్తేనే గానుగాడిన చెరుకుగడలాగా ఉంటుంది. ఆ పిల్ల కళ్ళు చూస్తే తినేసేటట్టున్నాయి. ఆమె కేసి గోపాలం రెండోసారి చూడలేకపోయాడు.”గోపాలం సరోజతో చాలా సమయం గడిపేవాడు, ప్రేమిస్తున్నాననే అనుకునే వాడు. జీవితం గురించి తన విశ్వాసాలు ఆమెతో చెప్పేవాడు, ప్రేమని వెల్లడించడానికి అదే ఉత్తమ మార్గమని. కాని సరోజ వాటితో ఎలాంటి సానుభూతీ చూపించదు. పైపెచ్చు వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి పనిదాని మంగిని దొంగతనంగా అన్నం తిన్నందుకు శాపనార్థాలు పెట్టడంతో అతనికి బాధ కలుగుతుంది: “దొంగముండ! నీతీ జాతీ లేదు. పని చేసే వాళ్ళని వేయి కళ్ళ కనిపెట్టుకుని ఉండాల్సిందే! ఎన్నడూ డబ్బులు కూడా ముట్టుకునేది కాదు. ఇవాళ ఈ దుర్బుద్ధి ఎందుకు పుట్టిందో! ఎంత మంచిగా కనిపించినా వీళ్ళను నమ్మకూడదు! ఛా! ఛా!”గోపాలానికి మంగి మీద జాలి కలిగి, ఇడ్లీలకి డబ్బిస్తాడు. దగ్గరవుతాడు. మంగిని వర్షంలో తడిపి పని చేయించుకొని న్యుమోనియా తెప్పించిందని సరోజ అంటే విముఖత ఏర్పడుతుంది. కాని అనుకోకుండా పద్మకి దగ్గరవతాడు: “మీరెక్కడినుంచో ఊడిపడ్డారుగాని, సరోజ చేసిన పని అందరూ చేస్తారు. నేనైనా చేస్తానేమో!” అంది పద్మ.

“ఎందుకు చేస్తాం అటువంటి పనులు? మనిషి రెండు పూటలా తినాలంటే అధమం నెలకు ఇరవై రూపాయలు కావాలి. అటువంటప్పుడు పనిచేసేవాళ్ళకు నాలుగూ, అయిదూ ఎందుకిస్తారు?” అన్నాడు గోపాలం.

“అంతకన్న ఇవ్వలేకనేమో!”

“ఫిడేలు మాస్టరుకు ముప్ఫై అయిదు ఇచ్చుకోగలమా?”

“అంతకన్న తక్కువకు రాడుగా!”

“పనివాళ్ళు చవకగా వస్తారనే మనకు వాళ్ళంటే అగౌరవం. మనిషి మంచితనం పెళ్ళాం పట్ల ప్రవర్తించటంలో బయట పడుతుందిట! మన సంస్కారమంతా పేదవాళ్ళ దగ్గిర బయట పెట్టుకుంటాం!”

..

సరోజతో అనని మాటలు తనతో అంటున్నాడని పద్మ గర్వంగా ఫీలవుతుంది.

పద్మ మీద గోపాలానికి ప్రేమ పెరుగుతుంది. పద్మ సమయం దొరికినపుడల్లా గోపాలం మీద తనకున్న ప్రేమని వ్యక్తం చేస్తుంది:

“అంత దూరం ఆలోచిస్తే ఆయిర్దాయం తరిగి పోతుంది.” అన్నది పద్మ.

“అదా మీ వంశం వాళ్ళ నమ్మకం?”

“ఇటువంటి నమ్మకాలు ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ ఒక్కసారి తెలుసుకోకండి, భయపడిపోతారు. ఒక్కోసారి నేనే దడుసుకుంటూ ఉంటాను.”

“ఏదీ ఇంకోటి చెప్పి భయపెట్టు!”

“ప్రపంచంలో ఒక్కడే మగాడున్నాడని!”

“దారుణం!”

“ముందే చెప్పానుగా?”

“ఆ మగాడికి చాలామంది ఆడవాళ్ళు కనిపిస్తే?”

“వీరస్వర్గం ఉండనే ఉంది!”

పద్మ తనను ప్రేమిస్తున్నదని గోపాలం గ్రహించాడు. తనకి చెప్పకుండా పద్మ ఏమైనా చేస్తే చిన్నబుచ్చుకుంటాడు:

” గోపాలం పత్రిక తీసుకుని తిరగేసాడు.

“కొత్త తార పద్మ! తారాపధాన యింకో మహోజ్వాల తార ఉదయించిందా?”

నాలుగు రోజుల క్రితం కనిపించినప్పుడు కూడా పద్మ చెప్పలేదు. కావాలని దాచిందని ఆమె మీద కోపం వచ్చింది. ..

మర్నాడు పన్నెండు గంటల వేళ గోపాలం సెట్టు మీద ఉండగా పద్మ వచ్చింది. గోపాలం ఆమెను చూడనట్లు గమనించాడు. ఆమె తనకోసం వచ్చిందనీ, తన ఉత్తరం చూసుకుని వచ్చిందనీ అతను గ్రహించాడు. ఆమె ఏడిచి రాగాలు పెడితే ఏం చెయ్యాలా అని అతను లోలోపల మధనపడుతున్నాడు.

“ఏం ఇట్లా వచ్చావ్?” అన్నాడు.

“పెద్ద స్టారుకు తాను లేని షూటింగు చూడాలనిపించింది?” అన్నది పద్మ. ఆమె కళ్ళు మాత్రం ప్రమాదాన్ని సూచిస్తున్నాయి.

“పులి ఇవాళ వ్యంగ్య ధోరణిలో ఉంది?” అన్నాడు తను.

“ఇంకేం వ్యంగ్యం? వేటగాడు గుండెలో గుండేసి కొట్టాడు!”

“అంతలావు వేటగాడెవరబ్బా?”

“ప్రపంచంలో ఒక్కడే ఉన్నాడు.”

“Nonsense! ఆ వేటగాడి కళ్ళలో దుమ్ము కొట్టటం పులికి బాగా తెలుసు!”

“నాకు ఏడవాలనుంది. ఇది మంచి చోటు కాదు.”

“నాకు వేరే పనుంది. కొంచెం ఆగు!”

..

“ఏమిటీ ముసురు గోపాల్?”

“రుతువు మార్పు!”

“నన్ను ఏడిపించదలిస్తే కనీసం సముదాయించటానికయినా దగ్గిరుండు గోపాల్! దూరాన్నుంచి తిట్టకమ్మా!”

ముసురు కాస్తా వర్షపాతంగా పరిణమించింది.

“ఏడవకు పద్మా? ఎవరికోసం ఏడుస్తావ్? నేను తగను. ఆ విషయం ఏనాడో చెప్పాను.”

“నేనేం తప్పు చేశాను? ఆ వెధవ వేస్తున్నానని నాతో చెప్పలేదు…” గోపాలం ఆమెకేసి పశ్చాత్తాపంతో చూసి, “అదృష్టవంతురాలివి. ఏడవగలవు. నాకదికూడా చేతకాదు. లోపల ఏడుస్తున్నాననుకుని క్షమించెయ్యి,” అన్నాడు.