తెలుగు భాష వయస్సెంత?
భాషను స్త్రీతో పోలుస్తారు. కానీ ఆడవాళ్ళ వయస్సు మొగవాడి జీతం అడగకూడదంటారు. ఆ రకంగా ఇది అడగకూడని ప్రశ్నే. అంతేకాక ఒక భాష ఎప్పుడు పుట్టింది అన్నది చాలా అసంబద్ధమైన (absurd) ప్రశ్న అని కొంతమంది భాషావేత్తలు అంటారు. “ప్రవాహినీ భాషా” అన్నట్లు భాష చరిత్రగతిలో మార్పులు చెందుతూ కొత్త కొత్త రూపాలు సంతరించుకొంటుందనీ, ఏ మార్పు ఎప్పుడు వచ్చింది అని అడగటం మాత్రమే సబబైన ప్రశ్న అని వారి వాదన. ఇటువంటి స్వచ్ఛసంప్రదాయ (Purist) వాదాన్ని పక్కనబెడితే, తెలుగు ఒక ప్రత్యేక భాషగా ఒక నియతస్థితిని, స్వయంప్రతిపత్తిని ఎప్పుడు ఏర్పరుచుకుందో ఆ కాలనిర్ణయం గురించి ప్రస్తుత భాషా పరిశోధకుల ఊహాగానాలను చర్చించడం ఈ వ్యాసం ముఖ్యోద్దేశ్యం.
భారతదేశంలోని భాషల చరిత్ర, భారతదేశపు పూర్వ చరిత్ర చాలా కాలంగా వివాదస్పదమైన అంశంగా మారింది. ఈ అంశంపై వచ్చిన వాదప్రతివాదాలు రాజకీయ, సాంఘిక ఉద్యమాలకు, భాషోన్మాదాలకు దారి తీసాయి. తమిళనాడులో ప్రారంభమైన ద్రావిడ ఉద్యమం ఇందుకు ఒక ఉదాహరణ. కాని ఆర్య, ద్రావిడ పదాలు భాషా కుటుంబాలని సూచించే పదాలే గాని, రెండు వేర్వేరు జాతులని సూచించే పదాలు కావని శాస్త్రవేత్తల నమ్మకం. జన్యుశాస్త్రంలో సాధించిన అభివృద్ధి ఆధారంగా ఈ దశాబ్దంలో జరుపుతున్న పరిశోధనలు భారతదేశంలో ఆర్య, ద్రావిడ అని రెండు విభిన్నమైన జాతులు లేవన్న శాస్త్రజ్ఞుల అభిప్రాయాలని ధ్రువపరుస్తున్నవి [4, 6].
ఇంతటి వివాదస్పదమైన అంశం గురించి రాయాటానికి నాకే భాషాశాస్త్రంలో గానీ జన్యుశాస్త్రంలో గానీ పట్టభద్రత లేదు. నేను చదువుకున్న చదువుకు చేసే ప్రోగ్రామింగ్ పనికి, భాషా చరిత్రతో ఎటువంటి సంబంధం లేదు. నాకున్న అర్హతల్లా ప్రఖ్యాతి గాంచిన భాషావేత్తలైన భద్రిరాజు, ఎమెనో, స్జోబెర్గ్ తదితరులు రాసిన కొన్ని పుస్తకాలు, పేపర్లు గత పదేండ్లుగా చదవటం మాత్రమే.
కానీ తెలుగు భాష పుట్టుపూర్వోత్తరాల గురించిన కనీస వివరాలు చాలామంది తెలుగువాళ్ళకే తెలిసినట్టులేదు. ఈ మధ్య ఇండియాలో ఒక టీవీ ప్రోగ్రాంలో ఎక్కువమంది మాట్లాడే ద్రావిడ భాష ఏది అన్న ప్రశ్నకు సమాధానం “తెలుగు” అంటే మా అన్నయ్య ఆఫీసులో చాలా మంది ఒప్పుకోలేదట. తెలుగు ద్రావిడ భాషే కాదని వారి వాదన. ఇంతే కాక ఈ మధ్య భారతదేశ చరిత్ర గురించి, భారతీయ భాషల గురించి వింత వాదనలు, శాస్త్రవిమర్శకు నిలువలేని సిద్ధాంతాల ప్రచారాలు ఇంటెర్నెట్లోనూ బయటా జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రచారాల నేపథ్యంలో తెలుగుభాష గురించి చాలామంది భాషావేత్తలు ఒప్పుకునే వివరాలను నాకు తెలియవచ్చినంత తేటపరచాలని ఈ వ్యాసరచనా సాహసానికి పూనుకున్నాను.
తెలుగు సంస్కృత భవం కాదు
పూర్వకాలం నుండి తెలుగు సంస్కృత జన్యం అన్న అభిప్రాయం ఉందని చాలామంది నమ్మకం. ఇందుకు ఉదాహరణగా “తల్లి సంస్కృతంబు యెల్ల భాషలకు” అన్న కేతన పద్యాన్ని, “జనని సంస్కృతంబు సర్వభాషలకు” అన్న క్రీడాభిరామ పద్యాన్ని చూపిస్తారు. కానీ నిశితంగా చూస్తే నన్నయ్య కాలం నుండి కూడా తెలుగు సంస్కృత భాషల మధ్య అంతరం కవులకు స్పష్టంగా తెలుసునని మనకు తెలుస్తుంది. సంస్కృత ఛందస్సు వేరు, దేశీ ఛందస్సు వేరు. సంస్కృత పదాలు వేరు (తత్సమాలు, తద్భవాలు), అచ్చతెలుగు పదాలు వేరు (దేశ్యాలు, గ్రామ్యాలు). తెలుగు సంధులు వేరు, సంస్కృత సంధులు వేరు. తెలుగు పదాన్ని, సంస్కృత పదాన్ని కలిపి రాయకూడదు. రాస్తే దుష్టసమాసం అవుతుంది. దేశీ కవిత, మార్గ కవిత అని కవిత్వంలో రెండు భిన్న ధోరణులు ఉండేవని కూడా మనకు తెలుసు. చాలామంది కవులు ఈ రెండు ధోరణులకు మధ్యస్థంగా ఇరు పక్షాలు మెచ్చే రీతిలో కవిత్వం రాస్తున్నామని కూడా చెప్పుకున్నారు (ఉదా: శ్రీనాథుడు, పోతన, కొరవి గోపరాజు, మొల్ల).
పూర్వ కవుల అభిప్రాయం ఏమైనప్పటికీ 19వ శతాబ్దం వచ్చేసరికి తెలుగు సంస్కృత భవమే అన్న నమ్మకం చాలా బలంగా ఉండేది. ఈ నమ్మకాలకు ప్రతికూలంగా తెలుగుకు సంస్కృత ప్రాకృతాలతో జన్య జనక సంబంధం లేదని మొదటిసారి చెప్పిన ఘనత Francis White Ellis (1816) కు దక్కుతుంది. తరువాత ఎల్లిస్ పరిశోధనను కొనసాగించిన అలగ్జాండర్ క్యాంప్బెల్ ఇలా అన్నారు:
ఎలిస్, క్యాంప్బెల్ సంగ్రహంగా ప్రతిపాదించిన ఈ సిద్ధాంతానికి సమగ్రాధారలతో కూలంకష చర్చతో స్థిరత్వాన్ని కల్పించింది బిషప్ రాబర్ట్ కాల్డ్వెల్. ఈయన తమిళ, కన్నడ, తెలుగు భాషలతో సహా 12 భాషలు ఒకే భాషా కుటుంబానికి చెందినవని, వాటికి సంస్కృతంతో జన్మ సంబంధం లేదని సశాస్త్రీయంగా నిరూపించాడు. ద్రావిడ భాషా పరిశోధనా పితామహుడిగా ప్రసిద్ధి కెక్కిన కాల్డ్వెల్ 1856లో రాసిన గ్రంథం “A Comparative grammar of Dravidian Languages” తొలి ద్రావిడ భాషా శాస్త్రజ్ఞుల పాలిటి ప్రమాణ గ్రంథం. తరువాత గత శతాబ్దంలో ఆధునిక శాస్త్ర పద్ధతులలో ద్రావిడభాషా పరిశోధనను జరిపి దానికి శాస్త్రీయతను కూర్చి స్థిరమైన పునాది ఏర్పరచిన వారిలో ముఖ్యులు: ఎం. బి. ఎమెనో, టి. బరో, భద్రిరాజు కృష్ణమూర్తి గార్లు. 2003లో భద్రిరాజు కృష్ణమూర్తి గారు రాసిన “Dravidian Languages” పుస్తకం, గత రెండు శతాబ్దాల్లో ద్రావిడ భాషాధ్యయనంలో సాధించిన అభివృద్ధిని సాధికారకంగా చర్చించి నేటి ప్రమాణ గ్రంథంగా నిలిచిందని చెప్పవచ్చు.
తెలుగు తమిళం నుండి పుట్టలేదు
తెలుగు సంస్కృతం నుండి పుట్టలేదు అంటే ఇది తమిళం నుండో కన్నడ నుండో పుట్టి ఉండాలి అన్న వాదం విన్నాను. తమిళం లో క్రీస్తు పూర్వము 3వ శతాబ్ది నుండి ప్రాచీన సాహిత్యం దొరుకుతుంది. కన్నడం లో ప్రాచీన గ్రంథం “కవిరాజ మార్గ” క్రీస్తు శకం 9వ శతాబ్దంలో రాయబడ్డది. కాబట్టి తెలుగు కన్నడ నుండో తమిళం నుండో పుట్టివుండాలని వీరి తర్కం. తమిళం ప్రాచీన భాషే ఐనా తమిళమే ప్రాచీన లక్షణాలను నిలుపుకొంది అనటం సరి కాదని, కొన్ని విషయాలలో తెలుగు మొదలైన ఇతర భాషలలోనే తమిళంలో లేని ప్రాచీన లక్షణాలు ఉన్నాయని భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం. 1906 లో Linguistic Survey of India లో ద్రావిడ భాషల పరస్పర సాన్నిహిత్యాన్ని గురించి రాస్తూ స్టెన్కొనో ఇలా అన్నారు
ఆ రకంగా తమిళ కన్నడ భాషలు తెలుగుకు సోదర భాషలే కాని మాతృకలు కావు. క్రీస్తు పూర్వం నాలుగు, ఐదువేల యేండ్లకు పూర్వం మూల ద్రావిడ భాష ఒకే భాషగా ఉండేదని, అది కాలక్రమాన ఇప్పటి ద్రావిడ భాషలుగా విడిపోయిందని భాషా శాస్త్రజ్ఞులు తులనాత్మక పద్ధతి ద్వారా నిర్ణయించారు.
ద్రావిడ భాషగా పుట్టి సంస్కృత పోషణలో పెరిగిన తెలుగు
తెలుగు ద్రావిడ భాష కాబట్టి సంస్కృత భాషా పదాలు వాడటం మానేసి అచ్చ తెలుగు పదాలే వాడాలని “వార్త” పత్రికలో ఒక వ్యాసం చదివాను. ఈ రకమైన వాదం తెలుగును రెండు మూడు వేల యేండ్లు వెనక్కి తీసుకువెళ్ళాలన్న ప్రయత్నమే. తెలుగు పుట్టినప్పటి నుండి వేలకొద్దీ సంస్కృత, ప్రాకృత పదాలు తెలుగులో వచ్చి చేరాయి. పద నిర్మాణంలోను, వాక్య నిర్మాణం లోనూ తెలుగు ఎన్నో సంస్కృత లక్షణాలను తనలో కలుపుకొంది. తెలుగు కవులందరూ సంస్కృత భాషను క్షుణ్ణంగా అభ్యసించిన వారే కాబట్టి ఆ భాషా ప్రభావం తెలుగు సాహిత్యం పై స్పష్టంగా కనిపిస్తుంది. ద్రావిడ భాషలో లేని Passive Voice (బడు ప్రయోగం), Relative Pronouns తెలుగులో వచ్చి చేరటం సంస్కృత ప్రభావాన్నే చూపిస్తుంది. పోతన రాసిన “ఎవ్వనిచే జనించు జగము … వానిన్ … శరణంబు వేడెదన్” అన్న పద్యము సంస్కృతంలో ఆలోచించి తెలుగులో రాసిన పద్యమని కూడా చెప్పవచ్చు.
ద్రావిడ భాషల వర్గీకరణ
రాబర్ట్ కాల్డ్వెల్ రాసిన Comparative Dravidian Grammar గ్రంథంలోనే తమిళ, మలయాళ, కన్నడ భాషలకు దగ్గరి సంబంధం ఉందని, తెలుగు తమిళ భాషలకు మధ్య చాలా వ్యత్యాసం ఉందనీ సూచించారు. 1906లో స్టెన్కొనో ద్రావిడ భాషలని తమిళ సముదాయం, తెలుగు సముదాయం అని రెండుగా విభజించారు. మూల ద్రావిడ భాష మొదట మూడు ఉపకుటుంబాలు గా చీలిందని ఇప్పుడు పండితులంతా అంగీకరిస్తున్నారు. 1975లో భద్రిరాజు కృష్ణమూర్తి గారు, తెలుగు-కువి-గోండీ భాషలను దక్షిణ-మధ్య ద్రావిడ భాషలుగా మూల దక్షిణ ద్రావిడం నుండి విడివడిన మరో ఉపశాఖకు చెందిందన్న కొత్త సిద్ధంతాన్ని ప్రతిపాదించారు. ఈ మధ్య ఆయన ద్రావిడ భాషలపై ప్రచురించిన గ్రంథరాజంలో తెలుగు దక్షిణ మధ్య ద్రావిడ ఉప కుటుంబానికి చెందిందని సాక్షాధారాలతో నిరూపించారు. ఈ పుస్తకంలో 26 ద్రావిడ భాషలను ఇలా విభజించారు: 
తెలుగు భాష ఎప్పుడు పుట్టింది?
మొట్టమొదటి తెలుగు శాసనాలు
తెలుగు మాట కనిపించే మొట్ట మొదటి శాసనం క్రీస్తు శకం 200కి చెందినది. బ్రహ్మీ లిపిలో ఉన్న ఈ శాసనం గుంటూరు జిల్లా అమరావతిలో దొరికింది. అంతకు పూర్వం అశోకుడు, బౌద్ధ మత ప్రచారానికి తన దూతలను ఆంధ్రదేశానికి పంపినట్లు అశోకుడి కాలం నాటి శాసనాల ద్వారా తెలుస్తోంది. పూర్తిగా తెలుగు భాషలో రాసిన శాసనాలు మనకు క్రీస్తు శకం ఆరవ శతాబ్దినుండి దొరుకుతున్నాయి. వీటిలో కడప జిల్లా ఎర్రగుడిపాడు (క్రీశ 575-600), కలమళ్ళ (క్రీశ 576-600) లో దొరికిన శాసనాలు మొట్ట మొదటివి. ఆరో శతాబ్దికి ముందు ఆంధ్ర ప్రాంతంలో శాసనాలు సంస్కృత ప్రాకృత భాషలో వేసేవారు కానీ వాటిలో ఉన్న ఊళ్ళ పేర్లు, మనుష్యుల పేర్లు తెలుగువే. ఈ శాసనాలలో ఉన్న ఏళూరు, తాన్ఱికొన్ఱ (తాటికొండ) మొదలైన ఊళ్ళ పేర్లు ఆ రోజులలో సామాన్య ప్రజలు తెలుగే మాట్లాడే వారని నిరూపిస్తుంది.
ప్రాచీన కావ్యాలలో ఆంధ్ర/తెలుగు ప్రస్తావన
రామాయణంలో సుగ్రీవుడు సీతాదేవి ఉనికిని గూర్చి వెతుకవలసిన స్థలాలను పేర్కొనే సందర్భంలో వరుసగా దండకారణ్యం, గోదావరీ నది, తరువాత, ఆంధ్ర, పుండ్ర, చోళ, పాంద్య దేశాలున్నట్టు చెప్పాడు. ధర్మరాజు రాజసూయం చేసే ముందు దక్షిణ దిగ్విజయ యాత్రకు సహదేవుని పంపినట్లు అతడు పాండ్యులు, ద్రవిడులతో పాటు ఆంధ్రులను, కళింగులను, ఓఢ్రులను జయించినట్లు భారతంలో ఉంది. బౌద్ధ సారస్వతంలో చోళరఠ్ఠం, కళింగరఠ్ఠం, ద్రమిళరఠ్ఠం తో పాటు గోదావరినదికి ఇరు వైపుల అళక, ముళక దేశాలున్నట్లు, ఇవి రెండు అంధక రాష్ట్రాలని “సుత్తనిపాత” గ్రంథంలో ఉంది. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దిలో మన దేశానికి వచ్చిన గ్రీక్ రాయబారి మెగస్తనీస్ మౌర్యుల తరువాత ఎన్నదగిన జాతి ఆంధ్ర జాతియని, వారి రాజు మిక్కిలి బలవంతుడని అతనికి 32కోటలున్నాయని పేర్కొన్నాడు.
ఆంధ్ర జాతి ప్రస్తావన మొట్టమొదటి సారి క్రీస్తు పూర్వం 7వ శతాబ్దానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణంలో కనబడుతుంది. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దికి చెందిన భరతుని నాట్యశాస్త్రంలో కూడా ఆంధ్ర భాషా ప్రస్తావన మనకు కనిపిస్తుంది. నాటకాలలో సంస్కృత ప్రాకృతాలే కాక సామాన్య ప్రజలు మాట్లాడే భాషలను వాడవచ్చని చెబుతూ, శకార, ఆభీర, చండాల, శబర, ద్రమిళ, ఆంధ్ర జాతుల భాషలను కూడా వాడవచ్చని ఇందులో ఉంది. ఐతే ఆంధ్ర రాజులు, ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర జాతి అన్న పదాలలో ఆంధ్ర శబ్దం తెలుగుకు పర్యాయపదంగా తీసుకుంటే క్రీస్తు పూర్వం 7వ శతాబ్దికి ముందుగానే ఆంధ్ర/తెలుగు ప్రత్యేక జాతిగా గుర్తింపబడిందని చెప్పవచ్చు.
భాషా శాస్త్ర పరంగా తెలుగు కాలనిర్ణయం
తమిళంలో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండీ సాహిత్యం లభిస్తోంది. తమిళం లోనూ కన్నడలోనూ తాలవ్యీకరణ (palatalization) లో వ్యత్యాసం కనబడుతోంది కాబట్టి, అవి రెండు కనీసం మూడు నాలుగు వందల యేండ్ల ముందుగా విడివడి ఉండాలి. ఆ రకంగా పూర్వ-తమిళం క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో ప్రత్యేక భాషగా ఏర్పడి ఉండవచ్చు. కానీ దక్షిణ ద్రావిడ భాషలకూ, దక్షిణ-మధ్య ద్రావిడ భాషలకూ శబ్ద నిర్మాణంలోనూ, వాక్య నిర్మాణంలోనూ అనేక వ్యత్యాసాలు కనిపిస్తాయి. దక్షిణ ద్రావిడ భాషలైన తమిళ-కన్నడ లతో పోలిస్తే తెలుగు-కువి-గోండీ లలో కనిపించే వ్యత్యాసాలో కొన్ని[1,3,5]:
- వర్ణవ్యత్యయం (metathesis): తెలుగు-కువి-గోండి భాషలలో మూల ద్రావిడ ధాతువులోని అచ్చు తరువాతి హల్లు పరస్పరం స్థానం మార్చుకుంటాయి. (ఉదా: వాడు < *అవన్ఱు, వీడు <*ఇవన్ఱు, రోలు < ఒరళ్ <*ఉరళ్)
- తెలుగులో బహువచన ప్రత్యయం- లు. తమిళాది దక్షిణ భాషల్లో ఇది -కళ్, -గళు.
- క్త్వార్థక క్రియలు తమిళాదుల్లో -తు -ఇ చేరటం వల్ల ఏర్పడుతాయి. తెలుగు-కువి-గోండి భాషలలో -చి, -సి చేరటం వల్ల ఏర్పడుతాయి. ఉదా: వచ్చి, చేసి, తెచ్చి, నిలిచి వరుసగా తమిళంలో వన్దు , కెయ్దు, తన్దు, నిన్ఱు.
పైన పేర్కొన్న లక్షణాలన్నీ దక్షిణ మధ్య ద్రావిడ భాషలన్నిటిలో ఉండి దక్షిణ ద్రావిడ భాషలో లేనివి. అంటే ఈ మార్పులన్నీ తెలుగు-కువి-గోండి ఒకే భాషగా కలిసి ఉన్న రోజులలో మూల దక్షిణ ద్రావిడ భాషనుండి విడిపోయిన తరువాత వచ్చిన మార్పులన్న మాట. అన్ని ముఖ్యమైన మార్పులు రావటానికి కనీసం 400-500 సంవత్సరాలు పట్టవచ్చు. అంటే తెలుగు-కువి-గోండి భాషలు దక్షిణ మధ్య ద్రావిడ ఉప శాఖగా క్రీస్తు పూర్వం 1100 సంవత్సరంలో మూల దక్షిణ ద్రావిడం నుండి విడిపోవచ్చు. ఇదే నిజమైతే క్రీస్తు పూర్వం 700-600 వరకే తెలుగు ఒక ప్రత్యేక భాషగా స్వయంప్రతిపత్తిని కలిగి ఉండవచ్చునని మనం ఊహించవచ్చు[1]. క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దానికి చెందిన ఐతరేయ బ్రహ్మణం ఆంధ్ర జాతిని ప్రత్యేక జాతిగా పేర్కొనడం ఈ లెక్కతో సరిపోతుంది కూడా!
ఈ రకమైన కాలనిర్ణయం సాపేక్ష కాలమానాల (relative chronology) మీద ఆధారపడ్డదే కానీ పద, ధాతు వ్యాప్తి గణాంకాల (lexicostatistics) మీద ఆధారపడ్డది కాదు. ద్రావిడ భాషల పూర్వచరిత్ర పై ఇంకా పరిశోధనలు ఇతోధికంగా జరిగితే గాని తెలుగు భాషా జనన కాలనిర్ణయాన్ని నిష్కర్షగా చెప్పలేం.
ఆధార గ్రంథాలు
- Dravidian Languages Bhadriraju Krishnamurti Cambridge University Press (2003)
- Comparative Dravidian Linguistics: Current Perspectives Bhadriraju Krishnamurti (2001)
- ద్రావిడ భాషలు పి. ఎస్. సుబ్రమణ్యం (1994)
- History and Geography of Human Genes Luigi Luca Cavalli-Sforza, Paolo Menozzi, Alberto Piazza (1994)
- భాష, సమాజం, సంస్కృతి భద్రిరాజు కృష్ణమూర్తి (2000)
- Journey of Man: A Genetic Odyssey Spencer Wells (2002)
Kompella Sarma అభిప్రాయం:
September 17, 2007 7:36 am
చాలా మంచి వ్యాసం. ప్రతీ తెలుగుజీవి దీనిని భగవద్గీతతో సమానంగా భద్రపరచుకోవాలి.
ధన్యవాదములు.
కొంపెల్ల శర్మ
Rohiniprasad అభిప్రాయం:
September 17, 2007 8:58 am
చరిత్ర, భాషా చరిత్రల గురించి ఆసక్తి ఉన్నవారందరికీ ఎంతో పనికొచ్చే మంచి వ్యాసం ఇది. క్రీ.పూ. ఏడో శతాబ్దం నాటికి తెలుగు తదితర దక్షిణాది భాషలకు స్పష్టమైన స్వరూపాలు ఏర్పడి ఉంటాయన్న ప్రతిపాదన పూర్తిగా సమంజసమైనది. అది బుద్ధుడూ, మహావీరుల కాలానికి ఒక శతాబ్దపు ముందరి కాలం. అప్పటికి ఉత్తరభారతమంతటా మహాజనపదాలుండేవి. దండకారణ్యం గుండా కనీసం కాలినడకకైనా పనికొచ్చే ‘దక్షిణాపథం’ ఒకటి ఉండేదేమో.
నాగరికత అంతగా ప్రవర్తిల్లని కాలంలో విడి తెగలుగా, గుంపులుగా ఒకే ప్రాంతంలో నివసిస్తున్నవారంతా క్రమంగా ఒకరికొకరు తారసపడి సంపర్కాలు పెంచుకోవటం ద్వారానే ఏ ప్రాంతీయభాషకైనా రూపం ఏర్పడుతుంది. సుమేరియన్ రాజవంశాలకు ప్రసిద్ధికెక్కిన ఆ కాలానికి ఉత్తరభారతంలో అథర్వణవేదం తదితర సాహిత్యం సృష్టి కావడం, దక్షిణ భారతంలో గణరాజ్యాల వంటివాటి స్థాపనా వగైరాలు జరిగే ఉంటాయి. లిపి కాకపోయినా దక్షిణభాషలు అప్పటికే రూపుదిద్దుకుని ఉంటాయనీ, ఆ తరవాతి కాలంలో సంస్కృత, ప్రాకృత భాషలతో వాటికి ప్రమేయం కలిగి ఉంటుందనీ సులువుగా ఊహించవచ్చు. కొన్ని వందల మైళ్ళ ఎడం ఉన్న దక్షిణాది రాష్ట్రాలన్నిటా ఒకే మూలభాష ఉండేదనీ (తమిళమో మరేదో) అందులోంచి తక్కినవి పుట్టాయనీ నమ్మడం కష్టం. రకరకాల స్థానిక తెగల మూల భాషల నుంచి ఆధునిక భాషలు విడివిడిగా పుట్టుకొచ్చాయన్నదే సబబుగా అనిపిస్తుంది.
Sreenath Reddy అభిప్రాయం:
March 6, 2008 3:11 am
చాలా మంచి వ్యాసము. మన ప్రభుత్వాలు తెలుగు భాష గురించి పట్టిచుకోకున్ననూ, మన గుండెల్లో ఇటువంటి భాషాభిమానము ఉన్నంతకాలము తెలుగు సజీవముగా నిలిచిపోతుంది.
Prof. C.Parameswara Murthy అభిప్రాయం:
July 22, 2008 5:43 am
Really it is an excellent work and is highly informative. It has all the potential and need for inclusion in our text books. Please write some more articles. Keep it up. I wanted to write this in telugu but my lack of key board knowledge has prevented me.
Murthy